Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India services sector sustains sharp growth in February 20261
సేవల్లో పనితీరు.. ఫ్లాట్‌ 

న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్తంత నిదానించాయి. ఈ రంగంలో కార్యకలాపాలను సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 58.5గా ఉంది. 50 పాయింట్లకు పైన ఉన్నంత వరకు విస్తరణగానే పరిగణిస్తుంటారు. డిమాండ్‌ స్వల్పంగా మెరుగుపడడం, ద్రవ్యోల్బణం పెరగడం ఫలితంగా సేవల రంగం పనితీరు 13 నెలల కనిష్ట వృద్ధికి పరిమితమైనట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తెలిపింది. ‘‘జనవరితో పోలి్చతే దాదాపు అదే స్థాయిలో ఫిబ్రవరిలోనూ సేవల రంగ పీఎంఐ నమోదు కావడం.. బలమైన పనితీరును సూచిస్తోంది. కొత్త ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి తగ్గింది. సేవల రంగం విక్రయాలు అంతర్జాతీయంగా పుంజుకున్నాయి. నిర్వహణ అవసరాల దృష్ట్యా కంపెనీలు నియామకాలు పెంచుకోవడం కనిపించింది’’అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు. పోటీ పెరిగిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించినట్టు కొన్ని కంపెనీల పర్చేజింగ్‌ మేనేజర్లు ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి కాంపోజిట్‌ పీఎంఐ (తయారీ, సేవలు కలిసిన) అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ 58.9కి పుంజుకుంది. జనవరిలో 58.4 పాయింట్లుగానే ఉంది.

Qatar Energy halts production of LNG after Iranian drone attacks2
గ్యాస్‌కు యుద్ధం సెగ

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్‌ యుద్ధం, భారత్‌కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్‌ లఫాన్‌ ప్లాంటుపై ఇరాన్‌ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్‌ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్‌కి ఎల్‌ఎన్‌జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఖతర్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్‌ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్‌ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్‌ సరఫరా దిగ్గజం గెయిల్‌ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్‌జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్‌ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్‌ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కీలక రవాణా మార్గమైన హర్మూజ్‌ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్‌ ఎనర్జీ, పెట్రోనెట్‌ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్‌ మెజూర్‌ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్‌ తెలిపింది. దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్‌ మార్కెట్‌లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్‌ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్‌ మార్కెట్లో యూనిట్‌ (ఎంబీటీయూ) ఎల్‌ఎన్‌జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్‌ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్‌ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి. సగం అవసరాలకు దిగుమతులే ఆధారం.. దేశీయంగా గ్యాస్‌ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్‌లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్‌లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్‌కి ఏటా వచ్చే 27 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీలో ఖతర్‌ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేసేందుకు ఖతర్‌తో పెట్రోనెట్‌కి ఒప్పందం ఉంది. స్పాట్‌ మార్కెట్లో కూడా పెట్రోనెట్‌ కొనుగోలు చేస్తోంది. ఖతర్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చే క్రూడాయిల్‌ మొదలైన వాటికి కూడా హర్మూజ్‌ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్‌ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

West Asia turmoil drags stock markets3
వార్‌.. బేర్‌! 

ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్‌ జోరు’ కొనసాగింది. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్‌ స్ట్రీట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్‌ 1,123 పాయింట్లు పతనమై 79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి 24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి. బీఎస్‌ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్‌ ఇండెక్స్‌ 4%, పీఎస్‌యూ బ్యాంక్‌ 3.50%, ఇండ్రస్టియల్స్‌ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్‌ 3.12%, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్‌ 2.25%, పతనమమ్యాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌లో 30 షేర్లలో ఎయిర్‌టెల్‌ (1.78%), ఇన్ఫోసిస్‌ (1.5%), టెక్‌ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి. → పీఎన్‌జీఎస్‌ రేవా డైమండ్‌ జ్యువెలరీ లిస్టింగ్‌ రోజు మెరిసింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్‌ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.ఆయిల్‌ మార్కెటింగ్, పెయింట్స్‌ షేర్లు డౌన్‌ గల్ఫ్‌ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్, పెయింట్‌ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌పీసీఎల్‌ 5.41%, బీపీసీఎల్‌ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్‌ పెయింట్స్‌ 2.6%, బర్జర్‌ పెయింట్స్‌ 2.22%, ఇండిగో పెయింట్స్‌ 1.49%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.95 పడిపోయాయి. ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం: దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్‌లాండ్‌ ‘సెట్‌ కాంపోసిట్‌’ సూచీ 6%, ఇండోనేసియా ‘జకార్తా కాంపోసిట్‌’ 5% పతనమయ్యాయి. తైవాన్‌ 4.50%, జపాన్‌ 4%, సింగపూర్‌ 2.16%, హాంగ్‌కాంగ్‌ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. జర్మనీ డాక్స్‌ 2%, ఫ్రాన్స్‌ సీఏసీ 1%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ అరశాతం లాభపడ్డాయి. నాస్‌డాక్‌ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్‌ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి. 92 దాటేసిన రూపాయి డాలర్‌ మారకంలో 56 పైసలు పతనం క్రూడ్, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ కారణం ఇంట్రాడేలో 86 పైసలు డౌన్‌ముంబై: ఇరాన్‌ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలు రావడంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్‌ మారకంలో 56 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 92.05 వద్ద స్థిరపడింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘రిస్క్ –ఆఫ్‌’ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్స్, బాండ్‌ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలు బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో డాలర్‌ ఇండెక్స్‌ 98 స్థాయిని సులభంగా ఛేదించింది. మరోవైపు ఇరాన్‌ యుద్ధం కారణంగా సరఫరా ఆందోళనలతో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర సైతం 1.29% పెరిగి 82.46 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు భయాలు తలెత్తాయి. ఈ పరిణామాలు రూపాయి కరిగిపోయేందుకు కారణమయ్యాయి’’ అని నిపుణులు తెలిపారు. ఒక దశలో ఏకంగా 86 పైసలు కరిగిపోయి 92.35 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది.2 రోజుల్లో రూ.16.32 లక్షల కోట్లు ఆవిరిస్టాక్‌ సూచీల వరుస నష్టాలతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.16.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.447.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల మేర సంపద గల్లంతైంది.

Gold Shipments Stranded in Dubai as Iran Conflict Grounds Flights4
దుబాయ్‌ దాటని బంగారం..

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్‌గా పేరుగాంచిన దుబాయ్‌ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్‌ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్‌, లండన్‌ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్‌ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్‌లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.దుబాయ్‌కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్‌ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ట్రేడింగ్ హబ్‌ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్‌కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్‌రైటింగ్ చేస్తాయి.ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్‌ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్‌24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌గా పేరొందిన ఎమిరేట్స్‌ బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్‌, న్యూయార్క్‌ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్‌ ఛేస్‌ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి.

Rupee Falls To All Time Low Against US Dollar Amid Middle East War5
యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా పడిపోయిన రూపాయి

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడింది. అమెరికా–ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 67 పైసలు క్షీణించి 92.16 వద్ద ముగిసింది. ఇది తాత్కాలికంగా నమోదైన ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం.ఫారెక్స్ మార్కెట్ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ‘రిస్క్ ఆఫ్’ పరిస్థితుల కారణంగా డాలర్ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీల బుట్టతో పోలిస్తే గ్రీన్‌బ్యాక్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది.ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి 92.05 వద్ద ప్రారంభమై, ఒక దశలో 92.35 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 92.16 వద్ద ముగిసి, గత ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే 67 పైసల నష్టాన్ని చవిచూసింది. సోమవారం రూపాయి 41 పైసలు బలహీనపడి 91.49 వద్ద స్థిరపడగా, హోలీ సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ మూతపడింది.ఇరాన్‌పై అమెరికా దాడులు, అలాగే హోర్ముజ్ జలసంధి మార్గంగా ఇంధన సరఫరాలకు ఉన్న ముప్పు కారణంగా ప్రపంచ చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు 1.29 శాతం పెరిగి 82.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,122.66 పాయింట్లు క్షీణించి 79,116.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 385.20 పాయింట్లు పడిపోయి 24,480.50 వద్ద స్థిరపడింది.మొత్తంగా, ప్రపంచ అనిశ్చితి పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Over 2 5 Million Users Boycott ChatGPT6
చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసిన 25 లక్షల మంది!

అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్‌జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్‌సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్‌ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్‌తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్‌జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్‌జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్‌ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్‌సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్‌ టవర్‌ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్‌ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్‌బాట్ యాప్, అమెరికాలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ చార్టుల్లో చాట్‌జీపీటీ యాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌ యూఎస్‌లో అన్‌ఇన్‌స్టాల్‌ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.

Advertisement
Advertisement
Advertisement