అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్పై కనిపించింది. సోమవారం (సెప్టెంబర్ 14) సాయంత్రం ట్రేడింగ్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉండటం, ఈ వారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న అంచనాలు, మరోవైపు ముడి చమురు ధరలు భారీగా పెరగడం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి.
గణేశ్ చతుర్థి కారణంగా కమోడిటీ మార్కెట్ తొలి భాగంలో ట్రేడింగ్కు సెలవు ఇచ్చారు. మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎంసీఎక్స్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సాయంత్రం 5:15 గంటల సమయంలో ఎంసీఎక్స్ గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.19 శాతం తగ్గి రూ.1,50,973 వద్ద ట్రేడయ్యాయి. అదే సమయంలో ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలోకు 1.70 శాతం క్షీణించి రూ.2,31,000 వద్ద ఉన్నాయి.
అమెరికా ద్రవ్యోల్బణం సెగ
బంగారం ధరల పతనానికి ప్రధాన కారణాల్లో అమెరికా ద్రవ్యోల్బణం కీలకంగా మారింది. అమెరికా ఆగస్టు వినియోగదారు ధరల సూచీ (CPI) ఏడాది ప్రాతిపదికన 3.4 శాతం పెరిగింది. నెలవారీగా 0.4 శాతం పెరిగింది. ఆహారం, ఇంధనేతర వినియోగదారు ధరల సూచీ కూడా ఆగస్టులో నెలవారీగా 0.3 శాతం పెరిగింది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది.
దీంతో సెప్టెంబర్ 16న జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేటు పెంపు అవకాశాలపై మార్కెట్లలో అంచనాలు బలపడ్డాయి. రాయిటర్స్ ప్రకారం, సోమవారం నాటికి ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల రేటు పెంచే అవకాశాన్ని మార్కెట్లు దాదాపు 90 శాతం వరకు ధరలోకి తీసుకున్నాయి. ఇది గత వారం కంటే గణనీయమైన మార్పు.
వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్కు మద్దతు లభిస్తుంది. మరోవైపు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం బులియన్ మార్కెట్పై ఒత్తిడిని పెంచుతోంది.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్.. సెబీ కొత్త ప్రతిపాదనలు


