Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Uday Kotak Conferred Padma Bhushan by Government of India1
కోటక్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ ఉదయ్ కోటక్‌కు పద్మభూషణ్

భారత ప్రభుత్వం పద్మ పురస్కాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరానికి అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, వైద్యం, విద్య, ప్రజాసేవ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో విశిష్ట, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఈ అవార్డులతో సత్కరిస్తారు.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు అవార్డులు పొందినవారి పేర్లను ప్రకటించారు. పద్మ అవార్డులు భారత రత్న తర్వాత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. వీటిని పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ఇస్తారు. 2026 సంవత్సరానికి 131 పద్మ అవార్డులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.ఉదయ్ కోటక్‌కు పద్మభూషణ్పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్‌ ఉదయ్ కోటక్‌కు దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ను భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ దాస్ ఆఫ్‌షోర్ లిమిటెడ్ ఫౌండర్‌, ఎండీ అశోక్ ఖాడే, టీటీకే గ్రూప్ చైర్మన్ (ఎమెరిటస్) టీటీ జగన్నాథన్‌లకు పద్మశ్రీ పురస్కారాల జాబితాలో చోటు దక్కింది. దేశీయ ప్రఖ్యాత వంటసామాను బ్రాండ్లలో ఒకటిగా ప్రెస్టీజ్‌ను తీర్చిదిద్దిన టీటీ జగన్నాథన్ గతేడాది అక్టోబర్‌లో మరణించారు.

Jio Monthly Plan Offers Data OTT YouTube Premium All in One2
జియో మంత్లీ రీచార్జ్‌.. ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్‌!

మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఎక్కువ ప్రయోజనాలున్న మంచి నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. రిలయన్స్ జియో ఇటీవల ‘హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్’ పేరుతో రూ.500 ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్‌తో డేటా, అపరిమిత కాలింగ్, అలాగే ఉచిత యూట్యూబ్ ప్రీమియం సహా అనేక ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.జియో రూ.500 ప్లాన్ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ .500. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 56 జీబీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.ఈ ప్లాన్ లో అనేక ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు ఇవే..యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్ (టీవీ/మొబైల్), సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్‌, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్.. ఈ సబ్‌స్క్రిప్షన్‌లన్నీ ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తాయి.ఈ ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియో హోమ్ 2 నెలల ఉచిత ట్రయల్, జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ స్టోరేజ్ కూడా కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్ లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది.

Is Gold Stored in Bank Lockers Truly Safe Know RBI rules3
రూ.లక్షల బంగారం.. లాకర్‌లో సేఫేనా?

ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్‌లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్‌లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్‌కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్‌కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్‌లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్‌లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్‌లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.

Infosys Asks WFH Employees to Share Electricity Bill Details4
ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్‌..

హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ప్రయత్నాల్లో భాగంగా, ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులను వారి ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను పంచుకోవాలని కోరుతోంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా నుంచి ఉద్యోగులకు ఒక అంతర్గత ఈమెయిల్ వెళ్లింది.అందులో కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విద్యుత్ వినియోగ సర్వేను పరిచయం చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ సర్వే హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే పరికరాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ ప్రయత్నమని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.“హైబ్రిడ్ పని విధానం మన కార్యకలాపాల్లో భాగమవడంతో, మన పర్యావరణ ప్రభావం ఇక కేవలం క్యాంపస్‌లకే పరిమితం కాదు. అది ఉద్యోగుల ఇళ్ల వరకూ విస్తరించింది. ఇంటి నుంచి పని చేసే సమయంలో వినియోగించే విద్యుత్తు కూడా ఇన్ఫోసిస్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుంది. మన నివేదికలను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు, ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ విద్యుత్ వినియోగంపై సరైన డేటా అవసరం” అని సంఘరాజ్కా వివరించారు.ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ఉద్యోగులున్న ఇన్ఫోసిస్‌లో, ఎక్కువ మంది హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తున్నారు. ఈ విధానం ప్రకారం, ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయానికి హాజరుకావాలి. గత 15 సంవత్సరాలుగా సంస్థ తన స్థిరత్వ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించుకుంటూ వస్తూ, పర్యావరణ లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారిస్తోంది.పరికరాల వివరాలూ ఇవ్వాలిఈ సర్వేలో ఉద్యోగులను కేవలం విద్యుత్ వినియోగ వివరాలే కాకుండా, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే కంప్యూటర్లు, లైటింగ్, ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాల వివరాలు కూడా ఇవ్వాలని కోరుతోంది. అలాగే లైట్ల వాటేజీ, ఇంట్లో సౌర విద్యుత్ వినియోగం ఉందా లేదా వంటి అంశాలపై కూడా సమాచారం అందించాలని సూచించింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులు ఇళ్లలో శక్తి సమర్థవంతమైన చర్యలను అనుసరించాలని ప్రోత్సహిస్తోంది.

H-1B Visa Shock for Indian Techies Stamping Interviews Pushed to 2027 5
H-1B visa: ఇండియన్‌ టెకీలకు షాక్‌.. ఇంటర్వ్యూలు ఇంకా లేటు!

అమెరికా హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తుదారులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా, తాజా పరిణామాలతో అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ ఐటీ వృత్తి నిపుణులపై తీవ్రంగా పడనుంది.భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్‌లాగ్‌లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో, ఇప్పటికే ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు 18 నెలలు వెనక్కి నెట్టి 2027 మధ్యకాలానికి మార్చినట్లు సమాచారం.వాస్తవానికి 2025 డిసెంబర్‌లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్‌మెంట్లను 2026కి మార్చారు. అనంతరం అవి 2026 అక్టోబర్‌కి, ఇప్పుడు నేరుగా 2027కి వాయిదా పడడం వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 2027 వరకు రెగ్యులర్ అపాయింట్‌మెంట్లు లేవని ‘అమెరికన్ బజార్’ కూడా వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు కూడా రద్దయ్యాయని సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్‌మెంట్లు ఉన్నవారికి సైతం తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయిస్తూ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది.ఉద్యోగాలు, కుటుంబాలపై తీవ్ర ప్రభావంఈ జాప్యం వల్ల వేలాది మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయారు. కొందరి భార్యా పిల్లలు అమెరికాలో ఉండగా, వారు మాత్రం భారత్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, వీసా గడువు పొడిగింపుల విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన ఉద్యోగులకు కొన్ని సంస్థలు పొడిగింపులు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

HCLTech to Acquire Singapore Based Finergy Solutions6
సింగపూర్‌ ఐటీ కంపెనీని కొంటున్న హెచ్‌సీఎల్‌ టెక్‌

దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ తాజాగా సింగపూర్‌కి చెందిన ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్‌ సంస్థ ఫినర్జిక్‌ సొల్యూషన్స్‌ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 19 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లను (సుమారు రూ. 136 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సేవల విభాగంలో, ముఖ్యంగా కోర్‌ బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ తెలిపింది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఒప్పందం పూర్తి కాగలదని వివరించింది. 2019లో ప్రారంభమైన ఫినర్జిక్‌కి భారత్, సింగపూర్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో కంపెనీ 12.6 మిలియన్‌ సింగపూర్‌ డాలర్ల ఆదాయం ఆర్జించింది.హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫినర్జిక్‌ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కోర్‌ బ్యాంకింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో డిజిటల్‌ పరిష్కారాలపై డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఫినర్జిక్‌ వద్ద ఉన్న డొమైన్‌ నైపుణ్యం, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం హెచ్‌సీఎల్‌ టెక్‌కు ఉపయోగపడనుంది. ముఖ్యంగా యూరప్‌, సింగపూర్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలపర్చుకునే అవకాశం ఈ డీల్‌ ద్వారా లభించనుంది.ఈ కొనుగోలుతో హెచ్‌సీఎల్‌ టెక్‌ తన బ్యాంకింగ్‌ క్లయింట్లకు మరింత సమగ్ర సేవలను అందించగలదు. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు కొత్త సేవలను అందించే క్రాస్‌-సెల్లింగ్‌ అవకాశాలు పెరగడంతో పాటు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో ఆదాయ వృద్ధికి ఇది దోహదపడనుంది. ఐటీ సేవల కంపెనీలు డొమైన్‌ ఆధారిత సంస్థలను కొనుగోలు చేసి విలువ పెంచుకునే ధోరణిలో భాగంగానే ఈ డీల్‌ను మార్కెట్‌ వర్గాలు చూస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement