ఖర్గోన్: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నీలోఫర్ అనే వివాహిత ఉదంతం సంచలనం సృష్టిస్తున్నది. మోహన్ టాకీస్ ప్రాంతానికి చెందిన నీలోఫర్ శనివారం మధ్యాహ్నం యాసిడ్ తాగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఇండోర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించకుండానే అత్తమామలు మృతదేహాన్ని ఖననం చేశారని పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్డీఎం, తహశీల్దార్ ఆదేశాలతో ఘటన జరిగిన మరుసటి రోజే అధికారులు రంగంలోకి దిగారు. సమాధి నుంచి నీలోఫర్ మృతదేహాన్ని వెలికితీసి, తహశీల్దార్ సమక్షంలో పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. కోత్వాల సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సిర్సాఠ్ మాట్లాడుతూ, అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి వైద్య పరీక్షల కోసం పంపామని తెలిపారు. మరణానికి గల కారణాలు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత దేశభక్తి పాట.. రఫ్ఫాడిస్తున్న నెటిజన్లు!


