హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆటో ఎల్పీజీ రిటైల్ సంస్థ యాక్సియం గ్యాస్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ నేడు (శుక్రవారం) ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 50.75 కోట్లు సమీకరిస్తోంది. షేరు ధర రూ. 54గా నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం నాడు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 5.77 కోట్లను కంపెనీ సమీకరించింది.
ఐపీవో ద్వారా సేకరించే నిధులను రుణాల చెల్లింపు, ఎల్పీజీ స్టోరేజీ, బాట్లింగ్ ప్లాంట్ల నిర్మాణం, ఆటోమేషన్ మొదలైన అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, సెప్టెంబర్ 24న ఎ–వన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ. 355 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 385–405గా ఉంటుందని సంస్థ తెలిపింది.


