ఒక్కోసారి మనకు పరిచయమై వ్యక్తులు ఎంతగా ప్రభావితం చేస్తుంటారంటే..మనం విస్మరిస్తున్న వాటిని గుర్తు చేస్తారు. అంతేగాదు అన్నింటకంటే ఏది ముఖ్యమో చెప్పే శ్రేయోభిలాషులని ఆ తర్వాత గానీ తెలియదు. ఇప్పుడిదంతా ఎందుకంటే..అలాంటి అనుభవమే ఈ సీఈవోకి ఎదురైంది. లింక్డ్ఇన్లో షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. మనం సదా సంపాదన చుట్టూ తిరుగుతూ మర్చిపోతున్న అసలైన సంపదను గుర్తు చేసింది అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఆ పోస్ట్లో ఈమార్ ఇండియా సీఈవో కళ్యాణ చక్రవర్తి ఇలా రాసుకొచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కు చెందిన ఒక సీనియర్ శాస్త్రవేత్త తనను అడిగిన ఒక ప్రశ్న ఏళ్ల తరబడి తన మదిలో అలానే నిలిచిపోయిందని అన్నారు. 2014లో, ప్రయాణమంతా నిద్రపోవాలనే ఉద్దేశంతో తాను బెంగళూరు-ఢిల్లీ విమానం ఎక్కానని పంచుకున్నారు. కానీ మరుసటి రోజు కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన ప్రధానిని కలవడం కోసం వెళ్తున్న డీఆర్డీఓతో మాటలు కదిపినట్లు తెలిపారు.
ఆ శాస్త్రవేత్త మొదటగా, మీరు జీవనోపాధి కోసం ఏమి చేస్తారు అని ప్రశ్నించినట్లు తెలిపారు. తాను ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో మేనేజింగ్ పార్టనర్ అని చెప్పగా, ఎవరడిగారు దాని గురించి అని ఆయన అన్నారు. దాంతో ఆశ్చర్యపోయిన తాను ఒక్కక్షణం ఆయన అలా ఎందుకు అన్నారో ఆలోచించాను. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త తాను వృత్తి గురించి అడగలేదని అన్నారు. తాను ఆరోగ్యం, ఆనందం కోసం ఏం చేస్తుంటారని అడిగానని తాపీగా అన్నారు. దాంతో తాను గర్వంగా సాయంత్రం సమయంలో 45 నిమిషాలు వాకింగ్ చేస్తానని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.
అది విని ఆయన ఆహా ఎంత సమయం వృధా చేస్తున్నారు మీరు అని తేలిగ్గా అనేశారు. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త పరుగెత్తడం వల్ల తన ఫిట్నెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. తాను అలా 34 ఏళ్లుగా పరుగెత్తుతున్నానని, తన రోజుని ఉదయం 4.30 గంటలకు ప్రారంభింస్తానని చెప్పారు. తన దినచర్యలో వారమంతా 15 కి.మీ ఆదివారం ఒక్కరోజు 35 కి.మీ పరుగు ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా మారథాన్లు పూర్తి చేశానని అన్నారు.
ఆ తర్వాత లెక్కించడమే మానేశానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు కళ్యాన్ చక్రవర్తి. చివరగా ఆయన ఒక మంచి జత బూట్లు కొనుక్కుని పరిగెత్తడం మొదలుపెట్టు మిగతాదంతా నువ్వు పరిగెడుతూ తెలుసుకుంటావ్ అని ఆయన ఇచ్చిన సలహాని ఎప్పటికీ మర్చిపోనన్నారు. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి ప్రశ్నను ఇంత సూటిగా అడగలేదని కూడా అన్నారు. దాంతో తాను మరసుటి రోజు నుంచి ఆయన సలహాను తూచా తప్పకుండా పాటించినట్లు తెలిపారు. మొదటి రోజు జస్ట్ 50 మీటర్లు నడిచి అలిసిపోయి వెనక్కి వచ్చేశానన్నారు. ఆ తర్వాత 100 మీటర్లు..అలా ఒక కిలోమీటరుగా మారింది.
మూడు నెలల్లో వేలాది మంది ఇతర రన్నర్లతో పాటు ఎయిర్టెల్ ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రారంభ రేఖ వద్ద నిలబడ్డాను, పూర్తి చేశాను కూడా అని సగర్వంగా చెప్పారు. చివరగా ఆయన మిమ్మల్ని ఎవరూ అడగని ప్రశ్నే కొన్ని సార్లు మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రశ్నగా మారిపోతుంది అంటూ పోస్ట్ని ముగించారు. నెటిజన్లు కూడా ఇది చాలా నిజం, మనం వ్యాపారాలను నిర్మించడం, సంపాదన పోగు చేయడం వంటి వాటితో మునిగిపోతాం. మనకు కావాల్సిని అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం అనే సంపదను విస్మరిస్తాం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన)


