మనీలా: ఫిలిప్పీన్స్లో దారుణం జరిగింది. అక్కడి పాఠశాలలో ఒక విద్యార్థి తన తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. అనంతరం ఆ విద్యార్థి సైతం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ విషయమై ఆ ప్రాంతానికి చెందిన బంగ టౌన్ మేయర్ ఆల్బర్ట్ పాలెన్సియా మాట్లాడుతూ, కాల్పులలో మరో ఎనిమిది మంది గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులందరూ 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులేనని తెలిపారు. కాల్పులకు ముందు నిందితుడు తన స్నేహితుల పక్కన కూర్చుని, భోజనం తర్వాత నేను నా ప్రణాళికను అమలు చేస్తానని చెప్పి వారందరిని ఇంటికి వెళ్లమన్నాడు. అయితే అతను తరచుగా హస్యం చేస్తుండడంతో ఆ ఘటనను విద్యార్థులంతా జోక్ గానే భావించారని ..మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులపై కాల్పులు ప్రారంభించారని తెలిపారు.
కాగా గత నెలలో, ఇదే తరహా ఘటన జరిగింది. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి మరో విద్యార్థిని కాల్చి చంపి, ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుమందు జూన్లో, టాక్లోబన్లోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు సహ విద్యార్థులు క్యాంపస్లో కాల్పులు జరపడంతో, కనీసం ముగ్గురు విద్యార్థులు మరణించగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఫిలిప్ఫిన్స్లో తరచుగా ఇలాంటి ఘటనలు జరగడం అక్కడ ఆందోళన రేకెత్తిస్తుంది.


