Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Robert Kiyosaki Buying Gold Dollar warning1
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు

బంగారం మరోసారి ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్‌ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్‌ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.తన ‘రిచ్‌ డాడ్‌’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్‌ క్లబ్‌’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్‌ ఆపరేషన్‌లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.

Gold Price Today US Inflation Boosts Gold Hyderabad Rates Rise2
బంగారం భారీ ధరలకు అదే కారణం..

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్‌లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్‌ సెప్టెంబర్‌లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్‌లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్‌ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్‌ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్‌లో ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్‌మార్క్‌ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్‌ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్‌ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి.

Hyundai Exter Knight edition launched at Rs 8 14 lakh3
తళుక్కుమనే ‘హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్’.. ధర ఎంతంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త 2026 ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్లాక్-థీమ్ డిజైన్, స్పోర్టీ రెడ్ యాక్సెంట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ మైక్రో ఎస్‌యూవీ ధర రూ.8.14 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. 2024లో తొలిసారి వచ్చిన ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చారు. కాగా, ఎక్స్‌టర్ ఇప్పటికే దేశంలో 2 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది.కొత్త ఎక్స్‌టర్ నైట్‌లో ప్రధాన ఆకర్షణ దాని నలుపు రంగు స్టైలింగ్. ముందు, వెనుక భాగాల్లో మ్యాట్ బ్లాక్ ఎక్స్‌టర్, హ్యుందాయ్ లోగోలు, డార్క్ గ్రే బంపర్లు, సైడ్ సిల్ గార్నిష్‌లు ఉన్నాయి. 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌కు ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు జత చేశారు. ప్రత్యేకమైన ‘Knight’ ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఈ మార్పులతో సాధారణ ఎక్స్‌టర్‌తో పోలిస్తే వాహనానికి మరింత బోల్డ్, స్పోర్టీ లుక్‌ వచ్చింది.క్యాబిన్‌లోనూ ఇదే డార్క్ థీమ్‌ను కొనసాగించారు. బ్రాస్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ప్రత్యేకమైన బ్లాక్ సెమీ-ఫ్యాబ్రిక్ సీట్లు, అంబర్ ఫుట్‌వెల్ లైటింగ్, బ్లాక్ డి-కట్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. మొత్తంగా బయట నలుపు, లోపల నలుపు రంగుల కలయికకు స్పోర్టీ టచ్ ఇచ్చారు.ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వెర్షన్‌లో 69 పీఎస్ పవర్, 95.2 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.భద్రత విషయంలో 2026 ఎక్స్‌టర్‌కు 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. కొత్త ఎక్స్‌టర్‌లో డ్యాష్‌క్యామ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి టెక్నాలజీ ఫీచర్లను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.ధర విషయానికి వస్తే.. 2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.14 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఎక్స్‌టర్ నైట్ శ్రేణి ప్రధానంగా HX6లోని పెట్రోల్, సీఎన్‌జీ ఎంపికలతో పాటు HX10 పెట్రోల్-ఏఎంటీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్‌పై నైట్ ఎడిషన్‌కు బ్లాక్ ఎక్స్‌టీరియర్, ప్రత్యేక ఇంటీరియర్ కోసం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 2026లో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను అప్‌డేట్ చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్స్‌టర్ ధరలు వేరియంట్‌ను బట్టి మారుతున్నాయి.

WORLD ELEPHANT DAY VANTARA ELEPHANT WELFARE OUTREACH INDIA GLOBALLY4
ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంక్షేమం, సంరక్షణ, సంరక్షకులకు మద్దతు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞాన మార్పిడిని మరింత విస్తరించేందుకు వంతారా పలు కార్యక్రమాలను ప్రకటించింది. పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ప్రయాణం గౌరి అనే ఏనుగును రక్షించడంతో ప్రారంభమై ప్రస్తుతం 260కుపైగా ఆసియా ఏనుగులకు ప్రత్యేక సంరక్షణ అందిస్తోంది.హాథీ గావ్‌లో ప్రత్యేక సంరక్షణ కేంద్రంరాజస్థాన్‌లోని జైపూర్ హాథీ గావ్‌లో ఏనుగుల సంరక్షణ, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వంతారా, రాజస్థాన్ అటవీ శాఖతో కలిసి పనిచేయనుంది. ఇందులో ఆధునిక ఏనుగుల ఆసుపత్రి, పోషకాహార కేంద్రం, హైడ్రోథెరపీ సదుపాయాలతో కూడిన చికిత్స–సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వృద్ధ ఏనుగుల కోసం ప్రత్యేక రిటైర్మెంట్ అండ్ కేర్ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు.182 ఏనుగులకు వైద్య, సంక్షేమ సేవలుఅస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, అండమాన్‌–నికోబార్ దీవుల్లోని ఎనిమిది ప్రాంతాల్లో వంతారా ఇటీవల భారీ ఏనుగుల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అటవీ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 182 ఏనుగులకు ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించగా, 242 మంది మహౌత్‌లకు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల ఆరోగ్యం, మానవీయంగా నిర్వహించడం, ప్రథమ చికిత్స, మస్ట్‌హ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించారు. వెటర్నరీ, సంక్షేమ కిట్లతో పాటు పోషకాహార సహాయాన్ని కూడా అందించారు.పిల్లల్లో కరుణ పెంచేందుకు ‘మై ఫ్రెండ్ లీలావతి’పిల్లల్లో ఏనుగుల పట్ల ప్రేమ, కరుణ, బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు వంతారా ‘మై ఫ్రెండ్ లీలావతి’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. చిన్నతనంలో తల్లి నుంచి వేరై సర్కస్‌లో సంవత్సరాలు గడిపిన లీలావతి, సర్కస్ టెంట్‌లో అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర గాయాలకు గురైంది. ప్రస్తుతం వంతారాలో సంరక్షణ పొందుతున్న లీలావతి కథ ఆధారంగా పిల్లలకు పజిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేతలకు లీలావతి గిఫ్ట్ హ్యాంపర్‌తో పాటు వంతారాను సందర్శించి ఆ ఏనుగును, సంరక్షకుడిని కలిసే అవకాశం కల్పించనున్నారు.మానవ–ఏనుగు ఘర్షణలపై అంతర్జాతీయ సహకారంమనుషులకు, ఏనుగులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ (EPI) ఫౌండేషన్‌కు వంతారా గ్రాంట్ అందిస్తోంది. 2027 మార్చిలో బ్యాంకాక్‌లో జరిగే గ్లోబల్ హ్యూమన్–ఎలిఫెంట్ కాన్‌ఫ్లిక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ హ్యూమన్–వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్ సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల నిపుణులు, సంరక్షణ కార్యకర్తలు, యువ ప్రతినిధుల భాగస్వామ్యానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.ఆసియా ఏనుగుల పరిధిలోని మొత్తం 13 దేశాల ప్రతినిధులతో పాటు ఆఫ్రికాలోని కనీసం ఐదు దేశాల ప్రతినిధులు, యువ సంరక్షణ కార్యకర్తలకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభించనుంది. భారత్‌లో తొలిసారిగా EPI యూత్ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది.అత్యవసర సేవలకు ఆధునిక సాంకేతికతక్షేత్ర స్థాయిలో మానవ–ఏనుగు ఘర్షణలను ఎదుర్కొనేందుకు వంతారా ర్యాపిడ్ రెస్పాన్స్ వెటర్నరీ బృందాలను, థర్మల్ డ్రోన్ నిఘాను, స్థానిక సమాజాలతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గాయపడిన ఏనుగులకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు మనుషులు, ఏనుగులు పరస్పర సహజీవనం సాగించేలా దీర్ఘకాలిక చర్యలను చేపడుతోంది.ఈ సందర్భంగా వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ప్రతి ఏనుగుకు ప్రత్యేకమైన కథ ఉంటుందని, వాటి సంక్షేమం పట్ల బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గౌరి రక్షణతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు అనేక ఏనుగుల సంక్షేమం, సంరక్షకులకు మద్దతు, విజ్ఞాన మార్పిడి, అంతర్జాతీయ పరిరక్షణ కార్యక్రమాల వరకు విస్తరించిందని పేర్కొన్నారు.

Airtel Recharge Shock 4 Prepaid Plans Discontinued5
రీచార్జ్‌ షాక్‌.. నాలుగు ప్రీపెయిడ్‌ ప్లాన్లు తొలగింపు

ప్రీపెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు భారతి ఎయిర్‌టెల్‌ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు ఇకపై అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్యాక్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా రూ.299 ప్లాన్‌ తొలగింపు వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించే ఈ ప్లాన్‌కు బదులుగా ఇప్పుడు రూ.349 ప్యాక్‌ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఇతర సాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే గతంలో రూ.299 చెల్లించిన వినియోగదారుడు ఇప్పుడు అదే తరహా నెలవారీ రీచార్జ్‌ కోసం కనీసం రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సుమారు 16.7 శాతం పెరుగుదలకు సమానం.మధ్యస్థ ధరల విభాగంలోనూ ఎయిర్‌టెల్‌ కొన్ని ఎంపికలను తగ్గించింది. రూ.579, రూ.619, రూ.649 ప్యాక్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ధరల వద్ద రీచార్జ్‌ చేసుకునే అవకాశం కస్టమర్లకు తగ్గింది. తాజా నివేదికల ప్రకారం, కొన్ని సర్కిళ్లలో మరికొన్ని ప్లాన్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి వినియోగదారుడి ఎయిర్‌టెల్‌ నంబర్‌, సర్కిల్‌ను బట్టి ప్రస్తుతం కనిపించే ప్లాన్లు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది.ఈ పరిణామాన్ని సాధారణ టారిఫ్‌ పెంపుగా కాకుండా, ఎంపిక చేసిన ధరల విభాగాల్లో ప్లాన్లను పునర్వ్యవస్థీకరించే చర్యగా చూడవచ్చు. చౌకైన ప్యాక్‌లను తొలగించి తదుపరి ధరల ప్లాన్‌ల వైపు కస్టమర్లను మళ్లించడం ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం కంపెనీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Maharashtra Marathi Mandatory Auto Taxi Cab Drivers August 166
క్యాబ్, ఆటో డ్రైవర్లకు కొత్త రూల్స్‌.. ఉల్లంఘిస్తే లైసెన్స్‌పై వేటు!

మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్‌లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఈ నిబంధనలను ఆగస్టు 16, 2026 నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఇప్పటికే ప్రకటించారు.కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులతో ప్రాథమికంగా మాట్లాడేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు సరిపడే స్థాయిలో డ్రైవర్‌కు మరాఠీపై పరిజ్ఞానం ఉండాలి. ఈ నిబంధన కేవలం డ్రైవర్లకే కాకుండా సంబంధిత పర్మిట్ హోల్డర్లకు కూడా వర్తిస్తుంది. మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని 4, 22, 78, 85 నిబంధనలకు చేసిన సవరణల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని లైసెన్స్, పర్మిట్‌కు సంబంధించిన నిబంధనల్లోకి తీసుకొచ్చారు.పాటించకపోతే ఏమవుతుంది?మరాఠీలో కనీస స్థాయి సంభాషణ కూడా చేయలేని డ్రైవర్‌కు ముందుగా నెల రోజుల గడువు ఇచ్చే విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ గడువులోనూ అవసరమైన భాషా పరిజ్ఞానం సాధించకపోతే డ్రైవింగ్ అనుమతిని మూడు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ లేదా సంబంధిత బ్యాడ్జ్‌ను రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వేలాది మందికి శిక్షణఈ నిబంధన అమలుకు ముందు ప్రభుత్వం డ్రైవర్లకు మరాఠీ నేర్పేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. హిందూహృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మరాఠీ శిక్వాణీ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు నెలల ఫంక్షనల్ మరాఠీ శిక్షణ పూర్తి చేసినట్లు ఆగస్టు 7న వెల్లడైంది.అంతకుముందు మే 1 నుంచే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, డ్రైవర్లకు భాష నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 15 వరకు 100 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలంలో రాష్ట్రంలోని ఆర్‌టీవోలు, డిప్యూటీ ఆర్‌టీవోల పరిధిలో తనిఖీలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement
Advertisement
Advertisement