Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Auto retail sales up 13. 3 Percentage at 29671064 units in FY261
వాహన విక్రయాలు.. టాప్‌గేర్‌

న్యూఢిల్లీ: వాహన రిటైల్‌ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 13% పెరిగినట్లు ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఏడాది ఆరంభంలో ఆటోమొబైల్‌ రంగంలో డిమాండ్‌ కొంత మేర తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 అమలుతో విక్రయాలు వేగవంతమయ్యాయని ఫాడా తెలిపింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన పండుగల సీజన్‌లో నవరాత్రి, దీపావళి ఒకే కాలంలో రావడంతో అక్టోబర్‌లో నెలవారీ రిటైల్‌ విక్రయాలు 40 లక్షల యూనిట్లను దాటి ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేశాయి. ఈ ఉత్సాహం తరువాతి నెలల్లోనూ కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెల కూడా రెండంకెల (డబుల్‌ డిజిట్‌) వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో ఈ వృద్ధి కేవలం పండుగల ప్రభావం మాత్రమే కాకుండా, నిర్మాణాత్మకంగా బలపడినట్లు స్పష్టమైంది. అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్‌ విక్రయాలు 2,61,87,255 (2024–25) నుంచి 13 శాతం వృద్ధితో 2,96,71,064 యూనిట్లకు చేరాయి. జీఎస్‌టీ 2.0 అమలుతో బూస్ట్‌: ఫాడా అధ్యక్షుడు భారత ఆటో రిటైల్‌ రంగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక ప్రదర్శన కనబర్చిందని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్‌.విఘ్నేశ్వర్‌ తెలిపారు. మొత్తం 2.96 కోట్లకు పైగా వాహనాలు విక్రయంతో ఆటో రంగం కొత్త గరిష్ట స్థాయిని చేరిందన్నారు. ఈ వృద్ధి కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, పరిశ్రమ 3కోట్ల మార్క్‌కు చేరువవుతోందని సూచిస్తోందన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న మొబిలిటీ అవసరం, మెరుగైన కొనుగోలు సామర్థ్యం, వివిధ ఇంధన సాంకేతికతల విస్తరణ ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని వివరించారు.అయితే, ఏడాది మొత్తం వృద్ధి సమానంగా కొనసాగలేదన్నారు. గత ఏడాది ఇన్వెంటరీ సమస్యలు, ఫైనాన్సింగ్‌ పరిమితులు, వినియోగదారుల ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ ధోరణి కారణంగా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు విక్రయాలు మోస్తరుగా ఉన్నాయని తెలిపారు. అయితే, సెప్టెంబర్లో అమలైన జీఎస్‌టీ 2.0తో పరిస్థితి మారిందని, చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గడంతో కొనుగోలు సామర్థ్యం పెరిగి డిమాండ్‌ ఊపందుకుందని వెల్లడించారు. అప్రమత్తతతో కూడిన ఆశావాద దృక్పథం: ఫాడా పశ్చిమాసియా పరిస్థితుల్లో మార్పులు భారత ఆటో రిటైల్‌ రంగంపై కీలక ప్రభావం చూపవచ్చని ఫాడా పేర్కొంది. ఇంధన ధరలు, సరఫరా లభ్యత, వినియోగదారుల విశ్వాసం ఆటో రంగం దిశను నిర్ణయించే ప్రధాన అంశాలుగా మారనున్నాయని తెలిపింది. తాజా సర్వే ప్రకారం, 53.2 శాతం డీలర్లు సరఫరా లేదా డిస్పాచ్‌లో అంతరాయాలను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. వీరిలో 17.1 శాతం డీలర్లు మూడు వారాలకుపైగా గణనీయమైన జాప్యాలు (కంపెనీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరాలో ఆలస్యం) నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగంలో ఎక్కువగా కనిపించింది. అలాగే ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), ద్విచక్ర వాహనాల (టూ వీలర్స్‌) డీలర్లు కూడా కొన్ని మోడళ్లలో ఆలస్యాలు ఉన్నట్లు తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల కూడా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. సుమారు 36.5 శాతం డీలర్లు పెరుగుతున్న లేదా పెరగవచ్చని భావిస్తున్న ఇంధన ధరలు వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల కొనుగోలు నిర్ణయాలు ఆలస్యమవడంతో పాటు, కస్టమర్లు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వైపు మళ్లే అవకాశముందని ఫాడా తెలిపింది. అయితే, ఫైనాన్సింగ్‌ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, 72.5 శాతం డీలర్లు రుణ నిబంధనల్లో మార్పులేదని వెల్లడించారు. మొత్తంగా, సమీప కాలంలో జాగ్రత్తతో కూడిన ఆశావాద దృక్పథాన్ని ఫాడా వ్యక్తం చేసింది. ఈవీ రిటైల్‌ విక్రయాలు @ 24.52 లక్షలుదేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) రిటైల్‌ విక్రయాలు గత (2025–26) ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. మొత్తం 24.52 లక్షల ఈవీలు అమ్ముడైనట్లు ఫాడా తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2024–25)లో విక్రయాలతో పోలిస్తే ఇవి 24.6 శాతం అధికంగా ఉన్నాయి. ప్రతి వాహన విభాగం కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ‘‘ఎఫ్‌వై 2026 భారత ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగానికి మైలురాయిగా నిలిచింది. ఇది ఆటోమొబైల్‌ రంగ విజయం మాత్రమే కాదు, ‘ఎనర్జీ మార్పిడి’లో భారతదేశ నాయకత్వ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. దేశ ఈవీ ప్రయాణం స్థిరమైన వేగంతో దూసుకెళ్తోంది అనేందుకు విక్రయ గణాంకాలు నిదర్శనం’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్‌. విఘ్నేశ్వర్‌ తెలిపారు. ⇒ 2025–26లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు 1,99,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెండు లక్షల యూనిట్ల లక్ష్యం కొద్దిలో చేజారింది. అయితే ఎఫ్‌వై25లోని 1,08,873 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 83.63% వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాలు 78,811 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. తరువాత జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా 53,089 యూనిట్లతో రెండో స్థానంలో, మహీంద్రా అండ్‌ మహీంద్రా 42,721 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ⇒ ఎలక్ట్రిక్‌ ద్వి చక్ర వాహనాల విభాగంలో 21.81% వృద్ధితో 14,01,818 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 3,41,513 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్‌ ఆటో 2,89,349 యూనిట్లతో రెండో స్థానంలో, ఏథర్‌ ఎనర్జీ 2,39,178 యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ⇒ ఎలక్ట్రిక్‌ త్రి చక్ర వాహనాల విక్రయాలు 18.97 % వృద్ధితో 8,30,819 యూనిట్లకు చేరాయి. అలాగే ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహన అమ్మకాలు 120.57% పెరిగి 19,454 యూనిట్లుగా నమోదయ్యాయి.

Trump Halts Iran Strike for 14 Days Oil Prices Crash Indian Markets Surge2
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్‌!

గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధ భయాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని నివారిస్తూ ఇరాన్‌పై తలపెట్టిన సైనిక చర్యను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి తొలగి పెట్టుబడిదారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 2 శాతంపైగా లాభపడటం భారత మార్కెట్లలో బుల్ రన్‌కు సంకేతాలు పంపుతోంది.ట్రంప్ వ్యూహాత్మక అడుగుఏప్రిల్ 8, 2026 ఉదయం 4:30(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంతో సైనిక దాడులను 14 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వినాశకరమైన యుద్ధం కంటే శాంతికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అయితే హార్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరిస్తేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు.చమురు ధరల పతనం..యుద్ధం వాయిదా పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ దాదాపు 18 శాతం తగ్గి 92.60 డాలర్లు వద్దకు చేరింది. బ్రెండ్ క్రూడ్ 6 శాతం తగ్గి 103.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటం వల్ల సరఫరా పునరుద్ధరిస్తారనే ఆశలు చిగురించాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతానికి పైగా ఈ మార్గం నుంచే సాగుతుండటంతో గడిచిన నెల రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు కిందికి దిగివస్తున్నాయి.దలాల్ స్ట్రీట్‌లో పండగభారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 450 పాయింట్ల పైగా లాభంతో ఉంది. దీని ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు చారిత్రాత్మక గరిష్టాలను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్‌లో నికాయ్, హాంగ్ సెంగ్ మార్కెట్లు ఇప్పటికే 2-3 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.ఇంతకాలం యుద్ధం వస్తుందేమో అన్న ఆందోళనతో నగదును వెనక్కు తీసుకున్న ఇన్వెస్టర్లకు ఇదొక గొప్ప ఊరట. ఇరాన్ తన 10 సూత్రాల శాంతి ప్రణాళికను అమలు చేస్తే ఈ రెండు వారాల విరామం శాశ్వత శాంతికి దారి తీయవచ్చు. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు చమురు ధరల తగ్గింపు బూస్టర్ డోస్ లాంటిది. అయితే, ఇది కేవలం రెండు వారాల గడువు మాత్రమేనని, మధ్యవర్తిత్వ చర్చల ఫలితాలను బట్టే మార్కెట్ల తదుపరి దిశ ఉంటుందని పెట్టుబడిదారులు గమనించాలి.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Air India Ticket Prices To Rise As Airline Revises Fuel Surcharge3
ఎయిరిండియా ప్రయాణికులకు ఏటీఎఫ్‌ సెగ

ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) రేట్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో ఎయిరిండియా గ్రూప్‌ తమ ఫ్లయిట్స్‌పై ఇంధన సర్‌చార్జీని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీ ఫ్లయిట్స్‌పై రూ. 299 నుంచి రూ. 899 వరకు, విదేశీ రూట్లలో 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు (కొన్ని రూట్లు మినహాయించి) ఉంటుంది. ఏప్రిల్‌ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఎయిరిండియా గ్రూప్‌ పేర్కొంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలకు కూడా ఇవి వర్తిస్తాయి.బంగ్లాదేశ్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా తదితర రూట్లకు సంబంధించి నియంత్రణ సంస్థ నుంచి వచ్చే అనుమతులను బట్టి నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతంలో బ్యారెల్‌కి 27.83 డాలర్లుగా ఉన్న ఏటీఎఫ్‌ మార్చి 27న ముగిసిన వారాంతానికి 81.44 డాలర్లకు ఎగిసినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సర్‌చార్జీలను విధించినప్పటికీ ఏటీఎఫ్‌ వ్యయాలు పూర్తిగా రికవర్‌ కావని, ఇప్పటికీ సింహభాగం భారాన్ని సంస్థే భరిస్తోందని ఎయిరిండియా పేర్కొంది. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్‌ వాటా 40–45 శాతం వరకు ఉంటుంది. మరో విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఇంధన సర్‌చార్జీలను సవరించిన సంగతి తెలిసిందే.సీఈవో విల్సన్‌ రాజీనామాఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేశారు. దీనితో ఆయన స్థానంలో కొత్త వారి నియామకం కోసం కంపెనీ ప్రత్యేక కమిటీని నియమించింది. న్యూజిలాండ్‌కి చెందిన విల్సన్‌ గతంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కి పని చేశారు. 2022లో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన విల్సన్‌ గత నాలుగేళ్లుగా సీఈవో, ఎండీగా పని చేస్తున్నారు. ‘2026లో తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లు 2024లోనే ఎయిరిండియా చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కి విల్సన్‌ తెలిపారు. అధికార బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేట్లుగా అప్పటి నుంచే కసరత్తు జరుగుతోంది‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.వారసుడు ఎంపికయ్యేంత వరకు విల్సన్‌ ప్రస్తుత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ‘కోవిడ్‌ అనంతరం పలు సవాళ్లు ఎదురైనప్పటికీ కంపెనీ వాటిని అధిగమించి, పురోగమించడంలో విల్సన్‌ కీలకపాత్ర పోషించారు‘ అని చంద్రశేఖరన్‌ కితాబిచ్చారు. ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు, సరఫరా వ్యవస్థలో సవాళ్లు, రెండు యుద్ధాలు, ఎయిర్‌స్పేస్‌ మూసివేత, ఇంధన ధరల పెంపు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక పెను విషాదం (అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన)లాంటి అసాధారణ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణం.కొత్త విమానాల డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో నేను కంపెనీ పగ్గాలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయం‘ అని ఉద్యోగులకి ఇచ్చిన సందేశంలో విల్సన్‌ పేర్కొన్నారు. 2022లో ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి టాటాలు కొనుగోలు చేసిన అనంతరం నాలుగు ఎయిర్‌లైన్స్‌ని విజయవంతంగా విలీనం చేయడం తదితర అంశాల్లో విల్సన్‌ కీలక పాత్ర పోషించారు. అయితే, 250 మంది ప్రయాణికులు మరణించిన ఎయిరిండియా విమాన దుర్ఘటన, ఇతరత్రా సందర్భాల్లో భద్రతా ప్రమాణాల లోపాలు తదితర అంశాలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

Digital commerce in India will grow to Rs 250 billion by 20304
ఈ–కామర్స్ @ 250 బిలియన్‌ డాలర్లు!

న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్‌ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. జెన్‌ జెడ్‌ షాపర్స్, క్విక్‌ కామర్స్‌ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్‌ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్‌ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్‌లైన్‌ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్‌ జెడ్‌ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.దేశీయంగా ప్రజల షాపింగ్‌ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్‌ కీలక దశలో ఉందని గూగుల్‌ ఇండియా ఎండీ (కనెక్టెడ్‌ కన్జూమర్‌ కామర్స్‌) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్‌ శకం వైపు మార్కెట్‌ మళ్లుతోందని డెలాయిట్‌ దక్షిణాసియా పార్ట్‌నర్‌ ఆనంద్‌ రామనాథన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ జనులైన జెన్‌ జెడ్‌ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్‌ కూడా అందించే జనరేటివ్‌ కామర్స్‌ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ⇒ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ రాబోయే రోజుల్లో 50 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. ⇒ 2030 నాటికి మొత్తం క్విక్‌ కామర్స్‌ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్‌లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్‌ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి. ⇒ క్రియేటర్‌ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్‌ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్‌ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్‌ స్టోర్‌ఫ్రంట్‌ ద్వారా జరుగుతుంది. లైవ్‌ కామర్స్‌ 8 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ⇒ పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్‌ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్‌ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది.

Government plans Rs 2. 5 lakh cr credit guarantee scheme for businesses affected by West Asia crisis5
యుద్ధం ఎఫెక్ట్‌.. దెబ్బతిన్న రంగాలకు కేంద్రం దన్ను!

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో దేశీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవనుంది. రూ.2.5 లక్షల కోట్లతో క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ (రుణ హామీ పథకం)ను తీసుకొచ్చే యోచనతో ఉంది. ఈ పథకం కింద రుణాలు తీసుకున్న సంస్థలు ఇరాన్‌–ఇజ్రాయెల్‌/అమెరికా యుద్ధ ప్రభావం కారణంగా చెల్లింపుల్లో విఫలమైతే 90 శాతం మేర (రూ.100 కోట్ల వరకు) ప్రభుత్వం రుణదాతలకు (బ్యాంక్‌లు) చెల్లిస్తుంది.ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ఈ మేరకు హామీని బ్యాంక్‌లకు ఇవ్వనుంది. కరోనా సమయంలోనూ ప్రభుత్వం ఇదే తరహా పథకాన్ని (అత్యవసర రుణ హామీ పథకం/ఈసీఎల్‌జీఎస్‌) ప్రకటించడం తెలిసిందే. నాడు ఈ పథకం ఎంతో విజయవంతమైందని, ఎన్నో సంస్థలు నిలదొక్కుకుని, తర్వాత చెల్లింపులు చేసేందుకు వీలు ఏర్పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీఎల్‌జీఎస్‌ను నాడు అన్ని రంగాలకు అమలు చేశారు. నూరు శాతం హామీని ఈ పథకం కింద ప్రభుత్వం అందించింది. దీనికింద అప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు, అదనపు రుణ సదుపాయాలను బ్యాంక్‌లు ఆఫర్‌ చేశాయి.రుణ రేట్లపై పరిమితులతోపాటు ముందస్తు చెల్లింపుల చార్జీలు, ప్రాసెసింగ్‌ చార్జీల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్‌ ధరలు భగ్గుమనడం తెలిసిందే. ఈ ప్రభావం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం తెలిసిందే. ఫార్మా, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాల్లో వినియోగించే కీలక ముడిపదార్థాలైన పెట్రోకెమికల్స్‌పైనా దిగుమతి సుంకాలను మినహాయించడం గమనార్హం.

Private banks outpace PSBs in Q4 deposit growth6
డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్‌

ముంబై: డిపాజిట్ల వేటలో ప్రభుత్వరంగ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంక్‌లు గట్టి పోడీ పడుతున్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు అధిక డిపాజిట్లను సమీకరించడం ఇందుకు నిదర్శనం. 2025–26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లలో 12–17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కానీ, ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 2–14 శాతానికి పరిమితమైనట్టు డేటా స్పష్టం చేస్తోంది. సాధారణంగా బ్యాంకులకు కరెంట్‌ అకౌంట్‌ అండ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (కాసా) డిపాజిట్లు చాలా చౌక రేట్లకే లభిస్తుంటాయి. ఇతర ఆర్థిక సాధనాల్లో ఇంతకుమించి మెరుగైన రాబడులతో కాసా డిపాజిట్లు క్రమంగా తగ్గిపోతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌లు సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్‌ (సీడీ)ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో అధిక వృద్ధి.. ప్రైవేటు బ్యాంకుల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. డిపాజిట్లు 17.2 శాతం పెరిగి రూ.2.84 లక్షల కోట్లకు చేరాయి. ఆ తర్వాత కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ డిపాజిట్లు 14.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిపాజిట్లు 14.4 శాతం చొప్పున పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యధికంగా 14.33 శాతం వృద్ధిని నమోదు చేయగా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 14 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఇండియా 13.37 శాతం చొప్పున డిపాజిట్లను పెంచుకున్నాయి. మార్చి త్రైమాసికం ముగిసిన తర్వాత కొన్ని బ్యాంక్‌లు విడుదల చేసిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఈ వ్యత్యాసం కనిపించింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ ఇంకా ఈ వివరాలు విడుదల చేయలేదు. రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల పైచేయి మార్చి త్రైమాసికంలో రుణాల పరంగా ప్రభుత్వరంగ బ్యాంకులు మెరుగైన పనితీరు చూపించాయి. రుణాల్లో 12–22 శాతం వరకు వృద్ధిని సాధించాయి. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రుణ వృద్ధి 12–20 శాతంగానే ఉంది. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో సంస్థ లోన్‌బుక్‌ రూ.2.92 లక్షల కోట్లకు చేరింది. యూకో బ్యాంక్‌ లోన్‌బుక్‌ 20 శాతం పెరిగి రూ.2.34 లక్షల కోట్లకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లోన్‌బుక్‌ సైతం 18.90 శాతం పెరిగి రూ.3.45 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇక మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకుల నిర్వహణ లాభం (కేటాయింపులకు ముందు) 9.1 శాతం, నికర లాభం 11.9 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా.

Advertisement
Advertisement
Advertisement