Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Government Weighs Proposal to Increase Mandatory EPF Wage Ceiling1
పీఎఫ్‌ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?

దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. తప్పనిసరి ఉద్యోగ భవిష్య నిధి (EPF)కు వర్తించే వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే, ఇప్పటివరకు ఈపీఎఫ్ పరిధికి బయట ఉన్న లేదా పరిమిత ప్రయోజనాలకే పరిమితమైన లక్షలాది ఉద్యోగులకు అదనపు భద్రత లభించే అవకాశముంది.ఏమిటీ వేతన పరిమితి?ప్రస్తుతం, ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం డీఏతో కలిపి రూ .15,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే ఈపీఎఫ్ తప్పనిసరిగా వర్తిస్తోంది. ఆ పరిమితిని పెంచితే, మధ్యస్థ వేతనాలు (వేతన రూ.30 వేల వరకూ పెంచే అవకాశం) పొందే ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ కవరేజీలోకి వస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం, ఎంఎస్ఎంఈలు, సేవారంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఉన్న రూ .15 వేల గరిష్ట వేతన పరిమితి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2014 సెప్టెంబర్‌లో దీన్ని నిర్ణయించారు. గత దశాబ్ద కాలంలో జీతాలు, జీవన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కానీ పీఎఫ్‌ పరిమితి మాత్రం మారకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది.వేతన పరిమితి పెంచితే ప్రయోజనాలువేతనంతో పాటు సంస్థ వాటా కూడా ఈపీఎఫ్‌లో జమ కావడంతో దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది.పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత మెరుగవుతుంది.ఈపీఎస్ పరిధి విస్తరించడంతో పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.ఈపీఎఫ్‌కు చెల్లించే మొత్తాలపై పన్ను రాయితీలు ఉంటాయి.గృహ నిర్మాణం, వైద్యం, విద్య వంటి అవసరాలకు నిబంధనల ప్రకారం ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది.యాజమాన్యాలపై ప్రభావంవేతన పరిమితి పెంపుతో యాజమాన్యాలపై చెల్లింపుల భారం కొంత పెరగవచ్చు. అయితే, ఉద్యోగుల నిలుపుదల (రిటెన్షన్) మెరుగవడం, సామాజిక భద్రతతో కూడిన స్థిరమైన వర్క్‌ఫోర్స్ ఏర్పడటం వంటి దీర్ఘకాలిక లాభాలు సంస్థలకు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రతిపాదనపై కార్మిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే, దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

Pre Launch Scam Inside Hyderabad Real Estate Frauds  2
సగం ధరకే ఫ్లాట్‌!! ఇంత తక్కువకు ఇస్తున్నారంటే...

ప్రీలాంచ్‌.. మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. సాహితీ, జయత్రి, భువన్‌ తేజ, ఆర్జే, ఏవీ, జేవీ, క్రితిక, భారతీ, జీఎస్‌ఆర్, శివోం, ఓబిలీ ఇన్‌ఫ్రా.. ఇలా లెక్కలేనన్ని రియల్‌ ఎస్టేట్‌ చీటర్లు కస్టమర్లను నట్టేట ముంచేశారు. ప్రీలాంచ్, సాఫ్ట్‌ లాంచ్, బైబ్యాక్, ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ), వన్‌టైం పేమెంట్‌ (ఓటీపీ).. పేరేదైనా కానివ్వండి వీటి అంతిమ ఎజెండా మాత్రం మోసమే. కళ్లబొళ్లి మాటలతో కొనుగోలుదారులను నట్టేట ముంచేయడమే వీటి లక్ష్యం.ఈ ఫొటోలో కనిపిస్తున్నది అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్‌–343లోని ఖాళీ స్థలం. కానీ, ఈ స్థలంలోనే 32 అంతస్తుల హైరైజ్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని ఓ బిల్డర్‌ తెగ బిల్డప్‌ ఇచ్చాడు. స్థల యజమానితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రాసుకొని, నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ప్రీలాంచ్‌లో విక్రయాలు మొదలుపెట్టాడు. చ.అ.కు రూ.2,500 చొప్పున సుమారు 2 వేల మంది కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేశాడు. ఇప్పటికీ నాలుగేళ్లయినా ఇటుక కూడా పేర్చలేదు. లబోదిబోమంటూ కస్టమర్లు ఆఫీసు చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి ఠాణా మెట్లెక్కారు. పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సదరు బిల్డర్‌ పరారీలో ఉన్నాడు. కష్టార్జితాన్ని పోగొట్టుకున్న కస్టమర్లు దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై ఉన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇటీవల కాలంలో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మోసాలు విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. గత 2–3 ఏళ్ల కాలంలో నగరంలో సుమారు రూ.25–30 వేల కోట్ల స్థిరాస్తి మోసాలు జరిగినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాణ అనుమతులు, రెరా నమోదిత ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోలు చేయాలని, బిల్డర్ల ట్రాక్‌ రికార్డ్‌ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నగరం నలువైపులా..చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ప్రీలాంచ్‌ విక్రయాలు చేస్తున్నాయి. కోకాపేట, ఖానామేట్, నానక్‌రాంగూడ, కొల్లూరు, పుప్పాలగూడ, నార్సింగి, ఫైనాన్షియల్‌ వంటి హాట్‌ ఫేవరేట్‌ ప్రాంతాలైన పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రీలాంచ్‌ విక్రయాలు సాగుతున్నాయి. హైరైజ్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని నమ్మబలికి, కస్టమర్ల నుంచి ముందుగానే సొమ్మంతా వసూలు చేస్తున్నారు. ప్రీలాంచ్‌ ప్రాజెక్ట్‌లన్నీ కేవలం బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ప్రీలాంచ్‌ ప్రాజెక్ట్‌ల ప్రచార దందా సోషల్‌ మీడియా వేదికగానే సాగుతుంది. కొన్ని కంపెనీలైతే ఏకంగా కస్టమర్‌ కేర్‌ సెంటర్లను తెరిచి మరీ దందా సాగిస్తున్నాయి.ఇంతకంటే తక్కువకు ఇస్తున్నాడంటే మోసమే..నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొలదీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్‌ + గ్రౌండ్‌ + ఐదంతస్తుల భవన నిర్మాణానికి చ.అ.కు రూ.3,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.4,500, 15–25 ఫ్లోర్ల వరకు రూ.5,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.6 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్‌ అయినా ఇంతకంటే తక్కువ ధరకు ఫ్లాట్‌ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని ఓ బిల్డర్‌ తెలిపారు.ప్రభుత్వానికీ నష్టమే..ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్‌ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజి్రస్టేషన్‌ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల విక్రయాలకు బదులుగా ప్రాజెక్ట్‌ కంటే ముందే అన్‌డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ ల్యాండ్‌(యూడీఎస్‌)ను కస్టమర్లకు రిజి్రస్టేషన్లు చేస్తున్నారు. ఫ్లాట్‌ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలకు బదులుగా యూడీఎస్‌లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్‌ కింద 1 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్‌లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజి్రస్టేషన్‌ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు.కస్టమర్లకు సూచనలివీనిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.ప్రాజెక్ట్‌ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.డెవలపర్‌ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదో తెలుసుకోవాలి.ప్రాజెక్ట్‌ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.డెవలపర్‌ లేదా కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి.ఇదీ చదవండి: ఆ సంవత్సరం.. రియల్‌ ఎస్టేట్‌కు బంగారం!ఇలా చేస్తే కట్టడి..జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో అధికారుల కొరతను తీర్చాలి. నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించాలి.సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్‌ చేసేలా ఉండాలి.రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి.రెరా అధికారులు, సిబ్బంది తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఏ బిల్డర్లు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది.ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్‌ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి.రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్‌ నంబర్‌ క్రియేట్‌ చేసి ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇటీవల వెలుగు చూసిన ప్రీలాంచ్‌ మోసాల్లో కొన్ని: (రూ.కోట్లలో)

What Is The Right Age To Take A Bank Loan3
హోమ్ లోన్‌ ఏ వయసులో బెస్ట్‌?

ఈరోజుల్లో బ్యాంక్‌ నుంచి గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అసాధ్యమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో అపార్ట్‌మెంట్ల ధరలు రూ.కోట్లలో ఉంటున్నాయి. దీంతో పొదుపు చేసిన సొమ్ముతో పాటు గృహ రుణం తీసుకుంటే తప్ప ఇల్లు సొంతమయ్యేలా లేదు. అయితే ఏ వయసులో హోమ్‌ లోన్‌ తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయో ముందుగానే కొంత అవగాహన కలిగి ఉండటం బెటర్‌. రుణానికి అర్హత ఉంది కదా అని ఏ వయసులో పడితే ఆ వయసులో గృహ రుణం తీసుకుంటే లేనిపోని చికాకులు, మానసిక ఒత్తిళ్లకు లోను కావాల్సి వస్తోందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పైసా పైసా కూడబెడుతుంటారు. ఖర్చులను ఆదుపులో పెట్టుకొని పొదుపుపై దృష్టి పెడుతుంటారు. అయితే మన సొంతింటి కలకు బ్యాంక్‌లు లోన్‌ రూపంలో సహకారం అందిస్తుంటాయి. వడ్డీ రేట్లు కూడా అందుబాటులోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తుంటారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 2.0 అమలులోకి వచ్చాక పన్ను విధానం సరళతరమైంది. స్టీల్, శానిటరీ ఉత్పత్తులు, రంగులు వంటి నిర్మాణ సామగ్రిపై పన్ను శ్లాబ్‌లు తగ్గాయి. ఇది గృహ కొనుగోలుదారులకు డిస్కౌంట్‌గానే కాకుండా దీర్ఘకాలంలో పొదుపుగా మారుతుంది. 30 ఏళ్ల వయసులో రుణం.. సాధారణంగా ఇంటి యాజమాన్యానికి దాదాపు 30 సరైన వయసు. ఈ వయస్సులో చాలా మంది తమ కెరీర్‌ మార్గాలు, స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు ఖర్చుల గురించి బాగా అర్థం చేసుకుంటారు. అలాగే కుటుంబాలతో స్థిరపడాలని ప్లాన్‌ చేసుకుంటారు కాబట్టి గృహ రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కెరీర్‌ ప్రారంభంలోనే అంటే 25–30 ఏళ్ల వయస్సులోనే గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జేబుకు అధిక భారం కాకుండా తక్కువ ఈఎంఐ చెల్లించే వీలుంటుంది. కెరీర్‌ ప్రారంభంలోనే ఉండటంతో సిబిల్‌ స్కోర్‌కు కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎక్కువ రుణం తీసుకునే వీలుతో పాటు కొంత వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. 750కు మించి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నప్పుడే బ్యాంక్‌ రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్‌ స్కోర్‌ 800 దాటితే వడ్డీలోనూ 0.5 శాతం వరకూ తగ్గింపులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. నలభైలో ఒత్తిళ్లు.. ఉద్యోగ విరమణ లేదా జీవితంలో చివరి దశలో 40– 50 ఏళ్ల వయసు ప్రారంభంలో ఇల్లు కొనడమనేది కొంత సవాళ్లతో కూడుకున్న అంశం. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి 20 సంవత్సరాలకు మించి ఉంటుంది కాబట్టి జీవితంలోని ఈ దశలో నెలవారీ వాయిదా(ఈఎంఐ) భారం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ఇతర బాధ్యతలు వంటి అధిక ఖర్చులుండే వయసులో ఈఎంఐ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏమైనా అనుకోని ఘటన జరిగితే సొంతిల్లుని బ్యాంక్‌ జప్తు చేసుకుంటుంది. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. అద్దెకూ వయసుందీ.. ఇల్లు కొనడమనేది వ్యక్తి ఆర్థిక సంసిద్ధత, స్థిరత్వం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సొంతిల్లు ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపును, హోదాను తీసుకొస్తుంది. భవిష్యత్తుకు భద్రతా భావాన్ని అందిస్తుంది. అయితే ప్రాపరీ్టని కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అనువైన సమయం ఎక్కువగా వ్యక్తి వ్యక్తిగత పరిస్థితులు లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల వయసు ప్రారంభంలో అద్దెకు తీసుకోవడం ఆచరణాత్మకమైంది. ఎందుకంటే యువ నిపుణులు స్థిరమైన ఆదాయం కోసం పలు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయతి్నస్తుంటారు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలను మారుతుంటారు. అందుకే ఆర్థికంగా సిద్ధంగా ఉన్నవారు ఈ దశలో ఇల్లు కొనడాన్ని ఎంచుకోవచ్చు.ఉమ్మడి రుణం.. తగ్గును భారం.. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవచ్చు. దీంతో ఇంటి కొనుగోలుకు అధిక మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు సంబంధించి అధిక మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీంతో నెలవారి చెల్లించే ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది.

Gold and Silver rates on January 10th 2026 in Telugu states4
మళ్లీ పసిడి పిడుగు! భారీగా మారిపోయిన ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. కొనుగోలుదారుల పాలిట పిడుగులా మారుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా ఎగిశాయి. వెండి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Golden Run for Indian Real Estate Hyderabad Among Top Gainers5
ఆ సంవత్సరం.. రియల్‌ ఎస్టేట్‌కు బంగారం!

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడుల వరద పారుతోంది. గతేడాది సిటీ స్థిరాస్తి రంగంలోకి రూ.3,892 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. 2024లో వచ్చిన రూ.2,704 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. 2025లో దేశంలోని 8 ప్రధాన మెట్రోల్లోకి 8,474.8 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 5 శాతం వాటాను హైదరాబాద్‌ కలిగి ఉందని కొల్లియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.– 2025 సంవత్సరం భారత స్థిరాస్తి రంగానికి బంగారంలాంటిది. గతేడాది దేశీయ రియల్‌ ఎస్టేట్‌లోకి 8.5 బిలియన్‌ డాలర్ల గరిష్ట పెట్టుబడులు వచ్చాయి. 2024తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, సుంకాల పెంపు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత రియల్‌ ఎస్టేట్‌లోకి ఈ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం గమనార్హం.విభాగాల వారీగా చూస్తే.. 2025లో అత్యధికంగా ఆఫీసు విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ సముదాయంలోకి 4,534.6 మిలియన్‌ డాలర్ల ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. ఆ తర్వాత నివాస విభాగంలోకి 1,566.9 మిలియన్‌ డాలర్లు, మిశ్రమ వినియోగ విభాగంలోకి 819.3 మిలియన్‌ డాలర్లు, పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి 734.2 మిలియన్‌ డాలర్లు, రిటైల్‌లోకి 380 మిలియన్‌ డాలర్లు, డేటా సెంటర్లు, సీనియర్‌ లివింగ్, హాలిడే హోమ్స్, స్టూడెంట్‌ హౌసింగ్‌ వంటి ప్రత్యామ్నాయ స్థిరాస్తి విభాగంలోకి 272.5 మిలియన్‌ డాలర్లు, హాస్పిటాలిటీ రంగంలోకి 167.3 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

More Crorepatis What Indias Tax Data Reveals6
Income Tax: కోటీశ్వరులు పెరిగారు..

మన దేశంలో ఆదాయ వివరాలను సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య అతి స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో రూ. కోటికి మించి వార్షిక ఆదాయం ప్రకటించిన వారు మాత్రం గతం కంటే భారీగా ఉన్నారు. పన్ను ఎగవేతల కట్టడికితోడు భారీ నగదు, విదేశీ రెమిటెన్సులు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్ల వంటి అధిక విలువ కలిగిన లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ట్రాక్‌ చేయడంతో అధిక ఆదాయ వర్గాలు అన్ని వివరాలు వెల్లడించక తప్పడం లేదు. - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌అధిక ఆదాయ వర్గాలు పెరగడం, లావాదేవీల వెల్లడి మరింత మెరుగవడం తాజా గణాంకాలను ప్రతిబింబిస్తోందని ట్యాక్స్‌ నిపుణులు అంటున్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృత వృద్ధికి ఈ ధోరణి కారణమని చెబుతున్నారు. వేతన వృద్ధి, బలమైన బోనస్, ఆరోగ్యకరమైన వ్యాపార లాభదాయకత కారణంగా గృహ ఆదాయాల్లో స్పష్టమైన మెరుగుదల నమోదవుతుందని పేర్కొంటున్నారు.ఆదాయ వివరాల వెల్లడిలో కఠిన నిబంధనలు, డేటా అనలిటిక్స్‌ విస్తృత వినియోగం, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌), మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌)/మూలం వద్ద పన్ను వసూళ్లు (టీసీఎస్‌) ట్రాకింగ్‌ కారణంగా పారదర్శకత పెరిగి పన్ను ఎగవేతలు గణనీయంగా తగ్గాయి. కొత్త సంపద ఆకస్మిక సృష్టి కంటే నిబంధనల అమలు మెరుగైన తీరుకు గణాంకాలు నిదర్శనమని ఇతర ట్యాక్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అతి తక్కువగా.. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ సమాచారం ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌లో 9 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 8.92 కోట్లు. దాఖలైన మొత్తం రిటర్నులు ఏడాదిలో 1.22 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. అసెస్‌మెంట్‌ సంవత్సరం 2025–26కుగాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2025 డిసెంబర్‌ 31 చివరి తేదీ. రెండంకెల వృద్ధి.. 2024–25 ఏప్రిల్‌–డిసెంబర్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్స రం ఇదే కాలంలో రూ.కోటికిపైగా ఆదాయాన్ని ప్రకటించిన వ్య క్తుల (అసెసీలు) సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కు చేరింది. అంటే 21.65% అధికం కావడం విశేషం. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న అసెసీలు 24.1% తగ్గడం గమనార్హం.ఇతర అన్ని ఆదాయ శ్రేణిలో.. అంటే రూ.5 లక్షలకుపైగా ఆదాయం కలిగిన అసెసీల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి, రూ.1–5 కోట్ల ఆదాయం చూపిన అసెసీలు 21% పెరిగారు. ఇక రూ.5–10 కోట్ల శ్రేణిలో ఏకంగా 29.7 %, రూ.10 కోట్లకుపైగా ఆదాయంతో రిటర్నులు సమర్పించినవారి సంఖ్య 28.3% దూసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆదాయం వెల్లడించాల్సిందే.. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అత్యధికులు ఎంచుకుంటున్నారు. అంటే వార్షికాదాయం రూ.12 లక్షల వరకు పన్ను లేదు. అధిక విలువ కలిగిన లావాదేవీల సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాలు, బ్యాంకుల నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు ఎప్పటికప్పుడు చేరుతోంది. పన్ను ఎగవేతలకు చెక్‌ పెట్టేందుకు ఐటీ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అందుకే అధిక ఆదాయ శ్రేణిలో దాఖలైన రిటర్నుల సంఖ్య భారీగా పెరిగింది. - అరుణ్‌ రాజ్‌పుత్, ఫౌండర్, ఆంబర్‌ గ్రూప్‌

Advertisement
Advertisement
Advertisement