Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Spicejet completes equity share allotment to Carlyle Aviation Partners1
కార్లయిల్‌కు స్పైస్‌జెట్‌ షేర్లు 

ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ తాజాగా గ్లోబల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్, ఫైనాన్సింగ్‌ సంస్థ కార్లయిల్‌ ఏవియేషన్‌ పార్ట్‌నర్స్‌(సీఏపీ)కు ఈక్విటీ షేర్లను కేటాయించింది. తద్వారా బ్యాలన్స్‌షిట్‌ నుంచి 50 మిలియన్‌ డాలర్ల లయబిలిటీల(రూ. 442 కోట్ల రుణాలు)ను తగ్గించుకుంది. అంతేకాకుండా తాజా నిధులతో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దారి ఏర్పాటు చేసుకోనుంది. 121.18 మిలియన్‌ డాలర్ల లీజ్‌ బకాయిల పునర్వ్యవస్థీకరణకు సీఏపీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సెపె్టంబర్‌ 11న కంపెనీ ప్రకటించింది. దీంతో 89.5 మిలియన్‌ డాలర్ల లిక్విడిటీకి వీలున్నట్లు తెలియజేసింది. తద్వారా పునర్వ్యవస్థీకరణ చర్యల కొనసాగింపునకు మద్దతు లభించనున్నట్లు పేర్కొంది. కాగా.. కంపెనీ బోర్డు అలాట్‌మెంట్‌ కమిటీ షేరుకి రూ. 42.32 ధరలో నాన్‌ప్రమోటర్‌ కేటగిరీలో ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన 10,41,72,634 షేర్ల జారీకి తాజాగా ఆమోదముద్ర వేసినట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. అంతేకాకుండా 79.6 మిలియన్‌ డాలర్ల నగదు మెయింటెనెన్స్‌ రిజర్వులకు ఒప్పందం వీలు కలి్పంచనుంది. భవిష్యత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్, ఇంజిన్‌ల నిర్వహణకు వీటిని వినియోగించనుంది. మరో 9.9 మిలియన్‌ డాలర్లు లీజ్‌ ఆబ్లిగేషన్లకుగాను నగదు నిర్వహణా క్రెడిట్స్‌గా పొందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెపె్టంబర్‌)లో స్పైస్‌జెట్‌ నికర నష్టం భారీగా పెరిగి రూ. 635 కోట్లను తాకిన విషయం విదితమే. బీఎస్‌ఈలో స్పైస్‌జెట్‌ షేరు దాదాపు యథాతథంగా రూ. 37 వద్ద ముగిసింది.

Indian domestic market has seen robust activity in early-stage Artificial Intelligence 2
ఏఐ వినియోగంలో వెనుకబడ్డ భారత్‌ 

న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం మన కంపెనీలు గణనీయంగా వెనుకబడ్డాయి. ఇప్పటికీ 45 శాతం సంస్థలు ఏఐ వినియోగానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నాయి. చాలా మటుకు సంస్థలు ఏఐ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఇతర గ్లోబల్‌ మార్కెట్లతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. హెచ్‌ఆర్‌ ప్లాట్‌ఫాం ’డీల్‌’ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 45 శాతం భారతీయ సంస్థలు ఏఐ వినియోగం విషయంలో ప్రారంభ దశలో ఉండగా, 38 శాతం కంపెనీలు మధ్య స్థాయిలో ఉన్నాయి. కేవలం 17 శాతమే అడ్వాన్స్‌డ్‌ దశలో ఉన్నాయి. తమ ప్రధాన వ్యాపార ప్రక్రియలు, ఆవిష్కరణల్లో ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 22 మార్కెట్లకు చెందిన 5,500 వ్యాపార దిగ్గజాలతో సెపె్టంబర్‌లో డీల్‌ ఈ సర్వే నిర్వహించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు .. → ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ 54 శాతం కంపెనీల్లో మాత్రమే అధికారికంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది 67 శాతంగా ఉంది. సాంకేతిక పురోగతి, సిబ్బంది సన్నద్ధత మధ్య పెరుగుతున్న అంతరాన్ని, శిక్షణపై తక్షణం మరింతగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది. → మానవ వనరుల (హెచ్‌ఆర్‌) కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగుల నిర్వహణ (66 శాతం), ఉద్యోగుల నియామకాల్లో (57 శాతం) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. → పని విధానాలను, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను ఏఐ సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు మారుతున్నాయి. అలాగే కంపెనీలు పరిగణనలోకి తీసుకునే నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపార సంస్థలు దీనికి వేగంగా అలవాటు పడాలి. → ఏఐ వల్ల అంతర్జాతీయంగా 91 శాతం కంపెనీల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన విధుల స్వరూపం మారింది. ఏఐని అనుసంధానించేందుకు మూడో వంతు సంస్థలు (34 శాతం)గణనీయ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాయి. → వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగ విధుల్లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు 43 శాతం కంపెనీలు వెల్లడించాయి. → వచ్చే 1–3 ఏళ్ల వ్యవధిలో ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్‌ నియామకాలు తగ్గుతాయని 70 శాతం దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్‌ సిబ్బందిని తీసుకోవడంలో అకడమిక్‌ డిగ్రీల కన్నా 66 శాతం కంపెనీలు సాంకేతిక సరి్టఫికేషన్లకు, 58 శాతం కంపెనీలు సమస్యల పరిష్కార సామర్థ్యాలకు, 52 శాతం సంస్థలు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. → కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచే విషయంలో భారత సంస్థలు వెనుకబడి ఉన్నాయి. 54 శాతం సంస్థలు మాత్రమే రీస్కిలింగ్‌పై స్థిరంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోకెల్లా ఇదే అత్యల్పం. ఈ విషయంలో కెనడా (77 శాతం), బ్రెజిల్‌ (76 శాతం), సింగపూర్‌ (74 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి. → 45 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి రీస్కిలింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించలేదు. వచ్చే 12 నెలల్లో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి. ఏఐ నైపుణ్యాలున్న వారిని రిక్రూట్‌ చేసుకోవడంలో 63 శాతం సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటుకున్నాయి.

Simplified registration for Foreign Portfolio Investors3
సులువుగా ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్‌ 

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసే బాటలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన చర్యలకు శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా ఎండ్‌టు ఎండ్‌ డిజిటైజేషన్‌కు తెరతీయాలని ప్రణాళికలు వేస్తోంది. డిజిటల్‌ సిగ్నేచర్‌లను వినియోగించుకోవడం ద్వారా పూర్తిగా పేపర్‌లెస్‌ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సెబీ చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా రిజిస్ట్రేషన్‌ సమయాన్ని భారీగా కుదించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం నెలలపాటు కొనసాగుతున్న ప్రక్రియను రోజులలోకి తగ్గించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదేసమయంలో డేటా ప్రైవసీ ఆందోళనలకు చెక్‌ పెట్టనున్నట్లు తెలియజేశారు. సర్వీసుల నాణ్యతను పెంచే బాటలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్‌కు రెండో ప్లాట్‌ఫామ్‌ను సైతం తీసుకురానున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం సీడీఎస్‌ఎల్‌ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు కీలక పాత్రధారులని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నిర్వహించిన 14వ భారత సీఐవో సదస్సు సందర్భంగా పాండే అభివరి్ణంచారు.

Domestic aviation industry loss may widen to Rs 9,500-10,500 cr this fiscal4
ఈసారి ఎయిర్‌లైన్స్‌ నష్టాలు రెట్టింపు 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు నికరంగా రూ. 9,500 కోట్ల–రూ. 10,500 కోట్ల మేర ఉండొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన సుమారు రూ. 5,500 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో తెలిపింది. ప్రధానంగా ప్యాసింజర్ల వృద్ధి నెమ్మదించడం, విమానాల డెలివరీలతో ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంలాంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ల ట్రాఫిక్‌ వృద్ధి 4–6 శాతం మేర ఉంటుందని తెలిపింది. అయితే, ఆర్థికంగా పరిశ్రమపై ఒత్తిడి నెలకొంటుందని నివేదిక పేర్కొంది. కానీ, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తాజా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ 7.6 శాతం వృద్ధి చెంది, 16.53 కోట్లకు చేరింది. అక్టోబర్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 1.43 కోట్లుగా నమోదైంది. వార్షికంగా 4.5 శాతం, నెలలవారీగా సెపె్టంబర్‌తో పోలిస్తే 12.9 శాతం పెరిగింది. కానీ సీమాంతర ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా అవాంతరాలు, 2025 జూన్‌లో విమాన దుర్ఘటన తర్వాత ప్రయాణాలు చేయడంపై సందేహాలు నెలకొనడంలాంటి అంశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వృద్ధి ఒక మోస్తరుగానే ఉండొచ్చని నివేదిక వివరించింది. ఇక సరఫరా వ్యవస్థపరమైన అవరోధాలు, ఇంజిన్‌ వైఫల్యాల వల్ల విమానాలు ఎగరలేని పరిస్థితులు మొదలైన అంశాలు పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటున్నాయని పేర్కొంది. 2025 మార్చి 31 నాటికి వివిధ కంపెనీలకు చెందిన 133 విమానాలు పక్కన పెట్టాల్సి వచి్చందని, మొత్తం పరిశ్రమ ఫ్లీట్‌లో ఇది 15–17 శాతమని నివేదిక వివరించింది. నిర్వహణపరమైన సవాళ్ల వల్ల ఎయిర్‌లైన్స్‌ వ్యయాలు పెరిగిపోయాయని పేర్కొంది.

Capital market players seek tax sops, steps to deepen financial sector5
పన్ను మినహాయింపులు ఇవ్వాలి

రానున్న బడ్జెట్‌లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను(ఎస్‌టీటీ) తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఆర్థిక మంత్రితో ప్రీబడ్జెట్‌ సమావేశం సందర్భంగా క్యాపిటల్‌ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిలో చోటు కల్పించడం తదితర అంశాలను సూచించారు. ఫైనాన్షియల్‌ రంగం మరింత లోతుగా విస్తరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డెరివేటివ్స్‌తో పోలిస్తే నగదు విభాగంలో ఎస్‌టీటీని కుదించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక బడ్జెట్‌ రూపకల్పనకు తెరతీసిన నేపథ్యంలో క్యాపిటల్‌ మార్కెట్‌ ప్రతినిధులు నాలుగోసారి ఆర్థిక మంత్రిని కలవడం గమనార్హం! స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్‌ఈసహా ఎంసీఎక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌(యాంఫీ), పెట్టుబడుల రిజిస్టర్డ్‌ సలహాదారులు, కమోడిటీ పార్టిసిపెంట్ల అసోసియేషన్‌ తదితర సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రితో సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న 2026–27 బడ్జెట్‌ను సీతారామన్‌ లోక్‌సభలోప్రవేశపెట్టే అవకాశముంది. తద్వారా వరుసగా 9వసారి బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. 33 శాతం అప్‌ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్‌ మార్కెట్లు 33 శాతం అధికంగా రూ. 14.6 లక్షల కోట్ల పెట్టుబడుల మొబిలైజేషన్‌కు వీలు కల్పించాయి. ఈక్విటీ, డెట్, రియల్టీ ట్రస్ట్‌(రీట్‌)లు, ఇన్‌ఫ్రా ట్రస్ట్‌(ఇన్విట్‌)లు తదితర ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్ల ద్వారా నిధుల మొబిలైజేషన్‌ జరిగింది. కార్పొరేట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు విభిన్న ఫైనాన్సింగ్‌ వ్యూహాలను అందిపుచ్చుకోవడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ, డెట్‌ విభాగాలే రూ. 14.2 లక్షల కోట్లను ఆక్రమించడం విశేషం! వెరసి ఆర్థిక వృద్ధికి అనువైన పెట్టుబడులను సమకూర్చడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాగా.. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాధా ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్‌ తుది రూపకల్పనకు ముందు ఆర్థిక శాఖ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించే విషయం విదితమే. ఈ బాటలో గత వారం సైతం ఆర్థికవేత్తలు, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగ అత్యున్నత ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. డిమాండును పెంచడం, ఉద్యోగ కల్పన, 8 శాతం ఆర్థిక వృద్ధి తదితర లక్ష్యాలతో బడ్జెట్‌ రూపొందనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Hike Healthcare Spend To Over 2. 5percent Of GDP Says NATHEALTH6
హెల్త్‌కేర్‌కు మరిన్ని నిధులు కావాలి

న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణకు జీడీపీలో 2.5 శాతం నిధులు కేటాయించాలని ఈ రంగానికి చెందిన అత్యున్నత మండలి ‘నాట్‌హెల్త్‌’ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. నాన్‌ కమ్యూనికేబుల్‌ వ్యాధుల (అంటు వ్యాధులు కానివి) నియంత్రణకు తక్షణ కార్యాచరణ అవసరమని సూచించింది. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించాలంటూ.. ఇందులో భాగంగా ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. దేశంలో 65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులు కారణం అవుతుండడంతో ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచింది. 2026–27 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా హెల్త్‌కేర్‌ తరఫున నాట్‌హెల్త్‌ కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, బీమా మరింత మందికి చేరువ అయ్యేందుకు, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు వీలుగా కార్యాచరణను సూచించినట్టు నాట్‌హెల్త్‌ ప్రకటించింది. 2025–26 బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయింపులు 1.97 శాతంగా ఉన్నాయి. మరిన్ని నిధులను కేటాయించంతోపాటు, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో పటిష్టమైన, భవిష్యత్తుకు వీలైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని సూచించింది. ఆరోగ్య సంరక్షణను ‘కోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’గా ప్రకటించి, రూ.50,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం కావడం, వీటికి దీర్ఘకాలిక రుణ అవకాశాలు పరిమితంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, టెక్నాలజీ ఆవిష్కరణలకు రూ.5,000–7,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది.

Advertisement
Advertisement
Advertisement