ఐఐటీ బొంబాయిలొ విషాదం చోటు చేసుకుంది. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిపోయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబైకి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాలేజీ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చనిపోయిన విద్యార్థిని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సాహిల్ వాకోడేగా గుర్తించారు. సాహిల్ మరణంపై తీవ్రంగా విచారిస్తున్నట్టు ఐఐటి బొంబాయి ఒక ప్రకటన జారీ చేసింది. కాగా ఇటీవలికాలంలో ఐఐటీ పవాయి క్యాంపస్లో జరిగిన మూడో ఆత్మహత్య ఇది. సంస్థ కథనం ప్రకారం, సాహిల్ వాకోడే పరీక్ష సమయంలో సమాధానాల కోసం చాట్జీపీటీ (ChatGPT)లో పరీక్ష ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేశాడు.విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఇన్స్ట్రక్టర్ ,హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ విద్యార్థితో మాట్లాడి, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చామని చెబుతున్నారు. ఇది అతని అకడమిక్ కెరీర్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని భరోసా ఇచ్చామన్నారు. కానీ ఆ తరువాత విద్యార్థి తన హాస్టల్ గదికి వెళ్లి, సాయంత్రానికి విగతజీవుడిగా పడి ఉన్నాడు.

FOUND WITH PHONE IN EXAM HALL. IIT BOMBAY STUDENT ENDS LIFE. PROTESTS ROCK CAMPUS.
A second-year IIT Bombay student died by suicide on Friday, hours after he was found using a mobile phone during an examination. According to an official statement from the institute, the student… pic.twitter.com/OVwqJ0P3hC— Rahul Shivshankar (@RShivshankar) September 19, 2026
విద్యార్థుల ఆందోళన
ఫిబ్రవరిలో ఒకరు, 2026 జూలైలో మరొకరు చొప్పున గత కొన్ని నెలల్లో ఐఐటీ బొంబై క్యాంపస్లో ఇలాంటి ఘటనే జరగడం ఇది మూడోసారి. సాహిల్ మృతి వార్త వెలువడిన వెంటనే ఐఐటీ పవాయి క్యాంపస్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇన్స్టిట్యూట్ పూర్తి నిజాలను దాచిపెడుతోందని ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన విద్యార్థిని ఒక సంవత్సరం సస్పెన్షన్ విధిస్తామని బెదిరించారని, దీనివల్ల అతను హాస్టల్ ఖాళీ చేసి బయట ఉండాల్సి వస్తుందని, కోర్సు ఐదేళ్లకు మారుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఒత్తిడే అతన్ని ఈ తీవ్ర నిర్ణయానికి పురిగొల్పి ఉంటుందని ఆరోపించారు. క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి దత్తాత్రేయ నలవాడే తెలిపారు.


