సరిగ్గా నెల రోజుల్లో పెళ్లి. ఏర్పాట్లనీ త్వర త్వరగా చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తన పెళ్లి కోసం తన సోదరీమణులతో కలిసి షాపింగ్ చేశాడు. తనకెంతో ఇష్టమైన'షేర్వానీ' కొనుకున్నాడు. ఇంతలో అత్యవసర మీటింగ్ అని చెప్పి వెళ్లిన 31 ఏళ్ల యువకుడు యువరాజ్ సింగ్ మంచంద అనూహ్యంగా శవమై తేలాడు. ఏం జరిగింది? హత్య చేసింది ఎవరు?
ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం హెచ్ఆర్ (HR) ప్రొఫెషనల్ యువరాజ్ సింగ్ తన చెల్లెళ్లతో కలిసి లజ్పత్ నగర్ మార్కెట్కు పెళ్లి షాపింగ్కు చేశాడు. సాయంత్రం 4:15 గంటల సమయంలో అక్కడే ఉన్న 'గోల్డెన్ డ్రాగన్' రెస్టారెంట్లో భోజనం చేశారు. కాసేపటి తర్వాత, గురుగ్రామ్లో తన మాజీ సహోద్యోగిని కలవాల్సి ఉందని చెప్పి వెళ్లాడు. దీంతో అతని సోదరీమణులు క్యాబ్లో ఇంటికి వెళ్లి పోయారు.
సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడిన అతను రాత్రి 10 గంటలకల్లా ఇంటికి వస్తానన్నాడు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ అతను అందుబాటులో లేడు. రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 8న యువరాజ్ నుండి చివరి వాట్సాప్ సందేశం వచ్చింది, ఆ తర్వాత అతని ఫోన్ మళ్లీ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో సెప్టెంబర్ 11న లజపత్ నగర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా యువరాజ్ చివరిసారిగా గురుగ్రామ్లో యువరాజ్ మాజీ సహోద్యోగి అన్య అన్య వత్స్ తోనే యువరాజ్ చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. అనుమానితురాలి కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. భర్తతో కలిసి ఈ హత్యకు పథకం వేసినట్టు తేలింది. నిందితురాలు ఉత్తరాఖండ్లో ఉండగా పోలీసులు ఆమెను, భర్తను అరెస్ట్ చేశారు. విచారణలో ఇద్దరు నిందితులు తామే యువరాజ్ను హత్య చేసి, శవాన్ని గురుగ్రామ్లోని తమ ఇంటి సమీపంలో ఒక డ్రైనేజీలో పడేసినట్లు అంగీకరించారు. ఈ హత్యకు ఆర్థిక వివాదమే కారణమని అనుమానిస్తుండగా, నిందితురాలు హత్యకు గల అసలు కారణాన్ని దాచిపెడుతోందని యువరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఎవరీ అన్య వత్స్
అన్య వత్స్ , భర్త సంయమ్ సచ్దేవా గురుగ్రామ్ ఉంటారు. తమకు వయసున్న కుమారుడు ఉన్నాడని ఆ జంట విచారణ అధికారులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. యువరాజ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసేవాడు. 2022లో యువరాజ్తో కలిసి అన్య మరొక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం ఆమెను ఆ సంస్థ నుంచి తొలగించారు. ఆర్థిక అక్రమాలతోనే ఆమెను తొలగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త సంయమ్కు కూడా ఉద్యోగం లేదు.
ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
ఏడు గంటలు కారులోనే డెడ్బాడీ
యువరాజ్ను అతని కారులోనే రెండుసార్లు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. యువరాజ్ కారులో వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే అతను హత్యకు గురయ్యాడని సమాచారం. మృతదేహాన్ని ఎక్కడ పారేయాలో ఆలోచిస్తూ కనీసం ఏడు గంటల పాటు కారులోనే ఉంచామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు
గురుగ్రామ్ పోలీసులు సెప్టెంబర్ 10నే మృతదేహాన్ని కనుగొన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, చివరికి ఆ వివరాలను 'జోనల్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ నెట్వర్క్' (ZIPNET - గుర్తుతెలియని మృతదేహాల వివరాలను తనిఖీ చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పోర్టల్)లో సకాలంలో అప్లోడ్ చేయలేదని యువరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు తమకు తెలియ జేయకుండానే సెప్టెంబర్ 14న మృతదేహానికి దహన సంస్కారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువరాజ్ తన కుటుంబంతో కలిసి సరితా విహార్లో నివసించేవారు. తండ్రి పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లికి గుండె జబ్బు. ఈ కుటుంబానికి యువరాజే ఏకైక ఆధారం. ప్రస్తుతం నిందితులను 5 రోజులు పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: దారుణం : గ్యాంగ్రేప్, కుళ్లిపోయిన శవం, పీక్కుతిన్న కుక్కలు


