సాక్షి, సిద్దిపేట: మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాల్లో భూముల సర్వే వేగంగా సాగుతోంది. కాగా, ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూముల సర్వేకు ఆదివారం బ్రేక్ పడింది. ఆదివారం సెలవు కావడంతో అధికారులు సర్వే ప్రక్రియను నిలిపివేశారు. సోమవారం నుంచి దళిత రైతుల వారీగా భూములను సర్వే చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక, ఎర్రవల్లిలో 325 సర్వే నంబర్లో భూములు ఉన్న రైతులకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులకు నోటీసులు అందగా.. తమ భూములకు సంబంధించిన ఆధారాలతో సర్వేకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. విడతల వారీగా మరో 100 మందికి పైగా రైతులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు రోజులుగా హద్దుల గుర్తింపు
ఇదిలా ఉండగా.. 325 సర్వే నంబర్ పరిధిలోని భూముల హద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు గత మూడు రోజులుగా చేపట్టారు. సర్వే నంబర్ పరిధిని పరిశీలించి బౌండరీలను మార్కింగ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతుల వారీగా భూముల వివరాలను నమోదు చేయనున్నారు. మొదట 325 సర్వే నంబర్కు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వేను(ఏ రైతు ఏ భూమిని అనుభవిస్తున్నారో/సాగు చేస్తున్నారో) పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రైతుల వారీగా భూములను గుర్తించి సబ్ డివిజన్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే రైతుల వారీ సర్వేలో సంబంధిత రైతులు తమ వద్ద ఉన్న భూ పత్రాలు, ఇతర ఆధారాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు.
388 ఎకరాల ప్రభుత్వ భూమిపై దృష్టి..
ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగుతోంది. గజ్వేల్, హుస్నాబాద్, కలెక్టరేట్ డివిజన్లకు చెందిన సర్వే విభాగం అధికారులు, మర్కూక్ ఆర్ఐ, మండల సర్వేయర్తోపాటు మరో ఏడుగురు సర్వేయర్లు, నలుగురు జీపీఓలు సర్వేలో పాల్గొంటున్నారు. బృందాలుగా విడిపోయి ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసరాల్లోని 325 సర్వే నంబర్లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రధానంగా దృష్టి సారించారు. హద్దులు స్పష్టమవుతున్న నేపథ్యంలో రైతుల వారీగా నోటీసులు జారీ చేసి.. ఎవరి పేరుపై ఎంత భూమికి పట్టా ఉంది? ప్రస్తుతం ఎవరి సాగులో ఎంత ఉంది? క్షేత్రస్థాయిలో ఎంత భూమిని అనుభవిస్తున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. రైతుల వారీగా లెక్కలు పూర్తయిన తర్వాత మొత్తం 388 ఎకరాల్లో సాగులో ఉన్న భూమి ఎంత? మిగిలిన భూమి ఎంత? అనే వివరాలను తేల్చనున్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో మరేదైనా ఆక్రమణకు గురైందా? అనే అంశాన్ని కూడా సర్వే ద్వారా గుర్తించనున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సమాచారం.
భూముల వద్దకు చేరుకున్న దళిత రైతులు
సర్వే నేపథ్యంలో తమ భూముల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు దళిత రైతులు భూముల వద్దకు చేరుకున్నారు. తమ భూములను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయొద్దని అధికారులను కోరారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పట్టాల పంపిణీని కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:


