ముంబై: గణేశ్ ఉత్సవాల వేళ ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలాచౌకీ ప్రాంతంలోని మహాగణపతి ఉత్సవ మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ, ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 12 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలాచౌకీ ప్రాంతంలోని మహాగణపతి ఉత్సవ మండపం వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మంచినీటి స్టాల్ వద్ద విద్యుత్ ప్రవాహం ఉన్నట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ అధికారులు గుర్తించారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గణపతి మండపం వద్ద విద్యుత్ షాక్ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రభావితమయ్యారు. వారిలో సుజాత (33), ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందగా.. కిరణ్ అక్బర్ నాయక్ (19), తన్వి నరేశ్ హండే (19), సాహిల్ సందీప్ తారే (19) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 12 ఏళ్ల బాలిక తీవ్ర పరిస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
భారీ రద్దీతో వెనక్కి వచ్చిన కుటుంబం
మృతిచెందిన చిన్నారి బంధువు కిష్మతి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చారు. రద్దీ తగ్గే వరకు వేచి ఉండాలని భావించి మండపం పక్కనే ఉన్న దుకాణం వద్ద ఆగారు. మండపం సమీపంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారని, భారీగా భక్తులు వస్తున్నప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కవరింగ్ నుంచి నీరు పడటంతో విద్యుత్ లైట్ కూడా సమీపంలోని వారిపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ తగిలిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో తన పిల్లలు కల్పన, నేహా విద్యుత్ ప్రవాహానికి గురయ్యారని తెలిపారు.
VIDEO | Maharashtra: Two persons, including an eight-year-old girl, were killed and several others injured in an electrocution incident near a Ganapati pandal in Mumbai's Lalbaug area early Sunday.
The incident occurred near the Kalachowki Vibhag Sarvajanik Ustav Mandal on… pic.twitter.com/Tn1n7kpcxi— Press Trust of India (@PTI_News) September 20, 2026
తన పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు తానూ విద్యుత్ షాక్కు గురైనట్లు కిష్మతి యాదవ్ చెప్పారు. మండపం నిర్వాహకులు, సంబంధిత అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన అనంతరం గణేశ్ ఉత్సవాల వేళ తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్ల భద్రతపై ఆందోళన నెలకొంది. విద్యుత్ షాక్కు ఖచ్చితమైన కారణం, బాధ్యులపై తదుపరి చర్యలపై అధికారుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.
మండపాల వద్ద భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. విద్యుత్ తీగలు, స్విచ్బోర్డులకు దూరంగా ఉండండి. బయటకు కనిపించే వైర్లు, తెగిన తీగలు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తాకవద్దు. పిల్లలను వాటి దగ్గరకు వెళ్లనివ్వకండి.
2. నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి. వర్షపు నీరు నిలిచిన చోట్ల, విద్యుత్ పరికరాలు లేదా వైర్లు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. తడిసిన వైర్లు, లోహపు స్తంభాలను తాకవద్దు.
3. రద్దీ ఎక్కువగా ఉంటే వేచి ఉండండి. మండపంలోకి వెళ్లేందుకు తొందరపడవద్దు. తోపులాట చేయకుండా, నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూల్లోనే వెళ్లండి. రద్దీ పెరిగితే కొంతసేపు దూరంగా ఉండండి.
4. అత్యవసర మార్గాలను ముందే గుర్తించండి. మండపంలోకి వెళ్లినప్పుడు బయటకు వెళ్లే మార్గాలు, అత్యవసర ద్వారాలు ఎక్కడున్నాయో గమనించండి. ప్రవేశ ద్వారాల వద్ద గుమిగూడవద్దు.
5. విద్యుత్ ప్రమాదం కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. తీగలు కిందపడటం, స్పార్కులు రావడం లేదా విద్యుత్ షాక్ తగిలినట్లు కనిపిస్తే వాటిని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించవద్దు. నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది లేదా అత్యవసర సేవలకు వెంటనే తెలియజేయండి.
ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే ఏం చేయాలి?
విద్యుత్ సరఫరా నిలిపివేసే వరకు బాధితుడిని నేరుగా తాకవద్దు. తడిగా ఉన్న నేలపై నిలబడి బాధితుడిని లాగేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ సరఫరా నిలిపివేయాలని వెంటనే విద్యుత్ సిబ్బందికి, అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వండి. విద్యుత్ సంబంధం పూర్తిగా తెగిందని నిర్ధారించిన తర్వాతే సురక్షితంగా సహాయం చేయాలి. బాధితుడికి వెంటనే వైద్య సహాయం అందించాలి. శ్వాస లేకపోతే, శిక్షణ ఉన్నవారు అత్యవసర సహాయం CPR ప్రారంభించాలి.


