ముంబై: 1993 నాటి ముంబయి పేలుళ్ల కేసు తీర్పు సమయంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారని నాటి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. ఆర్మ్స్ యాక్ట్ (ఆయుధాల చట్టం) కింద కోర్టు ఆయనను దోషిగా తేల్చి, తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించిన తరుణంలో సంజయ్ దత్ వణికిపోయారని ఒక తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈ కేసులో సంజయ్ దత్కు ‘ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్’ కింద ఉపశమనం లభించకుండా తానే గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నికమ్ తెలిపారు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడి నుంచి సంజయ్ దత్ తుపాకీని పొందారని, ఆ వ్యక్తి నేర నేపథ్యం తెలిసి కూడా ఆయుధాన్ని ఉంచుకున్నందున అతనికి చట్టపరమైన రాయితీలు ఇవ్వకూడదని తాను వాదించినట్లు వివరించారు.
ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ ఏడేళ్ల శిక్షను కోరగా, సుప్రీంకోర్టు తుదకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిందని గుర్తుచేశారు. తీర్పు అనంతరం న్యాయస్థానంలో సంజయ్ దత్ భయంతో వణుకుతూ, ‘నేనే తప్పూ చేయలేదు సార్’ అని అంటుంటే, మీడియా చూస్తోందని, నిటారుగా నిలబడాలని తాను ధైర్యం చెప్పినట్లు నికమ్ ఈ సందర్భంగా వెల్లడించారు.


