ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానం (F-15E) కూలిపోయినప్పుడు, పారాచూట్ దెబ్బతినడంతో గాల్లోంచి అత్యంత వేగంతో కిందపడి, తీవ్ర గాయాలతో 50 గంటల పాటు శత్రువుల కంటికి చిక్కకుండా తప్పించుకున్న ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ అధికారి ("బ్రావో" అనే కోడ్ నేమ్ గల వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్) సాహసోపేతమైన కథ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రాణాలతో బయటపడిన అమెరికా వైమానిక దళ అధికారి తొలిసారి తన అనుభవాలను అమెరికాకు చెందిన ప్రముఖ సీబీఎస్ (CBS) టీవీ షో '60 మినిట్స్' ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ఏప్రిల్ నెలలో అమెరికా F-15Eఇరాన్ గగనతలంలో కూలిపోయింది. పారాచూట్ పనిచేయక, గంటకు 161 కి.మీ వేగంతో పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డారు. అనేక ఎముకలు విరిగినప్పటికీ పర్వతాన్ని ఎక్కి, ఇరాన్ బలగాల నుంచి దాదాపు 50 గంటల పాటు తప్పించుకుని ప్రాణాలు బయటపడ్డారు.
ఏప్రిల్ 2న ఇరాన్ డ్రోన్, క్షిపణి కార్యక్రమాలకు సంబంధించిన పారిశ్రామిక సౌకర్యాలపై దాడి చేస్తున్న 'DUDE 44' అనే ఎఫ్-15ఈ (F-15E) ఫైటర్ జెట్లో బ్రావో వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ సమయంలో ఆ విమానాన్ని భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టింది.
పారాచూట్ వైఫల్యం
ఏదో ఒక సరుకు రవాణా రైలు వచ్చి గుద్దినట్లు అనిపించిందని బ్రావో చెప్పారు. కొన్ని క్షణాల్లోనే సిబ్బంది ఇద్దరూ పారాచూట్ ద్వారా బయటపడ్డారు. పైలట్ అయిన 'ఆల్ఫా' సురక్షితంగా కిందకు దిగగా, బ్రావో దాదాపు ఐదు మైళ్ల దూరంలో గరుకైన పర్వత ప్రాంతంలో పడ్డారు. ఈ దాడిలో బ్రావో పారాచూట్ దెబ్బతిని సరిగ్గా తెరుచుకోలేదట. దీంతో అత్యంత వేగంతో కిందపడిన క్షణాలు జీవితంలో అత్యంత భయానకమైనవనీ అని పేర్కొన్నారు.
ఫ్రీ-ఫాల్లా, గంటకు దాదాపు 161 కి.మీ వేగంతో నేలను ఢీకొట్టారు. దీంతొ ఆయన వెన్నుపూస, చేయి, భుజం ఎముకలు విరిగిపోయాయి. చీలమండ బెణికింది, తలపై, ముఖంపై గాయాలయ్యాయి. అయినా తాను ప్రాణాలతో బయటపడటాన్ని ఆయన "ఆధునిక కాలపు అద్భుతం" అని అభివర్ణించారు.
ఎలా బయటపడ్డారు
తీవ్ర గాయాలు బాధపెడుతున్నప్పటికీ కూలిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్లి కొండపైకి ఎక్కారు బావో. ఏదైనా ఆశ్రయం దొరుకుతుందనే నమ్మకంతో సుమారు 7వేల అడుగుల ఎత్తులో ఉన్న రిడ్జ్లైన్కు (కొండ శిఖరపు అంచు) చేరుకున్నారు. ఇరాన్ టీవీలో కనిపించ కూడదనే పట్టుదలే ముందుకు నడిపించిందన్నారు.
మరోవైపు అమెరికా బలగాలు ఆల్ఫాను గుర్తించి ఒక సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టాయి. 21 విమానాలతో కూడిన ఈ ఆపరేషన్లో రెండు హెలికాప్టర్లను పంపగా, రెస్క్యూ సిబ్బందిపై ఎదురుకాల్పులు జరిగాయి. ఆల్ఫాను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చినప్పటికీ, బ్రావో ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు బ్రావో అమెరికా బలగాలకు తాను బతికే ఉన్నానని సమాచారం అందించారు. ఆ తర్వాత ఆహారం, నీరు లేకుండా మరో రోజును పర్వతాల మధ్య గడిపారు. ఈలోగా అమెరికా బలగాలు రెండో రెస్క్యూ ఆపరేషన్కు ప్లాన్ చేశాయి.

సీఐఏ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. దాడి జరిగి దాదాపు రెండు రోజుల తర్వాత, దాదాపు 92 మంది స్పెషల్ ఆపరేటర్లు ఇరాన్లోకి ప్రవేశించి బ్రావోను రక్షించారు. చివరికి ఇద్దరు ఎలైట్ ఎయిర్ ఫోర్స్ పారాసెస్క్యూ ఆపరేటర్లు ఆ కొండ శిఖరంపై ఉన్న బ్రావోను చేరుకున్నారు.
ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!
ఈ ఆపరేషన్ అక్కడితో ముగియలేదు. రెస్క్యూ విమానం తాత్కాలిక ఎడారి రన్వేలో కూరుకుపోవడంతో, 90 మందికి పైగా యూఎస్ సిబ్బంది ఇరాన్లోనే చిక్కుకుపోయారు. చివరకు వారందరినీ సురక్షితంగా తరలించి, సున్నితమైన సాంకేతికత శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు అమెరికా సైన్యం ఆ విమానాన్ని కూడా ధ్వంసం చేసింది.
దాదాపు 50 గంటల తర్వాత బ్రావో సురక్షిత ప్రాంతానికి చేరు కున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి అమెరికా సైనిక బృంద స్ఫూర్తి, శిక్షణ, నాయకత్వమే కారణమని ఆయన కొనియాడారు. తిరిగి విమానాలు నడపడం ప్రారంభించిన ఆల్ఫా, భద్రతా కారణాల దృష్ట్యా '60 మినిట్స్' ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, ఇద్దరు సిబ్బందిని రక్షించడంలో కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన


