బెంగళూరు: ఎస్ఐ, మహిళా పోలీసు ప్రేమాయణం సాగినన్నాళ్లు సరదా సంతోషాలతో సాగింది, కానీ వికటించడంతో గొడవలు, మీడియా ముందుకు వచ్చి శాపనార్థాలతో రక్తి కడుతోంది. తన ప్రియురాలు ప్రేమ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధమైందని ఎస్ఐ వీరేశ్ ఆరోపిస్తున్నారు. యాదగిరి జిల్లాలో ఇంటెలిజెన్స్లో ఎస్ఐగా పనిచేస్తున్న వీరేశ్కు, మహిళా కానిస్టేబుల్ విజయశ్రీతో పరిచయమైంది. 8 ఏళ్ల నుంచీ ప్రేమ, సహ జీవనం చేస్తున్నామని, తన వద్ద నుంచి రూ.35 లక్షలు, వైద్య ఖర్చులంటూ మరో రూ.5 లక్షలు తీసుకుందని వీరేశ్ చెబుతున్నారు.
2017లో విజయపురలో చదువుకునే రోజుల్లోనే ప్రేమ మొదలైందన్నారు. రాయచూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు నాలుగేళ్ల పాటు కలసి జీవించారు, గుడిలో పూలదండలు మార్చుకొని వివాహం చేసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. కానీ, ఆమె 7వ తేదీన మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని తెలిపారు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని మంగళవారం రాత్రి రాయచూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.


