94 ఏళ్ల బామ్మ భారతీయ పౌరసత్వం కోసం కలెక్టర్ని ఆశ్రయించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తన శేష జీవితం భారతీయురాలిగా గడపాలంటూ ఆయన వద్దకు వెళ్లి చెప్పిన తీరు అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె కథేంటంటే..
ఆ బామ్మే ఆంద్రప్రదేశ్కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. భర్త మరణానంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కుమారుడు బుచ్చయ్య చౌదరి వర్జీనియాలోని పీటర్స్బర్గ్లో ఆంకాలజిస్ట్గా (క్యాన్సర్ వైద్య నిపుణుడిగా) పనిచేసేవారు. 2000 సంవత్సరంలో మహాలక్ష్మమ్మ అమెరికా పౌరురాలిగా మారారు. ఆమె అక్కడ సుమారు 18 ఏళ్లు నివసించారు. ఆ తర్వాత తన కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరడంతో ఆమె 2018లో తిరిగి భారతదేశానికి వచ్చారు.
దాంతో ఆమెకు మళ్లీ భారతీయ పౌరురాలిగా మారాలనే కోరిక కలిగింది. ఈ ప్రక్రియ వేగంతంగా అవ్వాలని కోరుతూ మహాలక్ష్మమ్మ కలెక్టర్ గారిని కలిశారు. ఆయనతో బామ్మ "కలెక్టర్ గారు నాకు 95 ఏళ్లు నిండనున్నాయి. నా చివరి రోజులను నా మాతృభూమిలో భారతీయ పౌరురాలిగా గడపడమే నా ఏకైక కోరిక. నా అంత్యక్రియలు నా సొంత గ్రామంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే నా అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా భారతీయ పౌరసత్వం లభించేలా సహాయం చేయండి." అని కోరింది.
తాను ఈ దేశ చట్టాలను గౌరవిస్తానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కేవలం తన మిగిలిన జీవితాన్ని తన జన్మస్థలంలోనే గడిపేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని స్థానికి అధికారులను కోరారు. దీనికి జిల్లా కలెక్టర్గారు స్పందిస్తూ..పౌరసత్వంపై తుది సిఫార్సును కేంద్ర అధికారులకు పంపే ముందు స్థానిక విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆ తర్వాత ఈ అభ్యర్థనపై నిర్ణీత విధానాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ బామ్మకు హామీ ఇచ్చారు.
(చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!)


