న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దుల్లో సరైన ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన జోర్డాన్ బ్రౌన్ (36) అనే అమెరికా పౌరుడిని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలు అరెస్ట్ చేశాయి. ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలోని సోనౌలీ సరిహద్దు పిల్లర్ నంబర్ 516 సమీపంలో రొటీన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాలిఫోర్నియాకు చెందిన ఈ వ్యక్తిని ప్రస్తుతం పలు కేంద్ర దర్యాప్తు, భద్రతా సంస్థలు ఉమ్మడిగా విచారిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద లేదా దేశవ్యతిరేక సంబంధాలు లభించలేదని అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పర్యాటక వీసాపై థాయిలాండ్ వెళ్లినప్పుడు అక్కడ పాస్పోర్ట్ పోగొట్టుకున్నానని, ఆ తర్వాత సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు, అక్కడి నుండి నవంబర్ 2025లో సముద్ర మార్గంలోనే భారత్లోకి ప్రవేశించానని బ్రౌన్ పేర్కొన్నాడు.
అప్పటి నుండి గోవాలో నివసిస్తున్న అతడు, ఇటీవల బెంగళూరు నుండి సోనౌలీ సరిహద్దుకు చేరుకుని నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎస్ఎస్బీ తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద రూ. 31,460 నగదు, మొబైల్ ఫోన్లు, నేపాల్ కరెన్సీ, మతపరమైన పుస్తకాలు, ఒక ఏఐ అనువాద పరికరం , చైనా పాస్పోర్ట్, డైరీ లభించినట్లు సమాచారం. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించినందుకు గానూ ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ సెక్షన్లు 21, 23 కింద సోనౌలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: రష్యాను షేక్ చేస్తున్న ‘బోరిస్ నదెజ్దిన్’ ఎవరు?


