ప్రధాన వార్తలు
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్తంత నిదానించాయి. ఈ రంగంలో కార్యకలాపాలను సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 58.5గా ఉంది. 50 పాయింట్లకు పైన ఉన్నంత వరకు విస్తరణగానే పరిగణిస్తుంటారు. డిమాండ్ స్వల్పంగా మెరుగుపడడం, ద్రవ్యోల్బణం పెరగడం ఫలితంగా సేవల రంగం పనితీరు 13 నెలల కనిష్ట వృద్ధికి పరిమితమైనట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తెలిపింది. ‘‘జనవరితో పోలి్చతే దాదాపు అదే స్థాయిలో ఫిబ్రవరిలోనూ సేవల రంగ పీఎంఐ నమోదు కావడం.. బలమైన పనితీరును సూచిస్తోంది. కొత్త ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి తగ్గింది. సేవల రంగం విక్రయాలు అంతర్జాతీయంగా పుంజుకున్నాయి. నిర్వహణ అవసరాల దృష్ట్యా కంపెనీలు నియామకాలు పెంచుకోవడం కనిపించింది’’అని హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. పోటీ పెరిగిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించినట్టు కొన్ని కంపెనీల పర్చేజింగ్ మేనేజర్లు ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవలు కలిసిన) అవుట్పుట్ ఇండెక్స్ 58.9కి పుంజుకుంది. జనవరిలో 58.4 పాయింట్లుగానే ఉంది.
గ్యాస్కు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్ యుద్ధం, భారత్కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్ లఫాన్ ప్లాంటుపై ఇరాన్ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్కి ఎల్ఎన్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఖతర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్ ఎనర్జీ, పెట్రోనెట్ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్ మెజూర్ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్ తెలిపింది. దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్ మార్కెట్లో యూనిట్ (ఎంబీటీయూ) ఎల్ఎన్జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి. సగం అవసరాలకు దిగుమతులే ఆధారం.. దేశీయంగా గ్యాస్ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్కి ఏటా వచ్చే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఖతర్తో పెట్రోనెట్కి ఒప్పందం ఉంది. స్పాట్ మార్కెట్లో కూడా పెట్రోనెట్ కొనుగోలు చేస్తోంది. ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే క్రూడాయిల్ మొదలైన వాటికి కూడా హర్మూజ్ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వార్.. బేర్!
ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్ జోరు’ కొనసాగింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్ స్ట్రీట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,123 పాయింట్లు పతనమై 79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి 24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి. బీఎస్ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్ ఇండెక్స్ 4%, పీఎస్యూ బ్యాంక్ 3.50%, ఇండ్రస్టియల్స్ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్ 3.12%, క్యాపిటల్ గూడ్స్ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్ 2.25%, పతనమమ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్లో 30 షేర్లలో ఎయిర్టెల్ (1.78%), ఇన్ఫోసిస్ (1.5%), టెక్ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి. → పీఎన్జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిస్టింగ్ రోజు మెరిసింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.ఆయిల్ మార్కెటింగ్, పెయింట్స్ షేర్లు డౌన్ గల్ఫ్ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్, పెయింట్ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్పీసీఎల్ 5.41%, బీపీసీఎల్ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్ 2.6%, బర్జర్ పెయింట్స్ 2.22%, ఇండిగో పెయింట్స్ 1.49%, ఏషియన్ పెయింట్స్ 0.95 పడిపోయాయి. ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం: దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్లాండ్ ‘సెట్ కాంపోసిట్’ సూచీ 6%, ఇండోనేసియా ‘జకార్తా కాంపోసిట్’ 5% పతనమయ్యాయి. తైవాన్ 4.50%, జపాన్ 4%, సింగపూర్ 2.16%, హాంగ్కాంగ్ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. జర్మనీ డాక్స్ 2%, ఫ్రాన్స్ సీఏసీ 1%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ అరశాతం లాభపడ్డాయి. నాస్డాక్ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి. 92 దాటేసిన రూపాయి డాలర్ మారకంలో 56 పైసలు పతనం క్రూడ్, డాలర్ ఇండెక్స్ ర్యాలీ కారణం ఇంట్రాడేలో 86 పైసలు డౌన్ముంబై: ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కలు రావడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్ మారకంలో 56 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 92.05 వద్ద స్థిరపడింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘రిస్క్ –ఆఫ్’ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్స్, బాండ్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలు బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో డాలర్లకు డిమాండ్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని సులభంగా ఛేదించింది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర సైతం 1.29% పెరిగి 82.46 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు భయాలు తలెత్తాయి. ఈ పరిణామాలు రూపాయి కరిగిపోయేందుకు కారణమయ్యాయి’’ అని నిపుణులు తెలిపారు. ఒక దశలో ఏకంగా 86 పైసలు కరిగిపోయి 92.35 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది.2 రోజుల్లో రూ.16.32 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ సూచీల వరుస నష్టాలతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.16.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.447.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల మేర సంపద గల్లంతైంది.
దుబాయ్ దాటని బంగారం..
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్గా పేరుగాంచిన దుబాయ్ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్, లండన్ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.దుబాయ్కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ట్రేడింగ్ హబ్ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్రైటింగ్ చేస్తాయి.ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్లైన్గా పేరొందిన ఎమిరేట్స్ బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్ ఎయిర్వేస్ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్, న్యూయార్క్ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్ ఛేస్ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి.
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన రూపాయి
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడింది. అమెరికా–ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో బుధవారం డాలర్తో పోలిస్తే రూపాయి 67 పైసలు క్షీణించి 92.16 వద్ద ముగిసింది. ఇది తాత్కాలికంగా నమోదైన ఆల్టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం.ఫారెక్స్ మార్కెట్ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ‘రిస్క్ ఆఫ్’ పరిస్థితుల కారణంగా డాలర్ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీల బుట్టతో పోలిస్తే గ్రీన్బ్యాక్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది.ఇంటర్బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి 92.05 వద్ద ప్రారంభమై, ఒక దశలో 92.35 వద్ద ఆల్టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 92.16 వద్ద ముగిసి, గత ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే 67 పైసల నష్టాన్ని చవిచూసింది. సోమవారం రూపాయి 41 పైసలు బలహీనపడి 91.49 వద్ద స్థిరపడగా, హోలీ సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ మూతపడింది.ఇరాన్పై అమెరికా దాడులు, అలాగే హోర్ముజ్ జలసంధి మార్గంగా ఇంధన సరఫరాలకు ఉన్న ముప్పు కారణంగా ప్రపంచ చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్కు 1.29 శాతం పెరిగి 82.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు క్షీణించి 79,116.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 385.20 పాయింట్లు పడిపోయి 24,480.50 వద్ద స్థిరపడింది.మొత్తంగా, ప్రపంచ అనిశ్చితి పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చాట్జీపీటీని బాయ్కాట్ చేసిన 25 లక్షల మంది!
అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్జీపీటీని బాయ్కాట్ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్వర్క్లో ఏఐ మోడల్ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్ టవర్ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్బాట్ యాప్, అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ చార్టుల్లో చాట్జీపీటీ యాప్ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్క్రంచ్ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్జీపీటీ మొబైల్ యాప్ యూఎస్లో అన్ఇన్స్టాల్ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
కార్పొరేట్
దుబాయ్ దాటని బంగారం..
ఎక్స్లో అశ్లీల కంటెంట్ నిషేధం?
ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!
ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
బంగారం ఎన్బీఎఫ్సీలకు పండగే!
EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!
ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్లో వేలమందికి ఉద్యోగం!
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకు...
యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం కారణంగా.....
రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!
బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకి...
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Ki...
పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమం...
ఇరాన్ సంక్షోభం.. ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటన...
ట్రావెల్.. క్యాన్సిల్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులతో అ...
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
దేశీయ విద్యుత్ రంగాన్ని ఆధునీకరించడమే కాకుండా, మార...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రోబో సలహాలు.. మంచివే!
మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? సలహాదారులను ఆశ్రయిస్తున్నారా? వారికి చెల్లించాల్సిన ఫీజు ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? సలహాదారులు ఎందుకులే... అనుకుంటూ మీకు తోచినట్లు ఇన్వెస్ట్మెంట్లు చేసి చేతులు కాల్చుకుంటున్నారా? పోనీ సలహాదారులు చెప్పినట్లే చేసినా కూడా వారి ఫీజులు పోను పెద్దగా రిటర్న్స్ రావటం లేదా? ‘నేను పెట్టేది తక్కువ మొత్తమే కదా! ఆర్థిక సలహాదారులు ఎందుకులే’ అని అనుకుంటున్నారా? ఇలాంటి వాటన్నిటికీ సమాధానమే కొత్తతరం రోబో అడ్వైజర్లు. చౌకగా పోర్టుఫోలియోలను నిర్వహించుకోవటమే కాదు... ఆకర్షణీయమైన లాభాలూ సొంత చేసుకోవచ్చు. ఈ తరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న రోబో అడ్వైజర్ల గురించి సమగ్రంగా చెప్పేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...దశాబ్దాలుగా ఇన్వెస్టింగ్ చేయడమంటే ఆర్థిక సలహాదారును కలవడమే కాదు. చాంతాడంత ఫారాలూ నింపాల్సి వచ్చేది. అడ్వైజరీ ఫీజులు ఎక్కువే. దీంతో ఇదంతా చాలా పెద్ద వ్యవహారంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలు రోబో అడ్వైజర్లను తెచ్చాయి. వీటి సాయంతో అత్యంత చౌకగా పోర్ట్ఫోలియోలను నిర్మించుకోవటమే కాదు. నిర్వహణ పనులు కూడా అవే చేసిపెడుతున్నాయి. ఎవరీ రోబో అడ్వైజర్లు.. రోబో అడ్వైజర్లంటే మరెవరో కారు..(కావు). అల్గోరిథమ్లను ఉపయోగించి పోర్ట్ఫోలియోలను రూపొందించడంతో పాటు నిర్వహణ సేవలూ అందించే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారాలు. పోర్ట్ ఫోలియో నిర్వహణకు సంబంధించి ఇవి ప్రధానంగా ఇన్వెస్టర్ రిస్కు సామర్థ్యాలను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేస్తాయి. వాటి సమాధానాలను బట్టి ఏ సాధనానికి ఎంత కేటాయించాలనేది వివిధ మోడల్స్ని బట్టి సూచిస్తాయి. అలాగే పెట్టుబడి వ్యయాలు తక్కువగా ఉండే సాధనాలను ఎంపిక చేస్తాయి. ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ చేస్తాయి. అంతర్జాతీయంగా చూస్తే... బెటర్మెంట్, వెల్త్ఫ్రంట్, ఫిడిలిటీ గో, సోఫైలాంటి ప్లాట్ఫామ్లు ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఈ మోడల్లో తమ ఆదాయం, లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాల్లాంటి ప్రశ్నలకు ఇన్వెస్టర్లు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ రోబో వ్యవస్థ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియలో మనిషి జోక్యం చాలా తక్కువ. అంతా సిస్టం చూసుకుంటుంది. అందుకే ఖర్చూ తక్కువగా ఉంటుంది. అసలెలా పని చేస్తాయి.. ఈ రోబో అడ్వైజర్లు ముందుగా రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తాయి. ఈ దశలో మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు? ఒకవేళ మార్కెట్ గానీ 10 శాతం పడితే మీరెలా స్పందిస్తారు? మీ ఆదాయం ఎంత మేర స్థిరంగా ఉంటుంది? వంటి ప్రశ్నలు వేస్తాయి. మీరిచ్చే సమాధానాలను బట్టి మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. మీరు ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడతారా? లేక ఒక మోస్తరుగా తీసుకోగలరా? లేక రిసు్కకు దూరంగా ఉంటారా? అనేది అర్థం చేసుకుంటాయి. పోర్ట్ఫోలియో నిర్మాణం ఇలా... మీరు ఓకే చేశాక... రెండో దశలో అల్గోరిథం మీ రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్, కొన్ని సందర్భాల్లో బంగారం లేదా అంతర్జాతీయ అసెట్స్లాంటి సాధనాలకు ఎంతెంత కేటాయించవచ్చనేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఈక్విటీ మార్కెట్లు పెరిగి, మీరు నిర్దేశించిన స్థాయికన్నా కేటాయింపులు పెరిగిపోతే, సిస్టం ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ చేస్తుంది. చాలా మటుకు ప్లాట్ఫామ్లు మీ లక్ష్యాలను ట్రాక్ చేసే విధంగా పని చేస్తాయి. రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడిని నిర్వహిస్తాయి. తద్వారా ఆర్థిక విషయాల్లో స్పష్టతనిచ్చేందుకు ప్రయతి్నస్తాయి. కొత్త వారికి లాభాలెన్నో..→ తక్కువ వ్యయాలు: సంప్రదాయ అడ్వైజరీ సరీ్వసులందించే సంస్థలు ఏటా 1– 2 శాతం చార్జీలు లేదా లావాదేవీలకింత కమీషన్ చొప్పున వసూలు చేస్తుంటాయి. అంతా ఆటోమేటెడ్గానే ఉంటుంది కాబట్టి రోబో–అడ్వైజర్ల ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఫీజులు తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మరింత ఎక్కువగా రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. → క్రమశిక్షణ: సాధారణంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు భావోద్వేగాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. భయం వల్ల కావచ్చు లేదా అత్యాశ వల్ల కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్లు సర్వసాధారణంగా ఎక్కువ రేటులో కొని, తక్కువ రేటుకు అమ్మేస్తుంటారు. ఆటోమేటెడ్ సిస్టంలలో ఇలాంటి భావోద్వేగాలు ఉండవు. వాటి తాలూకా తప్పిదాలూ ఉండవు. డేటా ఆధారిత అలొకేషన్ నిబంధనలను ఇవి పాటిస్తాయి. తద్వారా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగేలా చూస్తాయి. → సరళత్వం: రోబో అడ్వైజర్లు దన్నుగా ఉంటే డజన్ల కొద్దీ మ్యూచువల్ ఫండ్లను విశ్లేíÙంచుకోవాల్సిన పనిగానీ... ప్రతి రోజూ మార్కెట్ న్యూస్ని ట్రాక్ చేస్తూ ఉండటం గానీ చేయనక్కర్లేదు. డైవర్సిఫికేషన్ రీబ్యాలెన్సింగ్ అంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామే చూసుకుంటుంది. → అందుబాటు స్థాయిలో: సాధారణంగా చాలా తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. సంపాదన అప్పుడప్పుడే మొదలుపెట్టినవారికి ఇది ఎంతో అనుకూల అంశంగా ఉంటుంది. మన దగ్గర ఇలాంటి సాధనాలున్నాయా? భారత్లోను ఇప్పుడిప్పుడే ఇలాంటి సరీ్వసులు అందుబాటులోకి వస్తున్నాయి. జెరోధా, గ్రో లాంటి డిస్కౌంట్ బ్రోకరేజీలు, ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు.. లక్ష్యాల ఆధారిత ఇన్వెస్టింగ్ సాధనాలు, ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దిన పోర్ట్పోలియోలను అందిస్తున్నాయి. కొన్ని ప్లాట్ఫాంలు మోడల్ పోర్ట్ఫోలియోలను రూపొందిస్తున్నాయి. అర్థయంత్ర, కువేర, ఇండ్మనీ, స్క్రిప్బాక్స్, ఫండ్స్ ఇండియా లాంటివి వివిధ ప్రొఫైల్స్కి తగ్గట్లుగా సరీ్వసులు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా సుమారు 140 రోబో–అడ్వైజరీ స్టార్టప్స్ ఉన్నట్లు అంచనా. కాకపోతే ఇంకా దేశీయంగా పూర్తి స్థాయిలో అమెరికా మాదిరి ఆటోమేట్ చేసిన ఈటీఎఫ్ ఆధారిత రోబో ప్లాట్ఫాంలు అందుబాటులో లేవు. హైబ్రిడ్ మోడల్స్ మాత్రం వస్తున్నాయి. ఇవి లక్ష్యాల ఆధారిత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్, పెట్టుబడులకు ముందు డిజిటల్గా రిస్క్ ప్రొఫైలింగ్ చేయడం, ఆటోమేటిక్గా సిప్లను సరి చేయడంలాంటివి చేస్తున్నాయి. దేశీయంగా ఫిన్టెక్ వినియోగం, సిప్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రోబో–అడ్వైజరీ సరీ్వసులు మరింత విస్తరిస్తాయనేది సుస్పష్టం.ఇవి ఎవరికి అనువంటే...→ తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారికి → బిజీగా ఉండే ప్రొఫెషనల్స్కి → మార్కెట్పై పరిమిత స్థాయి పరిజ్ఞానం ఉన్న వారికి → దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునేవారికి అయితే, అత్యంత సంపన్న వర్గాల వారికి, సంక్లిష్టమైన విధంగా పన్నులు కట్టాల్సిన వారికి మాత్రం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మనుషులు అందించే అడ్వైజరీ సరీ్వసులే అవసరం కావచ్చు.ఇప్పుడిదే ట్రెండు..యువ ఇన్వెస్టర్లు ఇప్పుడు పేపర్ వర్క్, సేల్స్మెన్ బాదరబందీని కాకుండా సింపుల్గా ఉండే యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రోబో–అడ్వైజర్లు సరిగ్గా ఇందుకు సరిపోతాయి. సాధారణంగా చాలా మటుకు ఇండియన్స్ పెట్టుబడి అంటే అదేదో బ్రహ్మపదార్థమనే భావనతో ఇన్వెస్టింగ్ని వాయిదా వేస్తుంటారు. రోబో అడ్వైజరీ సాధనాలు ఇలాంటి అపోహలను పోగొట్టి.. పెట్టుబడి పెట్టడాన్ని చాలా సులభతరం చేస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయాలు..→ పెట్టుబడులు పెట్టడం మీకు కొత్తయినా, ఎలా మొదలెట్టాలో తెలియకపోయినా, రిస్క్ ప్రొఫైలింగ్ టూల్తో మొదలుపెట్టండి. వైవిధ్యమైన, తక్కువ ఖర్చులు ఉండే ప్రోడక్టులను ఎంచుకోండి. స్వల్పకాలిక గందరగోళం ప్రభావంలో పడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ చేయండి. → ముఖ్యంగా రోబో–అడ్వైజర్లంటే మ్యాజిక్ చేసేసి, సంపదను సృష్టించే సాధనాలేమీ కాదు. క్రమశిక్షణతో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలుగా మాత్రం చూడొచ్చు. అడ్వైజర్లతో గంటల తరబడి, రోజుల తరబడి చర్చిస్తూ కూర్చోడం కన్నా సింప్లిసిటీని కోరుకునే బిగినర్స్.. మార్కెట్లలోకి తొలి అడుగు వేసేందుకు ఇది స్మార్ట్ మార్గంగా ఉపయోగపడొచ్చు.
యూజర్లు సేఫ్.. మోసాలకు చెక్!
భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి గూగుల్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీంతో ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ను గూగుల్ రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (RCS) ప్లాట్ఫామ్ & స్పామ్ ఫిల్టరింగ్తో కలపడం ద్వారా వినియోగదారులకు మెరుగైన రక్షణ కలిగిన మెసేజింగ్ సేవలను అందించనున్నారు.గత 1.5 సంవత్సరాలుగా.. ఎయిర్టెల్ స్పామ్ కాల్స్ అండ్ డిజిటల్ మోసాలపై పోరాడుతోంది. ఏఐ బేస్డ్ విధానాలను ఉపయోగించి కంపెనీ ఇప్పటి వరకు 71 బిలియన్ స్పామ్ కాల్స్, 2.9 బిలియన్ స్పామ్ SMSలను అడ్డుకుంది. దీంతో సంస్థ ఆర్ధిక నష్టాల విలువ 68.7 వరకు తగ్గాయి. ఇది వినియోగదారుల పట్ల కంపెనీకున్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది.అయితే.. టెలికాం నెట్వర్క్లకు ఉన్న భద్రతా ప్రమాణాలు ఇతర మెసేజింగ్ యాప్స్లో పూర్తిగా అమలు కావడం లేదు. దీనిని అదనుగా తీసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారు. స్పామ్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఎయిర్టెల్.. గూగుల్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. మొత్తం మీద వినియోగదారుల భద్రతకు సంస్థ గొప్ప నిర్ణయం తీసుకుంది.ఉపయోగాలు➤సందేశం పంపిన వారి గుర్తింపును చెక్ చేయవచ్చు.➤వినియోగదారుల డీఎన్డీ సెట్టింగ్స్కు అనుగుణంగా మెసేజ్లను ప్రకటన లేదా అవసరమైన మెసేజ్లుగా వేరు చేసుకోవచ్చు.➤స్పామ్ బిజినెస్ మెసేజ్లు మీ ఫోన్కు రాకుండా చేసుకోవచ్చు.➤హానికరమైన లేదా మోసపూరిత లింకులను ముందుగానే గుర్తించి బ్లాక్ చేసుకోవచ్చు.
సిమ్ బైండింగ్పై ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్కార్డుతో లింక్ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్ బైండింగ్) కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని అతిక్రమించడమేనని, రాజ్యాంగవిరుద్ధమని టెలికం శాఖ కార్యదర్శి అమిత్ అగ్రవాల్కి ఫిబ్రవరి 23న రాసిన లేఖలో వ్యాఖ్యానించింది.దీని వెనుక గల అసలు కారణాలను తాము అర్థం చేసుకోగలమని, కాకపోతే నియంత్రణ సంస్థ జోక్యమనేది నిర్దిష్ట చట్టపరిధికి లోబడి ఉండాలని కోరుతున్నామని పేర్కొంది. మెటా, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలన్నీ బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి. దేశ భద్రత రీత్యా సిమ్ బైండింగ్ నిబంధనలను మార్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన నేపథ్యంలో బీఐఎఫ్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏఐప్లస్ స్మార్ట్ఫోన్ నుంచి నోవాపాడ్స్
న్యూఢిల్లీ: ఏఐప్లస్ స్మార్ట్ఫోన్ సంస్థ తాజాగా ఏఐఓటీ విభాగంలోకి కార్యకలాపాలు విస్తరించింది. నోవాపాడ్స్, నోవావాచ్ని ప్రవేశపెట్టింది. ఇవి ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి. నోవాపాడ్స్ ధర రూ. 699 నుంచి, నోవా వాచ్ ధర రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది.అలాగే కొత్త తరం స్మార్ట్ఫోన్లయిన పల్స్ 2, నోవా 2 సిరీస్ని కూడా కంపెనీ ప్రకటించింది. మార్చ్ 2న పల్స్ 2ని, ఆ తర్వాత నోవా 2 సిరీస్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. పల్స్ 2లో 50 ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 తదితర ఫీచర్లు ఉంటాయని పేర్కొంది.
పర్సనల్ ఫైనాన్స్
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి.
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
హెల్త్కు సూపర్ టాపప్!
పదేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్. ఆ వివరాలే ఈ ‘వెల్త్ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్ చికిత్సకు దాని స్టేజ్ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్ టాపప్ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్ టాపప్లు అందిస్తుంటాయి. బేస్ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్ అయినా, సూపర్ టాపప్ అయినా కనీస డిడక్టబుల్తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్ టాపప్తో పని ఉండదు. బేస్ పాలసీలోనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్ పాలసీ రూ.5 లక్షలు, టాపప్ లేదా సూపర్ టాపప్ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్ టాపప్ రెండూ డిడక్టబుల్తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్ టాపప్ రెండూ ‘డిడక్టబుల్’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్ ప్లాన్ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్ ప్లాన్ రూ.10 లక్షలు టాపప్ రూ.20 లక్షలు సూపర్ టాపప్ రూ.20 లక్షలు డిడక్టబుల్ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్లు మొదటి క్లెయిమ్ 4 లక్షలు రెండో క్లెయిమ్ 3.50 లక్షలు మూడో క్లెయిమ్ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్ ప్లాన్ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్ డిడక్టబుల్ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్ టాపప్ ప్లాన్ మాత్రం విడిగా ఒక క్లెయిమ్ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.20 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్లో ఈ ఫీచర్ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్ దాటినప్పుడే యాక్టివేట్ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్ టాపప్ ప్లాన్ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే వారికి సూపర్ టాపప్ అనుకూలం. → బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ కంపెనీ నుంచే టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలని లేదు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ ఉంటే క్లెయిమ్లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్–సూపర్ టాపప్ క్లెయిమ్ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్– సూపర్ టాపప్ ప్లాన్ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్ ప్రొసీజర్స్) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్ అష్యూర్డ్ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్ అష్యూర్డ్) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో బేసిక్ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.
జియో ఫైనాన్షియల్ యాప్లో వినూత్న ఫీచర్లు
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్ను మార్కెట్ప్లేస్ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్ స్కోర్ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్లో జోడిస్తున్నట్లు జేఎఫ్ఎస్ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.


