Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Donald Trump Hails Tim Cook as Apple Greatest Leader Surpassing Steve Jobs1
టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు

టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్‌ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.సమస్యల పరిష్కర్తగా కుక్..తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్‌ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్‌ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.15 ఏళ్ల ప్రస్థానం..దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్‌ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్‌జాబ్స్‌ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

CBI Raids Reliance Communications Over Alleged LIC Bond Irregularities2
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై సీబీఐ పంజా

ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కు జారీ చేసిన బాండ్లు, రుణ పత్రాల (డిబెంచర్స్‌) వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.రికార్డుల స్వాధీనం - సోదాల వివరాలురిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన నవీ ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఎల్‌ఐసీకి జారీ చేసిన బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్‌కు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నవీ ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగే కీలక ప్రాంతాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, అంతర్గత ఈమెయిల్స్, ఆర్థిక లావాదేవీల చిట్టాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ దర్యాప్తు ప్రధానంగా 2009-2016 మధ్య జరిగిన లావాదేవీలపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ సమయంలో కంపెనీ నిధుల సేకరణ కోసం అనుసరించిన మార్గాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణ.దర్యాప్తు వెనుక అసలు కారణం?ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ మొత్తంలో నిధులను సేకరించింది. అయితే ఈ డిబెంచర్లు, బాండ్ల జారీ సమయంలో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపించిందా? లేదా నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ మనీ ఉన్న ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కంపెనీ వైఫల్యం చెందడం, అంతకుముందు జరిగిన ఒప్పందాల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సోదాలకు దారితీశాయి.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

West Asia Tensions Global Economy Indian Investments Dubai Real Estate3
దుబాయ్‌ రియల్టీలో భారత పెట్టుబడులకు బ్రేక్‌!

పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానమైన దుబాయ్‌ రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని, దీనివల్ల దుబాయ్‌ రియల్టీలోకి వచ్చే భారతీయ మూలధనం తగ్గే అవకాశం ఉందని అనారాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్ పురి విశ్లేషించారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, భారత్-దుబాయ్ మధ్య ఉన్న సుదీర్ఘ పెట్టుబడి బంధం చెక్కుచెదరదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆర్థిక అంశాలే కీలకంపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భారత్‌పై రెండు రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయుష్ పేర్కొన్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం హార్మూజ్‌ జలసంధిపై గణనీయంగా ఆధారపడుతుంది. అక్కడ అంతరాయం కలిగితే చమురు ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనివల్ల విదేశీ కేటాయింపులు చేసే పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను పునసమీక్షించుకోవాల్సి వస్తోంది.‘సంఘర్షణ స్వల్పకాలికమైతే అది కేవలం భయాందోళనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అది సుదీర్ఘకాలం కొనసాగితే వినియోగదారుల ప్రవర్తన మారుతుంది. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, రూపాయిపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు’ అని ఆయూష్‌ వివరించారు.స్వదేశీ మార్కెట్‌కు కలిసొచ్చే అవకాశందుబాయ్‌లో పెట్టుబడులు తగ్గడం భారతీయ ప్రీమియం హౌసింగ్ మార్కెట్‌కు వరంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన స్వదేశీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

OpenAI CEO Sam Altman Home Attack Sparks Global AI Industry Debate4
సామ్ ఆల్ట్‌మాన్ ఇంటిపై దాడి

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య మాత్రమే కాదని, ఏఐ పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థలు ప్రచారం చేస్తున్న భయానక కథనాల ఫలితమేనని ఆల్ట్‌మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పోటీ కంపెనీ ఆంత్రోపిక్ తీరును ఆయన తప్పుబట్టారు.ఏం జరిగింది?శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్‌మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో ఒక దుశ్చర్య జరిగింది. టెక్సాస్‌కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్‌మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో తేలిన కీలక అంశాలునిందితుడు ఆల్ట్‌మాన్‌కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.పరిశ్రమ విమర్శలే కారణంఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్‌మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. ‘ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది’ అని ఆల్ట్‌మాన్ విమర్శించారు.ఓపెన్‌ఏఐ vs ఆంత్రోపిక్ఓపెన్‌ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్‌మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్‌ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో ‘సేఫ్టీ థియేటర్’ (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్‌మాన్ ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Sensex Crashes 756 Points Nifty Falls 198 as Geopolitical Tensions5
భగ్గుమన్న పశ్చిమాసియా

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలుముదురుతున్న అనిశ్చితిపశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పుయుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలుద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.ఇప్పుడేం చేయాలి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Redwood Software Establishes India Technology Center in Hyderabad6
హైదరాబాద్‌లో భారీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం

అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తన గ్లోబల్ సెంటర్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (ఐకమ్) వ్యవస్థాపక సీఈఓ ఫణి నాగార్జున, రెడ్‌వుడ్ ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్ మాట్లాడుతూ, అటానమస్ ఎంటర్‌ప్రైజ్ నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏజెంటిక్ AI ఆవిష్కరణలు, గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఈ కేంద్రం ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అద్భుతమైన టాలెంట్, ఎకోసిస్టమ్ తమ కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని, అందుకే ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్ పేర్కొన్నారు.ఉద్యోగ కల్పన విషయంలో కూడా రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ భారీ లక్ష్యాలను ప్రకటించింది. 2027 చివరి నాటికి ఇంజనీరింగ్, క్లౌడ్, బిజినెస్ ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు మూడొంతులకు సమానం.

Advertisement
Advertisement
Advertisement