Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Degree is Not Enough: AI Skills Now Mandatory for Jobs Says Unstop Report 20261
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్‌ ఉంటేనే జాబ్‌

ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్‌పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్‌స్టాప్‌ టాలెంట్‌ రిపోర్ట్‌ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్‌ఆర్‌ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్‌ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్‌) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్‌–హ్యాండ్‌ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యమే అసలైన ‘గేట్‌కీపర్‌’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్‌), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్‌’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్‌ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్‌స్టాప్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్‌ అగర్వాల్‌ విశ్లేషించారు.

Robert Kiyosaki Massive Warning MOST POWERFUL FINANCIAL POSITION CHANGES HANDS2
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్‌ పోస్ట్‌

ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది. తొలగని పావెల్ నీడ!ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.అసలు బాస్ ఎవరు?కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz)."ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం.

Meta New AI Strategy Usability Over Speed to Empower Billions3
ఏఐపై జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు

నేడు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తోంది. రోజుకో కొత్త సాంకేతికత, శక్తివంతమైన ఏజెంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఎంత మేధస్సును కలిగి ఉన్నా సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీశాయి.మెటా సంస్థ 2026 మొదటి త్రైమాసిక పలితాల విశ్లేషణ సమావేశంలో మాట్లాడుతూ, జుకర్ బర్గ్ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఏఐ ఏజెంట్లు అత్యంత శక్తివంతమైనవి కావొచ్చు, కానీ అవి సామాన్యులకు అర్థం కానంత క్లిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన ‘మదర్ టెస్ట్’గా అభివర్ణించారు.‘నా తల్లి సైతం అర్థం చేసుకునేంత సరళంగా ఈ ఏజెంట్లు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిలో మెజారిటీ సాధనాలు ఆ మదర్‌ టెస్ట్‌లో విఫలమవుతున్నాయి’ అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. సాంకేతిక నిపుణులు, కోడింగ్ తెలిసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించగలుగుతున్నారు తప్ప, సాధారణ వినియోగదారులకు ఇవి భారంగా మారాయని ఆయన విశ్లేషించారు.మెటా వ్యూహంప్రస్తుతం ఓపెన్ సోర్స్, కోడింగ్ ఆధారిత ఏజెంట్లను అభివృద్ధి చేయడంలో ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు తీవ్రమైన పోటీలో ఉన్నాయి. అయితే, మెటా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. వేగం కంటే వినియోగ సౌలభ్యానికి తమ కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, కమాండ్-లైన్ సెటప్‌లు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికే ఏఐ ఏజెంట్లు చేరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది వినియోగదారులు ఎటువంటి అదనపు శిక్షణ లేకుండా అత్యంత సహజంగా ఉపయోగించగల సాధనాలను రూపొందించాలని మెటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్క్‌ చెప్పారు.పెట్టుబడుల వెనుక ఆంతర్యంపెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మెటా తన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల ఖర్చులు పెరుగుతున్నా దీర్ఘకాలికంగా మార్కెట్‌ను శాసించేది వినియోగదారులకు అత్యంత చేరువలో ఉండే ఏఐ సాధనాలేనని మెటా భావిస్తోంది. ‘సాంకేతిక పురోగతి మాత్రమే ముఖ్యం కాదు. అది మనిషి జీవితంలో ఎంత సులభంగా భాగమైందనేదే అసలైన విజయానికి కొలమానం’ అని జుకర్ బర్గ్ గుర్తు చేశారు.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

DMart Q4 Net Profit Crosses 656 Crore Mark Total Revenue Up 19pc4
రూ. 656 కోట్లను దాటిన ‘డీమార్ట్‌’ లాభం

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డీమార్ట్‌) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 19 శాతం ఎగసి రూ. 656 కోట్లను అధిగమించింది.2024–25 ఇదే కాలంలో రూ. 551 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఆదాయం సైతం 19 శాతం బలపడి రూ. 17,684 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 14,872 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 16,798 కోట్లను తాకాయి. నికర లాభ మార్జిన్లు నిలకడను చూపుతూ 3.7 శాతంగా నమోదయ్యాయి.మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్‌ స్టోర్ల దిగ్గజం నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,970 కోట్లయ్యింది. మొత్తం కన్సాలిడేటెడ్‌ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 68,895 కోట్లను తాకింది. క్యూ4లో ప్రారంభించిన 58 కొత్త స్టోర్లతో కలిపి వీటి సంఖ్య 500 మైలురాయికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.

Courts Redefine Employer Responsibility in the Age of AI5
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్‌జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్‌జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్‌జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్‌పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్‌కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్‌ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్‌పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్‌స్కిల్లింగ్‌ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్‌ వర్క్‌ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్‌లో జూదం ఆడుతున్నారు!

Warren Buffett Warns Investors Stock Market Turning Into a Dangerous Casino6
మార్కెట్‌లో జూదం ఆడుతున్నారు!

ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు, ‘ఓరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలువబడే వారెన్ బఫెట్ మదుపరులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత పెట్టుబడిదారులు సంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి ప్రమాదకరమైన జూదంలో మునిగి తేలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.స్టాక్ మార్కెట్లు ‘అతి తక్కువ సమయంలో ఊహించని ధనవంతులు కావాలనే జూదగాళ్ల అడ్డాగా’ మారిందని బఫెట్ అన్నారు. నేటి మార్కెట్లలో పెట్టుబడి, ఊహాజనిత (స్పెక్యులేటివ్‌) కార్యకలాపాల మధ్య తేడా కనుమరుగవుతోందని ఆయన విశ్లేషించారు. ‘ఎవరైనా వన్-డే ఆప్షన్లతో ట్రేడింగ్ చేస్తుంటే అది పెట్టుబడి కాదు, కనీసం ఊహాజనితం కూడా కాదు.. అది పూర్తిగా జూదం లాంటిది. చరిత్రలో ఇంతటి తీవ్రమైన మానసిక స్థితి మదుపరుల్లో ఎప్పుడూ చూడలేదు’ అని బఫెట్ స్పష్టం చేశారు.సైనిక చర్యల సమాచారంతో..మార్కెట్లలో జరుగుతున్న ఈ అనాలోచిత ధోరణికి బఫెట్ ఒక సంచలన ఉదాహరణను ప్రస్తావించారు. వెనిజులాలో సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి మార్కెట్లలో ఒక అమెరికన్ సైనికుడు సుమారు 4,00,000 డాలర్లు (రూ.3.3 కోట్లు పైగా) గడించాడనే ఆరోపణలతో జరుగుతున్న విచారణను ఆయన గుర్తుచేశారు. ఇటువంటి ఘటనలు మార్కెట్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయన్నారు. స్వల్ప కాలపు లాభాల కోసం అక్రమ మార్గాలను ఎంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.నాయకత్వ మార్పుఈ సమావేశం బెర్క్‌షైర్ హాత్వేలో కొత్త శకాన్ని ఆవిష్కరించింది. గ్రెగ్ అబెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తన మొదటి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించారు. కృత్రిమ మేధ(ఏఐ) గురించి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రయోజనం లేని ఏ సాంకేతికతను సంస్థ గుడ్డిగా అనుసరించదన్నారు. కేవలం వ్యాపార విలువను పెంచే అప్లికేషన్లపైనే దృష్టి సారిస్తామని అబెల్ స్పష్టం చేశారు. రైల్వే, బీమా రంగాల్లో సంస్థ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు ఆయన వివరించారు.ఇదీ చదవండి: భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన

Advertisement
Advertisement
Advertisement