ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అనూహ్యమైన మార్పు వైపు ప్రయాణిస్తోంది. బంగారానికి ఉన్న డిమాండ్ను, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ టి.కియోసాకి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం పరుగు ఇంకా పూర్తికాలేదని, అసలు ఘట్టం ఇప్పుడే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేస్తున్నారు.
మానిటరీ పారిటీ ఫార్ములా విశ్లేషణ
ఆర్థిక నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘మానిటరీ పారిటీ ఫార్ములా’ను వివరిస్తూ.. బంగారం భవిష్యత్తు ధరపై అంచనాలను విశ్లేషించారు. తాను చెప్పిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఇదివరకెన్నడూ లేని విధంగా తమ మునుపటి రికార్డు కంటే మూడింతల వేగంతో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త పసిడి గనులు లేదా నిల్వలు కనుగొనలేదు. ఒకవైపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే సరఫరా మాత్రం స్తంభించిపోయింది.
ప్రపంచ ద్రవ్య సరఫరా, వివిధ దేశాల వద్ద ఉన్న భౌతిక పసిడి నిల్వలను లెక్కించి అందులో కనీసం 40 శాతం ద్రవ్యానికి బంగారం మద్దతు ఇస్తే.. గణాంకాల ప్రకారం ఔన్స్(సుమారు 30 గ్రాములు) బంగారం అసలు విలువ రూ.25,89,000 (27,000 డాలర్లు)కు చేరాల్సి ఉంటుందని ఈ ఫార్ములా తేల్చిచెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ధరల సవరణ కేవలం ప్రారంభ దశలోనే ఉందని, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమేనని జిమ్ రిక్కార్డ్స్ పేర్కొన్నారు.

పెట్టుబడిదారుల అపోహలు.. అవకాశాలు
సాధారణ పెట్టుబడిదారులు బంగారం ధరలు తగ్గుతాయని వేచి చూడటం పెద్ద పొరపాటని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2010లో టెస్లా షేర్లు లేదా 2013లో బిట్కాయిన్ ధరలు తగ్గుతాయని వేచి చూసిన వారితో ప్రస్తుత పసిడి ఇన్వెస్టర్లను పోలుస్తున్నారు. వేచి చూసే ధోరణితో చివరకు మిగిలిన దాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?


