Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rising Role of Women in Mutual Fund Investments Personal Finance Landscape1
మహిళలకు ప్యాసివ్‌ పెట్టుబడుల దన్ను

దేశీయంగా పర్సనల్‌ ఫైనాన్స్‌ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్‌ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ అనేది కోర్‌ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్‌లలో విస్తృతంగాఇన్వెస్ట్‌ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్‌ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్‌లు, గోల్డ్, సిల్వర్‌లాంటి కమోడిటీ ఇండెక్స్‌లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్‌ ఆధారిత ఫండ్స్‌లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్‌ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్‌ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లాంటి ప్యాసివ్‌ ఫండ్స్‌ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్‌ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్‌ ఫండ్‌ లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్‌ ఆధారిత ప్యాసివ్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్‌ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్‌ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్‌ ఫండ్లలో బాండ్స్‌లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్‌ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్‌ శ్రేయస్కరం..ఇక సిప్‌ విధానం ద్వారా ప్యాసివ్‌ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్‌ యావరేజింగ్‌ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్‌ ఫండ్స్‌ లేదా ఈటీఎఫ్‌లలో సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్‌ టైమింగ్‌ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్‌ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్‌ ఫండ్స్‌ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.

Overnight and Liquid Funds are better options in stock market2
ఎఫ్‌డీ కన్నా బెటర్‌ గురూ..

ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్‌ టారిఫ్‌లు రోజుకో టర్న్‌ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇపుడేమో పశ్చిమాసియా సంక్షోభం దావానలంలా చుట్టేస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఆరంభించిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో రోజురోజుకూ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై కూడా తీవ్రంగానే ఉంటోంది. గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే మన మార్కెట్లు ఇప్పటికే దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్న మదుపరులు ఇపుడేం చేయాలి? సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు కాస్త కిందికి వచ్చాక కొద్దికొద్దిగా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లటమే మంచిదని నిపుణులు చెబుతారు. మరి అలా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎక్కడుంచాలి? సేవింగ్స్‌ ఖాతాల్లో అయితే వడ్డీ ఏమీ రాదు. ఎఫ్‌డీల్లో అయితే బ్రేక్‌ చేస్తే వచ్చేది తక్కువ. ఇక మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో అయితే స్వల్ప కాలానికి పెద్దగా రాబడులేమీ రావు. దీనికి నిపుణులు చెబుతున్న సమాధానమే ఓవర్‌నైట్, లిక్విడ్‌ మ్యూచ్‌వల్‌ ఫండ్లు. వార్షికంగా 6–7 శాతం రాబడినిస్తూ... తక్కువ ఛార్జీలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకోగలిగే అవకాశం ఉండటమే వీటి ప్రత్యేకత. స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయటానికి వేచి చూసే వారే కాదు... స్వల్ప కాలానికి తమ డబ్బుల్ని ఎక్కడైనా ఉంచాలనుకునే వారందరికీ ఇవి అత్యుత్తమ పెట్టుబడి సాధనాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి కనక వీటిలో రిస్కూ తక్కువే.ఓవర్‌నైట్‌.. లిక్విడ్‌ ఫండ్స్‌.. ఈ రెండూ భిన్నమైన ఫండ్స్‌. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ కేవలం ఒక్క రోజు మెచ్యూరిటీ ఉండే డెట్‌ సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఆ విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో అత్యంత సురక్షితమైన కేటగిరీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ప్రత్యేకతలేమిటంటే... వడ్డీ రేట్ల మార్పులపరంగా చాలా తక్కువ రిసు్క. అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధి వరకు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఇవి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిధిలో ఉంటాయి. ఇక లిక్విడ్‌ ఫండ్స్‌ని తీసుకుంటే ఇవి 91 రోజుల వరకు మెచ్యూరిటీలు ఉండే డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌తో పోలిస్తే కాస్తంత ఎక్కువ రాబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దివారాల నుంచి కొద్ది నెలల వ్యవధి వరకు షార్ట్‌ టర్మ్‌ పెట్టుబడులకు ఇవి అనువైనవి.రాబడి ఇలా.. సాధారణంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను బట్టి రాబడులు మారుతుంటాయి. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ విషయం తీసుకుంటే వార్షికంగా సుమారు 5– 6 శాతం రాబడినిస్తాయి. అదే లిక్విడ్‌ ఫండ్స్‌ అయితే సుమారు 6–7 శాతం స్థాయిలో ఉంటుంది. అయితే కచి్చతంగా ఇంత రాబడులే వస్తాయని లేదు కానీ, స్వల్పకాలిక వడ్డీ రేట్లను బట్టి ఇవి ఉంటాయి. ఎవరికి అనువైనవి స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేసేందుకు సన్నద్ధమవుతున్నవారు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు తమ దగ్గర ఉన్న నగదును ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అలాగే, స్వల్పకాలికంగా, కొద్ది నెలల వ్యవధిలో అవసరం పడే మిగులు డబ్బును కూడా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉపయోగించుకోదల్చుకునే నిధులను కూడా కొందరు ఇన్వెస్టర్లు, లిక్విడ్‌ ఫండ్స్‌లో ఉంచుతారు.ఇందులోనూ రిసు్కలు ఉంటాయి.. ఈ తరహా పెట్టుబడుల్లో రిస్కులు తక్కువగా ఉంటాయే తప్ప పూర్తి రిస్క్‌– ఫ్రీగా మాత్రం ఉండవు. వీటిల్లో ప్రధానంగా పొంచి ఉండే రిసు్కలను చూస్తే.. వడ్డీ రేట్లలో మార్పులు: స్వల్పకాలిక వడ్డీ రేట్లు బట్టి రాబడులు హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. క్రెడిట్‌ రిస్కు (లిక్విండ్‌ ఫండ్స్‌లో): కొన్ని లిక్విడ్‌ ఫండ్స్, కార్పొరేట్‌ డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలాంటి వాటిలో పరిమిత స్థాయిలో క్రెడిట్‌ రిస్కు ఉంటుంది. ట్యాక్సేషన్‌: పన్నులపరంగా చూస్తే ఇన్వెస్టర్‌ ఆదాయ శ్లాబ్‌ని బట్టి క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది.ఏం చేయొచ్చంటే.. ఇలాంటి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణులు మూడు సింపుల్‌ రూల్స్‌ సూచిస్తున్నారు. అవేంటంటే.. ⇒ రెగ్యులర్‌ ప్లాన్లు కాకుండా డైరెక్ట్‌ ప్లాన్లు తీసుకుంటే చార్జీల మోత తగ్గుతుంది. ⇒ ఇన్వెస్ట్‌ చేయడానికి ముందే వ్యయ నిష్పత్తిని చూసుకోవాలి. ⇒ మాటిమాటికీ ఎంట్రీ, ఎగ్జిట్‌ చేయకుండా ఉంటే ఎగ్జిట్‌ లోడ్‌ భారాలు తగ్గుతాయి. ⇒ అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియో ఉండే ఫండ్స్‌ని ఎంచుకోవాలి. ⇒ ఇంకా ఎక్కువ ఈల్డ్‌పై అత్యాశతో నాసిరకం ఫండ్స్‌ని ఎంచుకోకూడదు. ⇒ స్వల్పకాలిక అవసరాల కోసమే ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. ⇒ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగా పరిగణించకూడదు.ఖర్చులూ చూసుకోవాలి .. సాధారణంగా ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌ అనేవి చౌకైన పెట్టుబడి సాధనాలే అయినప్పటికీ, కొన్ని చార్జీలు ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. వ్యయ నిష్పత్తి: స్కీమును నిర్వహించేందుకు ఫండ్‌ హౌస్‌ వార్షికంగా విధించే ఫీజును ఎక్స్‌పెన్స్‌ రేషియోగా వ్యవహరిస్తారు. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లో ఇది ఏడాదికి 0.6 నుంచి 0.25 శాతం శ్రేణిలో, లిక్విడ్‌ ఫండ్స్‌లో 0.8 నుంచి 0.40 శాతంగా శ్రేణిలోను ఉంటుంది. ఈ ఫీజును ఆటోమేటిక్‌గా ఫండ్‌ రిటర్నుల్లో నుంచి డిడక్ట్‌ చేస్తారు కనక ఇన్వెస్టర్లు విడిగా చెల్లించనక్కర్లేదు.ఈ చార్జీలు సెబీ పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలను 0.30 శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉన్న లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే వార్షికంగా సుమారు రూ. 3,000 చార్జీ వర్తిస్తుంది. అయితే మనం ఎన్ని రోజులు ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఉంచితే అన్ని రోజులకే చార్జీలు వర్తిస్తాయి. ఎగ్జిట్‌ లోడ్‌: పెట్టుబడులను సత్వరం రిడీమ్‌ చేసుకుని, వైదొలిగితే కొన్ని ఫండ్‌లు కొంత ఎగ్జిట్‌ లోడ్‌ని వసూలు చేస్తాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ విషయాన్ని చూస్తే, మొదటి రోజు రిడీమ్‌ చేసుకుంటే సుమారు 0.007 శాతం, రెండో రోజైతే 0.0065 శాతం.. అలా 7 రోజుల తర్వాత జీరో స్థాయికి లోడ్‌ తగ్గుతుంది. చాలా మటుకు ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లో సాధారణంగా ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. బ్రోకరేజ్‌ లేదా లావాదేవీ ఫీజులు: కొన్ని ప్లాట్‌ఫాంలు లేదా డి్రస్టిబ్యూటర్ల ద్వారా ఫండ్స్‌ తీసుకుంటే కొంత ట్రాన్సాక్షన్‌ చార్జీలు వర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా మటుకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు ఇలాంటి ఫీజుల బాదరబందీ లేకుండా డైరెక్ట్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ట్యాక్సేషన్‌: ఈ ఫండ్స్‌ నుంచి రాబడులపై పన్నులు వర్తిస్తాయి. ఇటీవల పన్ను విధానాల్లో మార్పుల అనంతరం, ఇన్వెస్టర్‌ ఆదాయ పన్ను శ్లాబ్‌ బట్టి స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వర్తిస్తోంది. స్టాక్‌ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు, కరెక్షన్లకు లోనవుతున్నాయి. ఇప్పటికే కొంత వరకూ మార్కెట్ల నుంచి ఎగ్జిట్‌ అయిన వారు, ఇంకా కొంత ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్‌ చేసి, బీపీ తెచ్చుకోవడం కంటే డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భావిస్తున్నారు. మరి బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలపై 2.5 – 4 శాతం వడ్డీ రేటే ఉంటోంది. అందుకే వీరు ఎంట్రీ, ఎగ్జిట్‌ రెండూ సులభంగా ఉండే ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌ను ఆశ్రయించవచ్చు.

Truhome Finance Files DRHP for Rs 3000cr IPO3
రూ. 3,000 కోట్ల ఐపీవోకి ట్రూహోమ్‌ ఫైనాన్స్‌

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 3,000 కోట్ల నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ (గతంలో శ్రీరాం హౌసింగ్‌ ఫైనాన్స్‌) ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం తాజాగా రూ. 1,500 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా. ప్రమోటర్‌ మ్యాంగో క్రెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ. 1,500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించనుంది.తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించి నిధులను వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2010లో ఏర్పాటైన ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ గతంలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌గా కార్యకలాపాలు సాగించేది. 2024 డిసెంబర్‌లో దాన్ని గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌ కొనుగోలు చేసింది. గృహ రుణాలు, ప్రాపర్టీపై రుణాలు మొదలైనవి అందిస్తున్న కంపెనీకి దేశవ్యాప్తంగా 216 శాఖలు ఉన్నాయి. 2025 డిసెంబర్‌ 31 నాటికి రూ. 21,124 కోట్ల అసెట్స్‌తో దేశీయంగా మూడో అతి పెద్ద అఫోర్డబుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా ఉంది.

Impact of the West Asia War on Crude Oil Prices4
గణాంకాలు, ఫెడ్‌ సమీక్షపై దృష్టి

దేశ, విదేశీ గణాంకాలు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష తదితరాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను బలహీనపరచిన పశ్చిమాసియా యుద్ధం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. ముడిచమురు ధరల పెరుగుదల ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తోంది. వెరసి మరోసారి స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ బ్రెంట్‌ చమురు బ్యారల్‌ లండన్‌ మార్కెట్లో గత వారం 102 డాలర్ల ఎగువకు చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇరాన్, యూఎస్, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, హుర్ముజ్‌ మార్గంలో నౌకల రవాణాకు అంతరాయాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా చమురు, గ్యాస్‌ సరఫరాల కొరత భారత్‌ను వేధిస్తోంది. నేడు(16న) చమురు ధరలు మరోసారి మండితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే వీలుంది. ఫెడ్‌ దారెటు? ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలను బుధవారం(18న) ప్రకటించనుంది. గత పాలసీ సమీక్షలో యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్‌ రేట్లు 3.5–3.75% వద్దే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, ప్రయివేట్‌ రంగ ఉపాధి, చమురు నిల్వల గణాంకాలు సైతం ఈ వారం విడుదల కానున్నాయి. వీటికితోడు పశి్చమాసియా యుద్ధం, ధరల పెరుగుదల తదితర అంశాలను ఫెడ్‌ పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆర్ధికవేత్తలు తెలియజేశారు. దేశీయంగా.. దేశీయంగా గత నెల రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 10 నెలల గరిష్టం 3.21 శాతాన్ని తాకింది. నేడు టోకు ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 1.81 శాతం పెరిగింది. ఫిబ్రవరి నెలకు వాణిజ్య గణాంకాలు సైతం విడులకానున్నాయి. కాగా.. బ్రెంట్‌ చమురు 101 డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు పెరగనుంది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం బలహీనపడుతోంది. యుద్ధం కొనసాగితే చమురు, గ్యాస్‌ కొరత పెరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.సాంకేతికంగా చూస్తే ఈ వారం .. యుద్ధ భయాలు, చమురు ఆందోళనలు ఈ వారం సైతం మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి విశ్లేషణ ప్రకారం మార్కెట్లు మరింత బలహీనపడే అవకాశముంది. ⇒ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,800–22,600 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఇక్కడి నుంచి బలపడకుంటే 22,200–22,100 పాయింట్లవరకూ పతనంకావచ్చు. ఒకవేళ బలాన్ని పుంజుకుంటే 23,700–23,900 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురయ్యే వీలుంది. 24,000 పాయింట్లు దాటితే మరింత పుంజుకోవచ్చు.గత వారం పతన బాటలోపశ్చిమాసియా యుద్ధం, చమురు ధరలు, రూపాయి క్షీణత ప్రభావంతో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నికరంగా సెన్సెక్స్‌ 4,355 పాయింట్లు(5.5 శాతం) పతనమై 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 1,299 పాయింట్లు(5.3 శాతం) కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 4 శాతం స్థాయిలో క్షీణించాయి. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే సెన్సెక్స్‌ 6,723 పాయింట్లు(8.3 శాతం) పడిపోయింది. బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ. 34 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ నెల ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో నికరంగా రూ. 52,704 కోట్ల(5.73 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా గత 17 నెలల్లోనే అత్యధిక పెట్టుబడులు చేపట్టారు. అయితే చమురు ధరలు, యుద్ధ భయాలతో ఈ నెల నుంచీ అమ్మకాల యూటర్న్‌ తీసుకున్నారు.

Impact of Changes in Gold Loan LTV Ratio on Borrowers5
గోల్డ్‌ లోన్‌లో.. రిస్కులూ ఉంటాయి!

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్‌్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్‌’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్‌ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్‌టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్‌టీవీకి సంబంధించి ఆర్‌బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్‌టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్‌టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్‌బీఐ విధించిన ఎల్‌టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్‌టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్‌్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్‌ అప్రైజర్‌ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్‌లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్‌బీఎఫ్‌సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్‌బీఎఫ్‌సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్‌టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్‌లు– ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్‌ చార్జీ, గోల్డ్‌ అప్రైజర్‌ చార్జీలు, డాక్యుమెంటేషన్‌ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్‌ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్‌ ఆఫ్‌ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్‌ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్‌టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్‌ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్‌..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్‌ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్‌్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్‌లు, ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్‌లు, ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.

ByteDance Halts Global Launch of Seedance 2 After Hollywood Copyright Clash6
‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్, క్యాప్‌కట్ వంటి యాప్‌లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్‌డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.వివాదానికి కారణం ఇదే..సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్‌ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్‌ క్లిప్‌లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.హాలీవుడ్ దిగ్గజాల ధ్వజంప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్‌డ్యాన్స్‌కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్‌డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

Advertisement
Advertisement
Advertisement