NEET పేపర్‌ లీక్‌ గుట్టు విప్పిన సీబీఐ | Inside NEET Leak Network: Experts Chits and Telegram Trail Exposed | Sakshi
Sakshi News home page

NEET పేపర్‌ లీక్‌ గుట్టు విప్పిన సీబీఐ

Aug 7 2026 11:32 AM | Updated on Aug 7 2026 11:36 AM

Inside NEET Leak Network: Experts Chits and Telegram Trail Exposed

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు ముందే ప్రశ్నలు ఎలా బయటకు వెళ్లాయి? ఎవరెవరు ఇందులో భాగమయ్యారు? అనే అంశాలపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన వివరాలు వెల్లడయ్యాయి. ప్రశ్నపత్రం ముద్రణ కేంద్రం నుంచి బయటకు రాలేదని.. ప్రశ్నల తయారీ, అనువాదం, పరిశీలన దశలోనే లీక్‌ అయినట్లు దర్యాప్తులో తేలినట్లు అందులో దర్యాప్తు సంస్థ పేర్కొంది.

సీబీఐ ఛార్జ్‌షీట్‌ ప్రకారం.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి చెందిన ముగ్గురు సబ్జెక్ట్‌ నిపుణులు రహస్యంగా ప్రశ్నలను సేకరించి, వాటిని అభ్యర్థులకు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో కెమిస్ట్రీ నిపుణుడు ప్రహ్లాద్‌ విఠల్‌రావ్‌ కులకర్ణి (PV కులకర్ణి), బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్‌ మందారే, ఫిజిక్స్‌ నిపుణురాలు మనీషా సంజయ్‌ హవల్దార్‌ ఉన్నారు.

తయారీ దశలోనే లీక్‌
సాధారణంగా పేపర్‌ లీక్‌ అంటే ముద్రించిన ప్రశ్నపత్రాలు బయటకు రావడం అనుకుంటారు. కానీ NEET-UG 2026 కేసులో మాత్రం ప్రశ్నల రూపకల్పన, అనువాదం, బ్యాక్‌ ట్రాన్స్‌లేషన్‌ సమయంలోనే లీక్‌ జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ప్రశ్నలను నేరుగా కాపీ చేయడం, చిన్న చిట్టీల్లో రాసుకోవడం, కొన్నింటిని గుర్తుపెట్టుకుని తర్వాత రాసుకోవడం, చేతిరాత నోట్స్‌ తీసుకోవడం వంటి పద్ధతులను నిందితులు ఉపయోగించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

అలా.. అభ్యర్థులకు ముందే ప్రశ్నలు
సీబీఐ వివరాల ప్రకారం.. కెమిస్ట్రీ నిపుణుడు కులకర్ణి, బయాలజీ నిపుణురాలు మనీషా మందారే పుణెలో తమ ఇళ్ల వద్ద అనధికారికంగా “స్పెషల్‌ రివిజన్‌ సెషన్లు” నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో అసలు నీట్‌ ప్రశ్నలు, నాలుగు ఆప్షన్లు, సరైన సమాధానాలను అభ్యర్థులకు చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. అభ్యర్థులు వాటిని నోట్‌బుక్స్‌లో రాసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. ఫిజిక్స్‌ ప్రశ్నలు మరో మార్గంలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. మనీషా హవల్దార్‌ పుణెలోని కోచింగ్‌ సిబ్బందికి ప్రశ్నలను చెప్పగా.. తేజస్‌ హర్షద్‌కుమార్‌ షా వాటిని చేతిరాతతో రాసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆ నోట్స్‌ను ఫొటోలు తీసి ఇతరులకు పంపినట్లు సీబీఐ పేర్కొంది.

ఆసుపత్రిలో ప్రశ్నలు బట్టీ పట్టించి..!
లీకైన ప్రశ్నలను అభ్యర్థులకు చేరవేసేందుకు మరో కీలక వ్యవస్థ పనిచేసినట్లు సీబీఐ వెల్లడించింది. పుణెకు చెందిన డాక్టర్‌ మనోజ్‌ భగవాన్‌రావ్‌ షిరురే సహకారంతో కొంతమంది అభ్యర్థులను లాతూర్‌లోని సిద్ధివినాయక్‌ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అక్కడ పరీక్షకు ముందు లీకైన ప్రశ్నలను వారికి గుర్తుపెట్టించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసు విచారణలో షిరురే కుటుంబ సభ్యుడి నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు CBI తెలిపింది.

మహారాష్ట్ర నుంచి విస్తరించిన నెట్‌వర్క్‌
లీకైన ప్రశ్నలు ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని సీబీఐ గుర్తించింది. మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌ వరకు మధ్యవర్తుల ద్వారా ఈ సమాచారం చేరినట్లు ఛార్జ్‌షీట్‌లో వివరించింది. నాసిక్‌కు చెందిన శుభమ్‌ ఖైర్నార్‌.. గురుగ్రామ్‌కు చెందిన యశ్‌ యాదవ్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. లీకైన ప్రశ్నలను PDFలుగా మార్చి టెలిగ్రామ్‌ ద్వారా పంపినట్లు తెలిపింది. ఆ తర్వాత యాదవ్‌ వాటిని జైపూర్‌కు చెందిన మంగీలాల్‌ బీవాల్‌కు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు వాటిని ప్రింట్‌ తీసి కుటుంబ సభ్యులు, కోచింగ్‌ సెంటర్లకు చెందిన అభ్యర్థులకు పంపినట్లు CBI తెలిపింది.

చేతిరాత నోట్సే కీలక ఆధారాలు
ఈ కేసులో ఫోరెన్సిక్‌ ఆధారాలు కీలకంగా మారాయి. దాడుల్లో స్వాధీనం చేసుకున్న నోట్‌బుక్స్‌లోని ప్రశ్నలను పరిశీలించగా.. అవి మే 3న జరిగిన అసలు నీట్‌ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు తేలిందని సీబీఐ తెలిపింది. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (CFSL), ప్రభుత్వ హ్యాండ్‌రైటింగ్‌ నిపుణులు ఈ విషయాన్ని నిర్ధారించినట్లు పేర్కొంది.

NTA భద్రతా లోపాలపై CBI ప్రశ్నలు
పేపర్‌ లీక్‌కు NTA భద్రతా విధానాల్లోని లోపాలు కూడా కారణమయ్యాయని CBI ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. రహస్య విభాగంలో పనిచేసిన నిపుణులందరికీ ఎక్కువ స్థాయిలో ప్రశ్నలకు యాక్సెస్‌ ఉండటం.. ప్రవేశ, నిష్క్రమణ సమయంలో నిపుణులను తనిఖీ చేయకపోవడం, లైవ్‌ CCTV పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం, CCTV ఫుటేజ్‌ కేవలం 20 నుంచి 25 రోజుల వరకు మాత్రమే భద్రపరచడం వంటి లోపాలను దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఏప్రిల్‌ 7న రహస్య పని పూర్తయి.. మే 12న కేసు నమోదు కావడంతో కీలక సమయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ అందుబాటులో లేకుండా పోయిందని CBI తెలిపింది.

13 మందిపై కేసు.. 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌
నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మొత్తం 13 మందిపై CBI ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో ముగ్గురు NTA సబ్జెక్ట్‌ నిపుణులు, కోచింగ్‌ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాల ధ్వంసం, అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (అక్రమ మార్గాల నిరోధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక వస్తువులను CBI సమర్పించింది. మొత్తం దర్యాప్తు పత్రాలు 20 వేల పేజీలకు పైగా ఉన్నట్లు వెల్లడించింది.

మొత్తంగా నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రశ్నపత్రం బయటకు రావడం వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేసినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌ స్పష్టం చేస్తోంది. ప్రశ్నల తయారీ దశలోనే భద్రతా లోపాలు, అంతర్గత వ్యక్తుల పాత్ర, మధ్యవర్తుల నెట్‌వర్క్‌ కారణంగా ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే ఛార్జ్‌షీట్‌లోని ఆరోపణలు కోర్టు విచారణలో నిరూపించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement