నిఠారి హత్యకేసులో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలి (Surinder Koli) ఆత్మహత్య కలకలం రేపింది. 2006 నాటి ఈ సంచలనాత్మక కేసులో "నిఠారి రాక్షసుడు" (Monster of Nithari)గా ముద్రపడి, సంచలనం సృష్టించిన సురీందర్ హరిద్వార్లోని సప్త సరోవర్ రోడ్డులో గల లాల్మాతా ఆలయం ఎదురుగా ఉన్న టీ స్టాల్లో కోలి ఉరి వేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
గత ఏడాది సుప్రీంకోర్టు ఆయనను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత, కోలి కొంతకాలంగా హరిద్వార్లో అద్దెకు టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పోలీసులు అల్మోరాలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు జరుపుతున్నారు.
నిఠారి హత్యల కేసు
2006 డిసెంబర్లో నోయిడాలోని నిఠారి గ్రామంలోని మోనిందర్ సింగ్ పంధర్ బంగ్లా వెనుక ఉన్న డ్రైనేజీలో 16 మానవ కపాలాలు, ఎముకలు లభించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ బంగ్లాలో పనిమనిషిగా పనిచేస్తున్న సురీందర్ కోలి, యజమాని మోనిందర్ సింగ్ పంధర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.2005-2006 మధ్యకాలంలో ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులకు సంబంధించినవి అని విచారణలో తేలింది.
ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులను విచారించిన దిగువ కోర్టు కోలికి మరణశిక్ష విధించింది. అయితే తదుపరి విచారణలో సాక్ష్యాధారాల లోపం కారణంగా 2023 అక్టోబర్లో హైకోర్టు వీరిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు కూడా చాలా అనుమానాలున్నప్పటికీ, తగిన రుజువులు లేకుండా నేరాన్ని నిర్ధారించలేమని వ్యాఖ్యానించింది.19 మంది బాలికలు, మహిళల హత్య కేసులో 13వ బాలిక హత్య కేసులో నిందితుడైన సురేంద్ర కోలిని విడుదల చేయాలని 2025 నవంబర్ 11 న కోర్టు ఆదేశించింది.


