యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. ప్రతి ఏడాది వేలాదిమంది సివిల్ సర్వెంట్ కావాలని ఆకాంక్షించినప్పటికీ..కొందరే సక్సెస్ అవ్వగలరు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఒకటి రెండు కాదు ఎన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధించాడో తెలిస్తే విస్తుపోతారు. అక్కడితో ఆగిపోకుండా అత్యంత కఠినతరమైన పరీక్షలో సైతం సత్తా చాటి శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరైన ఓ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించగానే కాలర్ ఎగరేస్తారు..కానీ ఈ వ్యక్తి మాత్రం తన సక్సెస్కి స్టాప్ ఉండదు అన్నట్లుగా సాగి..కొండలాంటి సివిల్స్నే ఢీ కొట్టి..యువతకు ప్రేరణగా మారారు.
అతడే రైతు కుటుంబానికి చెందిన ప్రేమ్ సుఖ్ దేలు. రాజస్థాన్లో బికనీర్ జిల్లాలోని రైసర్ గ్రామానికి చెందిన ప్రేమ సుఖ్దేలు..చిన్న నాటి నుంచి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చూస్తూ పెరిగారు. తండ్రి కుటుంబాన్ని పోషించడానికి రైతుగా పనిచేస్తూనే, ఒంటెల బండిని కూడా నడిపేవారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రేమ్ కూడా ఒక పక్క పాఠశాలలో చదువు సాగిస్తూనే..పశువులు మేపడం, వంటి ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేవాడు.
పేదరికాన్ని ప్రత్యక్షంగా చూడటం వల్ల, మంచి భవిష్యత్తుకు చదువే ఏకైక మార్గమని అతను నమ్మాడు. అందుకే అతడు ఎంతలా కష్టపడి చదివేవాడంటే..మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత రెవెన్యూ అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. అలా ఒకపక్క పట్వారీగా పనిచేస్తూనే వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడు. చివరికి అతని కఠోర శ్రమించి..జస్ట్ ఆరేళ్ల వ్యవధిలోనే ఏకం 12 ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించాడు.
ఆ తర్వాత రాజస్థాన్ గ్రామ సేవక్ పరీక్షలో రెండవ ర్యాంకు సాధించి, రాజస్థాన్ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుకు అర్హత సాధించాడు. ఆ తర్వాత రాజస్థాన్ అసిస్టెంట్ జైలర్ పరీక్షలో సైతం ఉత్తీర్ణుడయ్యాడు. పలు పదవులకు ఎంపికైనప్పటికీ, సివిల్ సర్వీసెస్లో చేరాలనే తన పెద్ద ఆశయాన్ని అతను కొనసాగించాడు.
అయితే అతడు రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్లో ఆల్ ఇండియా 170వ ర్యాంకు సాధించి..ఇండియన్ పోలీస్ సర్వీస్లో స్థానం పొందాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కూడా పట్టుదల, దృఢచిత్తంతో అధిగమించి ఉన్నత స్థానాన్ని చేరుకోగలమని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు ప్రేమ్ సుఖ్ దేలు.
(చదవండి: సైన్యంలోకి డెన్మార్క్ యువరాణి!)


