కొచ్చి: కేరళలోని ఎర్ణాకులం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. అయితే, ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న మానవ- వన్యప్రాణి సంఘర్షణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అటవీ శాఖ అధికారుల రెస్క్యూ ఆపరేషన్ను అడ్డుకోవడంతో ఏనుగు రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
అటవీ శాఖ సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 5- 6 గంటల మధ్య ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన సిబ్బంది సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో అడవి జంతువుల దాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారుల వాహనాలను, సహాయక చర్యలను అడ్డుకున్నారు.
ఈ నిరసనల మధ్యే అటవీ శాఖ సిబ్బంది ఏనుగును రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బావి నుంచి ఏనుగు సురక్షితంగా పైకి రావడానికి వీలుగా ఎర్త్మూవర్ సహాయంతో వాలుగా ఉండే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, వీలైనంత త్వరగా ఏనుగును సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్లు శ్రమిస్తున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


