కొన్ని సంఘటనలు అత్యంత విచిత్రంగా అబ్బురపరిచే విధంగా ఉంటాయి. సాధారణంగా తప్పిపోయిన కొన్నేళ్లకు అనుకోని విధంగా కలిసిన ఉదంతాలను చూసుంటాం. కానీ ఇలా ఇన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న అరుదైన ఘటనను చూసి ఉండరు. మహా అయితే ఐదు, ఆరేళ్లు దూరం ఉండొచ్చు కానీ ఈ తల్లి కూతుళ్లు ఎన్నేళ్లు ఒకరికొకరు సంబంధం లేకుండా బతికారో తెలిస్తే విస్తుపోతారు. ఈ అరుదైన ఘటన దక్షిణ కన్నడలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..105 ఏళ్ల సీతమ్మకు 11 మంది సంతానం. వారిలో పెద్ద కుమార్తె సుశీల తన అమ్మను కలుసుకోలేకపోతుంది. అది ఏకంగా ఎన్నేళ్లు వరకు అంటే..దాదాపుగా 20 ఏళ్ల పైగానే తల్లిని కలవలేకపోతుంది. ప్రధాన కారణం తన తల్లి సీతమ్మ దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకా సమీపంలోని మక్కీ అనే గ్రామంలో నివశిస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళ్లే ప్రదేశం అటవీ మార్గం, పైగా అటు వైపు సరైన రహదారి లేకపోవడం, అందులోనూ కొండ దిగువున ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఆ నేపథ్యంలోనే సుశీల తన తల్లిని చాలా ఏళ్లపాటు కలుసుకోలేకపోతుంది.
కాలం గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఒకరికి సంబంధిచి ఒకరికి పాత జ్ఞాపకాలే తప్ప రాకపోకలు లేక అమ్మను చూసుకునే భాగ్యం లేక తల్లిడిల్లిపోయింది సుశీలమ్మ. ఇక్కడ సుశీలమ్మ వయసు కూడా 85 ఏళ్ల కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల ఆ అమ్మ కూతుళ్ల మధ్య రాకపోకలు దశాబ్దంగా నిలిచిపోయాయి.
మనవళ్ల చొరవతో.. నెరవేరిన చిరకాల కోరిక!
తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు సుశీల మనవళ్లు. వారి చొరవతో సుశీల మక్కికి చేరుకునే అటవీ మార్గం గుండా జీపులో ప్రయాణించింది అయితే జీపు నేరుగా ఇంటి వరకు వెళ్లలేకపోయింది. చేసేది లేక అటవీ మార్గం గుండా సుశీలమ్మను ఓ చిన్నపిల్లను పట్టుకున్నట్లుగా పొదివి పట్టుకుని తీసుకెళ్లారు ఆమె మనవళ్లు. ఆ కష్టమైన ప్రయాణం తదనంతరం ఎట్టకేలకు తల్లిని కలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సుశీల.
రెండు దశాబ్దాల తర్వాత తన తల్లి సీతమ్మను కలుసుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబైంది సులశీలమ్మ. తాము ఎన్నాళ్ల నుంచో అమ్మమ్మను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, ఆమెకు వయసురీత్యా ఉన్న సమస్యల వల్లే ఇన్నేళ్లూ అది వీలు కాలేదని, చివరకు ఇన్నళ్ల తర్వాత తన అమ్మమ్మ, ముత్తవ్వను కలవగలిగిందని ఆనందంగా చెబుతున్నారు సుశీలమ్మ మనవళ్లు.
ఇదీ చదవండి: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట!


