ప్రధాన వార్తలు
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
బంగారం మరోసారి ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్ క్లబ్’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్ ఆపరేషన్లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.
బంగారం భారీ ధరలకు అదే కారణం..
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్ సెప్టెంబర్లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్లో ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి.
తళుక్కుమనే ‘హ్యుందాయ్ ఎక్స్టర్ నైట్’.. ధర ఎంతంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త 2026 ఎక్స్టర్ నైట్ ఎడిషన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్లాక్-థీమ్ డిజైన్, స్పోర్టీ రెడ్ యాక్సెంట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ మైక్రో ఎస్యూవీ ధర రూ.8.14 లక్షల (ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. 2024లో తొలిసారి వచ్చిన ఎక్స్టర్ నైట్ ఎడిషన్కు కొనసాగింపుగా ఈ కొత్త వెర్షన్ను తీసుకొచ్చారు. కాగా, ఎక్స్టర్ ఇప్పటికే దేశంలో 2 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది.కొత్త ఎక్స్టర్ నైట్లో ప్రధాన ఆకర్షణ దాని నలుపు రంగు స్టైలింగ్. ముందు, వెనుక భాగాల్లో మ్యాట్ బ్లాక్ ఎక్స్టర్, హ్యుందాయ్ లోగోలు, డార్క్ గ్రే బంపర్లు, సైడ్ సిల్ గార్నిష్లు ఉన్నాయి. 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్కు ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు జత చేశారు. ప్రత్యేకమైన ‘Knight’ ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఈ మార్పులతో సాధారణ ఎక్స్టర్తో పోలిస్తే వాహనానికి మరింత బోల్డ్, స్పోర్టీ లుక్ వచ్చింది.క్యాబిన్లోనూ ఇదే డార్క్ థీమ్ను కొనసాగించారు. బ్రాస్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ప్రత్యేకమైన బ్లాక్ సెమీ-ఫ్యాబ్రిక్ సీట్లు, అంబర్ ఫుట్వెల్ లైటింగ్, బ్లాక్ డి-కట్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. మొత్తంగా బయట నలుపు, లోపల నలుపు రంగుల కలయికకు స్పోర్టీ టచ్ ఇచ్చారు.ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్జీ వెర్షన్లో 69 పీఎస్ పవర్, 95.2 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. సీఎన్జీ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే వస్తుంది.భద్రత విషయంలో 2026 ఎక్స్టర్కు 6 ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు స్టాండర్డ్గా ఉన్నాయి. కొత్త ఎక్స్టర్లో డ్యాష్క్యామ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి టెక్నాలజీ ఫీచర్లను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.ధర విషయానికి వస్తే.. 2026 హ్యుందాయ్ ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.14 లక్షలు (ఎక్స్షోరూమ్). ఎక్స్టర్ నైట్ శ్రేణి ప్రధానంగా HX6లోని పెట్రోల్, సీఎన్జీ ఎంపికలతో పాటు HX10 పెట్రోల్-ఏఎంటీ వేరియంట్లో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్పై నైట్ ఎడిషన్కు బ్లాక్ ఎక్స్టీరియర్, ప్రత్యేక ఇంటీరియర్ కోసం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 2026లో హ్యుందాయ్ ఎక్స్టర్ను అప్డేట్ చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్స్టర్ ధరలు వేరియంట్ను బట్టి మారుతున్నాయి.
ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంక్షేమం, సంరక్షణ, సంరక్షకులకు మద్దతు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞాన మార్పిడిని మరింత విస్తరించేందుకు వంతారా పలు కార్యక్రమాలను ప్రకటించింది. పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ప్రయాణం గౌరి అనే ఏనుగును రక్షించడంతో ప్రారంభమై ప్రస్తుతం 260కుపైగా ఆసియా ఏనుగులకు ప్రత్యేక సంరక్షణ అందిస్తోంది.హాథీ గావ్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రంరాజస్థాన్లోని జైపూర్ హాథీ గావ్లో ఏనుగుల సంరక్షణ, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వంతారా, రాజస్థాన్ అటవీ శాఖతో కలిసి పనిచేయనుంది. ఇందులో ఆధునిక ఏనుగుల ఆసుపత్రి, పోషకాహార కేంద్రం, హైడ్రోథెరపీ సదుపాయాలతో కూడిన చికిత్స–సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వృద్ధ ఏనుగుల కోసం ప్రత్యేక రిటైర్మెంట్ అండ్ కేర్ సెంటర్ను కూడా అభివృద్ధి చేయనున్నారు.182 ఏనుగులకు వైద్య, సంక్షేమ సేవలుఅస్సాం, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, అండమాన్–నికోబార్ దీవుల్లోని ఎనిమిది ప్రాంతాల్లో వంతారా ఇటీవల భారీ ఏనుగుల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అటవీ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 182 ఏనుగులకు ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించగా, 242 మంది మహౌత్లకు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల ఆరోగ్యం, మానవీయంగా నిర్వహించడం, ప్రథమ చికిత్స, మస్ట్హ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించారు. వెటర్నరీ, సంక్షేమ కిట్లతో పాటు పోషకాహార సహాయాన్ని కూడా అందించారు.పిల్లల్లో కరుణ పెంచేందుకు ‘మై ఫ్రెండ్ లీలావతి’పిల్లల్లో ఏనుగుల పట్ల ప్రేమ, కరుణ, బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు వంతారా ‘మై ఫ్రెండ్ లీలావతి’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. చిన్నతనంలో తల్లి నుంచి వేరై సర్కస్లో సంవత్సరాలు గడిపిన లీలావతి, సర్కస్ టెంట్లో అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర గాయాలకు గురైంది. ప్రస్తుతం వంతారాలో సంరక్షణ పొందుతున్న లీలావతి కథ ఆధారంగా పిల్లలకు పజిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేతలకు లీలావతి గిఫ్ట్ హ్యాంపర్తో పాటు వంతారాను సందర్శించి ఆ ఏనుగును, సంరక్షకుడిని కలిసే అవకాశం కల్పించనున్నారు.మానవ–ఏనుగు ఘర్షణలపై అంతర్జాతీయ సహకారంమనుషులకు, ఏనుగులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ (EPI) ఫౌండేషన్కు వంతారా గ్రాంట్ అందిస్తోంది. 2027 మార్చిలో బ్యాంకాక్లో జరిగే గ్లోబల్ హ్యూమన్–ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ హ్యూమన్–వైల్డ్లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్ సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల నిపుణులు, సంరక్షణ కార్యకర్తలు, యువ ప్రతినిధుల భాగస్వామ్యానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.ఆసియా ఏనుగుల పరిధిలోని మొత్తం 13 దేశాల ప్రతినిధులతో పాటు ఆఫ్రికాలోని కనీసం ఐదు దేశాల ప్రతినిధులు, యువ సంరక్షణ కార్యకర్తలకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభించనుంది. భారత్లో తొలిసారిగా EPI యూత్ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది.అత్యవసర సేవలకు ఆధునిక సాంకేతికతక్షేత్ర స్థాయిలో మానవ–ఏనుగు ఘర్షణలను ఎదుర్కొనేందుకు వంతారా ర్యాపిడ్ రెస్పాన్స్ వెటర్నరీ బృందాలను, థర్మల్ డ్రోన్ నిఘాను, స్థానిక సమాజాలతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గాయపడిన ఏనుగులకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు మనుషులు, ఏనుగులు పరస్పర సహజీవనం సాగించేలా దీర్ఘకాలిక చర్యలను చేపడుతోంది.ఈ సందర్భంగా వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ప్రతి ఏనుగుకు ప్రత్యేకమైన కథ ఉంటుందని, వాటి సంక్షేమం పట్ల బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గౌరి రక్షణతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు అనేక ఏనుగుల సంక్షేమం, సంరక్షకులకు మద్దతు, విజ్ఞాన మార్పిడి, అంతర్జాతీయ పరిరక్షణ కార్యక్రమాల వరకు విస్తరించిందని పేర్కొన్నారు.
రీచార్జ్ షాక్.. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు ఇకపై అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్యాక్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా రూ.299 ప్లాన్ తొలగింపు వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందించే ఈ ప్లాన్కు బదులుగా ఇప్పుడు రూ.349 ప్యాక్ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఇతర సాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే గతంలో రూ.299 చెల్లించిన వినియోగదారుడు ఇప్పుడు అదే తరహా నెలవారీ రీచార్జ్ కోసం కనీసం రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సుమారు 16.7 శాతం పెరుగుదలకు సమానం.మధ్యస్థ ధరల విభాగంలోనూ ఎయిర్టెల్ కొన్ని ఎంపికలను తగ్గించింది. రూ.579, రూ.619, రూ.649 ప్యాక్లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ధరల వద్ద రీచార్జ్ చేసుకునే అవకాశం కస్టమర్లకు తగ్గింది. తాజా నివేదికల ప్రకారం, కొన్ని సర్కిళ్లలో మరికొన్ని ప్లాన్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి వినియోగదారుడి ఎయిర్టెల్ నంబర్, సర్కిల్ను బట్టి ప్రస్తుతం కనిపించే ప్లాన్లు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది.ఈ పరిణామాన్ని సాధారణ టారిఫ్ పెంపుగా కాకుండా, ఎంపిక చేసిన ధరల విభాగాల్లో ప్లాన్లను పునర్వ్యవస్థీకరించే చర్యగా చూడవచ్చు. చౌకైన ప్యాక్లను తొలగించి తదుపరి ధరల ప్లాన్ల వైపు కస్టమర్లను మళ్లించడం ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం కంపెనీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
క్యాబ్, ఆటో డ్రైవర్లకు కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే లైసెన్స్పై వేటు!
మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్లో మార్పులు చేసింది. ఈ నిబంధనలను ఆగస్టు 16, 2026 నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇప్పటికే ప్రకటించారు.కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులతో ప్రాథమికంగా మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు సరిపడే స్థాయిలో డ్రైవర్కు మరాఠీపై పరిజ్ఞానం ఉండాలి. ఈ నిబంధన కేవలం డ్రైవర్లకే కాకుండా సంబంధిత పర్మిట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుంది. మోటార్ వెహికల్స్ రూల్స్లోని 4, 22, 78, 85 నిబంధనలకు చేసిన సవరణల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని లైసెన్స్, పర్మిట్కు సంబంధించిన నిబంధనల్లోకి తీసుకొచ్చారు.పాటించకపోతే ఏమవుతుంది?మరాఠీలో కనీస స్థాయి సంభాషణ కూడా చేయలేని డ్రైవర్కు ముందుగా నెల రోజుల గడువు ఇచ్చే విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ గడువులోనూ అవసరమైన భాషా పరిజ్ఞానం సాధించకపోతే డ్రైవింగ్ అనుమతిని మూడు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ లేదా సంబంధిత బ్యాడ్జ్ను రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వేలాది మందికి శిక్షణఈ నిబంధన అమలుకు ముందు ప్రభుత్వం డ్రైవర్లకు మరాఠీ నేర్పేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. హిందూహృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మరాఠీ శిక్వాణీ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు నెలల ఫంక్షనల్ మరాఠీ శిక్షణ పూర్తి చేసినట్లు ఆగస్టు 7న వెల్లడైంది.అంతకుముందు మే 1 నుంచే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, డ్రైవర్లకు భాష నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 15 వరకు 100 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఆర్టీవోలు, డిప్యూటీ ఆర్టీవోల పరిధిలో తనిఖీలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
కార్పొరేట్
ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు
రూ. 50 లక్షలు, 15 ఏళ్ల కష్టం, కెనడాలో మాస్టర్స్ : చివరకు మిగిలింది!
కుళ్ళిన మటన్, చెడిపోయిన పండ్లు, మాడిన నూనె : మంత్రి సంచలన ప్రకటన
నిబంధనలు గాలికి,అపరిశుభ్రత : జెప్టోకు భారీ షాక్
యూపీ ప్రభుత్వం గోమూత్రం కొనుగోలు
ఐటీ ఉద్యోగులకు గట్టి షాక్
జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...!
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా!
గాల్లోనే నిలిచిపోయిన ఇంజిన్
టాటా సన్స్లో నాయకత్వ సంక్షోభం
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
సెన్సెక్స్ 304 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ...
ఫ్లాట్గా సూచీలు! నిఫ్టీ తదుపరి టార్గెట్ ఎంతంటే?
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో త...
ఇథనాల్ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం కోత?
దేశీయంగా రికార్డు స్థాయికి చేరిన చక్కెర ధరలకు అడ్డ...
కేంద్రానికి పసిడి పంట
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను పెంచుతూ ప...
మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..
విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక అక్కడే స్థిరపడ...
పొలాల్లో తగలేసే గడ్డి కాదిది.. కోట్లు కురిపించే నిధి!
దేశంలో ఇప్పటివరకు కేవలం పర్యావరణ సమస్యగా, పొలాల్లో...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో రీచార్జ్: ఇవి టెన్షన్ లేని మంత్లీ ప్లాన్లు!
ప్రతి నెలా మొబైల్ రీచార్జ్ పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లాన్లు 28 రోజుల వాలిడిటీతోనే ఉంటాయి. అయితే నెలనెలా రీచార్జ్ చేసుకునే వారికి రిలయన్స్ జియోకు చెందిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉపయోగకరంగా ఉన్నాయి. రూ.319, రూ.339 ధరలతో లభించే ఈ ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందుతాయి. ముఖ్యంగా వీటికి నెలవారీ సర్వీస్ వాలిడిటీ ఉండటం ప్రత్యేకత. అంటే ప్రతి 28 రోజులకు ఒకసారి రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.రూ.319 ప్లాన్.. ఏం లభిస్తాయంటే?జియో రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితోపాటు 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్ విలువ రూ.35,100గా కంపెనీ పేర్కొంటోంది. 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే రోజువారీ డేటా పరిమితి 1.5 జీబీ కావడంతో అదనపు 5జీ డేటా ప్రయోజనం ఇందులో లేదు. జియో టీవీ, జియో ఏఐ లౌడ్ వంటి సేవలు కూడా బండిల్గా వస్తాయి.రూ.339 ప్లాన్.. అదనంగా టాక్టైమ్రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్లోనూ రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనికి కూడా నెలవారీ వాలిడిటీ ఉంటుంది. రూ.319 ప్లాన్తో పోలిస్తే ఇందులో రూ.14.95 విలువైన టాక్టైమ్ అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్లోనూ గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్, జియో టీవీ, జియో ఏఐ లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే 5జీ డేటా ప్రత్యేకంగా అందుబాటులో ఉండదు.ఈ రెండు ప్లాన్లు దేశవ్యాప్తంగా అన్ని జియో టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు మైజియో యాప్ ద్వారా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. తరచూ రీచార్జ్ గడువు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నెలవారీ వాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి.
పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్!
విమానాశ్రయాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, ముఖ్యంగా హోటళ్లలో లభించే పబ్లిక్ వైఫై నెట్వర్క్లను వినియోగిస్తున్నారా? అయితే మీ వ్యక్తిగత, అధికారిక డేటా ప్రమాదంలో ఉన్నట్లేనని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది. ప్రయాణికులు, కార్పొరేట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని 'స్టార్మ్-2945' (రష్యా ఆధారిత 'మిడ్నైట్ బ్లిజార్డ్' సమూహం) అనే హ్యాకర్ల ముఠా 'క్యాప్టివ్క్రంచ్' పేరిట ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం బహిర్గతం చేసింది.దాడి ఎలా జరుగుతుంది?మనం హోటల్ లేదా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యే సమయంలో కనిపించే 'క్యాప్టివ్ పోర్టల్' (లాగిన్ స్క్రీన్) ఆధారిత నెట్వర్క్ వ్యవస్థలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. యూజర్లు నెట్వర్క్లో లాగిన్ కాగానే నకిలీ మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ పేజీలు లేదా విండోస్ అప్డేట్, డిఫెండర్ సెక్యూరిటీ స్కాన్, బ్రౌజర్ అప్డేట్ చేసుకోమంటూ నకిలీ పాప్అప్లను చూపిస్తున్నారు. యూజర్లు వీటిని నిజమైనవిగా భావించి క్లిక్ చేయగానే 'కార్న్ఫ్లేక్', 'చోకోషెల్' వంటి మాల్వేర్లు డివైజ్లోకి ప్రవేశిస్తాయి.వచ్చే ముప్పులు-నష్టాలుఈ మాల్వేర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల కంప్యూటర్లు, మొబైళ్లపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. బ్రౌజర్లో సేవ్ చేసిన పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, బ్రౌజర్ కుకీలు, మైక్రోసాఫ్ట్ 365 ఖాతాల యాక్సెస్ను దొంగలిస్తారు. దీనికితోడు పరికరం మైక్రోఫోన్, కెమెరాలను రహస్యంగా ఆన్ చేసి ఆడియో, వీడియోలను రికార్డ్ చేయడం, స్క్రీన్షాట్లు తీయడం వంటి అక్రమాలకు ఒడిగడుతున్నారు.పాటించాల్సిన సురక్షిత చర్యలుప్రయాణాల్లో ఉన్నప్పుడు నమ్మదగని, తెలియని హోటల్ వైఫై కంటే సొంత మొబైల్ డేటా/హాట్స్పాట్ లేదా ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను ఉపయోగించడమే అత్యంత సురక్షితం.వైఫై కనెక్ట్ అయ్యే సమయంలో సాఫ్ట్వేర్, బ్రౌజర్ లేదా సిస్టమ్ అప్డేట్ చేయమంటూ వచ్చే పాప్అప్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.సైబర్ ముప్పులను నివారించడానికి సురక్షిత వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్), మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) ఫీచర్లను ఆన్లో ఉంచుకోవాలి.పబ్లిక్ నెట్వర్క్లు ఏ క్షణమైనా ప్రమాదకరంగా మారవచ్చని, డిజిటల్ భద్రత పట్ల ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్..
భారీ జీతం పెంపు వస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఓ టెక్ ఉద్యోగికి మాత్రం 100 శాతం జీతం పెరిగినా సంతోషం కంటే ఉద్యోగ భద్రతపై భయమే ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ‘ఎక్స్’ పోస్టు ప్రకారం.. ఓ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ పెంపు కంపెనీలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ పోస్టు ప్రకారం.. కంపెనీలో సాధారణంగా జూన్లో ఉద్యోగుల పనితీరు మదింపు, జీతాల పెంపు ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం 150 మంది ఉద్యోగుల్లో 50 మందిని కంపెనీ తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులు తమకు ఇంక ఎలాంటి జీతాల పెంపు ఉండదని భావించారట. ‘‘కనీసం ఉద్యోగం మిగిలింది.. అదే చాలు’’ అనే పరిస్థితికి వచ్చారని పోస్టు పేర్కొంది.అయితే, అదే సమయంలో ఓ ఉద్యోగికి మాత్రం ఊహించని ఈమెయిల్ వచ్చింది. ప్రమోషన్తో పాటు ఏకంగా 100 శాతం జీతం పెంపు ప్రకటించినట్లు పోస్టులో ఉంది. దీంతో అతని వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది.ఈ భారీ పెంపునకు కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉద్యోగి వారాంతంలో స్వయంగా రూపొందించిన ఓ చిన్న AI చాట్బాట్ ఆ సంస్థకు గణనీయమైన విలువను తీసుకొచ్చినట్లు వైరల్ పోస్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతని సామర్థ్యాన్ని కంపెనీ గుర్తించి భారీగా పరిహారం పెంచినట్లు చెబుతోంది. అయితే, మేనేజర్ ఈ పెంపు సంస్థలోనే అత్యధికమైన వాటిలో ఒకటని చెప్పడంతో పాటు, తన జీతం గురించి ఇతర ఉద్యోగులతో మాట్లాడవద్దని సూచించినట్లు పోస్టులో ఉంది.అయితే ఇక్కడే ఉద్యోగికి ఆందోళన మొదలైంది. ఇప్పటికే కంపెనీ 50 మందిని తొలగించిన పరిస్థితిలో తన జీతం రెట్టింపు కావడం భవిష్యత్తులో తన ఉద్యోగానికి ప్రమాదంగా మారుతుందా? మరోసారి తొలగింపులు జరిగితే అధిక ప్యాకేజీ కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుందా? అనే సందేహాలు అతడిని వెంటాడుతున్నట్లు పోస్టు తెలిపింది.ముఖ్యంగా సిస్టమ్ డిజైన్ వంటి అంశాల్లో తనకు నైపుణ్యం ఉన్నప్పటికీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) అంటే తనకు ఇష్టం లేదని, అదే సమయంలో రూ.50 లక్షల ప్యాకేజీ స్థాయి ఉద్యోగాలకు మారాలంటే ఇంటర్వ్యూల్లో డీఎస్ఏ నైపుణ్యాలు అవసరమవుతాయా అనే ఆందోళన కూడా అతడికి ఉందట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగి ప్రస్తుత కంపెనీని వదిలి వెళ్లాలని అసలు కోరుకోవడం లేదు. తన మేనేజర్ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్తో పాటు తన ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడుతున్నానని చెప్పినట్లు పోస్టులో ఉంది. అందుకే అతని అసలు ప్రశ్న ‘ఇప్పుడే ఉద్యోగం మారాలా?’ అనేది కాదు.. ‘రేపు ఉద్యోగం పోతే మరో అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ అనేదే.ఈ కథనంపై సోషల్ మీడియాలోనూ భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపును గొప్ప అవకాశంగా అభివర్ణించగా, మరికొందరు ఉద్యోగ భద్రత, నైపుణ్యాల అప్డేట్, అత్యవసర పొదుపులపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదిలా ఉంటే, 2026లో టెక్ ఉద్యోగ మార్కెట్లో అధిక వేతనాలపై ఆకర్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.25 లక్షల ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఓ భారతీయ టెకీ.. తిరిగి వచ్చాక వందలాది దరఖాస్తులు చేసినా కేవలం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయని, రూ.40–50 లక్షల ప్యాకేజీ ఆశించిన చోట రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్లు మాత్రమే లభించాయని వెల్లడించాడు.The company doubled a guy’s salary to ₹50 LPAbut instead of just happiness, the hike brought a whole new fear. Every year, appraisals happened in june. This time, instead of appraisals, the company suddenly laid off around 50 out of 150 employees.Those of them who…— Pooja (@poojaofficial5) August 8, 2026
ఒక్క రోజులో పెరగనున్న ఐఫోన్ ధర?
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్ ధరలను ఆగస్టు 10 అంటే సోమవారం నుంచే పెంచే అవకాశం ఉందని తాజా లీక్ వెల్లడించింది. చైనీస్ సోషల్ మీడియాలో ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ (Fixed Focus Digital) అనే టెక్ లీకర్ చేసిన పోస్టు ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే ధర ఎంత పెరుగుతుంది, ఏ మోడళ్లకు వర్తిస్తుంది అనే వివరాలను లీకర్ వెల్లడించలేదు. అయితే యాపిల్ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ వార్తకు ప్రధాన కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల విస్తరణతో మెమరీ చిప్లకు డిమాండ్ పెరగడం, సరఫరాపై ఒత్తిడి ఏర్పడటం వల్ల హార్డ్వేర్ తయారీ వ్యయాలు పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే యాపిల్ ఉత్పత్తులపై కనిపించింది. జూన్లో కంపెనీ భారత్లో మ్యాక్బుక్, ఐపాడ్ తదితర ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లలో పెంపు రూ.1 లక్ష వరకు వెళ్లింది.అయితే ఆ ధరల పెంపు సమయంలో ఐఫోన్ ధరలు మాత్రం పెంచలేదు. అందుకే ఇప్పుడు ఐఫోన్ 17పై కూడా ధరల భారం పడుతుందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. యాపిల్ గతంలో పెరిగిన కాంపోనెంట్ వ్యయాలను కొంతకాలం భరించినప్పటికీ, మెమరీ ధరల పెరుగుదల తీవ్రంగా మారడంతో వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వివరణ ఇచ్చింది.ఐఫోన్ 17కు ఎక్కువ కాలం డిమాండ్?ఇక 2026లో యాపిల్ ఐఫోన్ లాంచ్ వ్యూహంలో మార్పులు చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఐఫోన్ 18 Pro, ఐఫోన్ 18 Pro Max, అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ సెప్టెంబర్లో రావచ్చని సమాచారం. అదే సమయంలో సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడళ్లను 2027 రెండో త్రైమాసికానికి వాయిదా వేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.అది నిజమైతే ఐఫోన్ 17 సాధారణం కంటే ఎక్కువ కాలం యాపిల్ లైనప్లో కొనసాగాల్సి ఉంటుంది. దీంతో కొత్త Pro మోడళ్లు వచ్చిన తర్వాత కూడా సాధారణ ధర శ్రేణిలో ఐఫోన్ 17కు డిమాండ్ కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ధరల పెంపు జరిగితే, ప్రస్తుత ఐఫోన్ 17 కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు 10 కీలక తేదీగా మారే అవకాశం ఉంది.అన్ని ఐఫోన్ 17 మోడళ్ల ధరలు పెరుగుతాయా?ప్రస్తుత లీక్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఐఫోన్ 17 Pro, Pro Max ధరలు పెంచితే, వాటి తర్వాతి తరం మోడళ్లు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఆ నిర్ణయం యాపిల్కు కొంత సంక్లిష్టంగా మారవచ్చు. కాబట్టి యాపిల్ అధికారిక ధరల జాబితాను విడుదల చేసే వరకు ఎదురుచూడక తప్పదు.
పర్సనల్ ఫైనాన్స్
న్యూ ఫండ్ ఆఫర్స్: ఇన్వెస్కో నుంచి రెండు ఫండ్స్
ఇన్వెస్కో ఇండియా రెండు న్యూ ఫండ్ ఆఫర్స్ని ప్రకటించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ వీటిలో ఉన్నాయి. ఇవి ఆగస్టు 11తో ముగుస్తాయి. అభిషేక్ బాహినిపతి వీటికి ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు. తక్కువ ట్రాకింగ్ ఎర్రర్స్కి లోబడి దేశీయంగా కీలకమైన లార్జ్ క్యాప్, బ్యాంకింగ్ రంగాల్లో తక్కువ వ్యయాలతో ప్యాసివ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి.దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధితో ముడిపడి ఉన్న సెన్సెక్స్లోని 30 దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు బీఎస్ఈ సెన్సెక్స్ ఈటీఎఫ్ ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవహారాలకు కీలకంగా నిల్చే దిగ్గజ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ సహాయకరంగా ఉంటుంది. ఎన్ఎఫ్వో వ్యవధిలో కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట చేయొచ్చు. కోటక్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఎఫ్వోఎఫ్కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ సంస్థ కొత్తగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో ఆగస్టు 19తో ముగుస్తుంది. ఇది వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా యాక్టివ్, ప్యాసివ్ ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకే సాధనంతో పెట్టుబడుల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కల్పించడం, తద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి తోడ్పడటం దీని లక్ష్యం. ఇందులో కనీసం రూ. 1,000 నుంచి, సిప్ విధానంలో రూ. 500 నుంచి (కనీసం రెండు ఇన్స్టాల్మెంట్లు) ఇన్వెస్ట్ చేయొచ్చు.
ITR-4: లెక్కలు లేకున్నా.. సక్రమంగా రిటర్నులు
ఈ వారం ఫారం 4 గురించి తెలుసుకుందాం. ‘లెక్కలు’ అనగానే వ్యాపారం/వృత్తులకు వర్తిస్తాయి. జీతాలు, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతర ఆదాయాలు.. వీటిలో దేనికి దానికే ప్రత్యేకంగా, చట్టపరంగా బుక్స్ రాయాలి. ఆదాయం పన్ను చట్టంలో ‘అకౌంటు బుక్స్’.. అంటే, ఏమిటో నిర్వచనం ఇచ్చారు. దీని ప్రకారం బుక్స్ని నిర్వహించండి. కొంత టర్నోవరు, వసూళ్లు దాటితే ఆడిట్ చేయాలి. కానీ, ఒక మినహాయింపు ఇచ్చారు. మీరు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ వైపే వెళ్లక్కర్లేదు.ఫారం ఐటీఆర్ – 4 అంటే ఏమిటి.. 🔷 వ్యక్తులు/హిందూ ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థలు 🔷 రెసిడెంట్లు అయి ఉండాలి 🔷 సంవత్సరంలో ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు 🔷 పాత చట్టం ప్రకారం 44 ఏడీ, 44ఏడీఏ, 44 ఏఈల వ్యాపారం ఉండాలి. 🔷 వ్యాపారం/వృత్తి ఆదాయంతో పాటు జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, వ్యవసాయం ఆదాయం రూ. 5,000 లోపల, నిర్దేశించిన ఇతర ఆదాయాలు 🔷 నాన్–రెసిడెంట్లు, రూ. 50,00,000 ఆదాయం దాటినవారు, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ వారు, లాంగ్టర్మ్లో రూ. 1,25,000 దాటిన వారు, కంపెనీ డైరెక్టర్లు, రెండు ఇళ్ల మీద ఆదాయం ఉన్నవారు, లాటరీ ఆదాయం ఉన్నవారు.. వీళ్లంతా ఈ ఫారం వేయకూడదు.44ఏడీఏ అంటే ఎవరు.. వృత్తి నిపుణులు – లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్.. వీరందరూ, వారి టర్నోవరు/వసూళ్లు.. సంవత్సరానికి రూ. 50,00,000 దాటకపోతే.. వ్యవహారాల్లో 5 శాతం లోపల నగదు లావాదేవీలు జరిపితే రూ. 75,00,000 దాటకపోతే, వీరు 50 శాతం ఆదాయంగా చూపించాలి.44 ఏడీ అంటే ఎవరు.. పై సెక్షన్ వృత్తి నిపుణులకు వర్తిస్తే, ఈ సెక్షన్ వ్యాపారస్తులకు, టర్నోవరు/వసూళ్లు రూ. 2 కోట్లు దాటకూడదు. 5 శాతం నగదు వ్యవహారాలు దాటకుండా ఉంటే రూ. 3 కోట్లు. వీరు ఈ టర్నోవరుపైన 6 శాతం చొప్పున లాభం ప్రకటించాలి. 6 శాతం దాటి చూపినా ఫర్వాలేదు. కానీ 6 శాతం కన్నా తక్కువ చూపిస్తే బుక్స్ రాసి ఆడిట్ చేయించాలి. ఇదంతా బ్యాంకింగ్ చానల్. నగదు వ్యవహారాలైతే 8 శాతం చొప్పున చూపించాలి.44ఏఈ ఎవరంటే.. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకే వర్తిస్తుంది. సొంతంగా గానీ.. అద్దెకు గానీ, లీజుగా గానీ కేవలం 10 వాహనాలు లేదా తక్కువ ఉండాలి. ప్యాసింజరు బళ్లకు వర్తించదు. హెవీ వెహికల్ అయితే, ఒక టన్నుకి రూ. 1,000. ఇతర వెహికల్ అయితే ఒక బండికి రూ. 7,500.పైన చెప్పిన మూడు రకాలవారికి 🔷 బుక్స్ అవసరం లేదు 🔷 ఆడిట్ అవసరం లేదు 🔷 వ్యాపార ఖర్చులు మినహాయింపు 🔷 పాత పద్ధతిలో అయితే 80సీ మొదలైన తగ్గింపులుంటాయిఅయితే ముఖ్యమైన విషయం 🔷 ఇతర రికార్డులు, వ్యాపారానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్లు మొదలైనవన్నీ ఉండాలి. 🔷 జీఎస్టీ రికార్డులు ఉండాలి 🔷 బ్యాంకు అకౌంటు బుక్స్ ఉండాలి 🔷 బిల్లులు, ఇన్వాయిస్లు, వసూళ్లకు సంబంధించి రికార్డులు ఉండాలి 🔷 లాగ్ బుక్స్ ఉండాలికొన్ని పరిమితులు/ఆంక్షలు ఉన్నాయి. అవి దాటలేదని నిర్ధారించడానికి అవసరమైన రికార్డులుంటే లెక్కలు లేకుండానే, సక్రమంగా రిటర్నులు వేయొచ్చు.
పోర్ట్ఫోలియోకి స్థిరత్వం, వృద్ధికి దన్ను
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే విషయంలో ‘పెట్టుబడి పెట్టాలా వద్దా’ అని కాకుండా .. ‘ఎందులో పెట్టాలి’ అనేదే అత్యంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా చాలాకాలంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరత్వానికి, నిలకడైన వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ, పోర్ట్ఫోలియోలకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు, మిడ్ క్యాప్ స్టాక్స్.. కార్పొరేట్ రంగ తదుపరి వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ రెండింటికీ పోర్ట్ఫోలియోల్లో స్థానం ఉంటున్నప్పటికీ, వీటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం చెప్పినంత ఈజీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ డేటా ప్రకారం ’లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్’ కేటగిరీలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2025 జూన్లో రూ. 3,497 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2026 జూన్ నాటికి 24 శాతం పెరిగి రూ. 4,321 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఫక్తు లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి పెట్టుబడులు ఒక మోస్తరుగానే వృద్ధి చెంది రూ. 2,067 కోట్లు వచ్చాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనే డైవర్సిఫికేషన్ ద్వారా మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం అలాగే లిక్విడిటీ ప్రయోజనాలను కూడా పొందాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఇది తెలియజేస్తోంది. ఈ కేటగిరీకి ఎందుకింత ప్రాధాన్యత.. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే విధానంలోనే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ తమ దగ్గరున్న నిధుల్లో కనీసం 35 శాతాన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో, మరో 35 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా భాగాన్ని ఫండ్ మేనేజర్ తన విచక్షణకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ విధానం వల్ల రెండు విభాగాల్లోనూ ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం ఉండటమే కాకుండా, అధిక లాభాలకు ఆస్కారమున్న సాధనానికి కేటాయింపులను పెంచేందుకు వీలుంటుంది. డబుల్ ప్రయోజనాలు.. సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలకు నిరూపితమైన వ్యాపార మోడల్స్, పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఉండటం వల్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పోర్ట్ఫోలియోకి ఇవి కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇక మిడ్ క్యాప్ కంపెనీలను చూస్తే ఇవి చిన్న సంస్థలకంటే మెరుగైన వృద్ధి దశలో ఉండి, ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి చేరుకోనివై ఉంటాయి. వ్యాపార విస్తరణ, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని అందిస్తాయి.అయితే, దీనికి తగ్గట్లుగానే వీటిలో రిస్క్లు, ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండింటి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్లు ఆకర్షణీయమైన విలువకే లభిస్తుండగా, మిడ్ క్యాప్లు మరింత మెరుగైన రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒకే పోర్ట్ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలనూ పొందవచ్చు. నిబంధనలకు ప్రాధాన్యత.. ఈ కేటగిరీ కేవలం విభిన్న క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయికగా మాత్రమే కాకుండా, పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడమో లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది.లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ కంపెనీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉండేలా చూడటం ద్వారా ఇలాంటి ఆలోచనా ధోరణుల వల్ల, ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా, ఈ ఫండ్ నిర్మాణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఏది ఎప్పుడు మెరుగ్గా రాణిస్తుందో అనేది అంచనాలు వేసుకోవాల్సిన పని ఇన్వెస్టర్లకు ఉండదు. పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ రెండూ ఉంటాయి కాబట్టి, మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా సమయాల్లో లభించే అవకాశాలను ఇది అందిపుచ్చుకుంటుంది. ఎవరికి అనుకూలం..? ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను కోరుకుంటున్నా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ ఫండ్లను విడివిడిగా కొనుగోలు చేసి నిర్వహించుకోవడానికి బదులుగా, స్థిరత్వం అలాగే వృద్ధి రెండింటినీ ఒకే ఫండ్ ద్వారా పొందాలనుకునే కొత్త ఇన్వెస్టర్లకు ఇది సరైన ఎంపిక. ఇప్పటికే లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, స్మాల్ క్యాప్స్లో రిస్కుల బారిన పడకుండా, అధిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగిరీ ఫండ్స్ ఇటు లార్జ్ క్యాప్స్, అటు మిడ్ క్యాప్స్కి అర్థవంతంగా పెట్టుబడులు కేటాయిస్తూనే, కొంత మేర స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలను సమతూకంతో అందించే ప్రయత్నం చేస్తాయి. వేర్వేరు ఫండ్లలో పెట్టుబడులు పెట్టి వాటిని తరచూ రీబ్యాలెన్స్ చేసే శ్రమ లేకుండా, ఒకే ఈక్విటీ ఫండ్ తమ పోర్ట్ఫోలియోకి ప్రధాన ఆధారంగా ఉండాలని కోరుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా.. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలనూ తీర్చలేదు. అయితే, లార్జ్ అండ్ మిడ్–క్యాప్ ఫండ్లు నిరూపితమైన పెద్ద కంపెనీల స్థిరత్వాన్ని, ఎదుగుతున్న కంపెనీల వృద్ధి సామర్థ్యాలని ఒక నియమావళికి లోబడి ఇన్వెస్టర్లకు అందిస్తాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ ఫండ్స్లోకి పెరిగిన నిధులను చూస్తే, ఇన్వెస్టర్లు కేవలం ఒకే రకమైన మార్కెట్–క్యాప్పై ఆధారపడకుండా స్థిరత్వంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. పెట్టుబడుల కేటాయింపుల్లో క్రియాశీలకంగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు స్థిరత్వం అటు వృద్ధి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో సందర్భంలో రాణిస్తుంది. తదుపరి రాణించబోయే సెగ్మెంట్ గురించి అంచనాలు వేసుకంటూ, ఊహాగానాల్లో ఉండిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడులను కొనసాగించిన వారికే ప్రయోజనాలు దక్కుతాయనేది గుర్తుంచుకోవాలి. ఇందుకోసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ క్రమశిక్షణతో కూడుకున్న విధానంగా ఉపయోగపడతాయి.
EMI లాక్: కోటక్ బ్యాంక్ హైబ్రిడ్ హోమ్ లోన్
న్యూఢిల్లీ: గృహ రుణాల ఈఎంఐల భారం విషయంలో రుణగ్రహీతలకు స్పష్టత ఉండే విధంగా ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్తగా హైబ్రిడ్ హోమ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో వడ్డీ రేటు 65 నెలల వరకు స్థిరంగా ఉండేలా లాక్ చేసుకునేందుకు వీలవుతుంది. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐల భారం విషంయలో కొంత వెసులుబాటు పొందేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.ఈ పథకం కింద 39, 52 లేదా 65 నెలల వరకు ఈఎంఐని లాక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫలితంగా కీలకమైన రెపో రేట్లు మారినా ఆ ప్రభావం వాయిదాలపై ఉండదని తెలిపింది. ఉదాహరణకు ఇటీవల వడ్డీ రేట్ల పెరుగుదల ధోరణులను చూస్తే, ఈ పథకం కింద రూ. 1 కోటి గృహ రుణం తీసుకున్న వారికి కనీసం రూ. 3.46 లక్షల వరకు ఆదా అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటు 7.6% నుంచి ప్రారంభమవుతోంది.


