చిన్నశంకరంపేట(మెదక్): తల్లీబిడ్డను విష సర్పం కాటు వేయడంతో చిన్నారి మృత్యువాతపడింది. కాగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన మండలంలోని మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... పొన్నబోయిన నాగరాజు భార్యాపిల్లలతో కలిసి ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో భార్య లావణ్య, కూతురు హారిక(8) ను నల్లని కట్లపాము కాటేసింది. అయితే లావణ్య మేలుకొని విషయం భర్తకు చెప్పింది.
కాలుకు కాటు కనిపించడంతో వెంటనే ఆమెను నార్సింగి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా చిన్నారి హారిక తనకు పాము కరవలేదని, ఇంటి వద్దే ఉంది. కానీ, కొద్దిసేపటికీ చిన్నారి అపస్మారక స్థితికి వెళ్లడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హారిక ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతుంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందం కేసు నమోదు చేశారు.


