పెళ్లిళ్లలోనూ,పండగల్లోనూ, ఉత్సవాల్లోనూ, దేవాలయల్లోనూ అలంకరణకు క్వింటాళ్ల కొద్దీ పువ్వులతోమండపాలను, దేవుళ్లను అలంకరించడం సర్వ సాధారణం. ఆ తరువాత ఈ పూలన్నీ ఎక్కడికి పోతున్నాయి. ఎపుడైనా ఆలోచించారా? మరీ ముఖ్యంగా గణేశ్, దేవీ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాల తరువాత పుణ్య నదుల్లో, కాల్వల్లో కలిసిపోవే పువ్వుల గురించి ఆలోచించారా? అలా 2015లో, అంకిత్ అగర్వాల్ కాన్పూర్లోని గంగా నది ఒడ్డున నిలబడి, మామూలుగా కనిపించిన ఒక దృశ్యం అతన్ని ఆగి ఆలోచించేలా చేసింది. ఆ ఆలోచనే రూ. 200 కోట్ల కంపెనీకి పునాది పడింది.
అది మకర సంక్రాంతి రోజు.. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తుండగా, ఆలయాల్లో సమర్పించిన పూలను సేకరించి అదే నదిలో పడేస్తున్నారు. చాలామందికి అవి వ్యర్థాలు మాత్రమే, కానీ అంకిత్ అగర్వాల్కు మాత్రం అది ఒక పెద్ద సమస్యలా కనిపించింది. ఇది తీవ్ర సమస్యగా మారకూడదు అనే తపన మొదలైంది.
పురుగుమందులు,రసాయన రంగులు, ఇతర పదార్థాలతో ఆ పువ్వులు, దేవాలయాలలో సమర్పించిన తర్వాత నదిలో కలిసి పోతున్నాయని కలత చెందారు. నది కలుషితం అవ్వడాన్ని ఆపడానికి ఈ పూలను రీసైకిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలయాల నుంచి సేకరించిన వ్యర్థ పువ్వులతో నది కాలుష్యం బారిన పడకుండా ఉండాలనే ఆలోచన మొదలైంది.ఆటోమేషన్ సైన్స్లో నేపథ్యం ఉండి, సోషల్ ఇన్నోవేషన్లో ఫుల్బ్రైట్ ఫెలోషిప్ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన అంకిత్ ఏదైనా చేయాలనుకున్నాడు.అంకిత్ తన చిన్ననాటి స్నేహితుడైన, పర్యావరణ ఇంజనీర్ ప్రతీక్ కుమార్ సంప్రదించాడు. ఇద్దరూ పారేసిన పువ్వులను సేకరించి, వాటిని ప్రాసెస్ చేసే మార్గాలను పరీక్షించడం ప్రారంభించారు. వారి ప్రారంభ ఆలోచన కంపోస్టింగ్, కానీ ప్రయోగాలు అనుకున్నట్లుగా జరగలేదు. ఆలయ వ్యర్థాలలో ఉండే పసుపు, కుంకుమ వంటి పదార్థాలు ఈ ప్రక్రియలో సమస్యలను సృష్టించాయి.

కానీ ఎక్కడా తగ్గలేదు.ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. చివరికి, వారు పూల వ్యర్థాలను అగరబత్తి ఉత్పత్తులకు ముడి పదార్థంగా మార్చే మార్గాన్ని కనుగొన్నారు. వ్యర్థాల సమస్యను పరిష్కరించే ప్రయత్నంగా ప్రారంభమైనది నెమ్మదిగా ఒక వ్యాపార నమూనాగా మారింది.2017లో 'ఫూల్' (Phool.co) వెనుక ఉన్న కంపెనీ అయిన కాన్పూర్ ఫ్లవర్సైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. ప్రారంభంలో ఈ పువ్వులతో అగర్బత్తీలు, ధూప్ కోన్లు, పర్యావరణహిత రంగులను తయారు చేశారు. ఆ తర్వాత ఈ వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు.
అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా ప్రమాదకరమైన ట్యానిరీ పనుల్లో పనిచేసిన వారికి ఉపాధి కల్పించారు. ప్రాసెసింగ్ సమయంలో మిగిలిపోయిన పూల పదార్థంతో ఏమి చేయవచ్చో ఆ బృందం పరిశోధించడం ప్రారంభించింది. ఆ పరిశోధన చివరికి అది మరో కంపెనీకి దారి తీసింది.

ఇదీ చదవండి: లవర్ను పెళ్లాడి బిహార్కు, ఇన్స్టాలో అమెరికా అమ్మడు సందడి
ఫ్లెదర్ -వీగన్ లెదర్(Fleather) ఆవిష్కరణ: కేవలం పూల వ్యర్థాలతో ఆగకుండా, ఆ అవశేషాల నుంచి జంతువుల చర్మానికి ప్రత్యామ్నాయంగా 'ఫ్లెదర్' అనే బయోమెటీరియల్ను అభివృద్ధి చేశారు. ఇది ఫ్యాషన్ పరిశ్రమను ఎంతగానో ఆకర్షించింది. 2017లో సీడ్ ఫండింగ్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 2022 నాటికి సిరీస్-ఎ రౌండ్లో బాలీవుడ్ నటి ఆలియా భట్ తదితరుల పెట్టుబడితో సుమారు రూ. 95 కోట్ల ఈక్విటీ ఫండింగ్ను సాధించింది. FY25 నాటికి ఫూల్ ఆపరేటింగ్ రెవెన్యూ సుమారు రూ. 77 కోట్లకు చేరగా, సంస్థ విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంది. జూన్ 2026లో ఎన్సీఎల్టీ (NCLT) అలహాబాద్ బెంచ్ 'ఫ్లెదర్' వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా డీమెర్జ్ చేసేందుకు అనుమతించింది.
ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి


