Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Fitch Raises India GDP Growth To 7. 4 percent For Fy20261
భారత వృద్ధి 7.4 %

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచాలను పెంచుతున్నట్టు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. 2025–26లో 6.9 శాతం వృద్ధి నమోదుకావొచ్చన్న గత అంచనాను 7.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది ప్రైవేటు వినియోగం వృద్ధికి ప్రధాన చోదకంగా ఉన్నట్టు వివరించింది. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్‌టీ సంస్కరణలతో సెంటిమెంట్‌ మెరుగుపడినట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావడంతో ఆర్‌బీఐ డిసెంబర్‌ సమీక్షలో మరో పావు శాతం రెపో రేటును తగ్గించి, 5.25 శాతం చేయొచ్చని అంచనా వేసింది. 2025లో 100 బేసిస్‌ పాయింట్లు (ఒక శాతం) తగ్గింపునకు ఇది అదనమని పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) 7.8 శాతం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో (క్యూ2) 8.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావడంతో ఫిచ్‌ రేటింగ్స్‌ తన అంచనాలను సవరించినట్టయింది. కాకపోతే ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి రేటు కొంత నిదానించొచ్చని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్‌ జీడీపీ వృద్ధి 6.4 శాతానికి తగ్గుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఆర్థిక పరిస్థితులు సరళంగా మారితే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 0.3 శాతానికి తగ్గడం తెలిసిందే. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్‌టీ కింద 375 ఉత్పత్తులపై రేట్లు తగ్గడం ఇందుకు అనుకూలించింది.

Sanjay Jaju Said AI Having Major Impact on the Media and Entertainment Sector2
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!

కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్‌ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్‌బీ) శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్‌ టు మొబైల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్‌ పిక్చర్‌ సమిట్‌ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్‌ఈ) భవిష్యత్‌ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్‌ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు.

RBI will announce the bi monthly monetary policy on 5 december 20253
నేడే ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు 

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనుంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొందరు విశ్లేషకులు యథాతథ స్థితినే కొనసాగించొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది కొందరి విశ్లేషణగా ఉంది. ఈ అంచనాల నడుమ ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. సీఆర్‌ఆర్‌ను సైతం ఒక శాతం తగ్గించడంతో 3 శాతానికి దిగొచ్చింది.

Aggressive Hybrid MFs assets jump to 2. 5Lakh cr in October 20254
అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు డిమాండ్‌

న్యూఢిల్లీ: అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం చూపిస్తుండడంతో అక్టోబర్‌ చివరికి నాటికి అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.2.5 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది కాలంలో ఏయూఎం విలువ 13 శాతం పెరిగింది. 2024 అక్టోబర్‌ చివరికి వీటి విలువ రూ.2.21 లక్షల కోట్లుగా ఉంది. ఈక్విటీ సూచీలు ఏడాదికి పైగా దీర్ఘకాలం పాటు దిద్దుబాటును చవిచూసిన కాలంలో అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఆస్తులు పెరగడం అన్నది.. ఇన్వెస్టర్లు ఈక్విటీ, హైబ్రిడ్‌తో కలయిక ద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు స్థిరత్వానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఫోలియోలు ఏడాది కాలంలో 4 లక్షలు పెరిగి అక్టోబర్‌ చివరికి 60.44 లక్షలకు చేరాయి. 2024 అక్టోబర్‌ చివరికి ఇవి 56.41 లక్షలుగా ఉన్నాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే సంఖ్యను ఫోలియోగా చెబుతారు. ఇలా ఒకే ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన పథకాల్లో ఫోలియోలు ఉండొచ్చు. మెరుగైన రాబడులు అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ బలమైన రాబడులు ఇస్తుండడం కూడా ఇన్వెస్టర్లు వీటిల్లో మరింత పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విభాగం గత ఏడాది కాలంలో 7 శాతం చొప్పున సగటు రాబడినివ్వగా, రెండేళ్లలో 16.5 శాతం (వార్షిక) చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఐదేళ్ల కాలంలోనూ 17 శాతం రాబడినిచ్చాయి. రెండు, ఐదేళ్ల కాలాల్లో నిఫ్టీ 50 హైబ్రిడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 65:35 ఇండెక్స్‌ను అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ పనితీరు పరంగా అధిగమించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఈ విభాగంలో పనితీరు పరంగా ముందుంది. రెండేళ్లలో ఏటా 19.6 శాతం చొప్పున కాంపౌండెడ్‌ రాబడిని ఇచ్చింది. ఐదేళ్లో అయితే ఏటా 24.7 శాతం రాబడి తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మహీంద్రా మాన్యులైఫ్‌ అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ రెండేళ్ల కాలంలో ఏటా 19.3 శాతం, ఐదేళ్లలో ఏటా 20.4 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది. బంధన్, ఎడెల్‌వీజ్, ఇన్వెస్కో ఇండియా అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ సైతం రెండేళ్ల కాలంలో ఏటా 18–19% మధ్య, ఐదేళ్లలో ఏటా 16.5–19.9% మధ్య ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెట్‌ ఫండ్, మహీంద్రా మాన్యులైఫ్‌ అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ ఇక మీదటా దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపించగలవని విశ్లేషకుల అంచనా.భవిష్యత్తులో మరింత డిమాండ్‌.. ‘‘ఈక్విటీ–డెట్‌ కలయికతో ఉంటాయి కనుక రెండు విభాగాల నుంచి ఈ ఫండ్స్‌ ప్రయోజనం పొందుతాయి. బలమైన విభాగంగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈక్విటీ విభాగంలో హెచ్చుతగ్గులు ఉన్న కాలంలో డెట్‌ పెట్టుబడులు రాబడులకు రక్షణ కల్పిస్తాయి. ఈక్విటీ పెట్టుబడులు వృద్ధిని చూస్తున్న తరుణంలో మంచి రాబడులను సొంతం చేసుకుంటాయి. మధ్యస్థ లేదా తక్కువ రిస్క్ తో కూడిన ఇన్వెస్టర్లకు ఇవి ఎంతో అనుకూలం’’అని మావెనార్క్‌ వెల్త్‌ సీఈవో శంతను అవస్థి తెలిపారు. సెబీ నిబంధనల ప్రకారం అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మధ్య ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Retail investors dump over Rs 25,300 crore in two months5
రిటైల్‌ ఇన్వెస్టర్లు స్మార్ట్‌గురూ! 

ఈ కేలండర్‌ ఏడాది(2025) మార్చి మొదలు రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపట్ల కొంతమేర విముఖతను ప్రదర్శిస్తున్నారు. దీంతో అప్పుడప్పుడూ కొనుగోళ్లకు కట్టుబడినప్పటికీ అడపాదడపా విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇదే బాటలో గత రెండు నెలల్లో మరింత అధికంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ద్వారా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. కొద్ది నెలలుగా ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ కదులుతున్నాయి. ఇటీవలే ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 86,100 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 26,300ను అధిగమించాయి. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ హెచ్చుతగ్గుల మధ్య లాభాలు ఆర్జించాయి. అక్టోబర్‌లో ఇండెక్సులు 4.5 శాతం పుంజుకోగా.. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌(100) 5.8 శాతం, స్మాల్‌ క్యాప్‌(100) 4.7 శాతం చొప్పున ఎగశాయి. ఈ ప్రభావంతో నవంబర్‌లోనూ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ మరింత బలపడినప్పటికీ స్మాల్‌ క్యాప్‌ 3 శాతం క్షీణించింది. సరిగ్గా ఇదే సమయంలో అంటే గత రెండు నెలల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఉమ్మడిగా రూ. 23,405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఈ ట్రెండ్‌ ఇప్పటివరకూ 2025 పొడవునా కనిపించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అప్రమత్తతతో.. నిజానికి మార్కెట్లు బలపడుతున్నప్పుడు విక్రయాలకు ప్రాధాన్యమిస్తూ వచి్చన రిటైలర్లు దిద్దుబాటుకు లోనైనప్పుడు కొనుగోళ్లు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా దేశీ స్టాక్స్‌పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే మరోపక్క ఇదే సమయంలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(మ్యూచువల్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌) పెట్టుబడులను కొనసాగించడం ప్రస్తావించదగ్గ అంశం! వివిధ పథకాలలో కొంతమంది రిటైలర్లు సిప్‌ల ద్వారా పెట్టుబడులు కొనసాగించడం మ్యూచువల్‌ ఫండ్‌లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా స్వల్పకాలిక పెట్టుబడుల విషయంలో రిటైలర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అధిక విలువల్లో కొనుగోలు చేసిన షేర్ల విషయంలోనూ మార్కెట్ల తీరు ఆధారంగా కొద్దిపాటి నష్టాలకు లేదా లాభాలకు అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మరోపక్క అంతగా లాభాలకు ఆస్కారం లేదనిపించిన దీర్ఘకాలిక పెట్టుబడులపైనా ఇదే ధోరణి అనుసరిస్తున్నట్లు వివరించారు. ఐపీవోలలోనూ 2025లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే రిటైలర్లు ఐపీవోలో లిస్టింగ్‌ లాభాలకోసమే ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో లిస్టింగ్‌ రోజునే అత్యధిక శాతం ఇన్వెస్టర్లు హోల్డింగ్స్‌ విక్రయించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

IBM CEO Arvind Krishna explained that surge in tech layoffs6
టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ

టెక్ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధ(ఏఐ) కాదని, కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు అవసరానికి మించి భారీగా ఉద్యోగులను నియమించుకోవడమేనని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉద్యోగ కోతలను సహజ దిద్దుబాటు(Natural Correction)గా అభివర్ణించారు.అతిగా నియామకాలు..1990 నుంచి ఐబీఎంలో వివిధ విభాగాలకు నాయకత్వ పాత్రలు నిర్వహిస్తున్న కృష్ణ 2020 నుంచి 2023 మధ్య చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను 30% నుంచి 100% వరకు వేగంగా పెంచాయని వివరించారు. దాంతో కొంత సహజ దిద్దుబాటు జరగబోతోందని చెప్పారు.ఈ ఏడాది ఐబీఎం తన ప్రపంచ శ్రామిక శక్తిలో వేలాది ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ తొలగింపులు ఏఐ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి సారించే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయని తెలిపింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు ఐబీఎం 2,70,000 ప్రపంచ శ్రామిక శక్తిలో సింగిల్ డిజిట్ శాతంగా ఉంటాయని అంచనా వేసింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ వంటి అధిక లాభదాయకత గల వ్యాపారాలపై పెట్టుబడులను పెంచుతోంది.ఉద్యోగాలపై ఏఐ ప్రభావంఉద్యోగాలపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావం గురించి అడిగినప్పుడు, కొంతమేర ఉద్యోగ స్థానభ్రంశం (Job Displacement) ఉంటుందని కృష్ణ అంగీకరించారు. అయితే అది తీవ్రంగా ఉండదని అన్నారు. ‘రాబోయే రెండేళ్లలో మొత్తం యూఎస్‌ ఉపాధి పూల్‌లో 10 శాతం వరకు ఉద్యోగ స్థానభ్రంశం ఉండవచ్చు’ అని అంచనా వేశారు. ఈ ప్రభావం కొన్ని విభాగాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు.కృత్రిమ మేధ కేవలం ఎంట్రీ లెవల్ శ్రమను తగ్గించడానికి మాత్రమే అనుసరించే విధానం అన్నారు. ఏఐ ఉత్పాదకతను పెంచుతున్నందున కంపెనీలు కొత్త రకాల పాత్రల్లో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయని కృష్ణ తెలిపారు.ఇదీ చదవండి: యూఎస్‌లో చదువుకు రూ.10 కోట్లు!

Advertisement
Advertisement
Advertisement