అరుదైన శస్త్రచికిత్సతో పసికందుకు పునర్జన్మ
న్యూఢిల్లీ: పుట్టిన ఒక్క రోజులోనే మృత్యువు అంచులను తాకిన ఒక పసికందును ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రి వైద్యులు తమ అసాధారణ నైపుణ్యంతో కాపాడారు. ‘ఇన్ఫ్రాడయాఫ్రగ్మాటిక్ టోటల్ అనోమలస్ పల్మనరీ వీనస్ కనెక్షన్’అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక గుండె లోపంతో జన్మించిన ఆ నవజాత శిశువుకు, అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ కలిగిన రక్తం గుండెకు సక్రమంగా చేరాల్సిన ప్రకృతి నియమం, ఈ లోపం కారణంగా విఫలమై, పుట్టిన వెంటనే ఆ పసికందు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేలా చేసింది. ప్రతి నిమిషం ప్రాణ సంకటంగా మారిన ఈ అత్యవసర స్థితిలో వైద్యులు యుద్ధప్రాతిపదికన స్పందించారు. ఈ శస్త్రచికిత్స గురించి ఆసుపత్రి పీడియాట్రిక్ అండ్ కంజెనిటల్ హార్ట్ సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ కె.ఎస్.అయ్యర్ మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం వల్లే పసికందు మృత్యుం జయురాలిగా మారిందని, భవిష్యత్తులో ఆ శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు పూర్తి అవకాశం ఉందని స్పష్టం చేశారు.


