వ్యభిచారం చేసి షరియా చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన ఒక మహిళకు, ఇండోనేషియాలోని ఆచె ప్రావిన్స్లోని బండా ఆచెలో బహిరంగంగా 100 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఆచెలో అమలులో ఉన్న ఇస్లామిక్ షరియా నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం పదకొండు మంది వ్యక్తులకు కొరడా దెబ్బల శిక్ష విధించారు. వారిలో ఇద్దరికి వ్యభిచారం చేసినందుకు ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బల శిక్ష వేయగా, మిగిలిన వారికి స్త్రీ, పురుషుల కలయికకు గాను 16 నుంచి 21 కొరడా దెబ్బల శిక్షను విధించారు.
శిక్ష అమలు చేస్తున్న సమయంలో మహిళ తీవ్ర నొప్పితో బాధపడినట్లు స్థానిక కథనాలు తెలిపాయి. చేతులు పైకెత్తి దయచూపాలని వేడుకుంటున్న ఆమె కొద్దిసేపటికే నేలపై కుప్పకూలింది. ఆమెతో పాటు శిక్షకు గురైన వ్యక్తి కూడా 60 దెబ్బలు పూర్తయిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కొంతసేపు శిక్షను నిలిపేశారు.
ఆ తర్వాత మళ్లీ కొరడాతో కొడుతూ 100 పూర్తిచేసినట్లు బండా అచే ప్రాసిక్యూటర్ కార్యాలయ సీనియర్ అధికారి దుర్మా ముస్తికా తెలిపారు. కాగా శిక్ష అమలును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ షరియా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అచే ప్రావిన్సుల్లో షరియా ఆధారంగా శిక్షలు విధిస్తునారు. వివాహేతర లైంగిక సంబంధాలు, మద్యం సేవించడం, జూదం ఆడటం, వివాహం కాని స్త్రీ, పురుషులు సన్నిహితంగా ఉండటం శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు.
ఇదీ చదవండి: మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్


