సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను బాధితుడినయ్యానని వ్యాఖ్యానించారు.
సంబల్పూర్లో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం ముదిరిన తీరును చూస్తే కొంతమంది వ్యక్తులు జెన్జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకోవాలని చూశారు.
అందుకే యువత ఆకాంక్షలను గుర్తించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో నా వ్యక్తిగత గౌరవానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మోదీ నా ప్రతిపాదనకు అంగీకరించి, ఆ తర్వాత స్వయంగా ఆయనే పిల్లలతో మాట్లాడారు అని పేర్కొన్నారు.
జులై 25న సమర్పించిన తన రాజీనామా లేఖలోని అంశాలను ఆయన గుర్తుచేశారు. ఈ ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా ఉండటానికి, దేశ ఐక్యతను కాపాడటానికి, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకే తాను మంత్రి పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు.
మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దర్యాప్తును సిబిఐకి అప్పగించి, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి జూన్ 21న తిరిగి నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.


