Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India EU trade deal finalised says commerce secy1
భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారు

భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్‌–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని జనవరి 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇది “సమతుల్యమైనదీ, ముందుచూపుతో కూడినదీ” అని పేర్కొన్న ఆయన, ఈయూతో భారతదేశ ఆర్థిక ఏకీకరణను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అమల్లోకి వచ్చే అవకాశముందని అగర్వాల్ తెలిపారు. ఒప్పంద పాఠ్యానికి సంబంధించిన చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్బింగ్)కు సుమారు 5–6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అధికారికంగా సంతకాలు జరుగుతాయని చెప్పారు. “చర్చలు పూర్తయ్యాయి. ఒప్పందం ఖరారైంది. ఇది రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు.కాగా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Union Budget 2026 Explained Important Budget Terms and What They Mean2
కేంద్ర బడ్జెట్‌ 2026: ఆరోజు నిర్మలమ్మ పలికే పదాలివే..

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించే పదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని పదాలు.. వాటి అర్థాల గురించి తెలుసుకుంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం–వ్యయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.యూనియన్‌ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.ఫిస్కల్‌ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకునే చర్యలు.బడ్జెట్ ఎస్టిమేట్స్‌ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.ఫినాన్స్‌ బిల్‌ (ఆర్థిక బిల్లు): బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.రెవెన్యూ ఎక్స్‌పెండీచర్‌ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.ఫిస్కల్‌ డెఫిసిట్‌ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.ప్రైమరీ డెఫిసిట్‌ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.రెవెన్యూ డెఫిసిట్‌ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.గ్రాస్‌ ఫిస్కల్‌ డెఫిసిట్‌ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.నెట్‌ ఫిస్కల్‌ డెఫిసిట్‌ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.క్యాపిటల్‌ రిసీట్స్‌ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.రెవెన్యూ రిసీట్స్‌ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.డైరెక్ట్‌ ట్యాక్స్‌ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు.

When A Leak Forced Authorities To Move Printing To Minto Road In 19503
1950లో బడ్జెట్ లీక్!.. తర్వాత ఏం జరిగిందంటే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో..గతంలో బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది.. ఈ నార్త్ బ్లాక్‌లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.తరువాత నార్త్ బ్లాక్‌కు..ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్‌కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్‌లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్లందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు.ఇదీ చదవండి: బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.

Infosys tighten WFH norms caps WFO exemption at five days a quarter4
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కొత్త కండీషన్‌

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్‌..దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్‌లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది.

Gold Prices Hit Rs 1 6 Lakh For The First Time Know The Reasons This Historic Surge5
అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొలిసారిగా ఔన్స్‌కు 5,000 డాలర్లు దాటేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్స్‌కు 100 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతూ.. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో చీఫ్ ఎకనామిస్ట్ & గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బంగారం ధర 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 5,085 డాలర్లు దాటేసింది. వెండి ధర 5 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 108.25 డాలర్లు క్రాస్ చేసింది. ఈ రెండూ కొత్త గరిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతకు సంకేతం. ఇది రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విధంగా పీటర్ షిఫ్ పేర్కొన్నారు.Gold is up over $100, trading above $5,085. Silver is up over $5, trading above $108.25, both at new record highs. Most people are clueless about what this means and are in for quite a shock. Those of us who understand have been expecting the economic crisis that’s about to hit.— Peter Schiff (@PeterSchiff) January 26, 2026బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో.. అమెరికా & నాటో దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పాటు ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కూడా.. పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకం విధిస్తామని ఆయన బెదిరించిన తర్వాత.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటివాటిపై పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీటి ధరలను అమాంతం పెంచేసింది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఇదిలా ఉండగా.. విశ్లేషకులు బంగారం ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఔన్సుకు 6000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గోల్డ్ & సిల్వర్ ధరల భారీ పెరుగుదల కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి, రాజకీయ ఉద్రిక్తతలకు స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Axis Mutual Fund Launches BSE Sector Leaders Index Fund 6
యాక్సిస్‌ కొత్త మ్యూచువల్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ బీఎస్‌ఈ సెక్టార్‌ లీడర్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6 వరకు ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో/కొత్త పథకం) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కార్తీక్‌ కుమార్‌ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.బీఎస్‌ఈ 500 సూచీలోని 21 రంగాల కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ప్రతీ రంగం నుంచి టాప్‌ 3 కంపెనీలను ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. దీంతో ఆయా రంగాల్లోని అగ్రగామి కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌ లభిస్తుంది. శామ్కో మిడ్‌క్యాప్‌ ఫండ్‌ శామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌.. శామ్కో మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బలమైన ఆదాయం, లాభాలు, ధరల తీరు ఆధారంగా భవిష్యత్తులో బలంగా ఎదిగే మధ్యస్థాయి కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. ఇందుకు గాను ‘కేర్‌’ విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్‌ కిందకు వస్తాయి. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 4 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement