గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ | Brics put UAE prince in spotlight Who Is Khaled al-Nahyan Full Details | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ

Sep 19 2026 1:38 PM | Updated on Sep 19 2026 1:50 PM

Brics put UAE prince in spotlight Who Is Khaled al-Nahyan Full Details

గల్ఫ్‌ రాజకీయాల్లో మరో యువరాజు పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయనే అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖలీద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌. 44 ఏళ్ల ఖలీద్‌.. కేవలం యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ (MBZ) కుమారుడిగా మాత్రమే కాకుండా.. అబుదాబి ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, దౌత్య వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపడుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ  బ్రిక్స్‌ (BRICS) సదస్సులో ఖలీద్‌ ప్రాధాన్యం మరింత స్పష్టమైంది. యూఏఈ తరఫున సదస్సుకు నాయకత్వం వహించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తోనూ కీలక సమావేశం నిర్వహించారు. ఇరాన్‌, యూఏఈ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించి, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని అంగీకరించినట్లు అబుదాబి అధికారిక వర్గాలు తెలిపాయి. పెజెష్కియాన్‌ కూడా సమావేశం అనంతరం.. గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్తు వైపు చూడాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు చెప్పారు. నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల తర్వాత ఇరాన్‌-యూఏఈ మధ్య అత్యున్నత స్థాయి సంప్రదింపుల్లో ఇదొకటిగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఇదంతా ఎందుకు కీలకం?
ఖలీద్‌ ఎదుగుదల కేవలం దౌత్య భేటీలకే పరిమితం కావడం లేదు. 2023లో ఆయనను అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌గా నియమించిన తర్వాత.. అబుదాబి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా, ADNOCకు సంబంధించిన కీలక బాధ్యతల్లోనూ ఆయన పాత్ర పెరిగింది. అంటే.. అబుదాబి రాజకీయ వ్యవస్థతో పాటు దాని చమురు, పెట్టుబడులు, ఆర్థిక శక్తి వ్యవస్థల్లోనూ ఖలీద్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

ఇదే సమయంలో గల్ఫ్‌లో మరో యువరాజు ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. ఆయనే సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (MBS). సౌదీ అరేబియా భారీ జనాభా, పెద్ద ఆర్థిక వ్యవస్థ, విస్తారమైన చమురు వనరులతో ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఉంది. మరోవైపు అబుదాబి పరిమాణంలో చిన్నదైనా.. భారీ సంపద, పెట్టుబడులు, ఫైనాన్స్‌, లాజిస్టిక్స్‌, అంతర్జాతీయ వ్యాపార సంబంధాల ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా కూడా పెట్టుబడులు, టూరిజం, వ్యాపార రంగాల్లో భారీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. దీంతో గల్ఫ్‌లో అబుదాబి, రియాద్‌ మధ్య ఆర్థిక పోటీ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యెమెన్‌, ఇరాన్‌, సూడాన్‌ వంటి ప్రాంతీయ అంశాలపై కూడా సౌదీ, యూఏఈ విధానాల్లో భేదాలు నమోదయ్యాయి.

తండ్రి నిర్మించిన వ్యవస్థ.. కొడుకు చేతుల్లోకి
యూఏఈ అధ్యక్షుడు MBZ దశాబ్దాలుగా నిర్మించిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఖలీద్‌ తదుపరి దశకు తీసుకెళ్లాల్సి ఉంది. అందులో భాగంగానే అంతర్జాతీయ నాయకులతో వరుస భేటీలు, భారీ పెట్టుబడి సంస్థల పర్యవేక్షణ, అబుదాబి ఆర్థిక వ్యవస్థలో కీలక బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్రిక్స్‌ వేదికపై ప్రధాని మోదీ, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వంటి నేతలతో ఖలీద్‌ భేటీలు.. ఆయనకు అప్పగిస్తున్న అంతర్జాతీయ దౌత్య బాధ్యతలకు మరో ఉదాహరణగా నిలిచాయి. యూఏఈ అధికారిక ప్రకారం, న్యూఢిల్లీలో మోదీతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల దీర్ఘకాలిక సంబంధాలు, ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చ జరిగింది.

అయితే ఖలీద్‌ ఎదుగుతున్న సమయంలో ఆయన కుటుంబంలోని ఇతర కీలక వ్యక్తులకూ అబుదాబి వ్యవస్థలో గణనీయమైన బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక్క వ్యక్తి వారసత్వ కథ మాత్రమే కాకుండా.. అబుదాబి పాలనా వ్యవస్థలో తదుపరి తరం అధికార పంపిణీ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. దీంతో, రియాద్‌లో MBS తన ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ.. అబుదాబి నుంచి ఖలీద్‌ కూడా అంతర్జాతీయ దౌత్యం, పెట్టుబడులు, ఆర్థిక శక్తి ద్వారా తన పాత్రను విస్తరిస్తున్నారు. ఇరాన్‌తో తాజా చర్చలు, మోదీతో భేటీ, బ్రిక్స్‌ వేదికపై ఆయన ప్రదర్శించిన దౌత్య చురుకుదనం.. గల్ఫ్‌ తదుపరి తరం నాయకత్వంలో ఖలీద్‌ పాత్ర పెరుగుతోందన్న సంకేతాలను ఇచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement