న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.
ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.
వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.
ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు.


