భారతీయ కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగులు రాజీనామాలకు నిరంతరం మారుతున్న వారి ప్రాధాన్యతలే ప్రధాన కారణమవుతున్నాయి. ముఖ్యంగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్ (వృత్తి-వ్యక్తిగత జీవితాల సమతుల్యత) లోపించడమే ఉద్యోగులు రాజీనామాలు చేయడానికి కీలకంగా మారుతోంది. తాజాగా వెలువడిన ‘రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ ఇండియా రిపోర్ట్ 2026’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 3,499 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా రాండ్స్టాండ్ ఈ సమగ్ర సర్వేను నిర్వహించింది. ఇందులో భాగస్వాములైన వారిలో 44 శాతం మంది మిలీనియల్స్, 31 శాతం మంది జెన్–జీలు కాగా, 23 శాతం మంది జెన్–ఎక్స్ తరానికి చెందినవారు ఉన్నారు.
తరాల మధ్య ప్రాధాన్యతల వ్యత్యాసం
గతంలో ఉద్యోగ భద్రత, అధిక వేతనాలకు పెద్దపీట వేసిన ‘జెనరేషన్ ఎక్స్’తో పోలిస్తే.. ప్రస్తుత నవతరం ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జెన్–జీ, మిలీనియల్స్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మానసిక ప్రశాంతత, వ్యక్తిగత సమయం లభించని పక్షంలో ఎంతటి భారీ ప్యాకేజీనైనా వదులుకోవడానికి వీరు వెనుకాడటం లేదు.
సర్వే వెల్లడించిన ముఖ్యాంశాలు
సుదీర్ఘ పనివేళలు, పని ప్రదేశాల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
హైబ్రిడ్ లేదా రిమోట్ వర్క్ సౌలభ్యం లేకపోవడం కూడా ఉద్యోగ మార్పిడికి ఒక బలమైన కారణంగా మారుతోంది.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కేవలం కెరీర్ గ్రోత్ వెనుక పడటానికి యువ ఉద్యోగులు సిద్ధంగా లేరని నివేదిక తేల్చింది.
ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!
యాజమాన్యాలకు హెచ్చరిక
కార్పొరేట్ సంస్థలు కేవలం ఆకర్షణీయమైన జీతభత్యాలు మాత్రమే కాకుండా, సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఆసన్నమైందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను నిలుపుకోవాలంటే వర్క్–లైఫ్ బ్యాలెన్స్కు అనుకూలమైన విధానాలను రూపొందించడం సంస్థలకు అత్యంత కీలకమని రిక్రూట్మెంట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.


