Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

2026 Hyundai Venue Knight Launched at Rs 9 70 Lakh1
హ్యుందాయ్ వెన్యూ నైట్‌: ధర ఎంతంటే?

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెన్యూ నైట్‌ను రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది పూర్తిగా నలుపు రంగులో ఉండటం చేత.. చూడటానికి సాధారణ వెన్యూ కంటే కొంత భిన్నంగా అనిపిస్తుంది.హ్యుందాయ్ వెన్యూ నైట్‌.. నలుపు రంగు ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రైల్స్, ఓఆర్వీఎంలు పొందుతుంది. అంతే కాకుండా.. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ నలుపు రంగులోని 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అయితే బ్రేక్ కాలిపర్స్ ఎరుపు రంగులో ఉన్నాయి. ఇది మ్యాట్ బ్లాక్ హ్యుందాయ్ లోగోలు, ప్రత్యేకమైన నైట్ లోగోలు పొందుతుంది.వెన్యూ నైట్ ఇంటీరియర్ కూడా నలుపు రంగులోనే ఉంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా సాధారణ వెన్యూలో మాదిరిగానే ఉంటాయి. రంగులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. ఇందులో డ్రైవింగ్, ఎమర్జెన్సీ & ఈవెంట్, వెకేషన్, ఆన్-డిమాండ్ మరియు ఫోటో క్యాప్చర్ వంటి బహుళ రికార్డింగ్ మోడ్‌లు ఉన్నాయి.2026 హ్యుందాయ్ వెన్యూ, పాత వెర్షన్‌లోని అవే ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. కాబట్టి 1.2-లీటర్ పెట్రోల్, డీసీటీతో జత చేసిన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి.

Stock Market Closing Update 20th April 20262
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్లు లేదా 0.074 శాతం నష్టంలో 78,435.12 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు లేదా 0.11 శాతం వద్ద 24,326.65 వద్ద నిలిచింది.అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, బట్లిబోయ్ లిమిటెడ్, రాజపాలయం మిల్స్ లిమిటెడ్, సికాజెన్ ఇండియా లిమిటెడ్, కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రావెయిల్ అండ్ వెయిల్ (ఇండియా) లిమిటెడ్, గుడ్‌ఇయర్ ఇండియా లిమిటెడ్, ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Kia April Bonanza: Save Big on SUVs and EVs This Month3
కియా కార్లు.. భారీ డిస్కౌంట్లు, బంపర్‌ ఆఫర్లు

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన కస్టమర్లకు ఏప్రిల్ 2026 కానుకగా అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. తన లైనప్‌లోని ఎంపీవీ (MPV), ఎస్‌యూవీ (SUV) మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందిస్తోంది. క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మోడళ్ల వారీగా ఆఫర్ల వివరాలు ఇక్కడ తెలుసుందాం.కియా కార్నివాల్ ఈ నెల ఆఫర్లలో అత్యధిక లబ్ధి పొందుతున్న మోడల్ కార్నివాల్ (Kia Carnival). 2025లో తయారైన (PY25) యూనిట్లపై గరిష్టంగా రూ. 3.20 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఇందులో రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 2 లక్షల భారీ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక 2026 మోడల్‌ ఇయర్‌ (MY26) కొత్త స్టాక్‌పై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తాయి.కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెల్టోస్‌ (Kia Seltos)పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. 2025 మోడల్‌ ఇయర్‌ యూనిట్లపై మొత్తం రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 60,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.కియా సైరోస్ కియా కొత్త మోడల్ సైరోస్ (Kia Syros) డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై కూడా కంపెనీ భారీ రాయితీలు ఇస్తోంది. 2025లో తయారైన యూనిట్లపై రూ. 70,000 నగదు తగ్గింపుతో కలిపి మొత్తం రూ. 1.55 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 2026 మోడల్‌ ఇయర్‌ యూనిట్లపై రూ. 60,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV)పై సైతం భారీ ఆఫర్లు ప్రకటించారు. 2025లో తయారైన HTM వేరియంట్‌పై ఏకంగా రూ. 2.15 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ. 85,000 నగదు తగ్గింపు, రూ. 75,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రధాన ఆకర్షణ.అదే విధంగా కొత్త మోడళ్లపై (MY26 యూనిట్లు) రూ. 90,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.అయితే పైన పేర్కొన్న ఆఫర్లు డీలర్‌షిప్ లొకేషన్‌, స్టాక్ లభ్యత, కొనుగోలుదారు అర్హతపై ఆధారపడి మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని అధీకృత కియా డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

Shocking Allegations Surface at TCS Nashik Unit Harassment and Misconduct Exposed4
TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

తవ్వే కొద్దీ వస్తున్నట్లు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పుకు సంబంధించిన సంఘటనలు మాత్రమే కాకుండా.. స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు కూడా బయటపడింది.టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో అసోసియేట్‌గా పనిచేసిన ఒక మహిళకు ఎదురైన అనుభవం వివరించారు. బాధితురాలు కొత్తగా వివాహం చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత సహోద్యోగుల నుంచి అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు, శారీరక వేధింపులు ఎదుర్కొన్నట్లు పోలీసులకు తెలిపింది.ఆమె ప్రకారం.. కొంతమంది సహోద్యోగులు వ్యక్తిగత, దాంపత్య జీవితంపై అసభ్యంగా మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. అనుమతి లేకుండా తాకడానికి ప్రయత్నించడం, ఆన్‌లైన్‌లో కూడా వేధించడం జరిగింది. ఈ చర్యలు మహిళలపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. బాధితురాలు భయంతో మొదట్లో ఎవరికి చెప్పలేకపోయినప్పటికీ, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఒకరోజు ''నేను చీర కట్టుకుని.. లాబీ గుండా, ప్యాంట్రీకి ఎదురుగా నడుస్తుండగా, ఎవరో నా చీర కొంగును లాగినట్లు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి, నా కొంగు అక్కడే పనిచేస్తున్న పురుష ఉద్యోగి చేతిలో ఉంది. నేను వెంటనే నా కొంగును వెనక్కి లాక్కున్నాను, దాంతో అతను నా వైపు చూసి నవ్వాడు'' అని ఆమె ఆరోపించింది.ఈ కేసులో నాసిక్ పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ మేనేజర్ కూడా ఉన్నారు. మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటన సంస్థలోని అంతర్గత వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది, ఎందుకంటే సంస్థకు ముందుగా ఈ తరహా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ తెలిపింది.మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని, దీనిపై మరింత సమగ్రమైన విచారణ జరపాలని కోరుకున్నారు. కాగా టీసీఎస్ కంపెనీ నాసిక్ యూనిట్‌లో తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్

Gold Hallmarking Secrets How to Verify gold purity Spot Fake Offers5
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్‌ హాల్‌మార్కింగ్, ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్‌మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) నిబంధనల ప్రకారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్‌ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్‌యూఐడీ నంబర్ (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్‌ కేర్‌ యాప్‌తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్‌ కేర్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లోని ‘Verify HUID’ సెక్షన్‌లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్‌మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్‌తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్‌ టెస్ట్‌నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్‌ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్‌ ఇన్వాయిస్‌ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్‌యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్‌టీ.ఇదీ చదవండి: డిమాండ్‌ భళా.. నిర్మాణాలు డీలా!

100 Cr Entrepreneur Chooses Autos Budget Hotels Minimalism Trend Sparks Debate6
వంద కోట్ల సామ్రాజ్యం.. ఆటోలో ప్రయాణం

నేటి గ్లామర్ లోకంలో కొంచెం డబ్బు రాగానే విలాసవంతమైన కార్లు, ఖరీదైన బంగ్లాలు, బ్రాండెడ్ వస్తువుల వెంట పడటం సహజం. కానీ, సుమారు రూ.100 కోట్ల నికర విలువ కలిగి ఉండి కూడా సామాన్యుడిలా ఆటోల్లో ప్రయాణిస్తూ బడ్జెట్ హోటళ్లలో బస చేసే ఒక పారిశ్రామికవేత్త కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రముఖ నూడిల్ బ్రాండ్ ‘నేచురల్లీ యువర్స్’ వ్యవస్థాపకుడు వినోద్ చెంధిల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్)లో పంచుకున్న ఒక సంఘటన ఈ చర్చకు దారితీసింది. తన స్నేహితుడైన ఒక ముంబై పారిశ్రామికవేత్త జీవనశైలి గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.‘నా స్నేహితుడి నికర ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైమాటే. కానీ అతను ముంబైకి వచ్చినప్పుడల్లా ఆటోరిక్షాల్లోనే తిరుగుతాడు. వీలైతే షేర్ ఆటోలు, టాక్సీలను ఆశ్రయిస్తాడు. బస చేయడానికి సాధారణ హోటళ్లనే ఎంచుకుంటాడు. ఇప్పటికీ అతనికి ఎలాంటి లగ్జరీ కార్లు లేవు’ అని చెంధిల్ పేర్కొన్నారు.చెంధిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పారిశ్రామికవేత్త ఉద్దేశపూర్వకంగానే విలాసాలకు దూరంగా ఉంటున్నారు. ఆర్థికంగా ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోకుండా ఆచరణాత్మకమైన జీవనశైలినే ఇష్టపడుతున్నారు. సంపద పెరిగిన తర్వాత ఆయన జీవితంలో సెలవుల కోసం కేటాయించే సమయం, వ్యక్తిగత స్వేచ్ఛలో మాత్రమే మార్పులొచ్చాయి.My founder friend who has 100cr net worth. Travels by auto whenever in Mumbai, takes share auto/taxi wherever possible, stays at simple hotels, has not bought an expensive vehicle.Only thing that has changed is that he has more vacations/free time now. https://t.co/Ieoy5AmPE5— Vinod Chendhil (@vinodchendhil) April 19, 2026నెటిజన్ల రీయాక్షన్‌ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘డబ్బు ఉన్నా గర్వం లేకపోవడం గొప్ప విషయం. భౌతిక సంపద కంటే మానసిక ప్రశాంతత, సమయం ముఖ్యం అని ఆయన నిరూపించారు’ అని కొందరు కొనియాడుతున్నారు. ‘సంపాదించిన డబ్బును సౌకర్యాల కోసం ఖర్చు చేయకపోతే ఆ సంపాదనకు అర్థం ఏముంది? కనీసం సమయాన్ని ఆదా చేసుకోవడానికైనా కారు వాడాలి కదా!’ అని మరికొందరు వాదిస్తున్నారు. దీనికి సమాధానంగా, తన స్నేహితుడు ఈ జీవనశైలితో చాలా సంతోషంగా ఉన్నారని చెంధిల్ స్పష్టం చేశారు.మినిమలిజం.. స్టార్టప్ ప్రపంచంలో కొత్త ట్రెండ్?ప్రస్తుతం స్టార్టప్ సర్కిల్స్‌లో మినిమలిజం లేదా కనీస అవసరాలతో జీవించడం అనే ధోరణి పెరుగుతోంది. కేవలం ఆడంబరాల కోసం ఖర్చు చేయకుండా ఆ సంపదను తిరిగి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం లేదా అర్థవంతమైన అవసరాల కోసం (ప్రయాణాలు, కుటుంబంతో గడపడం) ఉపయోగించడంపై యువ వ్యవస్థాపకులు మొగ్గు చూపుతున్నారు.ఇదీ చదవండి: డిమాండ్‌ భళా.. నిర్మాణాలు డీలా!

Advertisement
Advertisement
Advertisement