మోదీ ఆస్ట్రేలియా మిషన్‌.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి! | Modi Australia Mission, Focus On Strategic Partnership Trade And Green Energy, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మోదీ ఆస్ట్రేలియా మిషన్‌.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి!

Jul 9 2026 9:26 AM | Updated on Jul 9 2026 9:51 AM

Modi Australia Mission: Focus on Strategic Partnership Trade and Green Energy

మెల్‌బోర్న్‌: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్‌లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయనకు అధికారిక గౌరవ వందనం (గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌) నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి భారత్‌-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు.

మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలు, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

వ్యాపార దిగ్గజాలతో మోదీ భేటీ
మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్‌-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం, ఎకనామిక్‌ రోడ్‌మ్యాప్‌ బిజినెస్‌ రిసెప్షన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌-ఆస్ట్రేలియా భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులకే పరిమితం కాకుండా.. రాష్ట్రాలు, నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల స్థాయిలోనూ విస్తరించాలని మోదీ సూచించారు. రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాలను గుర్తించి కొత్త అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు.

ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఆహ్వానం
ఆస్ట్రేలియా పెన్షన్‌ ఫండ్స్‌ను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆ దేశ పెన్షన్‌ ఫండ్స్‌ నిర్వహిస్తున్న భారీ నిధులు సురక్షితమైన, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి భారత్‌లో అవకాశాలను పొందగలవని చెప్పారు. భారత్‌లో మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.

గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి
భారత్‌ స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. హరిత హైడ్రోజన్‌, సౌర విద్యుత్‌, వాయు విద్యుత్‌, జల విద్యుత్‌ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో భారత్‌ పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.

అల్బనీస్‌తో కీలక భేటీ.. సెల్ఫీ వైరల్‌
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.

భారత ప్రవాసులతో..
మెల్‌బోర్న్‌లో భారతీయ ప్రవాసులతో మోదీ సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.

మొత్తంగా.. మోదీ ఆస్ట్రేలియా పర్యటన భారత్‌-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. రక్షణ నుంచి వాణిజ్యం వరకు పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement