ఇరాన్‌లో ఏం జరుగుతోంది.. అమెరికా, ఇజ్రాయెల్‌కు కొత్త పరీక్ష! | Iran Protests Take New Turn Big Rally in Tehran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో ఏం జరుగుతోంది.. అమెరికా, ఇజ్రాయెల్‌కు కొత్త పరీక్ష!

Sep 19 2026 7:59 AM | Updated on Sep 19 2026 7:59 AM

Iran Protests Take New Turn Big Rally in Tehran

టెహ్రాన్‌: అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది మిలటరీ దుస్తులు ధరించి, ఇరాన్‌ జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని నినాదాలు చేశారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన తర్వాత టెహ్రాన్‌లో జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని పలు కథనాలు పేర్కొంటున్నాయి. సుమారు 3 లక్షల మంది పాల్గొన్నట్టు ఇరాన్‌ ప్రభుత్వ టీవీ అంచనా వేసింది.

ఇరాన్‌ ప్రభుత్వం చేపట్టిన ‘జన్ఫాదే–ఇరాన్‌’ (ఇరాన్‌ కోసం ప్రాణాలర్పించేవారు) ప్రచారోద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడంలో కీలకంగా ఉండే ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌, బసీజ్‌ మిలీషియాలకు వీరు అదనపు బలంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేరేందుకు ఇప్పటికే 6 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ జనరల్‌ హస్సన్‌ హస్సన్‌జాదెహ్‌ తెలిపారు. త్వరలోనే ఇతర నగరాల్లోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తామని బసీజ్‌ విభాగం నూతన సారథి హొస్సేన్‌ తాయెబ్‌ ప్రకటించారు.

ర్యాలీని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, మిలటరీ కమాండర్లు, సీనియర్‌ అధికారులు పరిశీలించారు. కొందరు పాల్గొనేవారు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ దేశాల జెండాలను తొక్కుకుంటూ వెళ్లారు. మరోవైపు ఓ ట్రక్కుపై మహిళా గార్డులు మెషీన్‌ గన్లతో కనిపించడం ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచింది.

 

ఇరాన్‌కు ప్లస్‌.. 
ఇదిలా ఉండగా.. యుద్ధం కొనసాగుతున్న వేళ జరిగిన ఈ భారీ ర్యాలీని ఇరాన్‌ ప్రభుత్వం దేశ ప్రజాబలాన్ని, ప్రతిఘటన సామర్థ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లింది. అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య దేశంలో ఐక్యతను చాటే ప్రయత్నంగానూ దీనిని అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది. ఇప్పటికే 6 లక్షల మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతుండటం, ఇతర నగరాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం.. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలను మరింతగా సమీకరించేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తున్న విషయాన్ని సూచిస్తోంది.

ట్రంప్‌కు టెన్షన్‌.. 
ఇదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్‌ ప్రజలు అమెరికా దాడులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశించిన సమయంలో.. యుద్ధం మధ్యలో ఇరాన్‌ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రజలను సమీకరించి ప్రతిఘటనకు సిద్ధమవుతున్నట్లు చూపిస్తోంది. ఈ పరిణామం అమెరికా-ఇజ్రాయెల్‌ వ్యూహాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఇదీ చదవండి: ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్‌ సంతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement