చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మోడ్రన్ మిస్మమ్మ'. సాయిబాబా దర్శకుడు. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరోహీరోయిన్లు. బుధవారం తొలిపాటని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో గ్రాండ్గా విడుదల చేశారు.
గీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ అంటూ సాగిన పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో కనిపిస్తుండగా, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ డ్రెస్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ పెళ్లి వద్దంటూ పాడుకునే ఈ పాట మహిళలకు కనెక్ట్ చేసేలా ఉంటుంది.
డైరెక్టర్ సాయి బాబా మాట్లాడుతూ.. ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిస్ టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి. గతంలో వచ్చిన ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’, భూమిక ‘మిస్సమ్మ’ ఈ రెండు చాలా అడ్వాన్స్ మూవీస్. మా సినిమాలో కూడా అలాంటి దమ్ము ఉందని నమ్మాం. ఈ సినిమా ద్వారా పెళ్లి వద్దని చెప్పడం లేదు. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందేనని చెప్పారు.
నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ.. ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా మూవీ తీయాలనుకున్నాం. మంచి అవుట్పుట్ వచ్చింది. అనుకున్న టైమ్లో అనుకున్న బడ్జెట్తో సినిమా పూర్తి చేశాం. అదే మా మొదటి సక్సెస్గా భావిస్తున్నాం. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని అన్నారు.


