Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Akasa Air Flight Ticket Charges Have Increased1
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్‌ ఫ్లయిట్‌ టికెట్ చార్జీలు

ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్‌ కూడా తమ ఫ్లయిట్‌ టికెట్లపై ఇంధన సర్‌చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంధనాల రేట్లు భగ్గుమన్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్‌ ఈ చార్జీలు విధిస్తున్నాయి. సాధారణంగా విమానయాన సంస్థల వ్యయాల్లో ఇంధనం భారం 40 శాతం స్థాయిలో ఉంటుంది.

Employee Requests Sick Leave Founder Rejects It And Orders HR To Dock Pay2
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!

ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. SaaS స్టార్టప్‌లో సపోర్ట్ ఉద్యోగిగా వ్యక్తికి.. ఒక రోజు అతని ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సరిగా నిద్రపట్టలేదు. నిద్రలేమి వల్ల అతను అలసటగా అనిపించింది. దీంతో ఆ రోజు పని చేయలేనని భావించి.. హెచ్ఆర్ విభాగానికి ఒక సిక్ లీవ్ కోసం ఈమెయిల్ పంపాడు. ఆ ఉద్యోగి చెప్పినట్టు, ఆరు నెలల్లో ఇది అతను తీసుకున్న రెండో సెలవు మాత్రమే.అయినప్పటికీ.. అతను ఊహించని విధంగా కంపెనీ ఫౌండర్ స్వయంగా ఆ ఈమెయిల్‌కు స్పందించారు. ఆ ఉద్యోగికి ఒకరోజు జీతం కోత పెట్టాలని HRకు సూచించారు. అదే రోజు సెలవు తీసుకోవడం కుదరదని కూడా చెప్పారు. అంతే కాకుండా.. ఫౌండర్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగి తాను అస్వస్థంగా ఉన్నానని చెప్పినా, ఫౌండర్ 'నీ వాయిస్ చూస్తే నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది' అని చెప్పారు. ఇది ఆ ఉద్యోగికి చాలా బాధ కలిగించింది.ఇదీ చదవండి: మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు స్పందించారు. వ్యవస్థాపకులు చాలా సున్నితంగా వ్యవహరించాలి అని కొందరు చెబితే.. మరికొందరు ఆ ఉద్యోగిని వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చారు. ఈ వ్యవస్థాపకులు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏమి ఆలోచిస్తారో నాకు అర్థం కావడం లేదు. వారి ఉద్యోగులతో సరిగ్గా వ్యవహరించలేరు. వారు మనల్ని ఏమని భావిస్తారు? అని ఇంకొందరు అంటున్నారు.

India Passenger Vehicle Wholesale Sales Rise 10 6 Percent in February SIAM Report3
సియామ్‌ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా..

దేశీయంగా ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులతో ప్యాసింజర్‌ వాహన టోకు అమ్మకాలు (కంపెనీల నుంచి డీలర్లకు) 4,17,705 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 3,77,689 యూనిట్లతో పోలిస్తే 10.6 శాతం పెరిగినట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది.ప్యాసింజర్‌ వాహనాలు, టూ–వీలర్లు, త్రీ–వీలర్ల అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా మార్చిలో పండుగలపరమైన సానుకూల అంచనాలు నెలకొన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధంతో తయారీ, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉందని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు.సియామ్‌ నివేదికలో మరిన్ని కీలకాంశాలు..➤యుటిలిటీ వాహనాల అమ్మకాలు 2,08,795 యూనిట్ల నుంచి 13.5 శాతం పెరిగి 2,36,957 యూనిట్లకు చేరాయి.➤ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 1,10,966 నుంచి 3.8 శాతం క్షీణించి 1,06,799 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤వ్యాన్ల అమ్మకాలు 1.1 శాతం పెరిగి 11,493 యూనిట్ల నుంచి 11,620 యూనిట్లకు చేరాయి.➤ద్విచక్ర వాహన విక్రయాలు 13,84,605 యూనిట్ల నుంచి 35.2 శాతం వృద్ధితో 18,71,406కి పెరిగాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 30.8 శాతం పెరిగి 10,96,537 యూనిట్లకు, స్కూటర్లు 42.3 శాతం వృద్ధితో 5,12,783 యూనిట్లకు చేరాయి.➤త్రీ–వీలర్ల విక్రయాలు 29 శాతం వృద్ధితో 57,788 యూనిట్ల నుంచి 74,573 యూనిట్లకు పెరిగాయి.

India pumps up Russia oil buy by 50 Percent in March4
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు

న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్‌ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్‌ బ్యారెళ్లు హర్మూజ్‌ జలసంధి నుంచే భారత్‌కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్‌పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్‌ఎన్‌జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్‌ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్‌ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్‌ అనలిస్ట్‌ సుమిత్‌ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్‌పీజీ వినియోగం ఒక మిలియన్‌ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్‌ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్‌పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Cognizant Research Shows Plug and Play AI is a Myth5
అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు

న్యూఢిల్లీ: కంపెనీల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ప్లగ్‌ అండ్‌ ప్లే (సిద్ధంగా ఉన్న) రకమైన సాధారణ సాఫ్ట్‌వేర్‌లు సరిపోవని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ వెల్లడించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి స్థాయి ఏఐ పరిష్కారాలను అందించే ఐటీ కంపెనీలకే ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. ఏఐపై నిర్ణయాధికారం కలిగిన 600 మందితోపాటు 38 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను సర్వే చేసి ఒక నివేదిక విడుదల చేసింది.సంస్థలు ఏఐ భాగస్వామిని (టెక్నాలజీ సంస్థ) ఎంపిక చేసేటప్పుడు ధర లేదా సత్వర ఫలితాలు కంటే, తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ప్రత్యేక పరిష్కారాలు, విధానాలను కీలకంగా చూస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా అందుబాటులో ఉండే ఏఐ సాఫ్ట్‌వేర్‌లు తమ వ్యాపార అవసరాలకు సరిపోవంటూ కొన్ని సంస్థలు ఏఐ సేవలను తిరస్కరిస్తున్నాయని వెల్లడించింది. తగినంత అనుభవం లేకపోవడం, ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేయకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొంది. కీలక సవాళ్లు.. ఏఐ స్వీకరణలో సంస్థలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లలో.. నియంత్రణ, నిబంధనలపరమైన ఆందోళనలు.. పెట్టుబడిపై సరైన రాబడిని చూపించడం కష్టంగా ఉండడం.. ఏఐ వ్యూహంపై సరైన స్పష్టతలేమిని పేర్కొంది. ఏఐ విజయవంతం కావాలంటే ఒక్కో నమూనాను అమలు చేయడంతోనే సరిపోదని, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ పేర్కొన్నారు. అలాగే ఏఐపై పెట్టుబడులను ప్రయోగాత్మకంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా సంస్థలు చూస్తున్నాయని తెలిపారు. ఏఐ మనుషుల పనులను వేగవంతం చేస్తుందే కానీ, వారి ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని కాగ్నిజెంట్‌ అధ్యయన నివేదిక పేర్కొంది. మనుషులు ఏఐ కలిసి పనిచేసే విధంగా పనితీరులో మార్పులు వస్తాయని తెలిపింది.

Cyber fraudsters using new tech to bypass UPI security for financial transaction6
ప్రమాదంలో యూపీఐ సెక్యూరిటీ!

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మోసగాళ్లు కొత్త టెక్నాలజీతో యూపీఐ యూజర్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ భద్రతా ఫీచర్లను ఛేదించుకుని మరీ, ఆర్థిక లావాదేవీలు కానిచ్చేస్తున్నారని, సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. టెలీగ్రామ్‌లో 20 గ్రూప్‌లు చురుగ్గా పనిచేస్తున్నట్టు, ప్రతీ బృందంలో 100కు పైగా సభ్యులున్నుట్టు తెలిపింది. ఈ గ్రూప్‌లు ‘డిజిటల్‌ లూటెరా’ పేరుతో చర్చించుకోవడం, పంపిణీ చేయడం, నిర్వహించడం చేస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇది కేవలం మరొక యూపీఐ మాల్వేర్‌ రకమే కాదు.డివైజ్‌పై ఉన్న నమ్మకంపైనే డిజిటల్‌ లూటెరా దాడి చేస్తోంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే మార్చివేస్తున్నప్పుడు.. సంప్రదాయ రక్షణలైన సిమ్‌ బైండింగ్‌ యాప్‌ (సిమ్‌కు అనుసంధానమైన) సిగ్నేచర్‌ తనఖీ కూడా పనికిరాకుండా పోతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ అంతటినీ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించింది. ఒక టెలిగ్రామ్‌ గ్రూప్‌ రెండు రోజుల్లోనే రూ.25–30 లక్షల లావాదేవీలను పూర్తి చేసిందని క్లౌడ్‌సెక్‌ విశ్లేషణలో తేలింది. ఈ మోసపూరిత వ్యవస్థ ఎంత వేగంగా విస్తరించగలదు, ఎంత మంది మోసం చేయగలదన్నదానికి ఇది నిదర్శమని పేర్కొంది. మోసం ఇలా... మొబైల్‌ ఫోన్‌ యూజర్‌ తనకు తెలియకుండా హానికారక ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పుడు.. డిజిటల్‌ లూటెరా కిట్‌ ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. వెంటనే సైబర్‌ నేరస్థులకు ఫోన్‌పై నియంత్రణ వెళుతుంది. దీంతో బ్యాంక్‌ ఓటీపీలు అటాకర్ల టెలీగ్రామ్‌ ఛానళ్లకు వెళతాయి. భద్రతకు ఢోకాలేదు: ఎన్‌పీసీఐ దీనిపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(యూపీఐ నిర్వహణ సంస్థ/ఎన్‌పీసీఐ) స్పందించింది. డిజిటల్‌ చెల్లింపుల నిర్వహణకు సంబంధించి బలమైన తనిఖీలున్నట్టు స్పష్టం చేసింది. ‘‘సంబంధిత నివేదికను ఎన్‌పీసీఐ పరిశీలించింది. ఆ విధమైన రిస్క్‌లను పరిష్కరిచేందుకు తగినన్ని రక్షణలు ఉన్నాయి. బహుళ అంచల రక్షణలతో, గుర్తింపు ధ్రువీకరణలతో లావాదేవీలను సురక్షితంగా, భద్రంగా చేసుకునే విధంగా యూపీఐని రూపొందించడమైంది’’అని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది.

Advertisement
Advertisement
Advertisement