Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SEBI has given approval for public issues1
3 కంపెనీలు రెడీ

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల దరఖాస్తులను ఆమోదించింది. ఈ జాబితాలో ఏస్‌వెక్టర్, సిల్వర్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్, స్టీల్‌ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ కంపెనీ చేరాయి. వీటిలో ఏస్‌వెక్టర్‌ 2025 జూలైలో గోప్యతా మార్గాన సెబీకి దరఖాస్తు చేసింది. సిల్వర్‌ కన్జూమర్, స్టీల్‌ ఇన్‌ఫ్రా ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. ప్రస్తుత క్యాలండర్‌ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 92 కంపెనీలు మెయిన్‌బోర్డులో ఐపీవోకు వచ్చాయి. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు ఈ నెలలోనే స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 3 కంపెనీలకు సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం! వివరాలు చూద్దాం.. స్నాప్‌డీల్‌ కునాల్‌ భల్, రోహిత్‌ బన్సల్‌ ఏర్పాటు చేసిన ఏస్‌వెక్టర్‌ రహస్య ఫైలింగ్‌ విధానంలో ఐపీవోకు అనుమతి పొందింది. ఇటీవల ఇదే మార్గంలో పలు దిగ్గజాలు పబ్లిక్‌ ఇష్యూ వచి్చన సంగతి తెలిసిందే. కాగా.. ఈకామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ మాతృ సంస్థ అయిన ఏస్‌వెక్టర్‌.. సాస్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌సహా, కన్జూమర్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ సంస్థ స్టెల్లారో బ్రాండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో యూనికామర్స్‌ 2024లోనే లిస్టయిన సంగతి తెలిసిందే. పంపులు, ఫ్యాన్లు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సిల్వర్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 865 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 35 కోట్లు అనుబంధ సంస్థ బీఏపీఎల్‌ రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా పంపులు, మోటార్లు, ఫ్యాన్లు, లైటింగ్‌ తదితర కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది. విస్తరణపై కన్ను స్టీల్‌ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 96 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.42 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వడోదర, హైదరాబాద్, భిలాయ్‌లలోగల తయారీ ప్లాంట్ల విస్తరణతోపాటు.. వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది.

Unemployment rate remains steady at 5. 2 pc in October 20252
5.2% వద్దే నిరుద్యోగం

న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో 5.2 శాతం వద్దే కొనసాగింది. సెపె్టంబర్‌లోనూ 5.2 శాతంగా ఉండగా, ఆగస్ట్‌లో 5.1 శాతం, జూలైలో 5.2 శాతం, మే, జూన్‌లో 5.6 శాతం, ఏప్రిల్‌లో 5.1 శాతం వద్ద ఉండడం గమనార్హం. అక్టోబర్‌ నెలకు సంబంధించి పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్ల వయసు పైబడిన వారికి సంబంధించిన గణాంకాలు ఇవి. → గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం కాస్తంత తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో 4.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 4.4 శాతానికి తగ్గింది. → పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు సెపె్టంబర్‌లో ఉన్న 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. → మొత్తం మీద 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగం 5.5 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4 శాతానికి పరిమితమైంది. → పురుషులకు సంబంధించి నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో 5.1 శాతం వద్ద స్థిరంగా ఉంది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. అదే పట్టణాల్లో మాత్రం 6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది. → వర్కర్‌–పాపులేషన్‌ రేషియో (మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న వారు) 52.5 శాతంగా ఉంది. మహిళల్లో వర్కర్‌ పాపులేషన్‌ రేషియో స్థిరంగా పెరుగుతూ వస్తోంది. జూన్‌లో ఇది 30.2 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 32.4 శాతానికి మెరుగుపడింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది జూన్‌లో 33.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌ నాటికి 36.9 శాతానికి పెరిగింది. → లేబర్‌ ఫోర్స్‌ పారి్టసిపేషన్‌ రేట్‌ (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) జూన్‌లో ఉన్న 54.2 శాతం నుంచి అక్టోబర్‌లో 55.4 శాతానికి మెరుగుపడింది.

Indian OMCs seen resilient to sanctions on Russian oil3
ఆంక్షలతో భారత ఓఎంసీలకు రిస్కేమీ లేదు

న్యూఢిల్లీ: రష్యన్‌ ఆయిల్‌ కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, ల్యూక్‌ ఆయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించడం, రష్యా చమురు ఆధారిత రిఫైనరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య (ఈయూ) నిషేధం విధించడం భారత ప్రభుత్వరంగ చమురు సంస్థల మార్జిన్లు, పరపతి సామర్థ్యాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే, ఈ ఆంక్షలు ఎంత కాలం పాటు కొనసాగుతాయి, ఎంత కఠినంగా అవి అమలవుతాయన్న దాని ఆధారంగా తుది ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2025 జనవరి నుంచి ఆగస్ట్‌ మధ్య కాలంలో భారత చమురు దిగుమతుల్లో మూడింట ఒక వంతు రష్యా నుంచే ఉండడం గమనార్హం. రష్యా డిస్కౌంట్‌ రేటుపై చమురును విక్రయించడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థల లాభదాయకత గణనీయంగా మెరుగుపడింది. సాధారణంగా మధ్యప్రాచ్య దేశాలపై చమురు దిగుమతుల కోసం భారత్‌ ఎక్కువగా ఆధారపడేది. కానీ, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత ఈ పరిస్థితుల్లో చాలా మార్పు వచి్చంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో మార్కెట్‌ ధర కంటే తక్కువకే చమురును రష్యా ఆఫర్‌ చేయడంతో భారత కంపెనీలు అటువైపు మళ్లాయి. దీంతో భారత చమురు దిగుమతుల్లో అంతకుముందు రష్యా వాటా ఒక శాతంగా ఉంటే, 40 శాతానికి పెరిగింది. చమురు ధరలు తక్కువ స్థాయిలోనే.. ప్రపంచ చమురు ఉత్పత్తి సామర్థ్యం తగినంత ఉండడం ధరలను అదుపులోనే ఉంచుతుందని, బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 2026లో సగటున 65 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపంది. 2025లో బ్రెంట్‌ బ్యారెల్‌ 70 డాలర్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇక రష్యా చమురు ఆధారిత ఉత్పత్తులను ఈయూకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న భారత్‌లోని ప్రైవేటు చమురు సంస్థలు రిస్‌్కను ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ) ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌లు బలంగా ఉన్నట్టు తెలిపింది. ఎల్‌పీబీ సబ్సిడీల నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించిన రూ.30వేల కోట్ల ప్యాకేజీతో గట్టెక్కొచ్చని పేర్కొంది. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ 2025–26లో బ్యారెల్‌కు 6–7 డాలర్లు, 2026–27లో 6 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది.

SEBI aiming to double number of equity investors in 3 to 5 years4
3–5 ఏళ్లలో ఇన్వెస్టర్లు రెట్టింపు

ముంబై: రానున్న మూడు నుంచి ఐదేళ్లలో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకు పెంచే లక్ష్యంతో ఉన్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలియజేశారు. ఇటీవల సెబీ చేపట్టిన సర్వే పలు అంశాలు వెల్లడైనట్లు పాండే పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో ఐదోవంతు వివిధ మార్గాల ద్వారా సెక్యూరిటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లు వెల్లడించారు. 2025 అక్టోబర్‌కల్లా దేశీయంగా మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య 12.2 కోట్లకు చేరింది. 2020లో కోవిడ్‌ మహ మ్మారి బయటపడ్డాక ఈ సంఖ్య వేగంగా పెరిగింది. కాగా.. ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పాండే తెలియజేశారు. తద్వారా 10 కోట్లమందిని జత చేసుకోగలిగితే పలు దేశాల ప్రజలను మించి దేశీ ఇన్వెస్టర్ల సంఖ్య బలపడనున్నట్లు సీఐఐ ఫైనాన్సింగ్‌ సదస్సులో ప్రస్తావించారు. సెబీతోపాటు.. నియంత్రణ సంస్థ సెబీసహా.. కార్పొరేట్లు నాణ్యమైన సెక్యూరిటీల జారీకి కట్టుబడటం ద్వారా క్యాపిటల్‌ మార్కెట్ల ఎకోసిస్టమ్‌ బలపడుతుందని పాండే పేర్కొన్నారు. దీంతో పెట్టుబడిదారులను ఆకట్టుకోవచ్చని తెలియజేశారు. యూఎస్‌ మార్కెట్లలో కరెక్షన్‌ వచి్చనప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడుల కారణంగా దేశీ మార్కెట్లు నిలదొక్కుకుంటాయని అభిప్రాయపడ్డారు. దేశీ మార్కెట్లలో గాలిబుడగల(బబుల్‌) పరిస్థితిలేదని, అత్యుత్తమ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులు, సంస్కరణలు, సులభతర వ్యాపార నిర్వహణకు వీలు వంటి అంశాలపట్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతున్నట్లు వివరించారు. కొత్త నియంత్రణలకు తెరతీయడం సెబీ అజెండాకాదని, అర్ధంచేసుకోగలిగే సరళతర, ఆవిష్కరణలకు మద్దతిచ్చే తెలివైన నిబంధనలను రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఈక్విటీ క్యాపిటల్‌ రూ. 2.5 లక్షల కోట్లను అధిగమించగా.. 7 నెలల్లో కార్పొరేట్‌ బాండ్ల పెట్టుబడులు రూ. 5.5 లక్షల కోట్లను తాకినట్లు వెల్లడించారు.

India October trade deficit hits record high on surge in gold imports5
ఎగుమతులు డీలా

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు మన దేశ ఎగుమతులపై అక్టోబర్‌లో చెప్పుకోతగ్గ ప్రభావమే చూపించాయి. వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 11.8 శాతం తక్కువగా 34.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 16.63 శాతం అధికమై 76.06 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 41.68 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తుండడం తెలిసిందే. సేవల ఎగుమతులు 38.52 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు 34.41 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. → బంగారం దిగుమతులు 200 శాతం అధికమై 14.72 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2024 అక్టోబర్‌లో పసిడి దిగుమతుల విలువ 4.92 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు చూసినా బంగారం దిగుమతులు 21.44 శాతం పెరిగి 41.23 బివలియన్‌ డాలర్లకు చేరాయి. → వెండి దిగుమతులు ఏకంగా 529 శాతం పెరిగి 2.71 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. → చమురు దిగుమతులు మాత్రం 14.8 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2024 అక్టోబర్‌లో చమురు దిగుమతులు 18.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే చమురు దిగుమతుల స్థాయికి బంగారం దిగుమమతులు చేరినట్టు తెలుస్తోంది. → ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, అపారెల్స్, టెక్స్‌టైల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్‌ గూడ్స్‌ ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఇక చేతి ఉత్పత్తులు, కార్పెట్, లెదర్, ఐరన్‌ఓర్, టీ, రైస్, పొగాకు, దినుసుల ఎగుమతులు మరింత క్షీణించాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో ఎగుమతులు 254.25 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.63 శాతం ఎక్కువ. ఇదే కాలంలో దిగుమతులు 6.37 శాతం పెరిగి 451.08 బిలియన్‌ డాలర్లకు చేరాయి. తొలి ఆరు నెలల్లో వస్తు వాణిజ్య లోటు 196.82 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో 5 శాతం బంగారం దిగుమతుల విలువ మొత్తం ఎగుమతుల్లో 5 శాతంగా ఉండడం గమనార్హం. అయితే, పసిడి దిగుమతులు భారీగా పెరగడానికి పండుగల సమయంలో డిమాండ్‌ కారణమని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేజ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్‌ నుంచి రాగా, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతైంది.

 collaboration between Cyient Semiconductors and Azimuth AI 6
సైయెంట్‌ సెమీకండక్టర్స్‌..  ఇంటెలిజెంట్‌ ఎస్‌వోసీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా తొలి ఇంటెలిజెంట్‌ పవర్‌ చిప్‌ ప్లాట్‌ఫాం, సిస్టమ్‌ ఆన్‌ ఎ చిప్‌ (ఎస్‌వోసీ) అయిన ‘అర్క జీకేటీ–1’ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం ఆవిష్కరించారు. సైయెంట్‌ సెమీకండక్టర్స్, అజిముత్‌ ఏఐ కలిసి దీన్ని రూపొందించాయి. సెమీకండక్టర్ల డిజైన్, టెక్‌ ఆవిష్కరణలకు హబ్‌గా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా ఇదొక కీలక మైలురాయని వైష్ణవ్‌ తెలిపారు. ప్రపంచ స్థాయి సెమీకండక్టర్‌ టెక్నాలజీలను డిజైన్‌ చేయడం, అభివృద్ధి చేయడంలో భారత్‌ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. మలీ్ట–కోర్‌ కస్టమ్‌ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్‌ అనలాగ్‌ సెన్సింగ్, మెమొరీ, ఇంటెలిజెంట్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన వాటన్నింటిని సమగ్రపర్చి, విద్యుత్‌ ఆదా చేసే ఎస్‌వోసీగా దీన్ని రూపొందించినట్లు సైయెంట్‌ వైస్‌ చైర్మన్‌ కృష్ణ బోదనపు తెలిపారు. ఇది అత్యధిక వృద్ధి అవకాశాలున్న స్మార్ట్‌ యుటిలిటీలు, అధునాతన మీటరింగ్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, ఇండ్రస్టియల్‌ ఆటోమేషన్‌ తదితర విభాగాల్లో ఉపయోగపడుతుందని అజిముత్‌ ఏఐ వ్యవస్థాపకుడు ప్రవీణ్‌ వై తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement