సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో చంద్రబాబు మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారని, ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో కార్యక్రమాన్ని షోగా మార్చారని విమర్శించారు. పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోందని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం పలు జీవోలు జారీ చేశామని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల కోసం 39, 40, 41, 42 జీవోల ద్వారా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ కార్యక్రమం ద్వారా పేదలకు ఇళ్లపై హక్కులు కల్పించామని అన్నారు. 100 గజాల్లోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా హక్కులు కల్పించినట్లు తెలిపారు.
100 నుంచి 200 గజాల ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వ ధరలో 50 శాతం రాయితీతో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి ఇళ్లపై హక్కులు కల్పించినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిద్ధమైన పట్టాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన పట్టాలకే మళ్లీ పట్టాలు ఇస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలు వసూలు చేశారని కేకే రాజు ఆరోపించారు.
ఇదీ చదవండి: సిట్ కొత్త కథ.. మరో కట్టుకథేనా?


