ముంబై: ముంబైలోని ఐఐటీ బాంబేలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. పరీక్ష సమయంలో ఫోన్ వినియోగం, చాట్జీపీటీ ద్వారా సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం క్యాంపస్లో కలకలం రేపింది. విద్యార్థుల ఆందోళనతో ఐఐటీ బాంబే ప్రధాన గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరీక్షలో ఏం జరిగింది?
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్ష సమయంలో సదరు విద్యార్థి మరో విద్యార్థి సమాధాన పత్రాన్ని చూస్తున్నట్లు గుర్తించి, పరీక్ష హాలు నుంచి బయటకు పంపించారని వారు ఆరోపించారు. అనంతరం అతడిపై క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే విద్యార్థుల వాదనను ఐఐటీ బాంబే ఖండించింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో.. పరీక్ష సమయంలో విద్యార్థి మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించామని తెలిపింది. ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలోకి అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది. అయితే విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రారంభించలేదని సంస్థ స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని సంబంధిత ఇన్స్ట్రక్టర్, విభాగాధిపతి విద్యార్థితో చర్చించారని ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఈ ఘటన అతడి విద్యా భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపదని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఆ విద్యార్థి సాయంత్రం తన హాస్టల్ గదిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పరిస్థితులను పరిశీలిస్తున్నారని ఐఐటీ అధికారులు తెలిపారు. విద్యార్థి మృతితో అతని స్నేహితులు, సహచరులు, అధ్యాపకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటన దరిమిలా విద్యార్థులు ఐఐటీ బాంబే ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని, యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్థ డైరెక్టర్తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు క్యాంపస్కు చేరుకుని, పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. కాగా ఈ ఏడాది క్యాంపస్లో నమోదైన విద్యార్థుల మృతి ఉదంతాల్లో ఇది మూడో ఘటన అని ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది.
ఇదీ చదవండి: ఎన్నాళ్లైనా ఎదగని పిల్లి.. పులిలా ఉందేంటి?


