న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్షీట్లో పొందుపరిచింది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన ఈ చార్జ్షీట్లో మొత్తం 360 మంది సాక్ష్యాలను పేర్కొన్నారు. నీట్-యూజీ పేపర్ల తయారీ ప్రక్రియ ఏప్రిల్ 5 నాటికే పూర్తయిందని, మే 3న పరీక్ష జరగగా.. లీక్ కారణంగా మే 12న రద్దు చేసి జూన్ 21న రీ-టెస్ట్ నిర్వహించినట్లు విశ్వజిత్ కుమార్ సీబీఐకి వెల్లడించారు.
ప్రశ్నపత్రాలు రూపొందించే నిపుణుల ఎంపికలో ఎలాంటి అప్రతిష్ట లేని వారికే ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రసాయన శాస్త్రానికి చెందిన ఒక సీనియర్ నిపుణురాలు ప్రైవేట్ కోచింగ్ తరఫున తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తాను ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఏలో ఆమెకున్న మంచి పేరు కారణంగానే తాము అనుమానించలేదని వివరించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉండే నిపుణులు ఎవరూ మొబైల్స్, పెన్నులు, కాగితాలు లోపలికి తీసుకెళ్లడానికి వీలే లేదని, అయితే నిపుణులను క్షుణ్ణంగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసే విధానం ఎందుకు నిలిపివేశారనేదానికి తనకంటే ముందే ఉన్న పద్ధతినే కొనసాగించినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు ఎన్టీఏ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వద్ద నిపుణుల రాకపోకలపై ఎలాంటి తనిఖీ వ్యవస్థ లేదని నీట్ కన్సల్టెంట్ శిల్పి శర్మ సీబీఐకి తెలిపారు. కేవలం ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే వారిని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. ఎన్టీఏ భవనంలోని ఒకటో అంతస్తులో 110 సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, రికార్డింగ్ నిల్వ సామర్థ్యం కేవలం 25 రోజులు మాత్రమే ఉండటం, సీసీటీవీ కంట్రోల్ రూమ్ సరిగ్గా లేకపోవడం వంటి భద్రతా లోపాలను సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ప్రశ్నలను కాగితపు చిట్టీలపై రాసుకోవడం, కొందరు వాటిని జ్ఞాపకం ఉంచుకుని హోటల్ గదుల్లో నోట్ చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా బయటకు తరలించినట్లు తేలింది.
ఇది కూడా చదవండి: ఇందిర హత్య కేసు దోషి కుమారునికి ‘పంజాబ్’ టికెట్!


