బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. కేలరీల లెక్కింపు వ్యాయామం వంటివి బరువు తగ్గేందుకు ఉపకరించేవే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్ బరువు తగ్గడానికి ఒక వెరైట్ డైట్ విధానం అనుసరించి ఏకంగా 38 కేజీల బరవు తగ్గాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యకరమైన తండ్రిగా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గానని వెల్లడించారు. మరి ఆయన అనుసరించిన డైట్ విధానం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
కంటెంట్ క్రియేటర్ జెఫిన్ స్వతహాగా పెద్ద ఫుడ్డీనని అన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్ పట్ల ఉన్న ఇష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగు తాను ఏళ్ల తరబడి అధిక బరువుతో పోరాడినట్లు తెలిపారు. తాను 2018లో 35 కిలోలు తగ్గానని, కానీ ప్రతి గ్రాము తిరిగి పెరిగిపోవడాన్ని చూశానని అన్నారు. అయితే 2022లో పెళ్లి కోసం మళ్లా బరువు తగ్గానని చెప్పారు. కానీ హైదరాబాద్కు మారిన తర్వాత ఒత్తిడి పెరిగి మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోయానని పోస్ట్లో రాసుకుకొచ్చారు.
తన అధిక బరువు తనకు బాధకరమైన అంశంగా మారిందని అన్నారు. ఇతరులకు ఇచ్చే స్నేహపూర్వక సలహాలు కూడా ఒత్తిడిని పెంచాయని చెప్పారు. గతేడాది ఏకంగా 147 కిలోల అధిక బరువుకి చేరిపోయానని అన్నారు. పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా.. తన జీవనశైలి కారణంగా తక్షణ స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్నారు. పైగా తన భార్య రిన్సీ తను కలిసి ఒక బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే తాము ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకుని..ఇలా వెయిట్లాస్ జర్నీకి ఉపక్రమించామని అన్నారు.
అయితే తమ ఫిట్నెస్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇలా పంచుకుంది ఆ జంట. తాము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం)ని ఉపయోగించనట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నామని అన్నారు. అలాగే డైట్లో తన భార్య రోజుకు రెండు పూటల భోజనానికి మారగా, తాను ఒక్క పూట భోజనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
అలా ఇప్పుడు తాను 109కిలోలకు చేరానని, ఇప్పటికీ ఆ ఆహార నియమాన్ని, వ్యాయామాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిక మరింతగా ఆరోగ్యకరమైన బరువు చేరుకోవడమే లక్ష్యంగా తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
ఒమాడ్ డైట్..
ఒమాడ్ అంటే ఒకరకమైన ఇంటర్మిటెంట్ పాస్టింగ్. ఇది ఒక వ్యక్తి తీసుకునే కేలరీలను ఒకే భోజనానికి లేదా ఒక గంట వంటి తక్కువ సమయానికి పరిమితం చేస్తారు. అంటే రోజంతా ఒక భోజనం చేసి, ఇతర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం లేదా ఒకే భోజనం చేసి, ఉపవాస సమయంలో పరిమిత పరిమాణాంలో ఆహారం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ ఆహార పద్ధతి కేలరీల లోటుకి దారితీస్తుంది.
అంటే శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలను తీసుకుంటుంది. దీనివల్ల సునాయాసంగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. ఈ విధానం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. రక్తంలో చక్కెర, వాపు స్థాయిలు తగ్గడం తోపాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఈ ఆహార పద్ధతి పిల్లలు కౌమారదశలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహార సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్కు..!)


