సాధారణంగా గణేశ్ విగ్రహాలనీ అత్యంత ఆకర్షణీయమైన రూపంలో ఉంటాయి. ప్రతి విగ్రహం దేనికి దానికి విలక్షణమైనది. కానీ ఉత్తరాఖండ్లో కొలువైన వినాయకుడు అత్యంత విభిన్నం. ఇక్కడ వినాయకుడి రెండు జీవితాలను దర్శించి తరించే అవకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ ఆయన రూపం ఇప్పటి వరకు మనం చూసిన గణేశుడి విగ్రహాల్లోకెల్లా అత్యంత విభిన్నంగా ఉంటుంది.
గజనానుడిగా మారక ముందు ఆయన రూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఆకృతి. ప్రపంచంలోనే తలలేని వినాయకుడి ఆలయం ఇది. ఇక్కడ వినాయకుడు తల లేకుండా మొండెంతో పూజలందుకుంటాడు. ఈ వినాయకుడి విగ్రహం కాషాయం రంగులో శక్తిమంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ‘శ్రీ ముండ కటియ గణేశ ఆలయం’ అని పిలుస్తారు.
పురాణ గాథ..
గణేశుడిగా ఆవిర్భవించిన కథ మన అందరికి తెలిసిందే..పార్వతి దేవి గణేశుడిని సృష్టించాలనే ఆలోచన రావడం. శివుని ఆగమనానికై ఎదురు చూస్తూ..పసుపు ముద్దతో ఒక బాలుడి విగ్రహాన్ని రూపొందించి ప్రాణం పోసి కుమారుడిగా స్వీకరించింది. తాను స్నానం ముంగించి వచ్చే వరకు ద్వారం వద్ద కాపలాగా ఉండమని ఆ బాలునికి చెప్పింది. సరిగ్గా ఆ సమయంలో శివుడు ఇంటికి తిరిగి వచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు.
తల్లి చెప్పిన మాటను శిరసావహిస్తూ..లోనికి వెళ్లడానికి వీల్లేదని హుంకరించాడు. ఎంత నచ్చచెప్పిన వినకపోగా..ఆయన దారికి అడ్డుగా నిలిచాడు. ఇది శివునికి ఆగ్రహానికి తెప్పించి ఆ బాలుని శిరస్సుని ఖండించేందుకు దారితీసింది. ఇంతలో పార్వతిదేవి వచ్చి శివుడుకి స్వాగతం పలికి..ఆయనకు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి..ముచ్చటిస్తుండగా..ద్వారం వద్ద ఉన్న బాలుడి ప్రస్థావన వచ్చింది. అంతే అక్కడే తల, మొండెం వేరై పడి ఉన్న బాలుడిని చూసి పార్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
తన కుమారుడికి తిరిగి ప్రాణం పోయకపోతే ఈ విశ్వాన్నే నాశనం చేస్తానని శపథం చేసింది. దాంతో శివుడు కాత్యాయని శాంతించు అంటూ ఊరడించి తక్షణమే ఆ బాలుడిని బతికిస్తానని వాగ్దానం చేశాడు. తన గణాలకు ఉత్తరదిశగా నిద్రిస్తున్న ఏనుగు తలను ఖండించి తీసుకురమ్మని ఆదేశించాడు. అలా శివుడు ఏనుగు మొండెన్ని అతికించి ప్రాణం పోయడంతో గజానుడిగా పేరొందాడు
అంతేగాదు తొలి పూజను అందుకునే గౌరవాన్ని, అడ్డంకులను తొలగించే దేవుడిగా వరాలు ప్రసాదించాడు. ఇప్పుడు మనం చెబుతున్న ఈ ఆలయం ప్రదేశంలోనే బాల గణేశుడు శిరస్సుని కోల్పోవడంతో ఈ ఆకృతిలోనే భక్తులకు వినాయకుడు దర్శనమిస్తూ పూజలందుకుంటున్నాడు.
చేరుకునే మార్గం..
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్ లోయకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది గౌరీకుండ్, కేదార్నాథ మార్గంలో సోన్ప్రయాగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
విమానంలో వస్తున్నట్లయితే, డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయంకు చేరుకుని 226 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
అదే రైలులో వస్తున్నట్లయితే..రిషికేశ్ లేదా డెహ్రాడూన్లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సోన్ప్రయాగ్కు చేరుకోవచ్చు.
ఈ ఆలయానికి చేరుకునే యాత్రికులకు మందాకిని నదిని చూస్తూ నడవడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
ఇదీ చదవండి: 'గోల్డెన్ మోదక్'..ధర ఎంతో తెలుసా!)


