Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Reliance Consumer Products Partners with Fazer to Introduce Premium Chocolates in India1
భారత్‌కు ఫిన్లాండ్‌ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్‌

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కి చెందిన ఆహారోత్పత్తుల దిగ్గజం ఫేజర్‌తో రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫేజర్‌ ప్రీమియం చాక్లెట్లను భారత్‌లో ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలను ఆర్‌సీపీఎల్‌ చేపట్టనుంది. ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ భారత పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.పోలాండ్, చైనా తదితర 40 పైగా దేశాలకు ఫేజర్‌ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్‌సీపీఎల్‌ సంస్థ టాఫీమ్యాన్, పాన్‌ పసంద్, లోటస్‌ చాక్లెట్స్‌లాంటి పలు దేశీ బ్రాండ్లను పునరుద్ధరించింది. అలాగే మాలిబాన్, నెక్స్‌బా, పేస్‌లాంటి గ్లోబల్‌ బ్రాండ్స్‌ని కూడా ప్రవేశపెట్టింది.

Financial Literacy Can Accelerate Womens Wealth Creation in India2
ఇన్వెస్ట్‌ చేస్తేనే ఇంకా ముందుకు..

దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం ఎల్‌ఎక్స్‌ఎంఈ ఫౌండర్‌ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్‌ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.చాలా మంది బంగారం, నగదు, చిట్‌ఫండ్స్‌పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్‌ఎక్స్‌ఎంఈ–ఈవై ఉమెన్స్‌ ఫైనాన్షియల్‌ ప్రాస్పరిటీ ఇండెక్స్‌ (2026) అధ్యయనం ప్రకారం భారత్‌కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు.

Gold prices drop in 7 days in India check latest rates3
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!

పసిడి ప్రియులకు గడిచిన వారమంతా ఆనందమే కలిగింది. దేశంలో బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా ధరలు పడిపోవడంతో పసిడి కొనే వారికి భారీ ఊరట లభించింది. గత వారంలో, అంటే మార్చి 2 నుంచి మార్చి 8 వరకు దాదాపు వారమంతా పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి. ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు కూడా ఒత్తిడికి గురయ్యాయి, దీంతో స్థానికంగా కూడా ధరలు పడిపోయాయి.ధరలు దిగొచ్చాయిలా..హైదరాబాద్‌, విశాఖ పట్నం సహా తెలుగు రాష్ట్రాలలో గత వారం బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.. మార్చి 2న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,70,510 ఉండగా మార్చి 8 నాటికి రూ.1,63,640 లకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మార్చి 2న రూ. 1,56,300 ఉండగా మార్చి 8 నాటికి రూ.1,50,000 లకు క్షీణించింది.అంటే వారం మొత్తంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,300 తగ్గుదలను నమోదు చేసింది. ఈ వారంలో ధరలు రోజుకు రోజూ తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో భారీ తగ్గుదల నమోదైంది. తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నా మొత్తంగా వారం అంతా క్షీణతే కనిపించింది. మార్చి 8న మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి.బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుఅంతర్జాతీయంగా బంగారం ధరలు మార్చి ప్రారంభంలో రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి (ఔన్స్‌కు సుమారు 5,400 డాలర్ల పైన). కానీ తర్వాత అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, మిడిల్ ఈస్ట్ ఘర్షణల నేపథ్యంలో ఇన్‌ఫ్లేషన్ భయాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాల మార్పు వల్ల సేఫ్-హెవెన్ డిమాండ్ తగ్గింది. ఇది బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చింది. అలాగే, కొన్ని రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్, స్పెక్యులేటివ్ సెల్లింగ్ కూడా జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Centre Extends Export Obligation Deadline to Support Exporters Amid West Asia Crisis4
కాంపోజిషన్‌ ఫీజు ఉండదు.. ఎగుమతిదారులకు కేంద్రం ఊరట

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 31 మధ్య ముగిసిపోయే ఎక్స్‌పోర్ట్‌ ఆబ్లిగేషన్‌ (ఈవో) వ్యవధిని ఆటోమేటిక్‌గా ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) వెల్లడించింది. ఇందుకోసం కాంపోజిషన్‌ ఫీజు ఉండదని పేర్కొంది.సాధారణంగా ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ (ఈపీసీజీ) స్కీము కింద దేశీ సంస్థలు సుంకాల రహితంగా మెషిన్లను దిగుమతి చేసుకోవచ్చు. అయితే, దానికి ప్రతిగా నిర్దిష్ట వ్యవధిలో ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. అమెరికా టారిఫ్‌లతో సతమతమవుతుండగా ఇటు పశ్చిమాసియాలో సంక్షోభం కూడా తోడు కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎగుమతిదారులు ఈ విషయంలో వెసులుబాటునివ్వాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. పోర్టుల్లో వెసులుబాటు.. ఎగుమతి సంస్థలకు మద్దతుగా నిల్చేలా కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, జలమార్గాల శాఖ నిర్ణయాలు తీసుకుంది. స్టోరేజి అద్దెలు, నౌకలను మార్చుకోవడానికి సంబంధించిన చార్జీలు మొదలైన వాటిని తగ్గించాలని లేదా మినహాయింపునివ్వాలని యూజర్ల నుంచి వచ్చే అభ్యర్ధనలను పరిస్థితిని బట్టి పరిగణనలోకి తీసుకోవాలని పోర్టులకు సూచించింది. పశ్చిమాసియా నుంచి వచ్చే పెరిషబుల్‌ కార్గో (ఎక్కువ కాలం నిల్వ ఉండని ఉత్పత్తుల)కి ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.అలాగే పోర్టుల్లో సమస్యలేవైనా తలెత్తితే సంప్రదించేందుకు నిర్దిష్టంగా నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఆ అధికారి సదరు సమస్యలను ఆయా విభాగాల దృష్టికి తీసుకెళ్లి 24–72 గంటల్లోగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) ప్రకారం పోర్ట్‌ చైర్‌పర్సన్లు తరచుగా షిప్పింగ్‌ లైన్స్, ఎగుమతిదారులు, కస్టమ్స్, టర్మినల్‌ ఆపరేటర్లు మొదలైన వర్గాలతో సమావేశమై, పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలని తెలిపింది.

West Asia Conflict Puts 11 8 Billion of Indias Farm Exports at Risk5
వ్యవసాయ ఎగుమతులకు యుద్ధం సెగ

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) వెల్లడించింది. జలరవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్‌కి సంబంధించి అనిశ్చితితో దాదాపు 11.8 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు రిస్క్‌లు నెలకొన్నాయని పేర్కొంది.భౌగోళికంగా భారత్‌కి దగ్గరగా ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండటంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్‌గా నిలుస్తోందని జీటీఆర్‌ఐ పేర్కొంది. 2025లో పశ్చిమాసియాకు భారత్‌ దాదాపు 11.8 బిలియన్‌ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8 శాతంగా నిల్చింది. వీటిలో 7.48 బిలియన్‌ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్లు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్‌ ఎగుమతి చేస్తోంది. ‘అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడొచ్చు. పశ్చిమాసియాకు భారత్‌ 4.43 బిలియన్‌ డాలర్ల బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7 శాతం. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలకు గల్ఫ్‌ దేశాలు కీలక మార్కెట్‌గా ఉంటున్నాయి‘ అని జీటీఆర్‌ఐ ఫౌండర్‌ అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్‌ రూట్లలో ఆటంకాలు ఏర్పడి, బీమా వ్యయాలు పెరిగిపోయి ఎగుమతిదారులకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్‌ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. గత దశాబ్దకాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్‌పై భారత్‌ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డెయిరీ ఉత్పత్తులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. 2025లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్‌ తదితర గల్ఫ్‌ దేశాలకు 396.5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే అరటిపళ్లు, 111 మిలియన్‌ డాలర్ల ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి. యాలకులు, జాజికాయలాంటివి (295.5 మిలియన్‌ డాలర్లు), జీలకర్ర–ధనియాల్లాంటివి (163 మిలియన్‌ డాలర్లు), అల్లం–పసుపు (173 మిలియన్‌ డాలర్లు), కాఫీ (240.7 మిలియన్‌ డాలర్లు), టీ (410.1 మిలియన్‌ డాలర్లు), ప్రాసెస్డ్‌ ఫుడ్, షుగర్‌ తదితరాలు (1.35 బిలియన్‌ డాలర్లు), చేపలు, మాంసం, ఫ్రోజెన్‌–ప్రాసెస్డ్‌ ఉత్పత్తులు (1.81 బిలియన్‌ డాలర్లు) మొదలైనవి ఎక్స్‌పోర్ట్‌ అవుతున్నాయి. 281.1 మిలియన్‌ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్‌ నుంచి మొత్తం డెయిరీ ఎగుమతుల్లో 28.9 శాతం. 197.5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఆల్కహాలిక్, నాన్‌–ఆల్కహాలిక్‌ పానీయాలను పశ్చిమాసియాకి భారత్‌ ఎగుమతి చేసింది.

Only 20pc of Women in India Have Adequate Health Insurance Coverage6
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..

దేశీయంగా బీమా కవరేజీ ఉన్న జనాభాలో మహిళల వాటా 47 శాతంగా ఉన్నప్పటికీ, వారికి ఆరోగ్య బీమా కవరేజీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేవలం 20 శాతం మంది మహిళలకు మాత్రమే తగినంత కవరేజీ ఉంటోందని టాటాఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వెల్లడించింది.కార్డియాక్, క్యాన్సర్‌లాంటి తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయాలకు సాధారణంగా రూ. 20 లక్షలకు పైగా కవరేజీ అవసరమవుతోందని పేర్కొంది. కానీ 80 శాతం మందికి ఆ స్థాయిలో బీమా ఉండటం లేదని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కార్డియాక్‌ రిసు్కలు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయని 34 శాతం మంది కార్డియాలజిస్టులు వివరించినట్లు తెలిపింది.అయితే, మహిళల్లో వ్యాధి లక్షణాలను చాలా సందర్భాల్లో సకాలంలో గుర్తించకపోవడం లేదా తప్పుగా నిర్ధారించడం వల్ల చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంటోందని సంస్థ తెలిపింది. ఇక చికిత్స వ్యయాల విషయానికొస్తే.. నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ (2021–22) గణాంకాల ప్రకారం 39.4 శాతం ఖర్చులు జేబునుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది.ఆరోగ్య బీమా తీసుకోవడం పెరుగుతున్నప్పటికీ దాన్ని కొనసాగించకపోవడం, తక్కువ కవరేజీ తీసుకోవడంలాంటి ధోరణులను బట్టి చూస్తే చాలా మటుకు మహిళలకు తగినంత కవరేజీ ఉండటం లేదనే విషయం తెలుస్తోందని కంపెనీ హెడ్‌ (కన్జూమర్‌ బిజినెస్‌ క్లెయిమ్స్‌) రాజగోపాల్‌ రుద్రరాజు తెలిపారు.మహిళల్లో క్యాన్సర్, తీవ్ర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సన్నద్ధత గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. తగినంత కవరేజీ తీసుకోవడం, ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టడం అవసరమని వివరించారు.

Advertisement
Advertisement
Advertisement