ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. కొన్నిరోజుల క్రితమే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ముందునుంచి అనుకుంటున్నట్లే కుమారస్వామి స్టోరీతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. కానీ ఇంతలోనే వివాదాల్లో ఇరుక్కుంటోంది. తమిళ నేత సీమన్.. కంటెంట్ విషయమై మేకర్స్కి వార్నింగ్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన 'ప్రేమలు' కమెడియన్)
అసలేంటి వివాదం?
కుమారస్వామిని మురుగన్గా తమిళులు ఆరాధిస్తుంటారు. అయితే ఎన్టీఆర్ సినిమాని ప్రకటించే క్రమంలోనే కుమారస్వామి, ఉత్తరాదిలో జన్మించినట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ప్రకటన వచ్చినప్పుడే తమిళ నెటిజన్లు దీనిపై మండిపడ్డారు. కుమారస్వామి తమిళనాడుకి చెందినవాడని వాదించారు. తాజాగా తమిళ రాజకీయనేత సీమన్.. ఏకంగా చిత్రబృందానికి హెచ్చరికలు జారీచేశారు. తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఈ సినిమాలో సుబ్రహ్మణ్యస్వామిని ఉత్తర భారతంలో పుట్టినవాడిగా, ఉత్తరాది దైవంగా చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికి చరిత్రని తప్పుదోవ పట్టించడమే. మురుగన్ తమిళుల ఆరాధ్య దైవం. ఆయన సంస్కృతి, చరిత్ర తమిళ గడ్డతోనే ముడిపడి ఉంది. సినిమా ప్రయోజనాల కోసం తమిళుల దైవాన్ని వేరే ప్రాంతానికి చెందినవాడిగా చూపిస్తే చూస్తూ ఉరుకోం. తమిళుల మనోభావాలు దెబ్బతినేలా, వారి సాంస్కృతిక మూలాలు మార్చేలా ఇందులో సన్నివేశాలు ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మూవీ టీమ్ వెంటనే ఈ విషయాన్ని గమనించి తగిన మార్పులు చేయాలి. లేదంటే మూవీ విడుదలని అడ్డుకుంటాం. ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తాయి' అని సీమన్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సింగ్ గీతం' సినిమా.. అధికారిక ప్రకటన)


