Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Non-bank lenders home loan growth will slow down in FY261
గృహ రుణ మార్కెట్లో పీఎస్‌బీల దూకుడు 

ముంబై: గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో.. నాన్‌ బ్యాంకింగ్‌ రుణ దాతల హౌసింగ్‌ పోర్ట్‌ఫోలియో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించొచ్చని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. నాన్‌ బ్యాంక్‌ రుణదాతల నిర్వహణలోని రుణ ఆస్తుల విలువ 2025–26లో 12–13 శాతం మేర వృద్ధి చెందొచ్చని.. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 14 శాతంగా ఉందని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీకి తోడు, ప్రీమియం గృహ రుణాల్లో ఆధిపత్యం రూపంలో సవాళ్లను బ్యాంకింగేతర గృహ రుణ సంస్థలు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనూ ప్రీమియం గృహ రుణాల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించించినట్టు తెలిపింది. బ్యాంకులు తక్కువ రేటుపై గృహ రుణాలను అందిస్తుండడం ధరల్లో పోటీకి దారితీసినట్టు పేర్కొంది. 9 శాతంలోపు వడ్డీ రేట్లతో కూడిన గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2025 మార్చి 31 నాటికి 60 శాతానికి చేరుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 45 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (మిగిలిన గృహ రుణాన్ని బదిలీ చేసుకోవడం)తో కస్టమర్లు వెళ్లిపోతున్న ధోరణి నెలకొన్నట్టు క్రిసిల్‌ డైరెక్టర్‌ శుభశ్రీ నారాయణన్‌ తెలిపారు.ప్రభుత్వరంగ బ్యాంకులు అసాధారణ స్థాయిలో అతి తక్కువ రేట్లపై గృహ రుణాలను మంజూరు చేస్తుండడం పట్ల కొన్ని సంస్థలు ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నిదానించిన వృద్ధి.. పెరుగుతున్న పట్టణీకరణ, ఇళ్ల ధరల కంటే, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, ఆదాయపన్ను, జీఎస్‌టీ తగ్గింపు వంటి సానుకులతలు ఉన్నప్పటికీ.. గృహ రుణ మార్కెట్లో వృద్ధి నిదానించినట్టు క్రిసిల్‌ నివేదిక తెలిపింది. మొత్తం మీద 2025–26లో మోర్ట్‌గేజ్‌ ఏయూఎం వృద్ధి 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2024–25లో 18.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.

Piyush Goyal meets stakeholders to boost FDI and FII2
విదేశీ పెట్టుబడులకు పుష్‌ 

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లు, విదేశీ సంస్థాగత పెట్టుబడు(ఎఫ్‌ఐఐ)లను ఆకట్టుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఇందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళతర, సమర్థవంత వేగంతోకూడిన విధానాలకు తెరతీయనున్నారు. ఈ బాటలో ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ విధానాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది. తద్వారా దేశంలోకి మరింత వేగంగా పటిష్టస్థాయిలో పెట్టుబడులు ప్రవహించేలా గోయల్‌ చర్యలు చేపట్టనున్నారు. సమావేశానికిముందు పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 98వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులనుద్ధేశించి గోయల్‌ ప్రసంగించారు. దేశంలోకి మరింత వేగంగా విదేశీ పెట్టుబడులు ప్రవహించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు గోయల్‌ తెలియజేశారు. ఉద్యోగ కల్పన, కొత్త టెక్నాలజీలు, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు విదేశీ పెట్టుబడులు దారి చూపుతాయని ఈ సందర్భంగా గోయల్‌ పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశీ కరెన్సీకి స్థిరత్వాన్ని కలి్పంచవచ్చని తెలియజేశారు. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. క్యూ1లో 15 శాతం అప్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో దేశంలోకి 15 శాతం అధికంగా ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో 18.62 బిలియన్‌ డాలర్లను తాకాయి. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబడులు 50 బిలియన్‌ డాలర్లను అధిగమించగా.. ఎఫ్‌డీఐలు 80.6 బిలియన్‌ డాలర్లను తాకడం గమనార్హం! పారిశ్రామికంగా సరఫరా వ్యవస్థలు డైవర్సిఫైకావలసి ఉన్నట్లు గోయల్‌ ప్రస్తావించారు. దీంతో ఒకే ప్రాంతంపై ఆధారపడటం తగ్గుతుందని తెలియజేశారు.

90 Initial Public Offerings have been launched in the Indian market so far in 20253
ఐ–బ్యాంకులకు ఐపీవోల పండగ 

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: ఒకదాని తర్వాత మరొకటిగా లైన్‌ కట్టిన పబ్లిక్‌ ఇష్యూలతో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల (ఐ–బ్యాంకులు) పంట పండుతోంది. ఫీజుల రూపంలో భారీ రాబడులతో అవి పండగ చేసుకుంటున్నాయి. గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 90 పైగా ఇన్ఫిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లు (ఐపీవో) వచ్చాయి. కంపెనీలు వీటి ద్వారా సుమారు రూ. 1.50 లక్షల కోట్లు సమీకరించాయి. సాధారణంగా ఇష్యూలకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించే సంస్థలు సుమారు 1 శాతం నుంచి 8 శాతం వరకు ఫీజులు తీసుకుంటాయి. ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన నిధులను బట్టి చూస్తే ఐ–బ్యాంకుల ఫీజులు దాదాపు రూ. 3,500 కోట్లకు పైగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా ఈ ఏడాది ముగియడానికి మరో నెలన్నర వ్యవధి మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. గతేడాది కూడా ఐపీవోలు వెల్లువెత్తిన నేపథ్యంలో దాదాపు ఇదే స్థాయిలో రూ. 3,500 కోట్ల వరకు ఐ–బ్యాంకులకు ఫీజుల రూపంలో ముట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారీ ఇష్యూల సందడి ఈ ఏడాది వరుసగా భారీ పబ్లిక్‌ ఇష్యూలు క్యూ కట్టాయి. వీటిలో టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఇండియా, హెక్సావేర్‌ టెక్, బిలియన్‌ బ్రెయిన్స్‌ మొదలైన ఇష్యూలు ఉన్నాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ప్రకారం టాటా క్యాపిటల్‌ రూ. 15,512 కోట్లు సమీకరించగా లీడ్‌ మేనేజర్లకు రూ. 159 కోట్లు ఫీజుల కింద ముట్టాయి. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ. 12,500 కోట్ల ఇష్యూని నిర్వహించిన సంస్థలు సుమారు రూ. 104 కోట్లు దక్కించుకోగా, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా తమ రూ. 11,605 కోట్ల ఐపీవోకి రూ. 226 కోట్లు చెల్లించింది. ఇక టెక్నాలజీ సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ రూ. 8,750 కోట్లు సమీకరించగా ఫీజుల కింద రూ. 215 కోట్లు చెల్లించింది. అటు గ్రో మాతృసంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ రూ. 6,632 కోట్ల ఇష్యూకి గాను మర్చంట బ్యాంకర్లకు రూ. 152 కోట్లు ముట్టజెప్పగా, లెన్స్‌కార్ట్‌ రూ. 7,278 కోట్ల ఇష్యూకి రూ. 129 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులకు చెల్లించింది. ఇలా మొత్తం మీద రూ. 76,210 కోట్లు సమీకరించిన టాప్‌ 10 సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లకు రూ. 1,315 కోట్లు ముట్టచెప్పాయి. అనుకూల పరిస్థితులు.. దేశీయంగా మ్యుచువల్‌ ఫండ్స్ నుంచి పెట్టుబడులు ప్రవహిస్తుండటం, అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్టార్టప్స్‌లో వాటాలను లాభాలకు అమ్ముకుని వీలైనంత త్వరగా నిష్క్రమించేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌ తొందరపడుతుండటం లాంటి అంశాలు ప్రస్తుతం పబ్లిక్‌ ఇష్యూల వెల్లువకు కారణంగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, జీడీపీ వృద్ధి, సెకండరీ మార్కెట్లు పటిష్టంగా ఉండటం వల్ల కూడా ఐపీవోల్లోకి సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గణనీయంగా వస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఐపీవో బూమ్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన చాలా మటుకు కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు సాధారణంగా కంటే అధిక ఫీజులే చెల్లించినట్లు తెలిపారు. ఇష్యూ ధరను ఆకర్షణీయంగా నిర్ణయించడం, కచ్చితంగా ఓవర్‌ సబ్‌్రస్కయిబ్‌ కావడం, లిస్టింగ్‌లో లాభాలు వస్తుండటంలాంటి అంశాల వల్ల నిధుల సమీకరణకు మార్కెట్లు మంచి మార్గంగా మారాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెకండరీ మార్కెట్లో ట్రేడవుతున్న పోటీ సంస్థల ధరలతో పోలిస్తే ఐపీవో రేటు సుమారు 20–30 శాతం వరకు తక్కువగా ఉండటం ఆకర్షణీయాంశంగా ఉంటుంది. దీనివల్ల – సంస్థలకు పెట్టుబడులు, ఇన్వెస్టర్లకు మార్కె ట్లో ఎంట్రీ, బ్యాంకులకు ఫీజులు – ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. దీనితో సానుకూల పరిస్థితులను సొమ్ము చేసుకునే దిశగా ఈ ఏడాది ఆర్థిక సేవలు, టెక్నాలజీ నుంచి కన్జూమర్‌ రిటైల్‌ వరకు వివిధ రంగాలకు చెందిన సంస్థలు పెద్ద ఎత్తున ఐపీవోలకు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. దీనితో బ్యాంకర్లు కూడా బిజీగా మారారని, ఐపీవోలు చేపట్టేలా మరిన్ని కంపెనీలకు భరోసానిస్తున్నారని వివరించాయి. ఇష్యూ సైజును బట్టి ఫీజులు.. ఐపీవో విజయవంతమయ్యేందుకు చేసే ప్రయత్నాలకు గాను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, మర్చంట్‌ బ్యాంకులు ఇలా ఫీజులు వసూలు చేస్తుంటాయి. సాధారణంగా ఇష్యూ పరిమాణం, అలాగే బ్యాంకరు రకాన్ని బట్టి ఫీజులు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 10 కోట్ల లోపు చిన్న, మధ్యతరహా సంస్థల (ఎస్‌ఎంఈలు) ఇష్యూలపై ఇది దాదాపు 8–10 శాతం, కొన్ని సందర్భాల్లో 15 శాతం వరకు ఇది ఉంటోంది. చిన్న ఐపీవోలకు ప్రాసెసింగ్‌ ఫీజుల్లాంటివి రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుండగా, ఇతరత్రా అండర్‌రైటింగ్‌ ఫీజులు, లీగల్, రెగ్యులేటరీ, ఆడిట్, లిస్టింగ్‌ ఫీజులు మొదలైనవెన్నో ఉంటాయి. పెద్ద కంపెనీలకు సంబంధించి, ఇష్యూ సైజు రూ. 1,000 కోట్ల వరకు ఉంటే ఫీజులు సుమారు 3–35 శాతం శ్రేణిలో ఉంటుంది. డీల్‌ సైజు రూ. 2,000 కోట్లు, రూ. 5,000 కోట్ల స్థాయిలో పెరిగే కొద్దీ ఫీజు శాతాల రూపంలో తగ్గినా, అంతిమంగా ఎక్కువగానే ఉంటుంది. దశాబ్దకాలం క్రితం చాలా మటుకు పబ్లిక్‌ ఇష్యూలపై ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లకు సుమారు 1–2 శాతమే ఫీజులు వచ్చేవి. ఇక భారీ ఇష్యూలకైతే ఇది మరింత తక్కువగా 0.5 – 1 శాతం శ్రేణిలో ఉండేది. ఈ ఏడాది సెకండరీ మార్కెట్‌ కూడా మెరుగ్గా ఉండటం, ఐపీవోల జోరు కొనసాగుతుండటంతో మధ్య స్థాయి ఇష్యూలపై ఫీజులు 2–2.5 శాతం స్థాయికి, భారీ డీల్స్‌పై 1.75 శాతం స్థాయికి పెరిగాయి. కొన్ని ఇష్యూలు.. బ్యాంకర్లు.. ఎల్‌జీ ఇండియాకి మోర్గాన్‌ స్టాన్లీ, యాక్సిస్, జేపీ మోర్గాన్, బీవోఎఫ్‌ఏ, సిటీ సంస్థలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి. అటు టాటా క్యాపిటల్‌కి కోటక్, యాక్సిస్, బీఎన్‌పీ, సిటీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్, జేపీ మోర్గాన్, ఎస్‌బీఐ సేవలందించాయి. ఇక బిలియన్‌ బ్రెయిన్స్‌కి కోటక్, జేపీ మోర్గాన్, సిటీ, యాక్సిస్, మోతీలాల్‌ సర్వీ సులు అందించగా.. లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్‌కి కోటక్, మోర్గాన్‌ స్టాన్లీ, ఎవెండస్, సిటీ, యాక్సిస్, ఇంటెన్సివ్‌ ఫిస్కల్‌ సంస్థలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి.

Why Hide Salaries Entrepreneur Ankur Warikoo Tweet Viral4
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్‌లో..

సాధారణంగా జీతాల విషయాలు ఎవరూ బయటపెట్టడానికి లేదా వెల్లడించడానికి ఇష్టపడరు. కానీ ఎందుకు జీతాలను దాచిపెట్టాలి? అని వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్, రచయిత అయిన 'అంకుర్ వారికూ' (Ankur Warikoo) తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.జీతానికి సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల.. మీరు పనిచేసే ప్రదేశంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇది కొందరిలో అభద్రతను పెంచుతుంది. కాబట్టి బయటకు వెల్లడించ వచ్చు. ఇది మీ క్రమశిక్షణను తెలియజేస్తుందని అంకుర్ వారికూ పేర్కొన్నారు.ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి కాదువ్యక్తిగత ఆర్థిక ప్రపంచంలో నాకు గుర్తింపు రావడానికి కూడా క్రమశిక్షణతో ఉండటం, డబ్బును ఎప్పుడూ వ్యక్తిగతంగా పరిగణించకపోవడమే అని అంకుర్ అన్నారు. నేను కేవలం జీతం మాత్రమే కాకుండా.. నా ఆదాయం, పెట్టుబడి, నేను చేసే పొరపాట్లను కూడా బహిరంగంగా చెబుతాను. ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి మాత్రం కాదు. మీరు కొన్ని విషయాలను దాచిపెట్టడం మానేస్తే.. స్పష్టత ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే.జీతాల విషయంలో కంపెనీలే పక్షపాతం చూపిస్తాయి. అలాంటప్పుడే చాలామంది తన జీతాల విషయాన్ని రహస్యంగా దాచేస్తారు. ఇలాంటిది నా స్టార్టప్‌లో జరగదు. అందరి జీతం పబ్లిక్‌గా ఉంటుందని ఆయన అన్నారు. జీతాల విషయంలో అందరికీ ఒక స్పష్టత ఇస్తామని కూడా వెల్లడించారు.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!పారదర్శకత పట్ల తన నిబద్ధతను హైలైట్ చేస్తూ.. వారికూ గతంలో తన డ్రైవర్ ఒక నెలలో ఎంత సంపాదిస్తాడో మరియు అతని జీతం ఎలా అభివృద్ధి చెందిందో వెల్లడించారు. మరో ఐదారు సంవత్సరాల్లో.. డ్రైవర్ జీతం నెలకు లక్ష రూపాయలకు చేరుకోవాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ ముగించారు.There is a simple reason I found acceptance in the world of personal finance.Because I treated money as something that should never have been “personal” in the first place.So I put my own numbers on the table.My business income.My investments.My performance.My salary.My…— Ankur Warikoo (@warikoo) November 21, 2025

Dhirubhai Ambani International School Fee Structure5
అంబానీ స్కూల్‌లో ఫీజులు అన్ని లక్షలా?

అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన దాదాపు అందరికీ.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) గురించి తెలిసే ఉంటుంది. ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో దీనిని 2003లో నీతా అంబానీచే స్థాపించారు. ఇందులో చాలామంది సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటున్నారు. అయితే ఈ కథనంలో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS).. కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్), CAIE (కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) వంటి అనేక కార్యక్రమాలలో విద్యను అందిస్తుంది. అంతే కాకుండా ICSE (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), IGCSE (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కోసం కూడా విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ స్కూల్ పిల్లలను బాధ్యతాయుతమైన, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యా నైపుణ్యంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి విలువనిస్తూ.. ప్రోత్సహిస్తోంది.మొత్తం విద్యార్థులు & ఉపాధ్యాయులు11, 12 తరగతులకు, ఈ పాఠశాల IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) ద్వారా IB డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందించడానికి అధికారం పొందింది. ఇందులో సుమారు 1,087 మంది విద్యార్థులు, 187 మంది ఉపాధ్యాయులు (వీరిలో 27 మంది ప్రవాసులు) ఉన్నారు.తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్ మరియు అబ్రామ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్ల పిల్లలు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)లో చదువుకుంటున్నారు. కాబట్టి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కరీనా కపూర్, సైఫ్ అలీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసేందుకు తరచుగా పాఠశాల నిర్వహించే వార్షిక కార్యక్రమంలో కనిపిస్తారు.ఫీజుల వివరాలు2023-2024 విద్యా సంవత్సరానికి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒకరిని కిండర్ గార్టెన్‌ నుంచి 12వ తరగతికి వరకు చదివించడానికి ఫీజులు రూ. 1,400,000 నుంచి రూ. 2,000,000 ఉంటాయని సమాచారం. పాఠశాల ఫీజులలో పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలు, రవాణా, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు నిర్మాణం గ్రేడ్ స్థాయి ఆధారంగా మారుతుంది. కిండర్ గార్టెన్ నుంచి 7వ తరగతి వరకు ఫీజులు సంవత్సరానికి రూ. 1.70 లక్షలు లేదా నెలకు సగటున రూ. 14వేలు. 8వ తరగతి నుంచి 10వ తరగతులకు సంవత్సరానికి రూ. 5.9 లక్షలు. 11, 12 తరగతులకు ఏటా రూ. 9.65 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఫీజులు కేవలం అంచనా మాత్రమే.

IndiGo Approves Rs 7270 Cr Investment To Acquire Aircraft6
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో

దేశీ విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ విమానాల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఐఎఫ్‌ఎస్‌సీ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు 82 కోట్ల డాలర్లు (రూ. 7,270 కోట్లు) అందించనుంది.ఇండిగో బ్రాండ్‌ విమాన సర్వీసుల కంపెనీ ఈక్విటీ షేర్లు, నాన్‌క్యుములేటివ్‌ ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు(ఓసీఆర్‌పీఎస్‌) జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనుంది. ఒకేసారి లేదా దశలవారీగా వీటి జారీని చేపట్టనున్నట్లు ఇండిగో తెలియజేసింది. నిధులను ప్రధానంగా విమానాల కొనుగోలుకి వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇప్పటికే 411 విమానాలను కలిగి ఉంది. వీటిలో 365 విమానాలు నిర్వహణలో ఉన్నట్లు విమాన ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ప్లేన్‌స్పాటర్‌.నెట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement