న్యూఢిల్లీ: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడైస్ (UDISE+) 2025-26 నివేదిక ప్రకారం దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గింది. గత రెండేళ్లలో (2023-24 నుండి 2025-26 మధ్య) ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య దాదాపు 86 లక్షలు తగ్గగా, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 88 లక్షల మందికి పైగా విద్యార్థులు పెరిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 12.75 కోట్ల నుండి 11.89 కోట్లకు పడిపోయింది, అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఈ సంఖ్య 9 కోట్ల నుండి 9.89 కోట్లకు చేరింది.
దేశవ్యాప్తంగా మొత్తం విద్యార్థుల నమోదు స్వల్పంగా 8.26 లక్షలు తగ్గి, 24.72 కోట్లుగా నమోదైంది. మొత్తం పాఠశాలల సంఖ్య 14.72 లక్షల నుండి 14.67 లక్షలకు తగ్గినప్పటికీ, ఉపాధ్యాయుల సంఖ్య 98.08 లక్షల నుండి 1.03 కోట్లకు పెరిగింది. దీనివల్ల ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి 25 నుండి 24కి మెరుగైంది. సున్నా నమోదు గల పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
మరోవైపు, బడి మానేసే వారి (డ్రాపౌట్స్) రేటు తగ్గడం సానుకూల అంశం. సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 8.2 శాతం నుండి 7 శాతానికి, ప్రిపరేటరీ స్థాయిలో 2.3 శాతం నుండి 1.8 శాతానికి తగ్గింది. మధ్యమ, సెకండరీ స్థాయిలలో విద్యార్థులు పాఠశాలల్లోనే కొనసాగే రేటు (రిటెన్షన్ రేట్) మెరుగైందని నివేదిక పేర్కొంది.


