న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)గత జూన్ 22 నుండి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించింది. అయితే, జూన్ 30న జరిగిన సోషియాలజీ (సామాజిక శాస్త్రం) పరీక్షా పత్రంలో స్పెల్లింగ్ లోపాలు, తప్పుడు వ్యాకరణాలు ఉన్నాయని అంతరా చక్రవర్తి అనే పీహెచ్డీ అభ్యర్థి ‘ఎక్స్’ వేదికగా ఆరోపించడంతో ఈ పరీక్షల నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 శాతం ప్రశ్నపత్రం ఇటువంటి ఘోర తప్పిదాలతోనే నిండిపోయిందని సదరు అభ్యర్థి పేర్కొన్నారు.
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల పేర్లను ఈ ప్రశ్నపత్రంలో పూర్తిగా మార్చేశారని ఆమె ఉదాహరణలతో సహా వివరించారు. ‘రిట్జర్’ అనే పేరును ‘పుట్జర్’ అని, ‘పార్సన్స్’ను ‘పార్సో’ అని, ‘ఘుర్యే’ను ‘ఘున్యే’ అని, అలాగే ఏఆర్ దేశాయ్ పేరును ‘ఏకె దేశాయ్’ అని తప్పుగా ముద్రించారని తెలిపారు. అంతేకాకుండా, ‘సోషల్’ అనే పదాన్ని ‘ఓవల్’అని రాశారని, ప్రశ్నల హిందీ అనువాదం ఐదేళ్ల పిల్లాడు చేసినట్లుగా అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల ప్రశ్నలను అర్థం చేసుకోవడానికే సగం సమయం వృథా అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలను సమర్థిస్తూ మరో అభ్యర్థి కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నపత్రం ఎన్టీఏ విద్యా ప్రమాణాలను ప్రశ్నిస్తోందని, సిలబస్కు వెలుపల ఉన్న ప్రశ్నలు ఇచ్చారని విమర్శించారు. అసలు సామాజిక శాస్త్రానికి సంబంధం లేని మాజీ విద్యాశాఖ మంత్రుల కాలక్రమాన్ని అమర్చమనే ప్రశ్నలు అడగడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హతను నిర్ణయించే ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలో ఇలాంటి తప్పులు దొర్లడంపై పలువురు విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


