Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

EMI Crisis: How IT Layoffs Are Rattling Middle Class Financial Stability1
ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!

ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభంగత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.పెరుగుతున్న గృహ రుణాల ఆందోళనఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.భారమైన బకాయిలుఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావంఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.తాజా నివేదికల ముఖ్యాంశాలు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్‌లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది. ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అన్నిటా లేఆఫ్‌లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

Swiggy co-founder Nandan Reddy steps down amid board leadership reshuffle2
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్‌బై.. తప్పుకొంటున్న కోఫౌండర్‌

ప్రముఖ ఫుడ్, గ్రొసరీ డెలివరీ దిగ్గజం 'స్విగ్గీ' (Swiggy)లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఇన్నోవేషన్ హెడ్ నందన్ రెడ్డి తన ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తన సొంత వెంచర్‌ను ప్రారంభించే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.వ్యవస్థాపక త్రయంలో మిగిలింది ఒక్కరే..శ్రీహర్ష మజేటీ, రాహుల్ జైమినిలతో కలిసి నందన్ రెడ్డి స్విగ్గీని స్థాపించారు. వీరిలో రాహుల్ జైమిని ఇప్పటికే 2020లో కంపెనీ నుంచి తప్పుకోగా, ఇప్పుడు నందన్ రెడ్డి కూడా వైదొలగడంతో వ్యవస్థాపక బృందంలో శ్రీహర్ష మజేటీ మాత్రమే మిగిలారు. "బెంగళూరులో ఒక చిన్న ప్రాంతంలో మొదలైన స్విగ్గీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించడంలో నందన్ కృషి వెలకట్టలేనిది. ఆయన దార్శనికత మా కంపెనీ డీఎన్‌ఏలోనే ఉంది" అని కంపెనీ సీఈవో శ్రీహర్ష ఈ సందర్భంగా కొనియాడారు.బోర్డులో కొత్త ముఖాలునందన్ రెడ్డి నిష్క్రమణతో పాటు బోర్డు సభ్యుల్లోనూ స్విగ్గీ పలు మార్పులు చేపట్టింది. గతంలో 'ఇన్‌స్టామార్ట్' బాధ్యతలు చూసిన ఫణి కిషన్ అడెపల్లి ఇప్పుడు బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈయన చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇక కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రాహుల్ బోత్రా కూడా బోర్డులో చేరనున్నారు. మరోవైపు రెనాన్ డి కాస్ట్రో అల్వెస్ పింటో ప్రోసస్ వెంచర్స్ ప్రతినిధిగా బోర్డులోకి రానున్నారు.పెట్టుబడిదారుల హక్కుల్లో మార్పులుకంపెనీ తన 'ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్'ను సవరిస్తూ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కీలక విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలో డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉన్న యాక్సెల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి సంస్థల హక్కులను కంపెనీ తొలగించింది. గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజేటీకి బోర్డు సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని కల్పించారు. దీనివల్ల కంపెనీ నిర్ణయాధికారాల్లో మేనేజ్‌మెంట్‌కు పట్టు పెరగనుంది.ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ మార్పులన్నీ వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి వస్తాయి. ఐపీఓ (IPO) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో స్విగ్గీలో జరుగుతున్న ఈ అంతర్గత మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Olectra Greentech Unveils New Brand Identity3
ఎలక్ట్రిక్‌ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎవ్రీడే’ అనే ట్యాగ్‌లైన్‌తో తమ నూతన బ్రాండ్‌ ఐడెంటిటీని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ స్థాయి నుంచి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత మొబిలిటీ, పరిష్కారాలను అందించే ఆవిష్కరణల ఆధారిత సంస్థగా కంపెనీ పరిణామక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.పర్యావరణహిత మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్‌ ద్వారా బాధ్యతాయుతమైన భవిష్యత్తువైపు ప్రపంచాన్ని నడిపించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుందని సంస్థ ఎండీ మహేశ్‌ బాబు తెలిపారు. నిర్మాణాత్మక సమగ్రత, లక్ష్యంతో కూడుకున్న దిశను సూచించేలా త్రిభుజాకారంలో ఒలెక్ట్రా ప్రిజం, దాని చుట్టూ ఒలెక్ట్రా యూనివర్స్‌ని సూచించే వృత్తంతో లోగో ఉంటుంది. వాటాదారులు, నగరాలు, కంపెనీ అందించే సేవల విస్తృత వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తుంది.

India GDP growth is projected to be 6. 9percent in fiscal year 20264
భారత్‌ వృద్ధి అంచనాలు అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్‌ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్‌లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం.

Union Minister Hardeep Singh Puri visits Qatar to boost energy ties5
భారత్‌కు విశ్వసనీయ  సరఫరాదారుగా ఉంటాం 

న్యూఢిల్లీ: భారత్‌కు ఇక ముందు విశ్వసనీయమైన ఇంధన సరఫరాదారుగా ఉంటామని ఖతార్‌ హామీ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి రెండు రోజుల దోహా పర్యటన (9, 10 తేదీలు) సందర్భంగా, అక్కడి ఇంధన మంత్రి సాద్‌ షెరీదా ఆల్‌కాబితో చర్చలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వానికి ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఖతార్‌ నాయకత్వానికి భారత ప్రధాని సంఘీభావాన్ని ఈ సందర్భంగా మంత్రి పురి తెలియచేశారు. ఇరాన్‌–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్, ఖతార్‌ స్వాగతించాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలు ఏర్పడిన దృష్ట్యా ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని పేర్కొన్నాయి. భారత్‌ అవసరాల్లో 45 శాతం ఎల్‌ఎన్‌జీ, 20 శాతం ఎల్‌పీజీని ఖతార్‌ సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా మంత్రి పురి ఖతార్‌ పర్యటనకు వెళ్లడం గమనార్హం.

Indian equity mutual fund inflows surged 56percent to Rs 40,450 crore6
ఈక్విటీ ఫండ్స్‌.. తగ్గేదేలే! 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొన్న తరుణంలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల పట్ల తమ విశ్వాసాన్ని చాటారు. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.40,456 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చిన రూ.25,978 కోట్లతో పోల్చి చూస్తే 56 శాతం పెరిగాయి. 2025 జూలై (రూ.42,702 కోట్లు) తర్వాత ఒక నెలలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌కు అత్యధిక ఆదరణ లభించింది. మరోవైపు డెట్‌ ఫండ్స్‌ నుంచి భారీ స్థాయిలో రూ.2.95 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఇదే విభాగం రూ.42,106 కోట్లను ఆకర్షించడం గమనార్హం. మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ మార్చిలో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా కోల్పోయింది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.82.03 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.73.73 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఈక్విటీ ఫండ్స్‌ రూ.31,97,698 కోట్లుగా ఉంది. స్టాక్స్‌ విలువలు తగ్గడం ఏయూఎంపై ప్రభావం చూపించింది. విభాగాల వారీగా.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ రూ.10,054 కోట్ల పెట్టుబడులను మార్చి నెలలో ఆకర్షించాయి. → స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.6,263 కోట్లు, మిడ్‌క్యాప్‌ లోకి రూ.6,063 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.5,307 కోట్లు, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.2,997 కోట్ల చొప్పున రాబట్టాయి. → మల్టీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,981 కోట్లు రాగా, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ రూ.437 కోట్లను కోల్పోయాయి. → గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గి రూ.2,266 కోట్లకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో ఇదే విభాగంలోకి రూ.5,255 కోట్లు, జనవరిలో రూ.24,040 కోట్లు చొప్పున రావడం గమనార్హం. → హైబ్రిడ్‌ ఫండ్స్‌ నుంచి నికరంగా రూ.16,500 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ నుంచి రూ.21,000 కోట్లు బయటకు వెళితే, మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌లోకి రూ.5,000 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్ల నమ్మకం.. ‘మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టిపై ఇన్వెస్టర్లలో స్థిరమైన విశ్వాసం కొనసాగుతోందని మార్చి నెల పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. భారత్‌ నిర్మాణాత్మక వృద్ధి బలంగా ఉండడంతో, ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) సీఈవో వెంకట్‌ చలసాని తెలిపారు. సిప్‌ సరికొత్త రికార్డు.. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఈక్విటీల్లోకి నెలవారీ వచ్చే పెట్టుబడులు మార్చిలో ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును నమోదు చేశాయి. రూ.32,087 కోట్ల పెట్టుబడులు సిప్‌ రూపంలో వచ్చాయి. ఫిబ్రవరిలో సిప్‌ పెట్టుబడులు రూ.29,845 కోట్లుగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం సిప్‌ రూపంలో వివిధ పథకాల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టే సంస్కృతి ఇటీవలి కాలంలో విస్తరిస్తున్నట్టు ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.

Advertisement
Advertisement
Advertisement