పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ అధికారాన్ని కైవసం చేసుకోవాలనే కమల దళం కల ఎట్టకేలకు నిజమైంది. రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్కు కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో, బంగ్లాదేశ్కు నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇంతకీ తీస్తా నీటి విషయంలో కేంద్రం, మమత బెనర్జీ.. బంగ్లాదేశ్ వాదనలు ఎలా ఉన్నాయంటే..
ఇరు దేశాల మధ్య తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నందుకు మమతా బెనర్జీపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విమర్శలు గుప్పించింది. అదే సమయంలో బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ ఫలితంగా రాష్ట్రానికి, బంగ్లాదేశ్కు మధ్య సంబంధాలను కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అభివర్ణించింది. ఈ సందర్భంగా బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బరీ హెలాల్ మాట్లాడుతూ.. సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ అద్భుత పనితీరును కనబరిచే అవకాశముందని ప్రశంసించారు. అలాగే, రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యపై పురోగతి ఆశలకు కూడా ఈ ఫలితాన్ని హెలాల్ ముడిపెట్టారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి అడ్డుగా నిలిచిందన్నారు.
ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్ చాలాకాలంగా కోరుకుంటున్న తీస్తా ఒప్పందంపై కేంద్రంతో కలిసి పనిచేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మార్పిడి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. తీస్తా సమస్యపై హెలాల్ స్పందిస్తూ..‘గత ప్రభుత్వమే అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉంది. తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండూ గట్టిగా మద్దతు తెలిపాయి. అలాగే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినందున, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపిణీలో పరిష్కారం కాని సమస్యలలో తీస్తా వివాదం ఒకటిగా మిగిలిపోయింది. 1996 గంగా జల ఒప్పందం, ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. అయితే, నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ పేర్కొంది. వాతావరణ మార్పులపై ఆందోళనలు కూడా తగ్గుతున్న నీటి లభ్యతపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
ఇప్పుడు, 1996 ఒప్పందం ఈ సంవత్సరం చివరలో ముగియనున్న నేపథ్యంలో, తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల కారణంగా దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం పెండింగ్లోనే ఉంది. 2011లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, తీస్తా జలాల్లో బంగ్లాదేశ్కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేయబడింది. అయితే, ఇది రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తీస్తా జలాలపై అంతకుముందు 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా లభించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన, న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది.
తీస్తా ఒప్పందం ఇలా..
2011లో డ్రాఫ్ట్ ఒప్పందం
భారత్కి 42.5% నీరు.
బంగ్లాదేశ్కి 37.5% నీరు.
20% పర్యావరణ అవసరాలకు ఉపయోగం.
అడ్డంకి: గత సీఎం మమతా బెనర్జీ, ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు.
సవాళ్లు..
భారత్లో: ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత.
బంగ్లాదేశ్లో: రెండు కోట్ల మంది ప్రజలు తీస్తా నీటిపై ఆధారపడుతున్నారు.
జియోపాలిటిక్స్: చైనా భాగస్వామ్యం వల్ల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం.
చైనా మద్దతు: నీటి కేటాయింపులపై ఆలస్యం జరిగితే, చైనా మద్దతుతో Teesta River Comprehensive Management and Restoration Projectను ముందుకు తీసుకెళ్తామని బంగ్లా హెచ్చరికలు.


