Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

LG Electronics India sold over 10 lakh AC units in Q1 20261
రికార్డ్‌ సేల్స్‌: పది లక్షల ఏసీలు అమ్మేశాం..

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2026) తొలి త్రైమాసికం (జనవరి–మార్చి)లో పది లక్షలకు పైగా ఎయిర్‌ కండీషనర్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా తెలిపింది. తద్వారా కేటగిరీలో ’నిర్ణయాత్మక లీడరు’గా నిల్చినట్లు వెల్లడించింది.సీజన్‌ ప్రారంభానికి ముందే కొత్త బీఈఈ స్టార్‌ రేటింగ్‌ ఏసీలను ప్రవేశపెట్టడం, అలాగే ఐసీసీ వరల్డ్‌ కప్‌ సందర్భంగా నిర్వహించిన మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ మొదలైనవి ఇందుకు తోడ్పడినట్లు కంపెనీ వివరించింది.అయితే, కేటగిరీ లీడరుగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ క్లెయిమ్‌ చేసుకోవడాన్ని టాటా గ్రూప్‌ సంస్థ వోల్టాస్‌ తోసిపుచ్చింది. ఏటా సుమారు 1.2–1.4 కోట్ల యూనిట్ల స్థాయిలో ఉండే రెసిడెన్షియల్‌ ఎయిర్‌ కండిషన్‌ మార్కెట్లో తామే అగ్రగాములమని పేర్కొంది.

Gold and Silver rates on 5th April 2026 in Telugu States2
పసిడి పతనమైందా.. పరుగులు పెట్టిందా? ఈరోజు ఇలా..

దేశంలో గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు పసిడి ధరలు (Today Gold Rate) వరుసగా రెండో రోజూ నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరల్లో (Today Silver Rate) ​కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Bandhan Bank Reports Growth in Loans and Deposits for FY263
బంధన్‌ బ్యాంక్‌లో రుణాలు, డిపాజిట్ల జోరు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగానికి చెందిన బంధన్‌ బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తన వ్యాపార గణాంకాలను ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్‌ రుణాలు (అడ్వాన్సులు) వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,36,995 కోట్లుగా నమోదయ్యాయి.స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు సమర్పించిన తాత్కాలిక (ఆడిట్‌ చేయని) గణాంకాల ప్రకారం, వరుస త్రైమాసిక ప్రాతిపదికన లోన్‌ బుక్‌ 6.2 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు వార్షికంగా 10 శాతం పెరిగి రూ.1,66,344 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,51,212 కోట్లుగా ఉండగా, గత త్రైమాసికంతో (రూ.1,56,724 కోట్లు) పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది.క్యూ4లో కరెంట్‌ ఖాతా, సేవింగ్‌ ఖాతా(కాసా) డిపాజిట్లు రూ.48,751 కోట్లుగా నమోదై, వార్షికంగా 2.8 శాతం పెరిగాయి. అయితే కాసా నిష్పత్తి గత ఏడాది 31.37 శాతం నుంచి 29.31 శాతానికి తగ్గింది. రిటైల్‌ డిపాజిట్లు (కాసాతో సహా) 17.7 శాతం పెరిగి రూ.1,22,547 కోట్లకు చేరాయి. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లు 30.1 శాతం పెరిగి రూ.73,796 కోట్లుగా నమోదయ్యాయి.మొత్తం డిపాజిట్లలో రిటైల్‌ వాటా 68.88 శాతం నుంచి 73.67 శాతానికి పెరిగింది. బల్క్‌ డిపాజిట్లు 6.9 శాతం తగ్గి రూ.43,797 కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి బ్యాంక్‌ లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌) సుమారు 131.76 శాతంగా ఉందని తెలిపింది. ఈ గణాంకాలు తాత్కాలికమైనవి, ఆడిట్‌ చేయనివని బ్యాంక్‌ స్పష్టం చేసింది.

Home Sales Surge in Hyderabad and Top Indian Cities4
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఇలా..

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జనవరి–మార్చి త్రైమాసికంలో జోరుగా సాగాయి. మొత్తం 1,01,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో అమ్మకాలు 93,280 యూనిట్లతో పోల్చితే 9 శాతం అధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల విలువ రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల విలువ రూ.1.42 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 6 శాతం వృద్ధి చెందింది.కానీ, 2025 డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే అమ్మకాల పరిమాణం (యూనిట్లు) 7 శాతం, అమ్మకాల విలువ 6 శాతం చొప్పున తగ్గినట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ తన నివేదికలో తెలిపింది. 2025 డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.1.60 లక్షల కోట్ల విలువైన 1,08,970 యూనిట్లు అమ్ముడైనట్టు వెల్లడించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో ప్రతికూలతలు దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో మాత్రం ఇళ్ల అమ్మకాల జోరు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే మెరుగుపడగా, త్రైమాసికం వారీగా జోరు తగ్గింది. జనవరి–మార్చి క్వార్టర్‌లో 15,985 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి త్రైమాసికం అమ్మకాలు 11,120 యూనిట్లతో పోల్చితే 44 శాతం పెరగ్గా.. డిసెంబర్‌ క్వార్టర్‌లో విక్రయాలు 19,250 యూనిట్లతో పోల్చితే 17 శాతం తగ్గినట్టు అనరాక్‌ నివేదిక తెలిపింది.భారత నివాస మార్కెట్‌ మూలాలు దీర్ఘకాలానికి బలంగా ఉన్నట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా స్వల్పకాల ప్రతికూలతలు మార్చి త్రైమాసికంపై చూపించినట్టు చెప్పారు. భారత గృహ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మధ్యప్రాచ్య ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గి ఉండొచ్చన్నారు.

Vivo V70 FE Launched A Powerhouse with 200MP Camera and 90W Fast Charging5
వివో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. 200 మెగాపిక్సెల్‌ కెమెరాతో..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ బ్రాండ్‌ వివో ‘వీ70 ఎఫ్‌ఈ’ పేరుతో ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. 6.83 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ఉంది. వెనుక అల్ట్రా స్టెబిలైజేషన్‌ కలిగిన 200 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అ్రల్టావైడ్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు కలిగి ఉంది.ముందు భాగంలో 50ఎంపీ గ్రూప్‌ సెల్ఫీ కెమెరా ఉంది. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 90వాట్ల ఫాస్ట్‌ ఛార్జర్‌ సపోర్ట్‌తో వచి్చంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.37,999గా, 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.40,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.44,999 ఉంది. వివో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, రిటైల్‌ స్టోర్లలో ఏప్రిల్‌ 9 నుంచి కొనుగోలు చేయొచ్చు.

Bengaluru Resident Calls 2BHK House Hunt In City A Nightmare6
ఐటీ సిటీలో రియల్ ఎస్టేట్ ఎటు పోతోంది?

దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో నివసించే సగటు ఉద్యోగికి ఇప్పుడు 'సొంత ఇల్లు' అనేది ఒక తీరని కలగా మారుతోంది. నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి 'రెడ్డిట్' (Reddit) వేదికగా పంచుకున్న తన చేదు అనుభవాలు నగరంలోని భయానక రియల్ ఎస్టేట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.పీడకలగా మారిన ఇంటి వేటబెంగళూరు నగరంలో ఒక రెండు పడక గదుల (2BHK) ఇంటి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఒక "పీడకల"గా మారిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎటు వెళ్తోంది?" అనే శీర్షికతో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.మూడేళ్ల క్రితం రూ. 1.4 కోట్లుగా ఉన్న ఒక ఫ్లాట్ ధర, ప్రస్తుతం ఏకంగా రూ. 2 కోట్లకు చేరింది. సదరు అపార్ట్‌మెంట్ ఒక పెద్ద మురికి కాలువ సమీపంలో ఉండటమే కాకుండా, అనేక లోపాలు, అసౌకర్యాలు ఉన్నాయి. అయినా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉందనే సాకుతో ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అద్దెలు కూడా భారమే..కేవలం కొనుగోలు ధరలే కాకుండా, అద్దెలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. గతంలో తక్కువ ధరకే లభించిన ఫ్లాట్‌లకు ఇప్పుడు నెలకు రూ. 70,000 పైగా అద్దె చెల్లించాల్సి వస్తోందని, ఇది నమ్మశక్యంగా లేదని నివాసితులు వాపోతున్నారు. మూడు, నాలుగేళ్లలో డబ్బు ఆదా చేసి ఇల్లు కొందామనుకునే లోపే, ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.పరిస్థితి తీవ్రతకొన్ని ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్లు ఏకంగా రూ. 2.5 కోట్లకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత ధర పెట్టినా డిమాండ్ తగ్గకపోవడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలను గృహ కొనుగోలుకు దూరం చేస్తోంది. పెరుగుతున్న ధరలు, క్షేత్రస్థాయిలోని సమస్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement