యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు దగ్గరవడంతో ఇటీవల వచ్చిన పలు సినిమాల టికెట్ రేట్లను పెంచకుండా రిలీజ్ అవడం ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడం వంటి అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల టికెట్ రేట్లు పెంచకుండా విడుదలైన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, ‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘లెనిన్’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో టికెట్ రేట్లు పెంచకపోవడం వల్లే థియేటర్లకు ఫుట్ఫాల్ పెరుగుతోందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక జీవో ఇంకా రాలేదు కానీ, పెంపు దాదాపు ఖరారైందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.
ఉదయం 6 గంటల ఎర్లీ మార్నింగ్ షోకు రూ.500–600 వరకు, రెగ్యులర్ షోలకు టికెట్పై రూ.50 వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. ఇటీవల వచ్చిన సినిమాల అందుబాటు ధరలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ‘టాక్సిక్’కు ఇంత భారీ రేట్లు పెడితే ఏపీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అప్పటికి టికెట్ ధరలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయిన విషయం తెలిసిందే.
గీతూ మోహన్దాస్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


