Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Petrol Pump Count Crosses 1 Lakh1
పెట్రోల్‌ బంకులు @ 1,00,000

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌ బంక్‌లు నవంబర్‌ చివరికి 1,00,266 మార్క్‌ను చేరాయి. 2015లో ఉన్న 50,451 స్టేషన్ల నుంచి చూస్తే రెట్టింపైనట్టు ప్రభుత్వ డేటా తెలియజేస్తోంది. యూఎస్, చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో పెట్రోల్‌ బంక్‌లు మనదేశంలో ఉండడం గమనార్హం. పీఎస్‌యూ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌) మార్కెట్‌ వాటాను కాపాడుకునేందుకు విస్తరణ చేపడుతుండడంతో మారుమూల ప్రాంతాలకు సైతం పెట్రోల్‌ స్టేషన్లు చేరుతున్నాయి. మొత్తం పెట్రోల్‌ పంపుల్లో 90% ఈ 3 సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. ఐవోసీ నిర్వహణలో 41,664 స్టేషన్లు ఉంటే, బీపీసీఎల్‌కు 24,605, హెచ్‌పీసీఎల్‌కు 24,118 స్టేషన్లున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 29% ఉన్నాయి. రష్యా రోజ్‌నెఫ్ట్‌కు చెందిన ‘నయారా ఎనర్జీ’ 6,921 పెట్రోల్‌ అవుట్‌లెట్లతో ప్రైవేటు రంగంలో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత రిలయన్స్‌–బీపీ జేవీలో 2,114 స్టేషన్లు, షెల్‌ నిర్వహణలో 346 స్టేషన్లు ఉన్నాయి. మొదటిసారి 2004లో ప్రైవేటు రంగంలో పెట్రోల్‌ స్టేషన్ల ఏర్పాటయ్యాయి. యూఎస్‌లో 1,96,643 రిటైల్‌ గ్యాస్‌ స్టేషన్లు, చైనాలో 1,15,228 గ్యాస్‌ స్టేషన్లు ఉన్నట్టు అంచనా.

Samsung bets on AI, local manufacturing and easy finance to drive growth2
లిస్టింగ్‌కు శాంసంగ్‌ నో 

న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టింగ్‌ యోచన లేదని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ ఎల్రక్టానిక్స్‌ తాజాగా స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది. వివిధ ప్రొడక్టులలో ఏఐను మరింత వినియోగించనున్నట్లు పేర్కొంది. కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశీ మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకు వీలుగా కన్జూమర్‌ ఫైనాన్స్‌ విభాగాన్ని విస్తరించనున్నట్లు తెలియజేసింది. భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత లోతుగా విస్తరించే యోచనలో ఉన్నట్లు శాంసంగ్‌ నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్‌ తెలియజేశారు. దేశీయంగా మొబైల్‌ ఫోన్‌ డిస్‌ప్లేల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(పీఎల్‌ఐ) దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలోనే మొబైల్‌ ఫోన్‌ తయారీకి నోయిడాలో అతిపెద్ద ప్లాంటును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది కీలక ఎగుమతుల కేంద్రంగా ఆవిర్భవించింది. కాగా.. దేశీయంగా ఐపీవో చేపట్టడంపై స్పందిస్తూ పార్క్‌ ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలులేవని స్పష్టం చేశారు. అయితే ఇతర దక్షిణ కొరియా దిగ్గజాలు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇటీవల పబ్లిక్‌ ఇష్యూతో నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. తద్వారా దేశీ కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు పార్క్‌ తెలియజేశారు. అవసరమైతే కార్పొరేట్‌ బాండ్ల జారీ లేదా సంస్థాగత రుణాలు తదితర మార్గాలలో నిధులు సమకూర్చుకోనున్నట్లు వివరించారు.

AI poses lower risk to white-collar jobs in India3
భారత్‌లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే

న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్‌ కాలర్‌ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్‌ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్‌ ఉందని చెప్పారు.

India IPO market has surpassed 100 listings for the first time4
2025లో అహో 2026లో ఒహో

ఈ కేలండర్‌ ఏడాది(2025) దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి ప్రైమరీ మార్కెట్లు లిస్టింగ్‌లతో సెంచరీ కొట్టాయి. మరోపక్క సెకండరీ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలను చేరడం ద్వారా చరిత్ర సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా రిటైలర్లు, దేశీ ఫండ్స్‌ కనీవినీ ఎరుగని రీతిలో చేపడుతున్న భారీ పెట్టుబడులు తోడ్పాటునిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాది(2026)లోనూ ప్రైమరీ మార్కెట్లు సుప్రసిద్ధ కంపెనీల ఐపీవోలతో కదం తొక్కేందుకు సిద్ధపడుతున్నాయి. వివరాలు చూద్దాం.. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 2025 జనవరి–డిసెంబర్‌ కాలంలో 103 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఇంతక్రితం ఎన్నడూలేని విధంగా రూ. 1.75 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. నిజానికి గతేడాది(2024)లోనూ ప్రైమరీ మార్కెట్లు సందడి చేశాయి. రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తదితర ఇష్యూలతో 91 కంపెనీలు రూ. 1,59,784 కోట్లు అందుకున్నాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ వివరాల ప్రకారం ఈ రికార్డును టాటా క్యాపిటల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ తదితరాల లిస్టింగ్‌తో 2025 అధిగమించింది. అయితే స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, డిజిటల్‌ సేవల దిగ్గజం రిలయన్స్‌ జియోసహా.. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, జెప్టో, ఓయో, బోట్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తదితరాలు ఐపీవోకు క్యూ కట్టడం ద్వారా 2026లోనూ ప్రైమరీ మార్కెట్లు దుమ్మురేపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 84 కంపెనీలకు సెబీ సై ఈ ఏడాదిలో మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్‌ 86,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. మరోపక్క ఇప్పటివరకూ 103 కంపెనీలు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించి లిస్ట్‌కావడం ద్వారా సరికొత్త రికార్డ్‌ నెలకొల్పాయి. ఈ బాటలో 2026 కొత్త ఇష్యూలతో మరింత కళకళలాడనుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే 84 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం సహకరించనుంది. తద్వారా రూ. 1.14 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు తెరలేవనుంది. మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుమించి మరో 108 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా రూ. 1.46 లక్షల కోట్ల నిధుల సమీకరణపై కన్నేశాయి. వెరసి 190 కంపెనీలు రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు అందుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి. కొన్నేళ్లుగా విదేశీ ఇన్వెస్టర్లకు మించి దేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తుండటం గమనార్హం! దీనికి కార్పొరేట్‌ పెట్టుబడులు సైతం జత కలుస్తుండటం విశేషమని విశ్లేషకులు తెలియజేశారు. కంపెనీలు విస్తరణ ప్రణాళికలు లేదా వృద్ధి ఆధారిత పెట్టుబడుల ప్రణాళికలు పక్కనపెట్టినప్పుడు ఆదాయ మార్గంగా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలలో అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. వెరసి విదేశీ పెట్టుబడులను దేశీ ఇన్వెస్టర్లు తోసిరాజంటున్నట్లు వివరించారు. పెట్టుబడుల విక్రయంఐపీవో ద్వారా పలు దిగ్గజాలు నిధుల సమీకరణ చేపడుతుండటం పెట్టుబడుల విక్రయానికి దారి చూపుతోంది. తొలి దశ ఇన్వెస్టర్లు లేదా ప్రమోటర్లు కొంత వాటా విక్రయించడం ద్వారా నిధుల సమీకరణతోపాటు పెట్టుబడులపై లాభాలను ఆర్జిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2025లో లిస్టయిన దిగ్గజాలను తీసుకుంటే.. ఉమ్మడిగా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీని పక్కనపెడితే ప్రమోటర్లు లేదా ముందస్తు ఇన్వెస్టర్లు రూ. 1.1 లక్షల కోట్లను అందుకున్నారు. టాటా క్యాపిటల్‌ ఐపీవోలో టాటా మోటార్స్‌(రూ. 15,512 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(రూ. 12,500 కోట్లు) భారీగా నిధులు సమకూర్చుకున్నాయి. ఇక ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ద్వారా యూకే భాగస్వామ్య సంస్థ రూ. 10,603 కోట్లు సమకూర్చుకుంది. ఈ బాటలో ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌(రూ. 11,607 కోట్లు), కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌(రూ. 290 కోట్లు)తో పాటు 2024లో స్విగ్గీ(రూ. 6,828 కోట్లు) అందుకోవడం ప్రస్తావించదగ్గ అంశం!--సాక్షి బిజినెస్ డిస్క్

Why Gold Silver And Copper Are All Surging Together5
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!

సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది.

Branchless Paperless Bank Accounts Gain Popularity in India6
బ్రాంచ్‌ లేని బ్యాంక్‌ అకౌంట్లు..

దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్‌ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్‌లెస్, బ్రాంచ్‌లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్‌లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement