భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు | PM Modi Receives Grand Welcome In Indonesia Jakarta, Holds Talks With President Prabowo, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు

Jul 7 2026 9:34 AM | Updated on Jul 7 2026 12:43 PM

PM Modis Grand Welcome in Jakarta

జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. జకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’ వద్ద ప్రధానికి సైనిక వందనంతో ఘన సాంప్రదాయ స్వాగతం లభించింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఒక కీలక అడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పర్యటన పరస్పర నమ్మకాన్ని, స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు.

రెండు దేశాల మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. భారతదేశ ఎన్నికల విధానానికి లభించిన గుర్తింపుగా, ఇండోనేషియా కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రూపకల్పన చేయడానికి భారత్ సహకరించనుంది. అలాగే, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో విజయవంతంగా నిరూపితమైన భారత ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సాంకేతికతను చూసి, భారత్ నుండి ‘అస్త్రా’ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపింది. కీలక ఖనిజాల సరఫరాను మెరుగుపరిచేందుకు ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల తయారీకి భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలను పెంచుకునేందుకు ఇండోనేషియాకు భారత్ మరిన్ని మిస్సైల్ బ్యాటరీలను సరఫరా చేయనుంది. వ్యూహాత్మక మలక్కా జలసంధికి సమీపంలో, భారత్ కు చెందిన గ్రేట్ నికోబార్ పోర్టు ప్రాజెక్టుకు కేవలం 100 మైళ్ల దూరంలో ఉన్న 'సబాంగ్' రేవు అభివృద్ధిపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ మూడు దేశాల అధికారిక పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా  ఇండోనేషియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి  సైనిక, సంప్రదాయ స్వాగతం లభించింది.  2018లో ఉభయ దేశాల మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మార్చిన తర్వాత ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి వాయుసేన యుద్ధ విమానాలు ఆయనకు రక్షణగా ఎస్కార్ట్ ఇచ్చాయి. అనంతరం విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు.

రక్షణ, సముద్ర తీర భద్రతతో పాటు ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు వంటి కీలక అంశాలు ఇరు దేశాల చర్చల ఎజెండాలో ఉన్నాయి. ‘మహాసాగర్’విధానం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రాంబనన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు.


 
ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’ లభించింది. మంగళవారం జకార్తాలోని ఇస్తానా మెర్డెకా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని పీఎం మోదీకి బహూకరించి గౌరవించారు. ఇండోనేషియా దేశ ఐక్యత, నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం విశేష సేవలు అందించిన వ్యక్తులకు 1959 నుంచి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement