breaking news
Bangladesh
-
బెదిరింపుల ప్రభావం తాత్కాలికమే
కోల్కతా: వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత్ తిరిగి రానున్నారు. 2003 తస్లిమా నస్రీన్ రాసిన పుస్తకం ‘ద్విఖండిత’పెద్ద వివాదానికి కారణమైంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, నిరసనలకు దిగడంతో ప్రభుత్వం 2007లో ఆ పుస్తకాన్ని నిషేధించడంతోపాటు తస్లీమా దేశం వదిలి వెళ్లేలా చేసింది. అయితే.. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కోల్కతా రావడంపై ఆమె గురువారం మాట్లాడుతూ, ‘‘నా సొంత దేశానికి వచ్చినట్లే’’అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తన తాజా పర్యటన భావ ప్రకటన స్వేచ్ఛ, భిన్న గళాలకు రక్షణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందిగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేవారు. తస్లీమా ఆగస్టు ఒకటవ తేదీ కోల్కతాలో జరిగే ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రసిద్ధ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయలతో కలిసి పాల్గొననున్నారు. తస్లీమా నస్రీన్ జన్మతః బాంగ్లాదేశీ. అయితే 1994లో ఆమె రాసిన పుస్తకం ‘లజ్జ’పై కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. బాబ్రీ మసీదు ధ్వంసం నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యం జరగిందని తస్లీమా తన పుస్తకంలో రాసుకొచ్చారు. దీనికి ఆగ్రహించిన అక్కడి మతఛాందసవాదులు నిరసనలకు దిగడంతో 1997లో కోల్కతాకు వచ్చారు. పదేళ్లు ఇక్కడే గడిపిన తరువాత మరో వివాదం కారణంగా మళ్లీ బాంగ్లాదేశ్కు మకాం మార్చాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆమె కోల్కతా రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో తస్లీమా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కోల్కతా కేవలం పదేళ్లు ఉన్న నగరం మాత్రమే కాదని, తనదన్న సొంత భావనను అందించినదని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లు దూరంగా ఉన్నా పశ్చిమ బెంగాల్తో తన అనుబంధం మాత్రం కొనసాగిందని చెప్పారు. ‘‘నా మనసులో బెంగాల్ ఎన్నడూ ముళ్లకంచెలతో కూడిన సరిహద్దులతో విడిపోలేదు. బెంగాల్ తూర్పు దిక్కున తలుపులు నాకు ఎప్పుడూ మూసే ఉంటాయి. అందుకే నాకు ఈ వైపు బెంగాల్ ఇల్లు అయిపోయింది’’అని వ్యాఖ్యానించారు. కోల్కతా తిరిగి వస్తూండటం తనకు దుఖంతో కూడిన ఆనందాన్ని ఇస్తోందని, పంతొమ్మిదేళ్లు నన్ను నా మిత్రులు, పాఠకులు, సొంతమనే భావనను దూరం చేశారని, ఈ కాలాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరని భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘అలాగని తాను ఏదో అతిథిలానో, అపరిచితురాలి మాదిరిగానో రావడం లేదు. బెంగాల్లో ఒక భాగమనే విశ్వాసంతోనే వస్తున్నా’’అన్నారు. ఆ మాటకొస్తే తాను కోల్కతా వదిలింది కూడా ఇష్టపూర్వకంగా కాదని, ఏదో ఒక రోజు ఇక్కడకు తిరిగి వస్తానన్న నమ్మకం తనకు ఉండిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగానే కాకుండా.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోసం జరిగిన పోరాటానికి తన రాక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘‘ఛాందసులు నొక్కేసేందుకు ప్రయత్నించిన గొంతుక తిరిగి వస్తోంది. స్టేజీపై నా ఉనికి ఫత్వాలు, బెదిరింపులు ఒక రచయితను కొంతకాలం ప్రవాసానికి పంపవచ్చునేమో కానీ ఆమె ఆలోచనలను తుడిచివేయలేరు అనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది’’అని అన్నారు. అసౌకర్యంగా ఉన్న అభిప్రాయాలకూ రక్షణ కల్పించడమే భావ ప్రకటన స్వేచ్ఛకు కొలమానమని అన్నారు. ‘‘ఒక రచయిత స్వేచ్ఛ ప్రభుత్వ దయపై, లేదా ఒక పార్టీ సిద్ధాంతంపై లేదా మత సంస్థల అనుమతులపై ఆధారపడకూడదు. ప్రాథమిక హక్కులా ఉండాలి’’అన్నారు. భారతీయ పౌరురాలు కానప్పటికీ తనకు ఇక్కడ ఆశ్రయం దక్కడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ రచయితలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తోందని, అదే సమయంలో బెదిరింపులు అందుకేనేందుకూ కారణమవుతుందోని చెప్పారు. యువత ప్రతి విషయాన్ని ప్రశ్నించాలని, మతం, సంప్రదాయం, అధికారం, రాజకీయాలు మాత్రమే కాకుండా... వారికిష్టమైన ఆలోచనలనూ ప్రశ్నించాలని, ఎవరి భావాలనో తమవిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, వాటిని తమ నమ్మకాలుగా స్వీకరించవద్దు అని పిలుపునిచ్చారు. -
బంగ్లాదేశ్లో హసీనా అడుగుపెట్టగానే జరిగేది ఇదే: బంగ్లా మంత్రి
ఢాకా: భారత్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, నేరుగా కోర్టు ముందు లొంగిపోయే అవకాశం రాకముందే మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను అరెస్టు చేసే అవకాశం ఉందని బంగ్లాదేశ్ న్యాయ మంత్రి ఎం.అసదుజ్జామాన్ గురువారం చెప్పారు. ప్రాణాలకు ముప్పు ఉందనే భయం ఉన్నప్పటికీ డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్కు తిరిగి రావాలనే సంకల్పంతో ఉన్నానని హసీనా చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హసీనా ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "నన్ను చంపేయవచ్చు. నన్ను అరెస్టు చేయవచ్చు. నన్ను జైలుకు పంపవచ్చు. నా భవితవ్యం నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నా. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు" అని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఆమె పార్టీ సహచరులతో ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.హసీనాకు తిరిగి వచ్చే హక్కు ఉందని అసదుజ్జామాన్ చెప్పారు. అయితే "చట్టం తన పని తాను చేస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే పని మేం ఏదీ చేయం" అని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "మరణ శిక్ష పడిన వ్యక్తి అయినప్పటికీ, బంగ్లాదేశ్ పౌరురాలిగా చట్టాన్ని గౌరవిస్తూ స్వదేశానికి వచ్చి లొంగిపోవాలనుకుంటే, అలా చేసే అవకాశం రాకముందే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉంది. చట్టం మాకు ఇచ్చిన అధికారాన్ని వినియోగిస్తాం" అని చెప్పారు.తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ను రద్దు చేసిన తర్వాత ఆమె ఎలా తిరిగి వస్తారని అడగగా, మంత్రి స్పందిస్తూ "అది ఆమె సమస్య, నాది కాదు" అని చెప్పారు. "అయితే ఆమె మా భూభాగంలోకి ప్రవేశించిన క్షణం, చట్టం నాకు అప్పగించిన అధికారాన్ని అమలు చేస్తా" అని అన్నారు.బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక వీధి నిరసనల తర్వాత 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వెళ్లిపోయారు. తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఉగ్రవాద నిరోధక చట్టం కింద జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో ఆమె పార్టీ అవామీ లీగ్ను ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. 2025 నవంబర్లో, 2024 విద్యార్థి నిరసనలను అణచివేసిన ఘటనలో ఆమె దోషిగా తేలడంతో, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ విచారణలను "లోపభూయిష్టం" అని పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం వాటి న్యాయబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తింది. -
బంగ్లాదేశ్కు కొత్త కెప్టెన్
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఇటీవలి కాలంలో మెహిదీ హసన్ మిరాజ్ సారథ్యంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వంలో మార్పు చేయాలని బోర్డు నిర్ణయించింది.లిట్టన్ దాస్కు నాయకత్వ అనుభవం కూడా బాగానే ఉంది. గతంలో బంగ్లాదేశ్ వన్డే జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన ఆయన, 2021 నుంచి 2026 వరకు టీ20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక టెస్టులో కూడా జట్టును నడిపించాడు.ఈ ఏడాది డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగే వన్డే సిరీస్ నుంచి లిట్టన్ దాస్ అధికారికంగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దాస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహించనుండగా.. నజ్ముల్ హసన్ షాంటో టెస్ట్ జట్టు సారధిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తాజాగా జింబాబ్వే పర్యటనలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆగస్ట్లో ఈ జట్టు ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. -
బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తాను.. నన్ను చంపేయొచ్చు: షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (78) తన ప్రాణాలకు ముప్పు ఉన్నా డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి రావాలని దృఢంగా నిర్ణయించుకున్నానని మీడియాకు తెలిపారు. "నన్ను చంపేయొచ్చు. నన్ను అరెస్టు చేయొచ్చు. నన్ను జైలుకు పంపొచ్చు. నా భవిష్యత్తు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు" అని చెప్పారు.విద్యార్థుల నేతృత్వంలో 2024 ఆగస్టులో జరిగిన తిరుగుబాటుతో హసీనా పదవి కోల్పోయారు. ఆమె నివాసాన్ని జనాలు చుట్టుముట్టడంతో హెలికాప్టర్లో భారతదేశానికి వచ్చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో జరిగిన అణచివేత చర్యల్లో 1,400 మంది వరకు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.నవంబర్లో ఢాకా కోర్టు హసీనాను మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన నేరాల కేసులో దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును ఆమె "చట్టం రూపంలో కనిపిస్తున్న రాజకీయ ప్రతీకారం"గా అభివర్ణించారు. భారతదేశంలో రహస్య ప్రదేశంలో నివసిస్తున్న హసీనా తాను తిరిగి బంగ్లాదేశ్కు రావాలనే నిర్ణయంపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.హసీనా పదవి కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిక్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కాస్త స్థిరపడింది. హసీనాను అప్పగించాలని ఢాకా అధికారికంగా కోరింది. ఆ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది.అయితే తన తిరుగు ప్రయాణ నిర్ణయానికి ఆ అంశంతో సంబంధం లేదని హసీనా చెప్పారు. తాను భారతదేశంలో గౌరవప్రదంగా ఉంటున్నానని అన్నారు. "నన్ను అప్పగించే అంశంపై భారత అధికారులు నాతో చర్చించలేదు. నా దేశానికి తిరిగి రావాలని నేనే నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.ప్రత్యర్థుల హత్యలు, ప్రతిపక్ష పార్టీల అణచివేత, పక్షపాత న్యాయస్థానాలు, ఏకపక్ష ఎన్నికలు వంటి అనేక దుర్వినియోగాలకు హసీనా ప్రభుత్వం పాల్పడిందని మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో చాలా వరకు "రాజకీయంగా సృష్టించిన ప్రచారాలు" అని హసీనా సమర్థించుకున్నారు.తన పదవి కోల్పోవడానికి దారితీసిన విద్యార్థుల నిరసనల సమయంలో అధిక బలప్రయోగానికి తానే అనుమతి ఇచ్చానన్న ఆరోపణలను కూడా హసీనా ఖండించారు. "నా ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో సహనాన్ని ప్రదర్శించింది. విద్యార్థుల ఉద్యమాన్ని శాంతియుత పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది" అని ఆమె చెప్పారు. ఆ తిరుగుబాటు కేవలం సాధారణ విద్యార్థుల నిరసన కాదని ఆమె వ్యాఖ్యానించారు."అది రహస్య ఆదేశాలు, వ్యవస్థీకృత హింస, ప్రచారం, ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో నడిచిన ప్రణాళికాబద్ధ చర్యగా మారింది" అని ఆమె అన్నారు. భారత విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించేందుకు భారతదేశ వ్యాప్తంగా జరిగిన నిరసనలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. -
అక్కడే మేం గెలిచాం.. ఆసీస్ సిరీస్పై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్కు గౌరవకరమైన విషయమని పేర్కొన్నాడు. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు."గతంలో మా జట్టుతో ఆడేటప్పుడు ప్రత్యర్థులు తరచూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఈసారి ఆస్ట్రేలియా పూర్తి బలంతో కూడిన జట్టును పంపడం మా జట్టు సాధించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి జట్టుతో మా సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం" అని శాంటో అన్నాడు.ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్, బో వెబ్స్టర్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.అయితే సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. వికెట్కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఇంకా కాఫ్ గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్లు నహీద్ రానా (సైడ్ స్ట్రెయిన్), షోరిఫుల్ ఇస్లాం (హామ్స్ట్రింగ్ గాయం) కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.మరో పేసర్ ఎబాదోత్ హొస్సేన్ ఇటీవలే జన్మించిన తన బిడ్డతో ఉండేందుకు ఈ సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవసరమైతే తిరిగి జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.తొలి టెస్ట్ డార్విన్ వేదికగా ఆగస్టు 13-17 వరకు, రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22-26 మధ్య జరగనుంది. దీనికి ముందు పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్తో ఓ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 6-8 వరకు డార్విన్ వేదికగా జరుగనుంది. -
బంగ్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) ప్రకారం స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించారు. గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, గతంలో బైపాస్ శస్త్రచికిత్స, తాజాగా ఆటోనామిక్ న్యూరోపతి నిర్ధారణ కారణంగా దీర్ఘకాలిక చికిత్స అవసరమైందని లేఖలో పేర్కొన్నారు.2024 ఆగస్టులో జరిగిన రాజకీయ సంక్షోభం అనంతరం దేశాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడంలో తన పాత్రను సమర్థించుకున్నారు. ఆయన పదవీ కాలం 2028 ఏప్రిల్ వరకు కొనసాగాల్సి ఉండగా, మధ్యలోనే వైదొలిగారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన షహాబుద్దీన్.. ఆమెతో సీక్రెట్గా మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి.షహాబుద్దీన్ రాజీనామా.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. షహాబుద్దీన్ ఈ రాజీనామాతో.. మరో ఐదు నెలల్లో తిరిగి స్వదేశానికి రావాలని భావిస్తున్న షేక్ హసీనాకు అత్యున్నత అధికార వర్గాల్లో ఇక ఏ ఒక్క మిత్రుడు కూడా మిగలనట్లయింది. 2024 నాటి తీవ్రమైన విద్యార్థి ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండి ఆమెకు చెందిన 'అవామీ లీగ్' పార్టీపై నిషేధం విధించడమే కాకుండా.. పలువురు నాయకులు, కార్యకర్తలు జైలు పాలయ్యారు.. కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.షేక్ హసీనా పాలనా సమయంలోనే షాబుద్ధిన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి ఉద్యమ అనంతరం కూడా రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి ఆయనే. 2024 ఆగస్టు విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ఆమె ప్రకటించారు.కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు జాతీయ పార్లమెంట్ (జాతీయ సంసద్) స్పీకర్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 17.3 కోట్ల మంది జనాభా ఉన్న బంగ్లాదేశ్లో దేశాధ్యక్షుడే సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించినప్పటికీ, కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి, మంత్రి వర్గం చేతిలోనే ఉంటాయి. -
ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్
జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జులై 17) జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వే 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకొని, సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో జింబాబ్వే బంగ్లాదేశ్కు షాకిచ్చిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హస్సన్ (55), తంజిద్ హసన్ తమీమ్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో యాసిర్ అలీ (22 నాటౌట్), సైఫుద్దీన్ (31 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ఈవాన్స్ తలో 2 వికెట్లు తీయగా.. సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. రిషద్ హొస్సేన్ (4-26), మెహిది హసన్ (3-24) ధాటిఇ 19.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా, సైఫుద్దీన్ , సైఫ్ హస్సన్ తలో వికెట్ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సికందర్ రజా (28), బ్రాడ్ ఈవాన్స్ (25), ర్యాన్ బర్ల్ (29) తేలికపాటి మెరుపులు మెరిపించారు. నిర్ణయాత్మక మూడో టీ20 జులై 19న జరుగనుంది. కాగా, ఈ సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో, ఏకైక టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వే బంగ్లాదేశ్కు షాకిచ్చింది. ఏకైక టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
భారత్ నుంచి హసీనా తిరిగి బంగ్లా వెళ్తాననడానికి కారణాలేంటి?
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాకు తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఢాకాకు తిరిగి వస్తానని ప్రకటించారు. "నేను తిరిగి వచ్చిన వెంటనే నన్ను అరెస్టు చేయవచ్చు. నన్ను చంపేయవచ్చు కూడా... అయినా నేను వెళ్లాల్సిందే" అని ఆమె చెప్పారు. ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన, ప్రవాస జీవితం గడుపుతున్న, కోర్టు ఎదుట హాజరు కాకుండానే మరణశిక్ష ఎదుర్కొన్న హసీనా తనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న స్వదేశానికి ఎందుకు తిరిగి రావాలనుకుంటున్నారు? "మరణం వస్తే అది నా స్వదేశంలోనే రావాలి. నా తల్లిదండ్రులు సమాధి అయిన నేలలోనే రావాలి. వారి రక్తం చిందిన నేలలోనే రావాలి" అని ఆమె చెప్పారు.ఈ నిర్ణయాన్ని 6 నెలల ముందే ప్రకటించడం వెనుక కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా లేదు. హసీనా ప్రకటన ఢాకాలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను అర్థం చేసుకునే అవకాశం ఇస్తోంది. ముందుగా ఆమె పార్టీ అవామీ లీగ్ను పరిశీలిద్దాం.ఆ పార్టీపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటర్లు మద్దతు పలికారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అవామీ లీగ్కు మద్దతు ఉన్నా, మళ్లీ ప్రధాన రాజకీయాల్లోకి వచ్చే స్పష్టమైన మార్గం కనిపించడం లేదు. పార్టీ నాయకుల్లో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు ప్రవాసంలో ఉన్నారు. మరికొందరు బెయిల్పై బయట ఉన్నారు.ఈ పరిస్థితి పార్టీలో రెండు వర్గాలను సృష్టించింది. ఒక వర్గం ఇప్పటికీ హసీనాకు పూర్తి మద్దతు ఇస్తోంది. మరో వర్గం మాత్రం హసీనా కంటే పార్టీ సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రెండు వర్గాలూ అవామీ లీగ్ తిరిగి బలపడాలని కోరుకుంటున్నాయి. అయితే అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం హసీనా విధేయుల కంటే సంస్కరణవాదులను తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది. వారిని తక్కువ ప్రమాదకరంగా భావిస్తోంది.మాజీ పరిశ్రమల మంత్రి అమీర్ హొస్సేన్ అమూ, మాజీ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హక్ హసీనా విధేయులుగా గుర్తింపు పొందారు. మరోవైపు, తక్కువ వయసున్న మాజీ పర్యావరణ శాఖ మంత్రి సాబెర్ హొస్సేన్ చౌధురీ సంస్కరణవాదిగా గుర్తింపు పొందారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రెండూ కలిసి చౌధురీ నేతృత్వంలో "సంస్కరించిన" అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి. అయితే చౌధురీ ఆ బాధ్యత స్వీకరించకపోవడానికి జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ వ్యతిరేకత కంటే, హసీనా విధేయుల ప్రతీకారం భయం ఎక్కువ కారణమైంది.అవామీ లీగ్పై నిషేధాన్ని చట్టబద్ధం చేయాలన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం హసీనా విధేయులను రాజకీయంగా పక్కన పెట్టి, సంస్కరణవాదులకు మాత్రం అవకాశం ఇవ్వడమే. హసీనా ప్రవాసంలో ఎక్కువ కాలం ఉంటే పార్టీలో విభేదాలు మరింత పెరుగుతాయని ఆమెకు తెలుసు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో కూడా అవామీ లీగ్ పునరాగమనంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.సీనియర్ నాయకులు సలాహుద్దీన్ అహ్మద్, మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్, ఇక్బాల్ హసన్ మహ్ముద్, అమీర్ ఖస్రు మహ్ముద్ చౌధురీ లాంటి వారు సంస్కరణవాదులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అలా చేస్తే జమాత్-ఇ-ఇస్లామీ–నేషనల్ సిటిజన్స్ పార్టీ కూటమి రాజకీయ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, బలహీనమైన అవామీ లీగ్ను తమకు అనుకూలంగా మలచుకోవచ్చని వారి అంచనా. ఈ ఆలోచనకు ప్రధానమంత్రి తారెక్ రెహ్మాన్ కూడా కొంత మద్దతు ఇస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే యువ నాయకత్వం మాత్రం అవామీ లీగ్పై నిషేధం కొనసాగాలనే కఠిన వైఖరిలో ఉంది.అశాంతి చెలరేగే ప్రమాదం ఆ పార్టీ తిరిగి వస్తే వీధుల్లో మళ్లీ అశాంతి చెలరేగే ప్రమాదం, స్థానిక స్థాయిలో రాజకీయ పోటీ పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడటం, ఎన్నో ఏళ్ల అశాంతి తర్వాత నెలకొన్న ప్రశాంతతను కొనసాగించడం ప్రభుత్వానికి ప్రాధాన్యంగా మారింది. అవామీ లీగ్ పాలనలో జరిగిన దుర్వినియోగాల జ్ఞాపకాలు ఇంకా ప్రజల్లో సజీవంగా ఉండటంతో, ఆ పార్టీని తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడం ప్రజల్లో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ ప్రస్తుతం అవామీ లీగ్ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే నిర్ణయంపై ఏకాభిప్రాయంతో ఉన్నాయి.జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీలు అవామీ లీగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2024 జూలైలో విద్యార్థులు కాల్పులను ఎదుర్కొంటే, జమాత్-ఇ-ఇస్లామీ మాత్రం హసీనా పాలనలో చాలా కాలంగా వేధింపులు ఎదుర్కొంది. హసీనా అధికారం కోల్పోయిన తర్వాత తమకు దక్కిన పరిమిత రాజకీయ అవకాశాలను కూడా అవామీ లీగ్ తిరిగి వస్తే కోల్పోతామనే ఆందోళన ఈ పార్టీల్లో ఉంది. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాజకీయాలకు పరిమిత ప్రజాదరణ మాత్రమే ఉందని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికీ బలమైన స్థితిలో ఉందని అవి గుర్తించాయి.అందుకే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తొలి పాలనా కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని అవి భావించడం లేదు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుతో సంస్కరణవాదుల నేతృత్వంలో అవామీ లీగ్ తిరిగి బలపడితే, అది తమకు తక్షణ రాజకీయ ముప్పుగా మారుతుందని ఈ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే అవి మళ్లీ వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉంది. అది కొత్త రాజకీయ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది.ఇదే నేపథ్యంలో షేక్ హసీనా మరో 6 నెలల్లో ప్రవాస జీవితం ముగించి స్వదేశానికి వస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది స్వదేశానికి తిరిగి రావాలనే వయసు మీద పడిన ఆ నాయకురాలి వ్యక్తిగత కోరికా? తన పార్టీని కాపాడాలనే ప్రయత్నమా? లేక ప్రస్తుతం ఉన్న మూడు పార్టీల అవగాహనను దెబ్బతీయాలనే రాజకీయ ఎత్తుగడా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. -
బంగ్లాదేశ్కు మరో షాకిచ్చిన జింబాబ్వే
బంగ్లాదేశ్పై టెస్ట్, వన్డే సిరీస్ల విజయాల జోరు కొనసాగించిన జింబాబ్వే టీ20 సిరీస్ను కూడా ఘనంగా ప్రారంభించింది. బులవాయో వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో పర్యాటక జట్టును 32 పరుగుల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ (4/17), రిచర్డ్ నగరవా (4/26) అద్భుత బౌలింగ్తో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు.బెన్నెట్ మెరుపులుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 44 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, టాడివానాషే మరుమానీ కూడా మెరుపులు (2 సిక్సర్లు) మెరిపించాడు. మధ్యలో ర్యాన్ బర్ల్ 30 పరుగులతో జట్టును నిలబెట్టాడు. చివర్లో బ్రాడ్ ఇవాన్స్ అజేయంగా 19 పరుగులు చేసి స్కోరును 20 ఓవర్లలో 170/6కు చేర్చాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రాణా మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ, చివరి ఓవర్లో వరుస బౌండరీలు ఇవ్వడంతో జింబాబ్వే భారీ స్కోరు సాధించింది.ముజరబానీ, నగరవా ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిచర్డ్ నగరవా వరుసగా రెండు వికెట్లు తీయగా, వెంటనే ముజరబానీ మరో దెబ్బ కొట్టడంతో పవర్ప్లే ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 43/3తో కష్టాల్లో పడింది.యాసిర్ అలీ (54), తౌహిద్ హృదయ్ కలిసి పోరాడినా, కీలక సమయంలో భాగస్వామ్యం విరగడంతో మ్యాచ్ పూర్తిగా జింబాబ్వే వైపు మళ్లింది. చివర్లో ముజరబానీ, నగరవా మరోసారి వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను 19 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ సిరీస్లో రెండో టీ20 జులై 17న జరుగనుంది. -
కారు మెకానిక్కు జాక్పాట్.. రాత్రికి రాత్రే
యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్'..జూలై నెలకు సంబంధించిన మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈసారి భారతీయులకు నిరాశే మిగలగా, బంగ్లాదేశ్, అర్మేనియా ప్రవాసులను అదృష్టం వరించింది. మొత్తం నలుగురు విజేతలు తలా 25,000 దిర్హామ్ల (సుమారు రూ. 5.6 లక్షలు) చొప్పున ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.అయితే వీరిలో బంగ్లాదేశ్కు చెందిన 33 మహ్మద్ షఫీకుల్ ఇస్లాం ఒకరు. షఫీకుల్ గత 16 ఏళ్లుగా యూఏఈలో ఒక కార్ గ్యారేజీలో మెకానిక్గా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా తన స్నేహితులతో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి నెలా క్రమం తప్పకుండా టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. ఎట్టకేలకు అతడిని అదృష్టం వరించింది.తనకు దక్కిన విజయంపై షఫీకుల్ మాట్లాడుతూ.. "నాకు ఫోన్ కాల్ రాగానే నమ్మలేకపోయాను. ఇన్నేళ్ల నా నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం ఇది. ఈ ప్రైజ్ మనీని నాతో పాటు టికెట్ కొన్న స్నేహితులతో పంచుకుంటాను" అని చెప్పకొచ్చాడు. అతడితో పాటు ఈ జాబితాలో మరో ఇద్దరు బంగ్లా దేశీయులు మహమ్మద్ అమ్దాదుల్లా అలీ హొస్సేన్ ఉన్నారు. ఆగస్టు 3న మెగా డ్రాఈ వారుపు డ్రాలతో పాటు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ టికెట్ లైవ్ మెగా డ్రా ఆగస్టు 3న జరగనుంది. ఈ డ్రాలో మొదటి బహుమతిగా రికార్డు స్థాయిలో 2 కోట్ల దిర్హామ్లను (భారత కరెన్సీలో సుమారు రూ. 45 కోట్లకు పైగా) అందించనున్నారు. -
షేక్ హసీనాకు జైలు శిక్ష తప్పదు..! బంగ్లాదేశ్ సర్కార్ హెచ్చరిక
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నిషేధిత అవామీ లీగ్ పార్టీ నాయకురాలు షేక్ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లిపోతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వస్తే ఆమెను నేరుగా జైలుకు పంపుతామని ఆయన అన్నారు.కాగా 78 ఏళ్ల షేక్ హసీనా, 2024 ఆగస్టులో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా తన పదవిని కోల్పోయారు. ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె ఢాకా నుంచి పారిపోయి భారత్లో ఆశ్రయం పొందారు. అయితే నిరసనల సమయంలో హసీనా ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఢాకాలోని ప్రత్యేక అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును, తనపై వచ్చిన ఆరోపణలను షేక్ హసీనా పూర్తిగా "రాజకీయ ప్రేరేపితమైనవి" గా తోసిపుచ్చారు.హసీనా లొంగిపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. హసీనాను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు గత మధ్యంతర ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన అవామీ లీగ్ నాయకుల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకే ఆమె విదేశాల నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అని షామా ఒబేద్ ఇస్లాం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ తగిలింది. హాసీనాకు సంబంధించిన వార్తల ప్రసారంపై బంగ్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హసీనా చేసిన ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాలు లేదా ఆమెకు సంబంధించిన ఇతర వ్యాఖ్యలను ప్రచురించవద్దని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నదని ప్రభుత్వం వెల్లడించింది.ఈ సందర్భంగా బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ సలహాదారు డాక్టర్ జాహెద్ ఉర్ రహ్మాన్ మాట్లాడుతూ.. కొందరు మీడియా సంస్థలు కోర్టు నిషేధాన్ని పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపారు. అందువల్ల అన్ని మీడియా సంస్థలు న్యాయస్థానం ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. కాగా, ఇటీవల షేక్ హసీనా వార్తా సంస్థ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూను కొన్ని బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రచురించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ప్రభుత్వం మీడియాకు తాజా ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. 2024లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి దేశం విడిచిన సంగతి తెలిసిందే. అనంతరం, ఆమె భారత్లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్లో పలు కేసులు నమోదై ఉండగా, ఆమెను "పరారీలో ఉన్న మాజీ ప్రధాని"గా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇటీవల హసీనా ఈ ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి అధికారుల ఎదుట లొంగిపోతానని ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వాతంత్ర్యంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం మాత్రం ఇది కోర్టు ఆదేశాల అమలులో భాగమేనని చెబుతుండగా, విమర్శకులు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. -
పరువు కాపాడుకున్న బంగ్లాదేశ్
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్ జట్టు ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. ఈ పర్యటనలో తొలుత జరిగిన ఏకైక టెస్ట్లో ఘోరంగా ఓడిన ఆతిథ్య జట్టు.. ఆతర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి 0-2తో సిరీస్ కోల్పోయింది. అయితే ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్, సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకుంది.హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత జింబాబ్వే 48.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.తంజిద్ హసన్ తంజిమ్ 101 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (69) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో మసుకు 2, చివంగ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు షోరిఫుల్ ఇస్లాం (10-1-44-4), తస్కిన్ అహ్మద్ (10-4-32-2), తన్వీర్ ఇస్లాం (10-0-37-2), మొహమ్మద్ సైఫుద్దీన్ (9.1-1-31-1) ధాటికి జింబాబ్వే 199 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో వెస్లీ మెదెవెరె (75), బ్రాడ్ ఈవాన్స్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జులై 15, 17, 19 తేదీల్లో బులవాయో వేదికగా జరుగునుంది. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
చంపేసినా సరే... నా సొంత గడ్డపైనే ప్రాణాలు విడుస్తా అంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో తనపై మరణశిక్ష పడినప్పటికీ.. భయపడేది లేదని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశ ప్రవాసం ముగించుకుని బంగ్లాదేశ్ తిరిగి వెళ్లనున్నట్లు ఆమె ప్రకటించారు. అక్కడ కోర్టుల ముందే లొంగిపోయి.. తనపై వచ్చినవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని నిరూపిస్తానని రాయిటర్స్ ఇంటర్వ్యూలో హసీనా స్పష్టం చేశారు.హసీనాకు బంగ్లాదేశ్లో కొన్ని కేసుల్లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. విద్యార్థుల నిరసనలను అణచివేయడంలో ఆమె పాత్ర ఉందనే ఆరోపణలపై, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నవంబర్ 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది.1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు.ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు. -
జింబాబ్వేదే వన్డే సిరీస్
హరారే: సొంతగడ్డపై బంగ్లాదేశ్తో ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించిన జింబాబ్వే జట్టు... వన్డే సిరీస్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ కరన్ (135 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.బ్రాడ్ ఇవాన్స్ (38 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టగా... సికందర్ రజా (33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (90 బంతుల్లో 60; 5 ఫోర్లు), తన్జీద్ హసన్ (70 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో పోరాడారు. గత మ్యాచ్లో 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడిన బంగ్లాదేశ్... ఈ సారి 235 పరుగుల ఛేదనలో 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ 3 వికెట్లు పడగొట్టగా... ముజరబాని, బ్రాడ్ ఇవాన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శనివారం ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే జరగనుంది. -
భారత్కు ‘తీస్తా’ పరీక్ష
భారత్లోని సిలిగురి కారిడార్ సమీపంలో ఉన్న తీస్తా నదీ ప్రాజెక్టుపై చైనా మరోసారి దృష్టి సారించింది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ దేశం చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు షేక్ హసీనా ప్రభుత్వం వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాజెక్ట్ సున్నితమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉండటంతో ఈ పరిణామాలు భారత్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆధిపత్య పోటీ.. తూర్పు హిమాలయాల్లో పుట్టి, సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశించే తీస్తా నది 414 కిలోమీటర్లు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. ఇందులో అధిక వాటా కావాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ కారణంగా ఇరుదేశాల మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. మహ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చడానికి భారత్ ముందుకొచ్చింది. దీనిపై 2016 నుంచి చైనా కన్ను ఉంది.అయితే, 2020లోనే తీస్తా ప్రాజెక్టును ఆవిష్కరించినప్పటికీ, ఆర్థికపరమైన పరిమితులు, సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడంతో భారత్ ఆందోళనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా తుది ఆమోదాన్ని నిలిపివేశారు. అది ప్రణాళిక దశను దాటి ముందుకు సాగలేదు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కుదుర్చుకున్న తాజా ఒప్పందం, తీస్తా విషయంలో చైనాకున్న ఆసక్తిని తెలియజెప్పడమే కాదు.. బంగ్లాదేశ్పై ఆధిపత్యానికి భారత్, చైనాల మధ్య పోటీని కూడా ప్రతిబింబిస్తోంది.ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి సాధ్యాసాధ్యాల అధ్యయనానికే పరిమితమైనప్పటికీ, బంగ్లాదేశ్లోని అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా మరింతగా పాలుపంచుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న పవర్చైనా సంస్థ వల్ల మరింత ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేది ప్రైవేట్ సంస్థ కాదు. ఇది చైనా ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ద్వంద్వ–ఉపయోగ మౌలిక సదుపాయాలను నిర్మించిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. చైనా బంగ్లాదేశ్తో కలిసి పనిచేయనున్న తీస్తా ప్రాజెక్ట్ ఏమిటి? తీస్తా నది వెంబడి వరదలను నియంత్రించడం, నీటి భద్రతను మెరుగుపరచడం, నదీ జీవావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడం ఈ తీస్తా సీఎంఆర్పీ లక్ష్యం. నదీ తీరాల వెంబడి రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ కేంద్రాలు, పర్యాటక సౌకర్యాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు అభివృద్ధి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. 2016 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ జల అభివృద్ధి బోర్డు, చైనా ఇంజనీరింగ్ సంస్థ పవర్చైనాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంతో తీస్తా సీఎంఆర్పీ ప్రారంభమైంది.2019మేలో ఈ ప్రాజెక్ట్కు అధికారిక ప్రభుత్వ చట్రం లభించింది. 2020లో దీనినొక భారీ నదీ పునరుద్ధరణ కార్యక్రమంగా బహిరంగంగా ఆవిష్కరించారు. అప్పటి ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం సాధ్యాసాధ్యాల అధ్యయనాలను ప్రారంభించి, 2020లో ఈ ప్రతిపాదనను ఆవిష్కరించింది. వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతంలో పెద్ద ప్రాజెక్ట్పై భారత్ ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఆమె తుది ఆమోదం తెలపలేదు. చైనానే ఎందుకు?ఇప్పుడు మరోసారి చైనాతో బంగ్లాదేశ్ భాగస్వామ్యం కావడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమయ్యే గణనీయమైన ఆర్థిక వనరులు, అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యం. ఆనకట్టలు, నదీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. వరద నియంత్రణ, నీటిపారుదల రంగాలలో దానికి విస్తృతమైన అనుభవం ఉంది. 2022లో పూర్తయిన పద్మా వంతెనతో సహా, బంగ్లాదేశ్లో కూడా చైనా సంస్థలు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించాయి. తీస్తా నదీ జలాల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన మరో కారణం. బంగ్లాదేశ్కు ఎక్కువ నీటిని మళ్లించడం వల్ల రాష్ట్రంలోని రైతులకు నష్టం జరుగుతుందని పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కోల్కతా సమ్మతి లేకుండా కేంద్రం ముందుకు సాగలేకపోయింది. 2024లో తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ నిధులు సమకూర్చడానికి కేంద్రం ముందుకొచ్చింది. హసీనా వైదొలగడంతో తలెత్తిన రాజకీయ గందరగోళం చర్చలను నిలిపివేసింది. మహమ్మద్ యూనస్ మధ్యంతర పాలనలో భారత ప్రతిపాదన అటకెక్కింది. చైనా, భారత్ కంటే వేగంగా కదిలింది.భారత్కు ఆందోళన ఎందుకు? తీస్తా నది ప్రాజెక్టుపై చైనా–బంగ్లాదేశ్ ఒప్పందం గురించి భారత్ ఆందోళన చెందడానికి బలమైన కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది భౌగోళిక సామీప్యత. బంగ్లాదేశ్లోని నీల్ఫామరి, రంగపూర్ ప్రాజెక్టు ప్రాంతాలు, మనదేశంలోని జల్పాయిగురి జిల్లాకు ఆనుకొని ఉన్నాయి. అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్ కూడా ఇదే ప్రదేశంలో ఉంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే అత్యంత ఇరుకైన ఈ సన్నని భూభాగం, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే ఏకైక భూమార్గం. ఈ ప్రాంతంలో శత్రు ఉనికి భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీస్తుంది.బంగ్లాదేశ్లో చైనా ప్రభావం భారత్కు రెండు వైపుల భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. తీస్తా బేసిన్లో చైనా ప్రమేయం పెరగడం వల్ల అంతర్గత అశాంతి చెలరేగుతుంది. ఇప్పటికే సున్నితమైన ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతుంది. నదీ జలవనరుల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్తో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. ప్రాజెక్ట్పై అభిప్రాయాలను గతంలోనే ఆ దేశానికి తెలిపింది. ప్రస్తుతానికి, తీస్తా సాధ్యాసాధ్యాల అధ్యయనం చివరికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి. -
బంగ్లాదేశ్లో బాంబు పేలుడు.. ఎన్సీపీ ర్యాలీలో ఘోరం!
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. వేదికపై నుంచి ఒక పార్టీ నేత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ సమీపంలోనే ఈ పేలుడు జరిగింది.దీంతో అక్కడున్న వారంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనపై ఎన్సీపీ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సావర్ థానా స్టాండ్ ఈద్గా మైదానంలో రాత్రి 9:45 గంటల సమయంలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే ఢాకా సమీపంలోని కేరానిగంజ్లోని గ్యాస్ లైటర్ల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
బంగ్లాదేశ్పై జింబాబ్వే సంచలన విజయం
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఎదురైంది. సొంతగడ్డపై పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనలో మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. సోమవారం హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్పై 25 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నురుల్ హసన్ (31), తౌహిద్ హృదోయ్ (25), మెహదీ హసన్ (10) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవన్స్ చెరో మూడు వికెట్లు తీయగా, బ్లెసింగ్ ముజరబానీ, న్యూమన్ నైమూరి రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ నగరవా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 9న జరగనుంది.Read: సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్ -
జింబాబ్వే 141 ఆలౌట్.. బంగ్లా బౌలర్ అరుదైన రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్లో బంగ్లాదేశ్ బౌలర్ నహీద్ రానా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో నహీద్ రానా కెరీర్ బెస్ట్ బౌలింగ్ (10-2-21-6) ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆరు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించిన నహీద్ రానా ఐదు వికెట్ల ప్రదర్శనతో అరుదైన రికార్డు అందుకున్నాడు. రైట్ ఆర్మ్ పేసర్ అయిన నహీద్ రానా 14 వన్డే మ్యాచ్ల్లోనే మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మూడో బౌలర్గా నహీద్ రానా నిలిచాడు. ఈ జాబితాలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 6 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన (124 మ్యాచ్లు) తొలి స్థానంలో ఉండగా, అబ్దుల్ రజాక్ నాలుగు సార్లు (153 మ్యాచ్లు), ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నాలుగు సార్లు (247 మ్యాచ్లు) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. నహీద్ రానా మూడో స్థానంలో ఉండగా, తస్కిన్ అహ్మద్ రెండు సార్లు (92 మ్యాచ్లు) ఐదు వికెట్ల హాల్ నమోదు చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2024లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేసిన నహీద్ రానా అనతి కాలంలోనే స్టార్ బౌలర్గా ఎదిగాడు. 14 వన్డేల్లో 30 వికెట్లు పడగొడితే, అందులో ఈ ఏడాదిలోనే 25 వికెట్లు ఉండడం గమనార్హం. తొలుత పాకిస్తాన్తో మ్యాచ్లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన నహీద్ రానా, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై, తాజాగా జింబాబ్వేపై ఐదు వికెట్ల ఫీట్తో మెరిశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కూడా బ్యాటింగ్లో తడబడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 19 పరుగులు చేసి కష్టాల్లో పడింది. బ్లెసింగ్ ముజరబానీ 2 వికెట్లు తీయగా, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. -
భారత్కు చైనా బిగ్ షాక్.. చేజారిన ‘మోంగ్లా’ డ్రీమ్ ప్రాజెక్ట్!
భారతదేశానికి అత్యంత సమీపంలో సుందరబన్ వనాలకు ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ రెండవ అతిపెద్ద నౌకాశ్రయం ‘మోంగ్లా’ ఇప్పుడు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఇటీవల బీజింగ్లో జరిపిన తొలి అధికారిక పర్యటనలో చైనాతో కుదుర్చుకున్న ఒక ‘అవగాహనా ఒప్పందం’ సరిహద్దుల్లో సరికొత్త వ్యూహాత్మక ఉత్కంఠకు తెరలేపింది. ‘చైనా-బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్’ అభివృద్ధి కోసం చైనా ప్రభుత్వ రంగానికి చెందిన ‘చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’తో ఈ ఒప్పందం కుదిరింది. గతంలో భారత్ దక్కించుకున్న ప్రాజెక్టును కాదని, బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం భారత రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.చేజారిన భారత్ డ్రీమ్ ప్రాజెక్ట్2015లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన సందర్భంగా ఈ మోంగ్లా పోర్ట్ పరిధిలోని 110 ఎకరాల భూమిలో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎకనామిక్ జోన్) అభివృద్ధి చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అప్పట్లో షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు ఈ ప్రాజెక్టును కేటాయించింది. దీనికోసం భారత్ భారీగా రుణ సహాయం (లైన్ ఆఫ్ క్రెడిట్) అందించడమే కాకుండా, రవాణా సులభతరం చేయడానికి మోంగ్లా పోర్ట్ నుంచి ఖుల్నా వరకు సరికొత్త రైల్వే లైన్ను కూడా నిర్మించింది. అయితే, 2024లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత సమీకరణలు వేగంగా మారిపోయాయి.చైనాకు దక్కిన సువర్ణావకాశంభారత డెవలపర్ అయిన హీరానందానీ గ్రూప్ నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించలేకపోయిందనే కారణాన్ని చూపుతూ, 2025లో బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నుంచి భారత్ను తొలగించింది. భారత్ తప్పుకున్న తరుణం కోసమే ఎదురుచూసిన చైనా, తారిఖ్ రెహమాన్ నూతన ప్రభుత్వం రాగానే ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు చైనా ప్రభుత్వ సంస్థ ఇదే 110 ఎకరాల భూమిలో ‘చైనీస్ ఎకనామిక్ జోన్’ నిర్మించనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, టెలికాం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో పాటు భారీ లాజిస్టిక్స్ గోదాములను చైనా ఏర్పాటు చేయబోతోంది.భారత్కు తగిలిన డబుల్ స్ట్రోక్ఈ రేవు పట్టణం కేవలం బంగ్లాదేశ్కే కాకుండా భారత ఈశాన్య రాష్ట్రాలు (నార్త్-ఈస్ట్ స్టేట్స్), నేపాల్, భూటాన్ దేశాల వాణిజ్యానికి ఒక వ్యూహాత్మక హబ్గా మారే సత్తా ఉన్నది. 2024 మే నెలలో ‘ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్’ ద్వారా మోంగ్లా పోర్ట్ టెర్మినల్ నిర్వహణ హక్కులను భారత్ సాధించి బెంగాల్ ఖాళీలో చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ చైనా ఆర్థిక, పారిశ్రామిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుండటంతో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతాకు ఇంత దగ్గరగా చైనా రావడం భారత తీరప్రాంత భద్రతకు పెను సవాలుగా మారనుంది.గూఢచర్యమే అతిపెద్ద ముప్పుఈ ప్రాజెక్టును చైనా కేవలం వాణిజ్యపరమైనదని చెబుతున్నప్పటికీ, రక్షణ నిపుణుల విశ్లేషణల ప్రకారం ఇది తీవ్రమైన నిఘా ముప్పును తెచ్చిపెట్టనుంది. గతంలో శ్రీలంకలోని హంబన్తోట, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టులను కూడా చైనా ఇలాగే వాణిజ్య అవసరాల కోసమని చెప్పి, ఆ తర్వాత తన నౌకాదళ యుద్ధ నౌకలను, జలాంతర్గాములను (సబ్మెరైన్లను) మొహరించడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ ద్వారా భారత నౌకాదళ (ఇండియన్ నేవీ) కదలికలపై నిఘా ఉంచడానికి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి చైనా దీనిని ఒక గూఢచర్య కేంద్రంగా మార్చే ప్రమాదం ఉంది.సిలిగురి కారిడార్కూ సెక్యూరిటీ థ్రెట్బంగ్లాదేశ్ ప్రధానమంత్రి చైనా పర్యటనలో కేవలం మోంగ్లా పోర్ట్ మాత్రమే కాకుండా, తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులోనూ చైనా సహకారాన్ని కోరడం భారత్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తీస్తా నది ప్రాంతం భారతదేశానికి అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ‘సిలిగురి కారిడార్’ (చికెన్స్ నెక్) కు అతి సమీపంలో ఉంటుంది. ఈ కారిడార్ దేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. దీనికి తోడు బంగ్లాదేశ్-చైనా దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాలను సమన్వయం చేసుకునేందుకు '2+2 డైలాగ్' ప్రారంభించాలని నిర్ణయించడం బంగ్లాదేశ్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ఉచ్చుభారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టేందుకు చైనా ఎప్పటినుంచో వ్యూహాత్మక ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ (ముత్యాల హారం) విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దాదాపు 17 పోర్ట్ ప్రాజెక్టులలో చైనా భాగస్వామ్యం వహిస్తోంది. ఇప్పుడు అందులోకి బంగ్లాదేశ్కు చెందిన వ్యూహాత్మక మోంగ్లా పోర్ట్ కూడా చేరిపోవడంతో, భారత్ను తూర్పు వైపు నుంచి కూడా ఒత్తిడిలోకి నెట్టడానికి చైనాకు ఒక బలమైన స్థావరం దొరికినట్లయింది. భౌగోళిక రాజకీయాల పరంగా ఇది బంగాళాఖాతంలో భారత ఆధిపత్యానికి పెను సవాలుగా నిలవనుంది.ఇది కూడా చదవండి: తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు! -
బంగ్లాదేశ్ జట్టుకు కొత్త కెప్టెన్
బంగ్లాదేశ్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. త్వరలో జింబాబ్వేతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం తౌహిద్ హృదోయ్ తాత్కాలిక కెప్టెన్గా నియమించబడ్డాడు. రెగ్యులర్ కెప్టెన్ లిట్టన్ దాస్ లంక ప్రీమియర్ లీగ్లో పాల్గొనడానికి సెలవు తీసుకోవడంతో హృదోయ్కు ఈ బాధ్యత అప్పగించారు. జింబాబ్వేతో సిరీస్ జులై 15, 17, 19 తేదీల్లో బులవాయో వేదికగా జరగనుంది.ఈ సిరీస్ కోసం కెప్టెన్ సహా 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును నిన్న ప్రకటించారు. ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ మొసద్దక్ హొసేన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్లో అతను 157 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.మరోవైపు యాసిర్ అలీ సుమారు మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే మొహమ్మద్ సైఫుద్దీన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని తీసుకున్నారు.అయితే షమీమ్ హొసేన్ను మాత్రం ఫామ్ కోల్పోవడంతో ఈ సిరీస్కి విశ్రాంతి ఇచ్చారు. గత 9–10 ఇన్నింగ్స్లలో రన్స్ చేయలేకపోవడం దీనికి కారణంగా సెలెక్టర్లు తెలిపారు.ఈ కొత్త నాయకత్వంలో బంగ్లాదేశ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి. యువ కెప్టెన్ హృదోయ్కు ఇది తన కెరీర్లో తొలి పెద్ద బాధ్యతగా మారనుంది.బంగ్లాదేశ్ టీ20 జట్టు: తౌహిద్ హృదోయ్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, మొసద్దెక్ హొస్సేన్ సైకత్, యాసిర్ అలీ చౌదరి, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషాఫ్ అహ్మద్, రిషాఫ్ అహ్మద్ రెహమాన్, నహిద్ రాణా, ఎండీ సైఫుద్దీన్, అబ్దుల్ గఫార్ సక్లైన్. -
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే
టెస్ట్ క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బంగ్లాదేశ్కు పసికూన జింబాబ్వే భారీ షాకిచ్చింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా జింబాబ్వేకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. యువ పేసర్ న్యూమన్ న్యాముహురి నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. కెప్టెన్ నగరవా, బ్రాడ్ ఎవన్స్, ముజుర్బానీ తలా రెండు వికెట్లు సాధించారు. బంగ్లా బ్యాటర్లలో మోమినల్ హక్(60) ఒక్కడే రాణించాడు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్లో 410 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ ఇన్నోసెంట్ కాయా (140) భారీ సెంచరీతో కదం తొక్కాడు. బ్రియాన్ బెన్నట్(60), మాధవీరే(77), ఎర్విన్(60) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 7 వికెట్లతో సత్తాచాటాడు. ఆ తర్వాత 270 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన 185 పరుగులకే ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ 4, రిచర్డ్ నగరవా 3 వికెట్లు పడగొట్టారు. జింబాబ్వే వారి టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం ఇది మూడోసారి గమనార్హం. జింబాబ్వే గత టెస్టులో (అక్టోబర్ 2025) అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. -
కైయా సెంచరీ.. పట్టు బిగించిన జింబాబ్వే
హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో జింబాబ్వే పట్టు బిగించింది. ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా కెరీర్లో మొదటి శతకంతో (140) కదంతొక్కడంతో 270 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసి.. తమ తొలి ఇన్నింగ్స్లో 410 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం 9 పరుగులకు ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ 21, మొమినుల్ హక్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్కు బంగ్లాదేశ్ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది.జింబాబ్వే ఇన్నింగ్స్లో కైయాతో పాటు బ్రియాన్ బెన్నెట్ (59), క్రెయిగ్ ఎర్విన్ (60), వెస్లీ మదెవెరె (77 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. బెన్ కర్రన్ 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 7 వికెట్లతో సత్తా చాటగా.. ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.అంతకుముందు జింబాబ్వే బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్కే ఆలౌటైంది. న్యూమ్యాన్ న్యామ్హురి 4, కెప్టెన్ రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (60) మాత్రమే అర్ద సెంచరీతో రాణించగా.. షద్మాన్ (20), కెప్టెన్ షాంటో (19) మాత్రమే అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.తైజుల్ ట్రిపుల్ సెంచరీతొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసి జింబాబ్వేను ఇబ్బంది పెట్టిన బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తన అంతర్జాతీయ కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఒక్క టెస్ట్ల్లోనే 270 వికెట్లు తీసిన అతడు.. వన్డేల్లో 31, టీ20ల్లో ఓ వికెట్ తీశాడు. -
బంగ్లాతో చైనా ఒప్పందాలు.. భారత్ ఆందోళన ఏంటి? చైనా ఏమంది?
చైనా, బంగ్లాదేశ్ ఇటీవల 13 ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న విషయం తెలిసిందే. తీస్తా సహా తదితర నదుల నిర్వహణలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో దీని గురించి చైనా స్పందించింది. తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు (టీఆర్సీఎంఆర్పీ) విషయంలో బంగ్లాదేశ్కు తమ మద్దతు ఉంటుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్తో చేసుకున్న తమ ఒప్పందం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని చైనా తెలిపింది.బీజింగ్లో మీడియాతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ.. "చైనా-బంగ్లాదేశ్ సహకారం ఏ మూడో దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదు. చైనా-బంగ్లాదేశ్ సహకారంలో ఏ మూడో దేశం జోక్యం ఉండకూడదు" అని చెప్పారు.ఈశాన్య ప్రాంతానికి సమీపంలో నదితీస్తా నది పరివాహక ప్రాంతం భారత్ ఈశాన్య ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. ఇదే భారత్ ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం. తీస్తా నదికి సమీపంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్, అంటే చికెన్ నెక్ ప్రాంతం ఉండటమే భారత్ ఆందోళనకు ప్రధాన కారణం.ఆ ప్రాంతంలో, ముఖ్యంగా చైనా ఉనికి పెరగడం, భారత్ భద్రతా ఆందోళనలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశ ఈశాన్య ప్రాంతాన్ని మిగతా భారతదేశంతో కలిపే ఈ కారిడార్ విషయంతో సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.ఆ నదీ ప్రాజెక్టు బంగ్లాదేశ్ ప్రజల జీవనోపాధికి ఉపయోగపడే ప్రాజెక్టు అని చైనా పేర్కొంటోంది. "తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధర ప్రాజెక్టు అనేది బంగ్లాదేశ్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజల జీవనోపాధి ప్రాజెక్టు. దీనికి సాధ్యమైనంత సాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది" అని జియాకున్ చెప్పారు."అభివృద్ధి వ్యూహాల్లో బంగ్లాదేశ్తో మరింత సమన్వయం సాధించడానికి, ఆర్థికం, వాణిజ్యం, జల సంరక్షణ, ప్రజల జీవనోపాధి వంటి రంగాల్లో పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత పెంచడానికి చైనా సిద్ధంగా ఉంది" అని ఆయన అన్నారు.ఈ ప్రాజెక్టుపై ఇరు దేశాల నిపుణులు తొలిసారిగా సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్ తెలిపారు. "ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సాధ్యాసాధ్యాలపై జరిపే అధ్యయనం అనుకూలంగా ఉంటే ఈ ప్రాజెక్టుకు సాధ్యమైనంత మద్దతు ఇస్తామని చైనా తెలిపింది" అని మంత్రి అన్నారు.బంగ్లాదేశ్లోని నదుల నిర్వహణలో సహకారాన్ని పెంచుకోవడానికి బంగ్లాదేశ్, చైనా ఒప్పందాలు చేసుకున్నాయి. తీస్తా ప్రణాళికపై వచ్చే ప్రకటనలను భారత్ నిశితంగా గమనించనుంది.ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డు (బీడబ్ల్యూఢీబీ), చైనా ప్రభుత్వ అధీన సంస్థ పవర్ చైనా అవగాహన ఒప్పందం గడువును పొడిగిస్తూ సంతకాలు చేశాయి. దీనితో తీస్తా ప్రాజెక్టు ముందుకు సాగింది. -
భారత్కు చైనా షాక్.. బంగ్లాతో బిగ్ డీల్!
ఢాకా: బంగ్లాదేశ్–చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల తాజా సంయుక్త ప్రకటనలో మోంగ్లా పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా భాగస్వామ్యం మరింత పెరగనున్నట్లు వెల్లడైంది. ఈ పరిణామం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.బంగ్లాదేశ్–చైనా ప్రకటన ప్రకారం, మోంగ్లా పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు, వాణిజ్య సౌకర్యాల విస్తరణలో చైనా సహకారం కొనసాగనుంది. అయితే, ఇది బంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఒప్పందంలో భాగంగానే తీస్టా నది సమగ్ర నిర్వహణ ప్రాజెక్ట్లో కూడా చైనా సహకారం అంశం చోటు చేసుకోవడం భారత్లో వ్యూహాత్మక ఆందోళనలకు కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతం భారత్లోని సిలిగురి కారిడార్కు సమీపంలో ఉండటంతో భద్రతా పరంగా సున్నితమైనదిగా పరిగణించబడుతోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బంగ్లాదేశ్ చైనా భాగస్వామ్యాన్ని ప్రధానంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ కోణంలో చూస్తున్నప్పటికీ, దీని ద్వారా బంగాళాఖాతం ప్రాంతంలో శక్తి సమతుల్యతలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. భారత్ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పటికీ, అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే సముద్ర వాణిజ్య మార్గాలు, ప్రాంతీయ భద్రత, మరియు ఈశాన్య భారత వ్యూహాత్మక పరిస్థితులపై దీర్ఘకాల ప్రభావం ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామం తక్షణ రాజకీయ మార్పు కంటే దక్షిణాసియాలో చైనా ప్రభావ విస్తరణకు మరో సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.మోంగ్లా పోర్ట్ ప్రాజెక్ట్ ప్రాధాన్యం?మోంగ్లా పోర్ట్ బంగ్లాదేశ్లో రెండో అతిపెద్ద సముద్ర వాణిజ్య కేంద్రం. ఈ పోర్ట్ అభివృద్ధి ద్వారా బంగ్లాదేశ్కు దిగుమతి, ఎగుమతి సామర్థ్యం పెరుగుతుంది. కంటైనర్ హ్యాండ్లింగ్ వేగం మెరుగవుతుంది. బంగాళాఖాతం వాణిజ్య మార్గాల్లో రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, చైనా కంపెనీల భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారం పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే దీని ద్వారా చైనా సముద్ర వాణిజ్య నెట్వర్క్లో తన స్థానం బలపడే అవకాశం ఉంది.చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది?ఈ ఒప్పందం చైనాకు మూడు ప్రధాన ప్రయోజనాలు కల్పించవచ్చు:1. బంగాళాఖాతం ప్రభావంబంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఆర్థిక–లాజిస్టిక్ ఉనికి పెరుగుతుందిసముద్ర వాణిజ్య మార్గాలపై ప్రభావం పెరగవచ్చు2. ప్రాంతీయ కనెక్టివిటీ నెట్వర్క్బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) భాగంగా పోర్ట్ అభివృద్ధిదక్షిణాసియాలో రవాణా–వాణిజ్య హబ్లపై ప్రభావం3. దీర్ఘకాల వ్యూహాత్మక స్థానంఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై నియంత్రణ పెంపు -
బంగ్లాదేశ్కు భారత్ గుడ్న్యూస్
ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్లుగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల జారీని భారత్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 28 (ఆదివారం) నుంచి బంగ్లాదేశ్ పౌరుల నుంచి పర్యాటక వీసా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయనే సంకేతంగా భావిస్తున్నారు.ఢాకాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC) భారత హై కమిషనర్ దినేశ్ త్రివేది సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభ దశలో ఢాకా, రాజ్షాహీ, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా నగరాల్లోని ఐదు వీసా కేంద్రాల ద్వారా టూరిస్ట్ వీసా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామని వెల్లడించారు. కాగా, దినేశ్ త్రివేది ఇటీవలే బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్కు తన అధికార పత్రాలను సమర్పించిన కొద్ది గంటలకే ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన తెలిపారు.ఎందుకు నిలిపివేశారు?2024లో బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ విద్యార్థి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాలు, వీసా కేంద్రాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో భారత్ సాధారణ టూరిస్ట్ వీసాల జారీని నిలిపివేసింది. అయితే వైద్య చికిత్స, అత్యవసర కుటుంబ అవసరాలు, విద్య, వ్యాపార అవసరాలకు సంబంధించిన పరిమిత వీసా సేవలు మాత్రం కొనసాగించబడుతున్నాయి.ఇదిలా ఉండగా, భారత్.. బంగ్లాదేశ్ పౌరులకు అత్యధికంగా వీసాలు జారీ చేసే దేశాల్లో ఒకటి. కరోనా తర్వాత కూడా వీసా సేవలు పునరుద్ధరించబడినప్పటికీ 2024 రాజకీయ అశాంతి కారణంగా టూరిస్ట్ వీసాలపై పరిమితులు కొనసాగాయి. తాజాగా ఈ నిర్ణయం కేవలం వీసా సేవల పునఃప్రారంభం మాత్రమే కాదు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయనే సంకేతంగా కూడా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యాటకం, వాణిజ్యం, వైద్య సేవలు, విద్య, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహదపడే అవకాశం ఉంది.అలాగే ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న వాణిజ్య, భద్రత, సరిహద్దు నిర్వహణ అంశాలపై కూడా సహకారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, బంగ్లాదేశ్ పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు జారీ చేయాలన్న భారత్ నిర్ణయం, ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే పరిణామంగా భావిస్తున్నారు. -
వదిలేస్తూనే... విజయం దక్కింది!
మాంచెస్టర్: ఏకంగా నాలుగు క్యాచ్లు నేలపాలు, పేలవ ఫీల్డింగ్, బ్యాటింగ్లోనూ చివర్లో కాస్త తడబాటు... అయినా సరే చివరకు భారత మహిళల జట్టుకు కీలక విజయం దక్కింది. డెత్ ఓవర్లలో పదునైన బౌలింగ్తో పాటు షఫాలీ మెరుపులతో జట్టు గట్టెక్కింది. టి20 వరల్డ్ కప్లో సెమీస్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గురువారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జువేరియా ఫిర్దోస్ (31 బంతుల్లో 33; 5 ఫోర్లు), కెప్టెన్ నిగార్ సుల్తానా (27 బంతుల్లో 32; 4 ఫోర్లు), శోభన (22) రాణించారు. రాధ యాదవ్ (3/28) మూడు వికెట్లు పడగొట్టగా, ఆంధ్ర అమ్మాయి శ్రీచరణికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (34 బంతుల్లో 53; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (18 బంతుల్లో 23; 3 ఫోర్లు) తలా ఓ చేయి వేశారు. రితూ మోని 2 వికెట్లు తీసింది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. భారత్ ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటే బంగ్లా మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఐదో ఓవర్ కూడా పూర్తి కాక ముందే భారత్ నాలుగు క్యాచ్లు వదిలేసింది. ఇందులో ఫిర్దోస్వే 3 క్యాచ్లు ఉన్నాయి. యస్తిక, రాధ, నందిని (2) ఈ క్యాచ్లు జారవిడిచారు. దీనిని వాడుకున్న బంగ్లా బ్యాటర్లు ఆ తర్వాత వేగంగా పరుగులు జోడించారు. 106/3తో బంగ్లా మెరుగైన స్థితిలోనే నిలిచింది. అయితే ఈ దశలో మన బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. 30 పరుగుల వ్యవధిలో బంగ్లా తర్వాతి 5 వికెట్లు చేజార్చుకుంది. ఆరంభంలో వరుస బంతుల్లో రెండు క్యాచ్లు చేజారడంతో వికెట్ అవకాశం కోల్పోయిన శ్రీచరణి... ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో స్మృతి మంధాన (8) తొందరగానే అవుటైనా... షఫాలీ దూకుడుతో భారత్ దూసుకుపోయింది. 4 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్ను కీపర్ వదిలేయడం కలిసొచ్చింది. పవర్ ప్లేలో జట్టు 63 పరుగులు చేయగా, 29 బంతుల్లోనే షఫాలీ అర్ధ సెంచరీ పూర్తయింది. యస్తిక, రిచా (10) తక్కువ వ్యవధిలోనే అవుట్ కాగా... ఒక దశలో వరుసగా 23 బంతుల పాటు బౌండరీ రాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే 6 ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో జెమీమా 6 బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ బాది భారత్ పని సులువు చేసింది. ఆమె వెనుదిరిగినా... హర్మన్ (13 నాటౌట్), దీప్తి (5 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు.12 ఒకే టి20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా శ్రీచరణి రికార్డు నెలకొల్పింది. తాజా ప్రపంచకప్లో శ్రీచరణి 4 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు తీసింది. 10 వికెట్లతో పూనమ్ యాదవ్ (2020లో) పేరిట ఉన్న రికార్డును శ్రీచరణి సవరించింది. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు అమెలియా కెర్ (న్యూజిలాండ్; 2024లో 15 వికెట్లు) పేరిట ఉంది. -
బంగ్లాదేశ్పై టీమిండియా గెలుపు
బంగ్లాదేశ్పై టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపు137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్ (26) బ్యాట్ ఝులిపించారు. మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 (నాటౌట్), దీప్తి శర్మ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్, నహిద తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 28 లార్డ్స్లో జరుగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్, నెదర్లాండ్స్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్లో స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. షఫాలీ ఔట్8.4వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నహిద అక్తర్ బౌలింగ్లో నిగార్ సుల్తానా స్టంపింగ్ చేయడంతో షఫాలీ వర్మ (53) ఔటైంది.టీమిండియా స్టార్ బ్యాటర్ ఔట్2.6వ ఓవర్- 137 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (8) మూడో ఓవర్లోనేచ ఔటైంది. మరుఫా అక్తర్ బౌలింగ్లో రబేయా ఖాన్కు క్యాచ్ ఇచ్చి మంధాన పెవిలియన్ బాట పట్టింది. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 31-1గా ఉంది. మంధాన ఔటైనా మరో ఓపెనర్ షఫాలీ వర్మ (22) ధాటిగా ఆడుతుంది. స్వల్ప స్కోర్కే పరిమితమైన బంగ్లాదేశ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్12.5వ ఓవర్- 79 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి శోభన మోస్తరి (22) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్8.5వ ఓవర్- 59 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. జుయారియా ఫెర్దోస్ (33) నందిని శర్మ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యింది. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్లో శ్రీ చరణికి క్యాచ్ ఇచ్చి దిల్హర అక్తర్ (4) ఔటైంది. 3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 12-1గా ఉంది. బంగ్లాదేశ్తో కీలక సమరం.. టాస్ ఓడిన టీమిండియాఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 25) కీలక మ్యాచ్ జరుగనుంది. మాంచెస్టర్ వేదికగా భారత్,బంగ్లాదేశ్ తలపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మబంగ్లాదేశ్: దిల్హర అక్తర్, జువైరియా ఫిర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(w/c), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, రబెయా ఖాన్, నహిదా అక్తర్, శంజిదా అక్తర్ మేఘలా, మరుఫా అక్తర్ -
గెలుపు + రన్రేట్పై గురి
మాంచెస్టర్: పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై ఘన విజయాలతో టి20 ప్రపంచకప్ను గొప్పగా ప్రారంభించిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో ఒక్కసారిగా తమ పరిస్థితిని కాస్త సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు తర్వాతి పోరులో బలహీన జట్టు బంగ్లాదేశ్పై చెలరేగి గెలిస్తే జట్టు ముందంజ వేసే అవకాశాలు మెరుగవుతాయి. నేడు జరిగే ఈ మ్యాచ్లో విజయంతో పాటు మంచి రన్రేట్ కూడా హర్మన్ప్రీత్ బృందానికి అవసరం. ఓవరాల్గా బంగ్లాదేశ్పై 20–3 రికార్డుతో భారత్దే పైచేయి అయినా... ఉదాసీనత కనబరిస్తే బంగ్లాదేశ్ కూడా షాక్ ఇవ్వగలదు. గత పోరులో పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జోరు మీదుంది. భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి 150కు పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించి శుభారంభం ఇస్తున్నారు. అయితే జెమీమా, హర్మన్, యస్తిక తడబాటుతో భారీ స్కోరు సాధించడం జట్టుకు కష్టంగా మారుతోంది. 3 మ్యాచ్లలో కలిపి జెమీమా 32 పరుగులే చేసింది. లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్ దూకుడుగా ఆడటం సానుకూలాంశం. గత మ్యాచ్లో అరంగేట్రం చేసిన లెగ్స్పిన్నర్ ప్రేమ రావత్ విఫలం కావడంతో ఆమె స్థానంలో రాధ యాదవ్కు అవకాశం దక్కవచ్చు. బంగ్లాను పదునైన పేస్తో ఇబ్బంది పెట్టే వ్యూహంతో క్రాంతి గౌడ్ను తుది జట్టులో చేర్చాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎడంచేతి వాటం స్పిన్నర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి నిలకడగా రాణిస్తోంది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్లో ఓపెనర్ ఫిర్దోస్, కెపె్టన్ నిగార్ సుల్తానాలపై ఆధారపడుతుండగా... బౌలింగ్లో మారుఫా అక్తర్, నాహిదా అక్తర్ కీలకం కానున్నారు. గ్రూప్ ‘1’లో ఆడిన నాలుగు మ్యాచ్లూ గెలిచి ఆ్రస్టేలియా సెమీఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకోగా, రెండో స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. నేటి మ్యాచ్లో నెదర్లాండ్స్తో, ఆ తర్వాత బంగ్లాదేశ్తో సఫారీ టీమ్ ఆడాల్సి ఉండగా... భారత్ చివరి పోరులో ఆ్రస్టేలియాను ఎదుర్కొంటుంది. కాబట్టి రన్రేట్లో దక్షిణాఫ్రికాతో పోటీ పడాలంటే హర్మన్ బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. -
అప్పుడు పాక్.. ఇప్పుడు బంగ్లాదేశ్.. భారత్ అప్రమత్తం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రస్తుతం చైనాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చైనా ప్రధానమంత్రి లీని, అధ్యక్షుడు షీ జిన్పింగ్ను కలవనున్నారు. ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా బంగ్లాదేశ్ జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన, తుది చర్చలు వంటివి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.పాకిస్థాన్ కూడా ఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్పై వీటిని ఉపయోగించినట్లు సమాచారం. ఆ సమయంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద ముప్పులను సమర్థంగా నిర్వీర్యం చేసింది.బంగ్లాదేశ్ 24 చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఈ ఒప్పందం కీలక ఫలితంగా నిలవనుందని భావిస్తున్నారు.పలు నివేదికల ప్రకారం.. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటున్నాయి చైనా, పాకిస్థాన్. 2026 ఆగస్టు నాటికి యుద్ధ విమానాల కొనుగోలును ఖరారు చేయాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. జె-10సీ అనేది చైనా వైమానిక దళం వినియోగించే యుద్ధ విమానం. జె-10సీఈ అనేది ఇతర దేశాలకు విక్రయించేందుకు రూపొందించిన వెర్షన్.ఈ కొనుగోలుతో పాకిస్థాన్ తర్వాత ఈ ప్రత్యేక విమానాన్ని వినియోగించే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్లు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలపై చైనా, బంగ్లాదేశ్ అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సోర్సెస్ తెలిపాయి.బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునికీకరణ చేసుకోవాలనుకుంటోంది. జె-10సీఈ ఆ దేశ వైమానిక యుద్ధ సామర్థ్యాలను బాగా పెంచవచ్చు. అదే సమయంలో దక్షిణాసియాలో వ్యూహాత్మక ప్రభావాలు కూడా ఉంటాయి. ఇది బంగ్లాదేశ్-చైనా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు బంగాళాఖాతంలో ప్రాంతీయ సమతౌల్యాన్ని ప్రభావితం చేయవచ్చు.ఎక్కడ మోహరిస్తారు? భారత్ విషయానికి వస్తే, మన దేశం రెండు పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒప్పందం కుదిరి యుద్ధ విమానాలు బంగ్లాదేశ్కు చేరితే, వాటిని ఎక్కడ మోహరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.బంగ్లాదేశ్ ఇప్పటికే ఉత్తర బంగ్లాదేశ్లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరం (బీఏఎఫ్ స్టేషన్ లాల్మొనిర్హాట్)ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రదేశాల వైమానిక స్థావరంగా ఇది పనిచేసింది. ఈ స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కి.మీ దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్కు సమీపంలోనూ ఉంది. ఈ స్థావర పునరుద్ధరణకు చైనా సాయం చేసే అవకాశంపై చర్చలు జరిగాయి. ఈ బంగ్లాదేశ్ వైమానిక దళ కేంద్రంలో కొత్త యుద్ధ విమాన హ్యాంగర్లు నిర్మించే పనులు కూడా ఉన్నాయి.కేంద్ర సర్కారు ఏమన్నది? భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ స్థావరం ఉండటంతో భారత్లో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025 ఆగస్టు 8న లోక్సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనించింది. 2025 మే 26న బంగ్లాదేశ్ సైన్యం సైనిక కార్యకలాపాల సంచాలకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని కూడా గమనించింది. ప్రస్తుతం లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని సైనిక అవసరాలకు వినియోగించే ప్రణాళికలు లేవని ఆయన చెప్పారు. జాతీయ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు.పాకిస్థాన్ వైమానిక దళం ప్రస్తుతం 36 చైనా తయారీ చెంగ్డు జె-10సీఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. జె-10 విమానాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. కనీసం 42 చెంగ్డు జె-10 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయం ఇండోనేషియా రక్షణ కొనుగోలు విధానంలో మార్పును సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆ దేశం రష్యా, అమెరికాపై ఆధారపడేది. -
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా బ్యాటర్ మారిజెన్ కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్తో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు విజయాలు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. అయితే భారత్ తొలి రెండు మ్యాచ్లు (పాకిస్తాన్, నెదర్లాండ్స్) భారీ తేడాతో గెలవడంతో మెరుగైన నెట్ రన్రేట్ (+2.511) కారణంగా పట్టికలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ కంటే ముందుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు తలా రెండు మ్యాచ్లు మిగిలి ఉండడం, ఆసీస్ ఆడిన మూడింట గెలిచి సెమీస్ రేసులో ఒక మెట్టు పైనే ఉంది. అయితే హర్మన్ సేన సెమీస్ చేరడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.సెమీస్ అవకాశాలు ఇలా..భారత మహిళల జట్టు తమ చివరి రెండు మ్యాచ్లను ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ హర్మన్ సేన గెలిస్తే 8 పాయింట్లతో నెట్ రన్రేట్తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. అలా కాకుండా ఒక మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్లో ఓడితే మాత్రం నెట్ రన్రేట్ కీలకం కానుంది. అదే సమయంలో సౌతాఫ్రికా కూడా తాను ఆడబోయే రెండింటిలో ఒక దానిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లతో పోలిస్తే భారత్ రన్రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాపై ఓడినా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే భారత జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బంగ్లాదేశ్ మనపై విజయం సాధిస్తే మాత్రం రన్రేట్ పడిపోయి హర్మన్ సేన ఎలిమినేట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక హర్మన్ సేన తాము ఆడబోయే రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైతే మాత్రం ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా టోర్నీ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లో ఒక జట్టు సెమీస్ చేరుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అప్పుడు గ్రూప్-బి నుంచి మరో సెమీస్ స్థానానికి భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్పోటీపడాల్సి వస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.ఓపెనర్ షఫాలీ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలవగా, దీప్తిశర్మ (29), హర్మన్ప్రీత్ (24) పర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో మారిజెన్ కాప్, షబ్నమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా కాప్ సంచలన ఇన్నింగ్స్తో 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తంజిమ్ బ్రిట్స్ (40), లారా వోల్వర్ట్ (20) రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టింది.చదవండి: కొంపముంచిన రెడ్కార్డ్.. బెల్జియంకు ఇరాన్ షాక్ -
పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ దశలో పాక్కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు తదుపరి రౌండ్కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకుంది. గ్రూప్-ఏలో బంగ్లా, పాక్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. పాక్, నెదర్లాండ్స్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. వీరు మినహా మరే ఇతర బంగ్లా బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. పాక్ బౌలర్లు తొలి 16 ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్నారు. షోర్నా అక్తెర్ చివర్లో పాక్ బౌలర్ల భరతం పట్టింది. ముఖ్యంగా తస్మియా రుబాబ్ బౌలింగ్ను చీల్చిచెండాడింది. రుబాబ్ మినహా పాక్ బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ ఫాతిమా సనా (4-1-18-2), నష్రా సంధు (4-0-14-1), సదియా ఇక్బాల్ (4-0-21-1) అద్బుతమైన గణాంకాలు నమోదు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. షంజిద అక్తెర్ (4-0-21-3), నహిద అక్తెర్ (4-0-18-3), రబేయా ఖాన్ (4-1-17-1), మరుఫా అక్తెర్ (4-1-18-0), రితూ మోనీ (4-0-24-1) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. -
బంగ్లాదేశ్లో హిందువుల భారీ ఆందోళన.. జై శ్రీరామ్ నినాదాలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ నిరసనకు దిగారు. ఉత్తర బంగ్లాదేశ్లోని గైబాంధా జిల్లాలో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారన్న ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. నిరసనల సందర్భంగా ఢాకా వీధులు "జై శ్రీరామ్" నినాదాలతో మార్మోగాయి.అసలు వివాదం ఏమిటి?గైబాంధా జిల్లాలోని పలాష్బారి ప్రాంతంలో సుమారు 81 అడుగుల ఎత్తుతో శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీనిని బంగ్లాదేశ్లోనే అతిపెద్ద శ్రీరామ విగ్రహంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టును కొందరు ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రదర్శనలో శ్రీరాముడి చిత్రాన్ని చెప్పులతో కొట్టినట్లు, అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.Massive protests in Dhaka yesterday saw Bangladeshi Hindus call for justice over the desecration of Bhagwan Shri Ram's image by Islamists and seek the continuation of the halted 81-foot Ram murti project in Gaibandha. pic.twitter.com/za4vFu6c2y— Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2026వీధుల్లోకి వేలాది మందిఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు తొలుత టార్చ్లైట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ విద్యార్థి సంఘాలు, మైనారిటీ హక్కుల సంస్థలు, సామాజిక సంఘాల పిలుపుతో షాహ్బాగ్ ప్రాంతంలో భారీ నిరసన జరిగింది. నిరసనకారులు దోషులను వెంటనే అరెస్టు చేయాలని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.72 గంటల అల్టిమేటంనిరసనలకు నాయకత్వం వహించిన హిందూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గైబాంధాలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ విగ్రహ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, మత సామరస్యంపై మరోసారి చర్చ మొదలైంది. హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్య పరిషత్ సహా పలు సంస్థలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మత విద్వేష ఘటనలను అరికట్టాలని కోరాయి. -
భారత్కు పాక్ కొత్త సవాల్.. 1971 గాయం మానలేదా?
భారత్-పాకిస్తాన్ మధ్య 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పెద్దగా కనిపించని పాకిస్తాన్ నౌకాదళం.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. చైనా సాయంతో నిర్మించిన అత్యాధునిక హంగోర్-క్లాస్ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం నౌకాదళ విస్తరణేనా? లేక 1971 తర్వాత కోల్పోయిన వ్యూహాత్మక ప్రభావాన్ని తిరిగి సాధించాలనే ప్రయత్నమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.1971లో ఏం జరిగింది?1971 యుద్ధం పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద సైనిక, రాజకీయ పరాజయం. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. దీంతో పాక్కు బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ (PNS Ghazi) విశాఖపట్నం సమీపంలో మునిగిపోయింది. తూర్పు ప్రాంతంలో భారత నౌకాదళం సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్కు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం దాదాపు లేకుండాపోయింది. అప్పటి నుంచి పాక్ నౌకాదళం ప్రధానంగా అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ ప్రాంతాలకే పరిమితమైంది.పాక్ ప్లానేంటి?పాకిస్తాన్ నౌకాదళం చైనా సహకారంతో కొనుగోలు చేస్తున్న 8 హంగోర్-క్లాస్ జలాంతర్గాములు దాని సముద్ర వ్యూహంలో పెద్ద మార్పునకు నాంది పలుకుతున్నాయి. మొదటి జలాంతర్గామి PNS హాంగోర్ ఇప్పటికే పాక్ నౌకాదళంలో చేరింది. మిగిలినవి 2028 నాటికి దశలవారీగా చేరనున్నాయి. పాక్ నౌకాదళ అధికారుల ప్రకారం.. ఈ కొత్త సామర్థ్యాలతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది.హంగోర్ జలాంతర్గాముల ప్రత్యేకత?ఈ జలాంతర్గాములు చైనా Type-039B యూవాన్ క్లాస్ నమూనా ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ సామర్థ్యాల వల్ల పాక్ నౌకాదళానికి గతంతో పోలిస్తే గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.వీటి ప్రధాన ప్రత్యేకతలు:AIP (Air Independent Propulsion) టెక్నాలజీనీటి అడుగున ఎక్కువకాలం ప్రయాణించే సామర్థ్యంతక్కువ శబ్దంతో కదిలే స్టెల్త్ సిస్టమ్ఆధునిక సోనార్, సెన్సార్ వ్యవస్థలుటార్పెడోలు, యాంటీ-షిప్ క్షిపణుల సామర్థ్యంభవిష్యత్తులో బాబర్-3 క్రూయిజ్ క్షిపణుల వినియోగ అవకాశాలుచైనా పాత్ర ఎంత కీలకం?ఈ ప్రాజెక్టు వెనుక అసలు శక్తి చైనానే. హంగోర్ జలాంతర్గాముల ఒప్పందం విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. నాలుగు జలాంతర్గాములు చైనాలో, మరో నాలుగు కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు. భారత్ చుట్టూ "స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్" వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా, గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు.భారత్కు ఆందోళన అంశమేనా?సైనికంగా చూస్తే ప్రస్తుతం భారత నౌకాదళం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్లు, దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థలు, తూర్పు నౌకాదళ కమాండ్ వంటి అంశాల్లో భారత్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. అయితే, పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల భారత నౌకాదళం తన తూర్పు తీర భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే భారత్ కూడా కొత్త జలాంతర్గాముల కొనుగోలు, దేశీయ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.బంగ్లాదేశ్ అంశం కూడా కీలకమేపాక్ బంగాళాఖాతంలో ఉనికిని పెంచాలంటే బంగ్లాదేశ్తో సంబంధాలు కీలకం కానున్నాయి. గత కొంతకాలంగా ఇస్లామాబాద్-ఢాకా సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతం ఇప్పటికీ భారత ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందువల్ల పాక్ ఉనికి పెరిగినా, అది ఎంత స్థాయిలో ప్రభావం చూపగలదన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. కాగా, వాస్తవానికి బంగాళాఖాతంలో పాక్ నిరంతర ఉనికి కొనసాగించడం అంత సులభం కాదు. భౌగోళిక పరిమితులు, లాజిస్టిక్స్, భారత నౌకాదళ ఆధిపత్యం వంటి అంశాలు ఇప్పటికీ ఇస్లామాబాద్కు పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. -
బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారుకు షాక్.. ఇచ్చి పడేసిన భారత్
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్కు దిల్లీ విమానాశ్రయంలో ఉహించని ఘటన ఎదురైంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను రెండు గంటలకు పైగా తనిఖీకోసం ఎదురు చూసేలా చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రెహమాన్ ఢిల్లీ విమానాశ్రయంలో నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏం జరిగింది?ఐఓఆర్ఏ (ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్) సీనియర్ అధికారుల కమిటీ 28వ సమావేశంలో పాల్గొనేందుకు జహీద్ ఉర్ రెహమాన్ ఆదివారం (జూన్ 14, 2026) ఎయిర్ ఇండియా విమానంలో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ కథనాల ప్రకారం "మొదట ఇమిగ్రేషన్ అధికారులు ఎటువంటి కారణం చెప్పకుండా ఆయన్ను ఆపేశారు. కారణం అడిగినప్పుడు, అంతా బానే ఉందని, కొన్ని వివరాలు సరిచూస్తున్నామని చెప్పారు. వారి ప్రవర్తన, విచారించిన తీరు కనీస మర్యాద లేకుండా సాగింది. ఒక రాష్ట్ర మంత్రి హోదా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా, సాధారణ ప్రయాణికులతో పాటు సోఫాలో కూర్చోబెట్టారు. రెండు గంటల నిరీక్షణ తర్వాత క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. కానీ, అప్పటికే నిరాశకు గురైన రెహమాన్ వెనక్కి వెళ్లడానికే మొగ్గు చూపారు." అని ఢాకా పేర్కొంది.అయితే ఈ అంశంపై దౌత్యపరమైన దుమారం చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలూర్ రెహమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది "విచారకరం" అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నిరసనగా ఢాకాలోని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పవన్ బాథేను బంగ్లాదేశ్ ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది.భారత్ స్పందన ఏంటి?భారత అధికారులు మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. జహీద్ ఉర్ రెహమాన్కు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, గత కొన్నేళ్లుగా భారత్కు వ్యతిరేకంగా, అలాగే బంగ్లాదేశ్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారని అధికారులు గుర్తుచేశారు.జాహెద్ ఉర్ రెహమాన్ గతంలో పలుమార్లు భారత్ను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాసిస్ట్ అని పిలవడంతో పాటు భారత్ హిందూ కార్డు వాడుతోందనే ఆరోపణలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలుమార్లు భారత్ను కించపరుస్తూ మాట్లాడారు. భారత్ బంగ్లాదేశ్ను అస్థిరపరచాలని చూస్తోందని, బంగ్లాదేశ్లోని తమ ప్రాజెక్టుల నుండి అదానీ గ్రూప్కు వచ్చే లాభాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వెళ్తున్నాయని కూడా అతను ఆరోపించారు. ఈ చర్యలతో అతని పేరును గతంలోనే ఇమ్మిగ్రేషన్ వాచ్లిస్ట్లో చేర్చామని పేర్కొన్నారు. -
బోణీ కొట్టిన బంగ్లాదేశ్
2026 మహిళల టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ తమ ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇవాళ (జూన్ 14) జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నీ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. అరంగేట్రం బ్యాటర్ ఫిర్దౌస్ (50) మెరుపు అర్ద శతకంతో బంగ్లా గెలుపుతో ప్రధానపాత్ర పోషించింది.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మరుఫా అక్తర్ (4-0-31-2), ఫరిహా త్రిస్న (4-0-32-1) చక్కటి బౌలింగ్తో కీలక వికెట్లు పడగొట్టారు. అయితే కెప్టెన్ బార్బెట్ డి లీడ్ 45 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. లీడ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. ఆఖర్లో ఐరిస్ జ్విల్లింగ్ (13 నాటౌట్), సిల్వర్ సీగర్స్ (10 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఫిర్దౌస్, దిల్హర అక్తర్ (26) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 67 పరుగులు జోడించి జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు. ఫిర్దౌస్ కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. ఆమె ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.అంతా సజావుగా సాగుతున్న వేల, నెదర్లాండ్స్ బౌలర్లు అనూహ్య పోరాట పటిమ కనబరిచారు. కరోలిన్ డి లాంజ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చింది. ఫిర్దౌస్ అర్ధశతకం అనంతరం ఔట్ కాగా, కెప్టెన్ నిగార్ సుల్తానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అనంతరం సిల్వర్ సీగర్స్ దిల్హరాను ఔట్ చేయగా, ఫ్రెడెరిక్ ఓవర్డైక్ అద్భుత డైరెక్ట్ హిట్తో శోభన మోస్తరీను రనౌట్ చేసింది. దీంతో బంగ్లా స్కోర్ 67/0 నుంచి 85/4కు పడిపోయి ఒత్తిడిలో పడింది.ఈ దశలో అనుభవజ్ఞురాలు షర్మిన్ అక్తర్ (37 నాటౌట్), యువ బ్యాటర్ షోరఆన అక్తర్ (18 నాటౌట్) జాగ్రత్తగా ఆడి, మరో 5 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ను (4 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లాంజ్ 2, సిల్వర్ ఓ వికెట్ తీశారు. -
మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్ను చేజార్చుకున్న ఆసీస్.. నేటి మ్యాచ్లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది.275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కన్నోల్లీ (149) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (4 నాటౌట్) బౌండరీ సాధించి, ఆసీస్ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్ (2 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా ఆసీస్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్ శిబిరంలో ఉత్కంఠ రేపాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ .. తౌహిద్ హృదోయ్ (83), లిటన్ దాస్ (58 నాటౌట్), మొసద్దెక్ హొసేన్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కన్నోల్లీ ఒంటరిపోరాటం చేశాడు. అతడికి లబూషేన్ (29), గ్రీన్ (27), పీక్ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. కాస్త అటుఇటు అయ్యుంటే ఈ మ్యాచ్ కూడా ఆసీస్ చేజారేది. షోరిఫుల్ ఇస్లాం (10-1-48-6) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ శిబిరంలో రైళ్లు పరిగెట్టించాడు. ఈ పర్యటనలో ఆసీస్ తదుపరి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చట్టోగ్రామ్ వేదికగా జూన్ 17న జరుగనుంది. -
హైదరాబాద్లో బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి..
హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్కు తరలించారు. విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా... గాజులరామారం–జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ బంగ్లాదేశీయులు పట్టుబడుతుండడం గమనార్హం.భారత్లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని వందలాది బంగ్లాదేశీయులు ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని బితారి-హకింపూర్ సరిహద్దు కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అక్రమ వలసదారులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న "గుర్తించు-తొలగించు-బహిష్కరించు" వ్యూహం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని వారు ప్రయత్నించారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుమానిత చొరబాటుదారులందరికీ వెళ్లిపోవాలని, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "జల్దీ జల్దీ భాగో నహీ తో జో కర్నా హై సర్కార్ కరేగా (వెంటనే పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది)" అని ఆయన అన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా, ఇతర వలసదారుల కోసం 23 జిల్లాల్లో "నిర్బంధ కేంద్రాలు" ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. -
భారత్, పాక్, బంగ్లాదేశ్ల నుంచి గల్ఫ్కు 1.90 కోట్ల మంది వలస
న్యూఢిల్లీ: 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈలకు బతుకుదెరువు కోసం వెళ్లారని ఈ సర్వే తేల్చింది. పశ్చిమాసియా దేశాలకు ప్రధానంగా వలసలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దక్షిణాసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారే ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వెళ్లినట్లు గుర్తించామని సర్వే చేపట్టిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్, పాపులేషన్ అండ్ జస్ట్ సొసైటీస్ ప్రోగ్రామ్కు చెందిన గై అబెల్ తెలిపారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులు 2010 తర్వాత ఏడాదికి 3 లక్షల మంది చొప్పున సౌదీ వెళ్లినట్లు ఇటీవల జర్నల్ నేచర్లో ప్రచురితమైన ఇందుకు సంబంధించిన కథనం పేర్కొంది. అకస్మాత్తుగా తలెత్తిన సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల కాకుండా ఈ వలసలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయని వివరించింది. -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 11) జరిగిన రెండో మ్యాచ్లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్లోనూ ఆసీస్ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను హస్తగతం చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తౌహిద్ హృదోయ్ (40), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (22) అజేయమైన ఇన్నింగ్స్లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్ (42), నజ్ముల్ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో తంజిద్ హసన్ డకౌట్ కాగా.. లిటన్ దాస్ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్ హొసేన్ 15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, మెరిడిత్, జంపా, రెన్షా, గ్రీన్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆసీస్ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25), అలెక్స్ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3), తన్వీర్ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో వన్డే జూన్ 14న జరుగనుంది. కాగా, ఆసీస్కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్ ఓటమి. ఈ సిరీస్కు ముందు ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో 1-2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. -
ఆసీస్ సిరీస్ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా
త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్ జట్లను ఇవాళ (జూన్ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్తో టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ పేరును ప్రకటించారు.ఈ సిరీస్తో పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్ ఆసీస్ బ్యాటింగ్ యూనిట్పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్లో ఆడిన తంజిమ్ హసన్ షకీబ్, రిపన్ మొండల్, మొహమ్మద్ సైఫుద్దీన్లకు చోటు దక్కలేదు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్ విషయానికొస్తే.. నజ్ముల్ హసన్ షాంటో కెప్టెన్గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్ హృదోయ్ టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, మొమినుల్ హక్ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్ రోబివుల్ హాక్కు అవకాశం లభించింది.ఆసీస్తో మూడు మ్యాచ్ టీ20 సిరీస్ జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్ జూన్ 28 నుంచి హరారేలో జరుగనుంది.ఆస్ట్రేలియా సిరీస్కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్, హసన్ మహమూద్, తౌహిద్ హృదోయ్, అమిటే హసన్, రోబివుల్ హాక్. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్ల ప్రకటన
2026 మే నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్ 11) ప్రకటించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల హవా కనిపించింది. గత నెలలో ఆ జట్టు పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ విజయం (2-0తో క్లీన్ స్వీప్) సాధించిన విషయం తెలిసిందే.ఈ సిరీస్లో విశేషంగా రాణించిన వికెట్కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం, స్పిన్ బౌలర్ తైజుల్ ఇస్లాం ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా ఎంపికయ్యారు. మరో నామినీగా నేపాల్ ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ ఎంపికయ్యాడు. దీపేంద్ర గత నెలలో ఆడిన వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.ముష్ఫికర్ రహీంఈ వెటరన్ బ్యాటర్ మే నెలలో అసాధారణంగా రాణించాడు. పాక్పై రెండు టెస్టుల్లో 253 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 137 పరుగుల భారీ ఇన్నింగ్స్తో మ్యాచ్ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు తిప్పేశాడు.తైజుల్ ఇస్లాంబంగ్లాదేశ్ ప్రధాన స్పిన్నర్ అయిన తైజుల్ పాక్తో జరిగిన సిరీస్లో 13 వికెట్లతో సిరీస్ టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ (6/120) ఇందులో హైలైట్గా నిలిచింది.దీపేంద్ర సింగ్ ఎయిరీఎయిరీ గత నెలలో జరిగిన వన్డేల్లో ఓ సెంచరీ (యూఏఈపై), రెండు హాఫ్ సెంచరీలు (యూఎస్ఏపై) సహా 8 వికెట్లు తీశాడు. అతడి ఆల్రౌండ్ ప్రదర్శనల వల్ల నేపాల్ కీలక విజయాలు సాధించింది.మహిళల విషయానికొస్తే.. ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్, పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ గుల్ ఫెరోజా, న్యూజిలాండ్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ మే నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. -
ఐదేళ్ల తర్వాత హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ (జూన్ 11) జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ముందుగా ప్రకటించిన జట్టులో లేకపోయినా, అనూహ్యంగా తుది జట్టులో ప్రత్యక్షమయ్యాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే, మెరిడిత్ దాదాపుగా ఐదేళ్లుగా వన్డే జట్టులో లేడు. అలాంటి ఆటగాడు హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.ముందుగా జట్టులో లేని మెరిడిత్ను తుది జట్టులో తీసుకోవడం ఆసీస్ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో భారీ ఓటమి తర్వాత సిరీస్ను కాపాడుకోవాలన్న ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరిడిత్ చివరిగా 2021 జులైలో వెస్టిండీస్పై ఓ వన్డే ఆడాడు. ఇదే అతని కెరీర్లో చివరిది, మొదటది. ఆ మ్యాచ్లో 5 ఓవర్లు వేసిన మెరిడిత్ 36 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అతను వన్డేల్లో అవకాశాలు రాక, టీ20 ఫార్మాట్కు మాత్రమే పరిమితం అయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరింత దారుణంగా ఖాతా తెరవకుండానే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఆ దేశ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు వన్డేల్లోనూ ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. తాజా ఉదంతంలో ఓపెనర్లు షార్ట్, కన్నోల్లీ, నాలుగో నంబర్ ఆటగాడు రెన్షా డకౌట్లయ్యారు.లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ అతికష్టం మీద 42 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతానికి మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్, బార్ట్లెట్తో పాటు కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మరో బ్యాటర్ (జంపా) కూడా డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3) చెలరేగి బౌలింగ్ చేశారు. ఆసీస్ ఈ మ్యాచ్ కూడా కోల్పోతే, వరుసగా రెండో సిరీస్ను చేజార్చుకున్నట్లవుతుంది. ఈ సిరీస్కు ముందు పాక్ చేతిలోనూ ఆసీస్ 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. -
Kerala: చొరబాట్ల కలకలం.. 10 వేల మంది నకిలీ పౌరులు?
తిరువనంతపురం: కేరళలో వలస కూలీల ముసుగులో భారీ ఎత్తున బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాం జిల్లాలోని కొట్టారక్కరలో ఇటీవల పోలీసులు పది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో ఈ నకిలీ గుర్తింపు పత్రాల రాకెట్ గుట్టురట్టయింది. కేవలం 700 రూపాయలకే అసలైన వాటిని పోలిన నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను సృష్టిస్తూ, సుమారు 10,000 మందికి పైగా బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా చలామణి అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం దేశ రక్షణ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.రూ.700లకే గుర్తింపు పత్రాలుపోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అక్రమ వలసదారులు మొదట పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ప్రాథమిక నకిలీ పత్రాలను సంపాదించిన తర్వాత, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కేరళకు చేరుకుంటున్నారు. కేరళలోని స్థానిక చిరునామాలను ఉపయోగించుకుని, పూర్తి స్థాయి నకిలీ ఐడీలను సృష్టిస్తున్నారు. దీని వెనుక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించి, వాటిలో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ల కాపీలను కనుగొనడంతో వారి అసలు పౌరసత్వం బయటపడింది.గొలుసుకట్టు వలసల గుట్టుఈ అక్రమ వలసల్లో గొలుసుకట్టు (చైన్ మైగ్రేషన్) విధానం సాగుతున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. 13 ఏళ్ల క్రితం కేరళకు వచ్చిన ముగల్ ఖాతూన్ అనే బంగ్లాదేశ్ మహిళ, ఇక్కడ ‘మామ్దాస్’ అనే నకిలీ పేరుతో అన్ని రకాల గుర్తింపు పత్రాలను పొందింది. ఆ తర్వాత ఆమె తన బంధువులను కూడా ఇక్కడికి రప్పించింది. అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందే ఆమె బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఉపయోగించి ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశానికి వెళ్లివచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కూలీలకు, బంగ్లాదేశీయులకు మధ్య ఉన్న స్వల్ప భాషా వ్యత్యాసాల ద్వారా వీరిని గుర్తించవచ్చని, అయితే భయం కారణంగా స్థానికులు సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.భద్రతా ఆందోళనలు ఈ వ్యవహారాన్ని కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నాయి. దేశ వ్యతిరేక శక్తులు లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఈ నకిలీ పత్రాలను వాడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, పోలీసుల నిఘా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయులు కేరళను విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో కేరళలోని వలస కార్మికులందరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత! -
సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణకు సంబంధించి సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారుల ఏరివేతపై ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లోని వివిధ సరిహద్దు అవుట్పోస్ట్ల ద్వారా 2,980 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను తిరిగి వారి దేశానికి పంపించివేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది.సువేందు సర్కార్ యాక్షన్ ప్లాన్పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే, అంటే మే 19 నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,930 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపారు. మే 19న ముఖ్యమంత్రి సువేందు అధికారి ‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్’ (గుర్తించు, తొలగించు, దేశం దాటించు) అనే కఠినమైన విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుండి సరిహద్దుల్లో గస్తీ, తనిఖీలు ముమ్మరమయ్యాయి.ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలుఒకవైపు సరిహద్దుల్లో ఈ విధమైన భారీ బహిష్కరణల పర్వం కొనసాగుతుండగానే, మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. భారత్కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , బంగ్లాదేశ్కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఢిల్లీలో సమావేశమయ్యారు. అక్రమ వలసల నిరోధంతో పాటు ఇరు దేశాల సరిహద్దుల్లో మెరుగైన సమన్వయం, పరస్పర సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు సాగుతున్నాయి.రిపోర్టుతో వెల్లడైన నిజాలు‘ది ప్రింట్’ సేకరించిన సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) అంతర్గత వర్గాల డేటా ప్రకారం ఈ షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ బోర్డర్ అవుట్పోస్ట్తో పాటు బెంగాల్లోని పలు కీలక సరిహద్దు తనిఖీ కేంద్రాల ద్వారా ఈ వలసదారులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియల అనంతరం బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు. ఈ సరిహద్దు నియంత్రణ చర్యలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది. -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం
ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (జూన్ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.ఇటీవల పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది. -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు. -
బాలిక హత్యాచారం కేసులో దంపతులకు ఉరి
ఢాకా: బంగ్లాదేశ్లో తీవ్ర సంచలనం రేపిన బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన దంపతులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కేవలం ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని న్యాయవాదులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న 19 రోజుల్లోనే ఢాకా మెట్రోపాలిటన్ చైల్డ్ రిప్రెషన్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ ఈ ఘనత సాధించిందన్నారు. మే 18వ తేదీన ఢాకాలోని పల్లబి ప్రాంతంలోని ఓ 8 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమెను అక్కడే ఓ అపార్టుమెంట్లో ఉండే సోహెల్ రాణా కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అతడికి భార్య స్వప్నా ఖాతూన్ సహకరించింది. అనంతరం ఆ బాలికను ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేసి సోహెల్ పరారయ్యాడు. పోలీసులు 19వ తేదీన సోహెల్, స్వప్నలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. జడ్జి మస్రూర్ సలెకిన్ ఆదివారం తీర్పు వెలువరించారు. నిందితులు ఇద్దరికీ ఉరి శిక్షతోపాటు, రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను వేలం వేసి, వసూలు చేయాలని ఆదేశించారు. -
బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ కోచ్, ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ షాన్ టైట్ తన పదవికి రాజీనామా చేసినట్లు ధృవీకరించాడు. 2025 మేలో బాధ్యతలు చేపట్టిన టైట్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యలోనే తప్పుకోవడం చర్చనీయాంశమైంది. టైట్ శిక్షణలో యువ పేసర్ నహిద్ రాణా విశేషంగా రాణించాడు. అతడి వేగం, ప్రదర్శన మెరుగుపడటంలో టైట్ పాత్ర కీలకమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.టైట్ కీలక సమయంలో బంగ్లాదేశ్ జట్టును దెబ్బేశాడు. జూన్ 9 నుంచి 21 వరకు ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ పర్యటించనుంది. ఈ సిరీస్కు కొద్ది రోజుల ముందు టైట్ హ్యాండ్ ఇవ్వడం బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఈ సమయంలో బంగ్లా పేసర్లకు టైట్ శిక్షణ (ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు) చాలా ముఖ్యం. అలాంటిది కారణం ఏంటో చెప్పకుండా టైట్ అర్దంతరంగా బంగ్లా జట్టుకు హ్యాండ్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. టైట్ స్థానంలో మాజీ బంగ్లా పేసర్ తల్హా జుబైర్ను తాత్కాలిక పేస్ బౌలింగ్ కోచ్గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.కాగా, 3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనుండగా.. మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్లో జరుగనున్నాయి.ఈ సిరీస్ల కోసం వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను ఇదివరకే ప్రకటించగా.. తొలి రెండు వన్డేల కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు.ఆస్ట్రేలియా వన్డే జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపాఆస్ట్రేలియా టీ20 జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపాతొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా -
గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్!
బంగారు రంగు జుట్టు.. హుందాగా కనిపించే 700 కిలోల భారీ కాయం.. వీటన్నింటికీ మించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండే విలక్షణమైన రూపం! ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ వింత అల్బినో గేదె గురించే చర్చ నడుస్తోంది. వారం రోజులుగా ఢాకా శివార్లలోని జాతీయ జంతుప్రదర్శనశాలకు వచ్చిన ఈ గేదెను చూసేందుకు జనం తరలివస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ ‘ట్రంప్’ గేదె కథనం ఇప్పుడు అంతర్జాతీయంగానూ హెడ్లైన్స్లో నిలుస్తోంది.మొదట ఈ అరుదైన అల్బినో గేదెను ముస్లింల పవిత్ర పండుగ ‘ఈద్-అల్-అధా’ (బక్రీద్) సందర్భంగా త్యాగం (బలి) చేయడం కోసం ఒక స్థానిక రైతు సిద్ధం చేశాడు. అయితే, ఈ గేదె లేత కొమ్ములు, దానికున్న వింతైన బంగారు రంగు జుట్టు సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉన్నాయంటూ సదరు రైతు గమనించి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. ‘ఫేస్బుక్లో ఈద్కు ముందే ‘ట్రంప్’ను బలి ఇవ్వబోతున్నారనే పోస్టులు చూశాను. కానీ చివరి నిమిషంలో దానిని బలి ఇవ్వకుండా జూకు తరలించారని తెలిసి స్వయంగా చూడటానికి వచ్చాను’ అని జాషోర్ నగరం నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు తెలిపారు.భద్రతా కారణాలు, ప్రజా విజ్ఞప్తుల దృష్ట్యా బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్వయంగా స్పందించి ఆ జంతువును రక్షించాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ గేదెను ఢాకాలోని జాతీయ జంతుప్రదర్శనశాలకు తరలించింది.జూలో వీఐపీ ట్రీట్మెంట్!ప్రస్తుతం జూలో ఈ వింత గేదెకు సెలబ్రిటీ హోదా దక్కింది. జూ సిబ్బంది దీనిని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. విపరీతమైన ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి సిబ్బంది నిరంతరం నీళ్లు చల్లుతున్నారు. ట్రంప్ మార్కు హెయిర్స్టైల్ చెడిపోకుండా జుట్టును ఒక వైపునకు దువ్వుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.జూ క్యూరేటర్పై వేటు!ఈ గేదెకు ‘డొనాల్డ్ ట్రంప్’ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రదర్శనశాలలోని ఎన్క్లోజర్ వద్ద మొదట డొనాల్డ్ ట్రంప్ అనే బోర్డును ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ తర్వాత అధికారులు ఆ బోర్డును తొలగించారు. ఈ వివాదం నేపథ్యంలోనే జూ క్యూరేటర్ను పదవి నుంచి తొలగించడం గమనార్హం. అయితే దీనికి గల అధికారిక కారణాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
హనీమూన్ ముగిసి సవాళ్ల దశలోకి!
ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు ప్రస్తుతం మూడు ప్రభుత్వాల పనితీరును ప్రత్యేకంగా గమనిస్తున్నారు. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. ఇవి వేర్వేరు స్వతంత్ర దేశాలు కాగా, ఇపుడు అకస్మాత్తుగా వారి దృష్టిని తమిళనాడు ఆకర్షిస్తున్నది. ఈ జాబితాలోకి అనూహ్యంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా వచ్చి చేరింది. పరిశీల కుల దృష్టిలో ఇటువంటి జాబితా ఒకటి తయారు కావటానికి కారణం, ఈ పరిణామాలన్నింటి వెనుక యువతరం ఆగ్రహం ఒక అంతస్సూత్రంగా కనిపిస్తుండటం; ఇదంతా ఆసియాలో జరుగుతుండటం.నేషనల్ ఛార్టర్– ఒక ప్రత్యేకతబంగ్లాదేశ్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న అధికారానికి వచ్చిన తారిఖ్ రహమాన్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయి. ఆయన నాయకత్వాన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారానికి వచ్చిన పరిస్థితులు తెలిసినవే. షేక్ హసీనా ప్రధానిగా 17 సంవత్సరాల పాటు సాగిన అవామీ లీగ్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన యువతరం ఉద్యమంతో ఆ ప్రభుత్వం పతనమైంది. కొంతకాలం మధ్యంతర ప్రభుత్వ పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో బీఎన్పీ మూడింట రెండు వంతుల ఆధిక్యతతో విజయం సాధించింది. ప్రతిపక్ష జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ తాము పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించగలమనీ,కొంత కాలంపాటు అయినదానికి కానిదానికి ఆందోళనలు చేయబో మనీ ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.ఇదిగాక గమనించవలసిన విషయం, అధికార పక్షానికి తన సొంత మేనిఫెస్టో ఒకటిగాక, అన్ని పార్టీల ఆమోదంతో ‘నేషనల్ ఛార్టర్’ పేరిట పరిపాలనా సంస్కరణల కార్యక్రమం ఒకటి కూడా ఎన్నికలకు ముందే రూపు తీసుకుంది. ఎన్నికలతో పాటే దానిపై రెఫరెండం జరగగా అందుకు ప్రజామోదం లభించింది. ఇటువంటి ఛార్టర్, అందుకు రెఫరెండం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలలో మరెక్కడా జరిగినట్లు లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు బంగ్లా దేశ్ను గమనించటానికి ఇవన్నీ కారణమవుతున్నాయి.మాట నిలబెట్టుకుంటారా?పదిహేడు సంవత్సరాల అస్తవ్యస్త పాలన తర్వాత కొత్త ప్రభు త్వపు పనితీరును అంచనా వేసేందుకు కేవలం వంద రోజుల వ్యవధి నిజానికి సరైనది కాదు. ఆ పరిమితిని దృష్టిలో ఉంచుకుంటూనే అసలు ఈ కాలంలో జరిగిందేమిటనేది చూడవచ్చు. మాజీ ప్రధాని బేగం ఖలేదా జియా కుమారుడైన తారిఖ్ రహమాన్ గత చరిత్ర గొప్పదేమీ కానందున, ఆయన దీర్ఘకాలపు ప్రవాస జీవితం నుంచి ఎన్నికలకు కొద్దికాలం ముందు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, తానిప్పుడు మారిన మనిషినని ప్రకటించారు. ఇప్పుడు మే 27కు హనీమూన్ కాలం ముగిసేవరకు ఆయన తన మాట ప్రకారమే వ్యవహరిస్తూ రావటాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గుర్తించినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా మొదట పాలకునిపై వ్యక్తిగత స్థాయిలో నమ్మకం ఏర్పడితే, హనీమూన్ కాలంలో ఏమి జరిగినా జరగకున్నా రాగల రోజులపై ఆశాభావం కలుగుతుంది.పరిపాలనకు వస్తే, యథాతథంగానే వెనుకబడినది అయిన బంగ్లాదేశ్కు షేక్ హసీనా సుదీర్ఘ పాలనలో అవినీతి వల్ల సమస్యలు మరింత పెరిగాయి. కనుక, కొత్త ప్రభుత్వం నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసినా పరిస్థితులు కుదుట పడేందుకు చాలా సమయమే తీసు కుంటుంది. అదట్లుండగా, ఇపుడు మూడు నెలలుగా కొనసాగు తున్న ఇరాన్ యుద్ధం సృష్టించిన చమురు, గ్యాస్ సమస్యలు పిడుగు వలె వచ్చి పడ్డాయి. వారి ఇంధన అవసరాలలో 62 శాతం దిగుమ తుల ద్వారా తీరవలసినవే. ఈ స్థితి వల్ల కొత్త ప్రభుత్వం మరింత సతమతమవుతున్నది. ఇది మొత్తం మీద గల స్థూల పరిస్థితి కాగా, తారిఖ్ రహమాన్ ప్రభుత్వం వీటిని సాకుగా చూపకుండా అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవటం గురించి చెప్పాలి. ఆ పనులు చేసే ముందు ఆయన స్వయంగా ప్రతిపక్ష నాయకుల నివాసాలకు వెళ్లి సంప్రదింపులు జరిపారు. పరిపాలన విషయంలో ప్రజలకు తక్షణం అనుభవంలోకి వచ్చేది సంక్షేమ చర్యలన్నది తెలిసిందే. ఆ ప్రకారం పేదలకు, రైతులకు ఆహార సహాయంగా నెలకు 2,500 బంగ్లాదేశ్ టాకాల (ఒక రూపాయి 1.29 టాకాలకు సమానం) విలువ చేసే కార్డులు జారీ చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారులకు పదివేల టాకాల వరకూ రుణమాఫీ జరిపారు. పేదలందరికీ వైద్య చికిత్సల కార్డులు పంపిణీ చేశారు. స్కూలు పిల్లలకు యూనిఫారాల సరఫరా జరిగింది.ఉలికిపాటు ఉప్పెనఇటువంటివి సంక్షేమాలు, ఉపశమన చర్యలు కాగా, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం దేశమంతటా సాగునీటి కాల్వల పునరుద్ధరణను ప్రారంభించారు. బంగ్లాదేశ్లో వరి ఉత్పత్తి తగినంత ఉన్నా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంతోపాటు దేశమంతటా చెట్ల పెంపకంవల్ల గ్రామీణు లకు ఉపాధికల్పన జరుగుతుందన్నది ఆలోచన. యువకుల ఉపా ధికి పరిశ్రమలు, వాణిజ్యం తప్పనిసరి గనుక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఎగుమతి రంగాల విస్తరణ, కొత్త పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరొక వైపు, కొన్ని అంశాలకు సంబంధించి విమర్శలు కూడా వినవస్తు న్నాయి. వాటిలో ముఖ్యమైనవి శాంతిభద్రతలు, అదే విధంగా వేర్వేరు రంగాల సంస్కరణల కోసం రూపొందించిన జాతీయ ఛార్టర్ అంశాలను ఇంతవరకు పార్లమెంట్లో ధ్రువీకరించటంపై గానీ, అమలు పరచటంపైగానీ తగు చర్యలు తీసుకోకపోవటం.రాగల రోజులలో వీటితోపాటు, భారతదేశంతో సంబంధాల మెరుగుదల బీఎన్పీ ప్రభుత్వానికి సవాళ్లు కానున్నాయి. ప్రధాని రహమాన్ అధికారానికి వచ్చినప్పుడు, ఆ పని తప్పక చేయగల మనీ, అందుకు పరస్పర ప్రయోజనాలు, గౌరవాలు ఆధారం కావా లనీ, అదే ప్రాతిపదికపై సమస్యలను పరిష్కరించుకోగలమనీ అన్నారు. కానీ ఈ వంద రోజులలో ఆ దిశగా అడుగులు పడలేదు. ఇందుకు రెండు వైపుల నుంచి చొరవ అవసరం. నదీ జలాలు, సరిహద్దుల గుర్తింపు, వలసలు, షేక్ హసీనా అప్పగింత వంటివి తేలిక వివాదాలు కావు.మళ్లీ మొదటికి వస్తే, బంగ్లాదేశ్తోపాటు శ్రీలంక, నేపాల్ ప్రభుత్వాల పనితీరుపై, అవి ఇంతకుముందటి ప్రభుత్వాల కన్న ఎంత భిన్నంగా ఉండగలవన్న దానిపై, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. తమిళనాడులో విజయ్ గెలుపులోనూ వారు యువతరం తిరుగుబాటుతో కూడిన ఆకాంక్షల వెల్లువను చూస్తున్న సమయంలో, ‘కాక్రోచ్’ ఉప్పెన వారిని ఉలికిపాటుకు గురిచేసింది. ప్రధాని మోదీ ఇటీవలి అసెంబ్లీ విజయాలతో ఎదురులేకుండా పోయిందనుకుంటుండగా, యువతరం నుంచి ఈ అనూహ్యమైన భూకంపం వారిని పునరాలోచనలో పడవేసింది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్లోని తొలి 2 మ్యాచ్ల కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జూన్ 3) ప్రకటించారు.స్టార్ ఆల్రౌండర్ మొసద్దెక్ హొసేన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో చివరిసారిగా వన్డే ఆడిన మొసద్దెక్, ప్రస్తుతం జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అబాహని లిమిటెడ్ తరఫున ఆడుతున్న అతడు ఆరు ఇన్నింగ్స్ల్లో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఏడు ఇన్నింగ్స్ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.మొసద్దెక్తో పాటు నురుల్ హసన్ కూడా గ్యాప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. లిట్టన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, తౌహిద్ హృదోయ్, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ తదితర బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా వంటి పేసర్లు జట్టులో స్థానం తిరిగి పొందారు.ఈ సిరీస్లోని వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనున్నాయి. అనంతరం మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్లో జరుగనున్నాయి.ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్
స్వదేశంలో జరుగుతున్న మహిళల టీ20 ట్రై-సిరీస్లో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. టోర్నీ ఓపెనర్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన ఈ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్కు భారీ షాకిచ్చింది.ఎడిన్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా.. స్కాట్లాండ్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బౌలర్లు, బ్రైస్ సిస్టర్స్ స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బౌలింగ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాబ్రియెల్లా ఫోంటెనియా (4-1-11-1), క్రిస్టీ గోర్డాన్ (4-0-21-1), క్యాథరీన్ బ్రైస్ (3-0-24-1), అబ్తహా మక్సూద్ (2-0-14-1) రాణించగా.. ఛేదనలో క్యాథరీన్ బ్రైస్ (54 నాటౌట్), సారా బ్రైస్ (23 నాటౌట్) సత్తా చాటారు. డార్సీ కార్టర్ (23), క్యాథరీన్ ఫ్రేసర్ (28) కూడా తలో చేయి వేశారు. బంగ్లా బౌలర్లలో రీతూ మోనీ, షోర్నా అక్తెర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్లో కెప్టెన్ నిగార్ సుల్తానా (46 నాటౌట్) రాణించగా.. శోభన మోస్తరి (22), షోర్నా అక్తెర్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ప్లేయర్లలో దిల్హర అక్తెర్ 11, ఫిర్దోస్ 12, షర్మిన్ అక్తెర్ 10, రబేయా ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇవాళ (మే 31) జరుగబోయే తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్తో తలపడనుంది. -
ట్రంప్ పోలికలే రక్షించాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్మీడియాలో వైరల్గా మారిన ఓ అరుదైన తెల్లగేదె ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కు బక్రీద్ సందర్భంగా బలి తప్పదనుకున్న వేళ.. చివరి క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది.బంగ్లాదేశ్లోని ఢాకా సమీప నారాయణ్గంజ్లో ఓ ఫారంలో పెంచుతున్న ఈ అరుదైన ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ గేదె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. పిల్లలు, యువత, కుటుంబాలు పెద్దఎత్తున ఫారంకు చేరుకుని సెల్ఫీలు దిగేవారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట.అయితే ఈద్ అల్ అదా సందర్భంగా బలి కోసం ఇప్పటికే ఈ గేదెను విక్రయించినట్లు యజమాని జియౌద్దీన్ మృధా వెల్లడించారు. “ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను.. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని ఆయన చెప్పడంతో.. వైరల్ స్టార్గా మారిన ఈ గేదె కథ విషాదంగా ముగియబోతోందన్న చర్చ మొదలైంది.కానీ సోషల్మీడియాలో పెరిగిన చర్చలు, భారీ ప్రజాదరణ చివరకు ప్రభుత్వాన్ని కదిలించాయి. పరిస్థితిని గమనించిన బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ చివరి క్షణంలో జోక్యం చేసుకుని గేదెను రక్షించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ‘ట్రంప్ బఫెలో’ను ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. ప్రత్యేక షెడ్, కేర్టేకర్ను ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆల్బినో జంతువులు బంగ్లాదేశ్లో చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం కారణంగానే వీటికి తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టు వస్తాయని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు పలుమార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని తెలిపారు.ఇప్పుడు సోషల్మీడియాలో ఒక్క ప్రశ్నే వైరల్గా మారింది.. “ట్రంప్లా కనిపించడం వల్లేనా ఈ గేదె ప్రాణాలు దక్కాయి?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. బలి పీఠం దాకా వెళ్లిన ‘ట్రంప్ బఫెలో’ కథ చివరకు జూ వరకూ చేరి హ్యాపీ ఎండింగ్ దిశగా మలుపు తిరిగింది. -
Bangladesh: ఇనుప రాడ్ల ట్రక్కు బోల్తా.. 15 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయువ్యంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగైల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈద్-ఉల్-అదా(ఈద్) పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు, అదుపు తప్పి బోల్తా పడటంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈద్ వేళ విషాదంప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో ఇనుప రాడ్లతో పాటు, ప్రయాణీకులు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో టాంగైల్ జిల్లాలోని సోరటోయిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీలు తమ కుటుంబాలతో కలిసి ఈద్ వేడుకలు జరుపుకోవడానికి ఇంటికి బయలుదేరగా, విధి వారిని మార్గమధ్యలోనే బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలేనని అధికారులు తెలిపారు.అదుపు తప్పిన వాహనంస్థానిక పోలీస్ చీఫ్ ఫువాడ్ హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనాన్ని నియంత్రించలేక డ్రైవర్ చేసిన పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం బోల్తా పడింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి, ట్రక్కు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నిత్యం వెంటాడుతున్న మరణ మృదంగంబంగ్లాదేశ్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం, రహదారుల దుస్థితి, నైపుణ్యం లేని డ్రైవర్ల వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ప్రయాణ భద్రతపై కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదకర సంఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయి. -
ట్రంప్లా కనిపించిన గేదె.. పాపం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అరుదైన తెల్లగేదె సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కథ.. మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్గంజ్లో ఉన్న ఓ ఫారంలో పెంచుతున్న ఈ నాలుగేళ్ల ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు ముద్రపడింది. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే.. బక్రీద్ సందర్భంగా ట్రంప్ గేదెను బలి ఇవ్వబోతున్నారట. ఈ గేదెను పెంచుతున్న ఫారం యజమాని జియౌద్దీన్ మృధా మాట్లాడుతూ.. ఈద్ అల్ అదా(Eid al-Adha) సందర్భంగా బలిచేయడానికి ఇప్పటికే ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడని తెలిపారు. ‘‘ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్ చెబుతున్నారు.తెల్లని చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టుతో కనిపించే ఈ గేదెను చూసేందుకు ప్రతిరోజూ జనాలు పెద్ద ఎత్తున ఫారంకు వచ్చేవారని.. పిల్లలు, యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడేవారని తెలిపారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట. మరోవైపు.. ఆల్బినో జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం వల్లే వీటికి తెల్లటి రంగు వస్తుందని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు నాలుగు సార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని చెప్పాడు. అయితే జనసందోహం ఎక్కువ కావడంతో గేదె ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే చివర్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశాడట. వైరల్ స్టార్గా మారిన ఆ గేదెకు ఇదే చివరి పండుగ కానుండటం స్థానికంగా భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల చివర్లో జరగనున్న ఈద్ అల్ అదా కోసం భారీ సంఖ్యలో పశువులను సిద్ధం అవుతున్నాయి. భారీ సైజులో ఉండడమో లేదంటే ప్రత్యేక లక్షణాల కారణంగా పలు పశువులు సోషల్మీడియాలో వైరల్ అవడం సాధారణమైపోయింది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం.. సంచలన నిర్ణయాలతో పలు దేశాలను షేక్ చేస్తుండడంతో.. ఈ గేదె తన ప్రత్యేక రూపంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
పాక్కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. తొలిసారి ఈ జట్టు బంగ్లాదేశ్ చేతిలో వైట్వాష్కు గురైంది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 78 పరుగుల తేడాతో ఓడటంతో 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆ జట్టు భారత్ను సైతం కిందకు (ఆరో స్థానానికి) నెట్టింది. ఆసీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక టాప్-4 జట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో పాక్ మరింత పతనమై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ గెలుపు బంగ్లాదేశ్కు పాక్పై వరుసగా నాలుగవది. అంతకుముందు రెండు టెస్ట్లకు బంగ్లాదేశ్ పాక్ గడ్డపైనే గెలిచింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లా జట్టు పాక్ను వన్డే సిరీస్లోనూ ఓడించింది. రిజ్వాన్ పోరాటం వృధా437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాశించాడు.ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (126) సెంచరీతో కదంతొక్కాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ (17-1-81-4), మొహమ్మద్ అబ్బాస్ (16-3-45-3) రాణించారు. అనంతరం పాక్ కూడా తొలి ఇన్నింగ్స్లో తడబడింది. బాబర్ ఆజం (68) ఒక్కడే రాణించడంతో అతి కష్టంమీద 232 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్, నహిద్ రాణా తలో 3, తస్కిన్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లతో పాక్ ఆట కట్టించారు.కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్లోనూ తొలుత తడబడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ముష్ఫిఫర్ రహీం (137) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 390 పరుగుల భారీ స్కోర్ చేసి పాక్కు 437 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఛేదనలో రిజ్వాన్ సహా షాన్ మసూద్ (71), సల్మాన్ అఘా (71) అర్ద సెంచరీతో రాణించినా పాక్ను గట్టెక్కించలేకపోయారు. -
పాకిస్తాన్ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్ అడుగులు
సిల్హెట్: బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... పాకిస్తాన్పై టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలైన పాకిస్తాన్... రెండో మ్యాచ్లో కాస్త పోరాడినా ప్రస్తుతం పరాజయం అంచునే ఉంది. 437 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్... మంగళవారం ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. సిరీస్ సమం చేయాలంటే... బుధవారం చివరి రోజు చేతిలో మూడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. సల్మాన్ ఆఘా (102 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (134 బంతుల్లో 75 బ్యాటింగ్; 8 ఫోర్లు), కెపె్టన్ షాన్ మసూద్ (116 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్లు అజాన్ అవైస్ (21), అబ్దుల్లా ఫజల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోడంతో ఛేదనలో పాకిస్తాన్కు శుభారంభం దక్కలేదు. 41/2తో కష్టాల్లో పడ్డ జట్టును బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షాన్ మసూద్ కాపాడే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్కు 92 పరుగులు జోడించిన అనంతరం బాబర్ అవుట్ కాగా... ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. సౌద్ షకీల్ (6) విఫలమయ్యాడు. దీంతో ఒకదశలో 133/2తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ కాసేపటికి 162/5తో కష్టాల్లో పడింది. ఇక పాక్ పని అయిపోయినట్లే అనుకుంటున్న దశలో సల్మాన్, రిజ్వాన్ చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్కు 134 పరుగులు జోడించింది. దీంతో కోలుకున్న పాకిస్తాన్ 296/5తో మ్యాచ్ను ముగించే స్థితికి చేరింది. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించిన బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం చివర్లో సల్మాన్తో పాటు హసన్ అలీ (0)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... రిజ్వాన్తో పాటు సాజిద్ ఖాన్ (8 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఎడమ చేతివాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4, నహీద్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులు చేయగా... పాకిస్తాన్ 232 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసిన బంగ్లాదేశ్... పాక్ ముందు రికార్డు లక్ష్యాన్ని నిలిపింది. -
IPL: లిటన్ దాస్ సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో తన ప్రయాణం గుర్తుంచుకోదగినది కాదన్నాడు. ఫ్రాంఛైజీ నుంచి తనకు ఎలాంటి మద్దతూ లభించలేదని ఆరోపించాడు.ఒక్క మ్యాచ్.. చేదు అనుభవంకాగా 2023 ఐపీఎల్ సీజన్కు ముందు రూ. 50 లక్షల కనీస ధరకు కేకేఆర్ లిటన్ దాస్ను కొనుగోలు చేసింది. చాన్నాళ్లపాటు బెంచ్కే పరిమితమైన అతడు.. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు.ఓపెనర్గా బరిలోకి దిగిన లిటన్ దాస్ (Liton Das).. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్లో లలిత్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక వికెట్ కీపర్గానూ లిటన్ దాస్ విఫలమయ్యాడు. రెండుసార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫలితంగా ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓటమిపాలైంది.నాకెలాంటి మద్దతూ లభించలేదుఆ తర్వాత లిటన్ దాస్కు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాల గురించి బంగ్లాదేశ్ క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్కు నా అవసరం ఉందని అస్సలు అనుకోలేదు. ఆశించిన విధంగా జట్టు నుంచి నాకెలాంటి మద్దతూ లభించలేదు. ఒక మ్యాచ్లో ప్లేయర్ను ఆడిస్తున్నామంటే ముందుగానే సమాచారం ఇస్తారు.రాత్రి 11 గంటలకు మెసేజ్కానీ నా విషయంలో అలా జరుగలేదు. రెండు మ్యాచ్లలో నన్ను బెంచ్ మీదే కూర్చోబెట్టారు. అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకు నాకో మెసేజ్ వచ్చింది. ‘నువ్వు ఆడబోతున్నావు’ అని చెప్పారు. అప్పటికప్పుడు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కాలేదు. నా శాయశక్తులా బాగా ఆడేందుకు ప్రయత్నించా. అయితే, క్రికెట్లో ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ జరుగకపోవచ్చు. ఆరోజు నాది కాదంతే’’ అని లిటన్ దాస్ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కేకేఆర్ యాజమాన్యంపై ఆరోపణలు చేశాడు.కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా తదితరులు కేకేఆర్ సహ యజమానులు. ఐపీఎల్-2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది.హైడ్రామాఅయితే, భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ను కేకేఆర్ తొలగించింది. దీంతో బంగ్లా బోర్డు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తమ జట్టును భారత్కు పంపలేదు. వేదిక మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లా ప్రకటించింది. తద్వారా భారీ మూల్యమే చెల్లించింది. ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం బీసీసీఐతో సంబంధాల పునరుద్ధణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా బంగ్లా ప్రపంచకప్ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020 దశకంలో అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.ఈ దశకంలో (2020 నుంచి) బాబర్ ఇప్పటివరకు 212 మ్యాచ్లు ఆడి 231 ఇన్నింగ్స్ల్లో 9060 పరుగులు చేశాడు. అతని సగటు 42.53 కాగా, 17 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ఉన్నాడు. రూట్ 120 మ్యాచ్ల్లో 8305 పరుగులు చేశాడు. రూట్ వన్డేలు, టీ20లు తక్కువగా ఆడటం వల్ల బాబర్ కంటే వెనుకబడ్డాడు.ఈ దశకంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ వికెట్కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 7779 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు కుసాల్ మెండిస్, పథుమ్ నిస్సంక వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.భారత్ తరఫున తొలి ఐదుగురిలో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లి 6771 పరుగులతో ఆరో స్థానంలో ఉండగా, శుభ్మన్ గిల్ 6649 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 6391 పరుగులతో టాప్-10లో (పదో స్థానం) చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో పాక్ తడబడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయిన ఆ జట్టు మరో ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి 156 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ తొలి ఇన్నింగ్స్లో 232 పరుగులకే కుప్పకూలింది. -
బాబర్ ఆజం పోరాటం వృధా.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన పాక్
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పాక్ వెనుకపడింది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ మరింత తీసికట్టుగా 232 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బంగ్లాకు 46 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 8 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (4) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (26), మొమినుల్ హక్ (2) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లాదేశ్ 89 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఆట మూడో సెషన్ కొనసాగుతుంది.బాబర్ పోరాటం వృధాబంగ్లాదేశ్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేసిన ఆనందం పాక్కు ఎంతో సేపు నిలబడలేదు. ఆ జట్టు బంగ్లా కంటే తక్కువ స్కోర్కే ఆలౌటై ఉసూరుమనిపించింది. బాబర్ ఆజం అద్భుతైన అర్ద సెంచరీతో (68) పోరాడినా పాక్ను గట్టెక్కించలేకపోయాడు. ఆఖర్లో సాజిద్ ఖాన్ (38) బ్యాట్ ఝులిపించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్లో అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 9, కెప్టెన్ షాన్ మసూద్ 21, సౌద్ షకీల్ 8, సల్మాన్ అఘా 21, మొహమ్మద్ రిజ్వాన్ 13, హసన్ అలీ 18, ఖుర్రమ్ షెహజాద్ 10 పరుగులకు ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలో 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.దాస్ శతకంతొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లిట్టన్ దాస్ (126) వీరోచిత శకతం సాధించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. పాక్ బౌలర్లు అబ్బాస్ (3 వికెట్లు), ఖుర్రమ్ షెహజాద్ (4), హసన్ అలీ (2), సాజిద్ ఖాన్ (1) సత్తా చాటారు. వాస్తవానికి బంగ్లాదేశ్ ఈపాటి స్కోర్ చేయడం కూడా చాలా గొప్పే. దాస్కు మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ ఊహించని విధంగా 104 పరుగుల తేడాతో పాక్కు షాకిచ్చింది. -
ఆ డీల్ ఓకే అయితేనే భారత్తో సంబంధాలు.. బంగ్లాదేశ్
ఢాకా: భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ మంత్రి మీర్జా ఫఖ్రుల్ అస్రాం ఆలంగీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగానది జలాల భాగస్వామ్య పునరుద్ధరణతోనే ఆధారపడి ఉంటాయన్నారు. బంగ్లాదేశ్ ప్రజల అంచనాలు మరియు అవసరాలకు అనుగుణంగా భారత్ కొత్త ఒప్పందంపై చర్చలు జరపాలని భారత్పై ఒత్తిడి తెచ్చారు.1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రస్తుత గంగా నీటి ఒప్పందం ఈ ఏడాది (2026) డిసెంబర్తో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై స్పందించింది. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ "భారత్తో మంచి సంబంధాలు కొనసాగడం అనేది గంగా నీటి భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకుండా ఒప్పందం ఉండాలి". అన్నారు.గంగా నది వివాదంభారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్ వ్యవసాయం, జీవవైవిధ్యం మరియు నీటి సరఫరాకు ఈ నది చాలా కీలకం.కాగా కోల్కతా ఓడరేవులో పూడికను కొట్టుకుపోయేలా చేసి, హుగ్లీ నదిలో నావిగేషన్ను మెరుగుపరచడానికి ఫరక్కా బ్యారేజ్ భారత్ నిర్మించింది. అయితే దీనివల్ల ఎండాకాలంలో ఫరక్కా బారేజ్ వల్ల బంగ్లాదేశ్కు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతోందని, దీనివల్ల ఉప్పునీటి శాతం పెరిగి, వ్యవసాయం, నదీ వ్యవస్థలు మరియు పర్యావరణం దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.వివాదాస్పదంగా 'పద్మా బారేజ్' ప్రాజెక్ట్ఫరక్కా బారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి పద్మా నదిపై ఒక భారీ బారేజ్ నిర్మించే ప్రాజెక్ట్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ వల్ల భారత్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని వాదిస్తోంది. భారత్స్పందన ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉన్నాయని వీటన్నిటిపై చర్చించడానికి ఇప్పటికే ఒక పటిష్టమైన ద్రైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు.అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు నది నీటి ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని తెలిపారు. -
పాక్తో రెండో టెస్ట్.. లిట్టన్ దాస్ వీరోచిత శతకం
సిల్హెట్ వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ జట్టు తడబడి నిలబడింది. లిట్టన్ దాస్ వీరోచితమైన పోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోర్ (278 పరుగులు) చేయగలిగింది. పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలగా.. దాస్ ఒంటరిపోరాటం చేసి సూపర్ శతకంతో మెరిశాడు. ఓ పక్క సహచరులు పెవిలియన్కు క్యూ కడుతున్నా, దాస్ బాధ్యతాయుతంగా ఆడి జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు. దాస్ 159 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి 9వ వికెట్గా వెనుదిరిగాడు. దాస్ మినహా బంగ్లా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4, మొహమ్మద్ అబ్బాస్ 2, హసన్ అలీ 2, సాజిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు పాక్ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ పాక్పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. -
పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లా ప్లేయర్లకు భారీ లబ్ది
పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్న్యూస్ చెప్పింది. మిర్పూర్ టెస్టులో 104 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఈ మ్యాచ్లో షాంటో విశేషంగా రాణించాడు.తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (101), రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (87) (మొత్తం 188 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతడు.. ర్యాంకింగ్స్లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా కొనసాగుతున్నాడు.ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో వికెట్ తీసి జట్టు విజయంలో మరో కీలక పాత్రధారుడిగా నిలిచిన నహిద్ రాణా కూడా ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.ఇదే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 91, రెండో ఇన్నింగ్స్లో 56 పరుగులు చేసిన మొమినుల్ హక్ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్కి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 71, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్లో నిలిచాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిన తైజుల్ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ చేరుకోగా, తస్కిన్ అహ్మద్ 48వ స్థానంలో నిలిచాడు.ఇక పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ఈ టెస్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్ షకీల్, షాన్ మసూద్ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మొహమ్మద్ అబ్బాస్ మాత్రం 28వ స్థానానికి ఎగబాకి కొంత ఊరటనిచ్చాడు. -
బంగ్లాదేశ్ చేతిలో పాక్ బోల్తా
మిర్పూర్: బంగ్లాదేశ్తో జరిగిన మొదటి 13 టెస్టుల్లో పాకిస్తాన్ 12 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ విజయపరంపరకు 2024లో రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తెరదించింది. ఆనాడు రెండు వారాల్లో వరుసగా రెండు టెస్టుల్లో పాకిస్తాన్ను వారి సొంతగడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ భళా అనిపించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ పాకిస్తాన్తో జరిగిన టెస్టులో వరుసగా మూడోసారి బంగ్లాదేశ్ జట్టే పైచేయి సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మిర్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 16 నుంచి సిల్హెట్లో జరుగుతుంది. ఆట చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 152/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 70.3 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ కెపె్టన్ నజు్మల్ హుస్సేన్ షంటో (87; 7 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. మోమినుల్ హక్ (56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, నోమన్ అలీ 3 వికెట్ల చొప్పున తీశారు.అనంతరం బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన పాకిస్తాన్ 52.5 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా ఫజల్ (66; 11 ఫోర్లు) ఒక్కడే క్రీజులో నిలబడి అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. తస్కిన్ అహ్మద్, తైజుల్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఆఖరి రోజు 16 వికెట్లు పడటం విశేషం. మ్యాచ్లో 188 పరుగులు చేసిన షంటోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులు... పాకిస్తాన్ 386 పరుగులు చేశాయి. -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 100 వికెట్లు తీసిన తొలి పాకిస్తాన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో షాహీన్ ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో షాహీన్ వికెట్ల సంఖ్య 103కు చేరింది.పాకిస్తాన్ తరఫున WTCలో అత్యధిక వికెట్లు:* షాహీన్ అఫ్రిది – 103* నౌమన్ అలీ – 89* సాజిద్ ఖాన్ – 63* నసీం షా – 60ఇదే మ్యాచ్లో షాహీన్ మరో ఘనత కూడా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల చారిత్రక మైలురాయిని తాకాడు. మొమినుల్ హక్ వికెట్ షాహీన్కు 400వ వికెట్. కేవలం 26 ఏళ్ల వయసులోనే 211 అంతర్జాతీయ మ్యాచ్ల్లో షాహీన్ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో వన్డేల్లో 139, టీ20ల్లో 136, టెస్ట్ల్లో 125 వికెట్లు ఉన్నాయి.తొమ్మిదో బౌలర్షాహీన్ 400 వికెట్ల క్లబ్లో చేరిన తొమ్మిదో పాకిస్తాన్ బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ 916 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, వకార్ యూనిస్ 789 వికెట్లు, ఇమ్రాన్ ఖాన్ 544 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.పాకిస్తాన్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు:* వసీం అక్రమ్ – 916* వకార్ యూనిస్ – 789* ఇమ్రాన్ ఖాన్ – 544* షాహిద్ అఫ్రిది – 538* సక్లెయిన్ ముస్తాక్ – 496* సయీద్ అజ్మల్ – 447* షోయబ్ అక్తర్ – 438* ఉమర్ గుల్ – 427* షాహీన్ అఫ్రిది – 400*కాగా, బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పాక్ వెనుకపడింది. తొలి ఇన్నింగ్స్లో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీసి పాక్ను కట్టడి చేయగా, రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 152/3 స్కోరుతో 179 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బంగ్లా కెప్టెన్ షాంటో, రెండో ఇన్నింగ్స్లో 58 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం చివరి రోజు ఆట కొనసాగుతుంది. -
జాతీయ విధులకు ఆసీస్ స్టార్లు డుమ్మా
ఐపీఎల్ 2026 కారణంగా పలువురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టారు. త్వరలో జరుగబోయే పాక్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్లకు జట్లను ప్రకటించగా.. అందులో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ తదితరుల పేర్లు కనిపించలేదు.అండర్-19 జట్టు సారధి ఓల్లీ పీక్ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇతను పాకిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు మాత్రమే ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్లు రిటర్న్ రావడంతో బంగ్లాదేశ్ సిరీస్కు పీక్ను ఎంపిక చేయలేదు.కమిన్స్ గైర్హాజరీలో మిచెల్ మార్ష్ రెండు సిరీస్లకు (పాక్, బంగ్లాదేశ్) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే ఇంగ్లిస్, గ్రీన్లకు మూడు జట్లలో చోటు దక్కింది. స్టోయినిస్, మ్యాక్స్వెల్ బంగ్లాదేశ్ సిరీస్కు అందుబాటులో ఉన్నా సెలెక్టర్లు పట్టించుకోలేదు. వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్కు కూడా మూడు జట్లలో చోటు దక్కలేదు. ట్రవిస్ హెడ్ బంగ్లాదేశ్ వన్డే, టీ20 సిరీస్లకు మాత్రమే ఎంపికయ్యాడు.ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరే జట్లతో ఉన్న కూపర్ కన్నోల్లీ, డ్వార్షుయిస్, బార్ట్లెట్ను కూడా పాక్ వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాక్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో మే 30, జూన్ 2, 4 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.పాకిస్తాన్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపాఅనంతరం ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్కు వెళ్తుంది. ఈ పర్యటనలో వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో.. టీ20లు 17, 19, 21 తేదీల్లో జరుగన్నాయి.బంగ్లాదేశ్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపాబంగ్లాదేశ్ టీ20ల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా -
పాకిస్తాన్ ఆలౌట్.. బంగ్లాదేశ్కు ఆధిక్యం
ఢాకా వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పాక్ తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం ఆటగాడు అజాన్ అవైస్ (103) సెంచరీతో కదంతొక్కగా.. అబ్దుల్లా ఫజల్ (60), సల్మాన్ అఘా (58), మొహమ్మద్ రిజ్వాన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో ఇమామ్ ఉల్ హక్ 45, కెప్టెన్ షాన్ మసూద్ 9, సౌద్ షకీల్ డకౌట్, నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది 13, హసన్ అలీ 6, మొహమ్మద్ అబ్బాస్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీశారు.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (101) సెంచరీతో సత్తా చాటాడు. మొమినుల్ హక్ (91) సెంచరీ మిస్ అయ్యాడు. ముష్ఫికర్ రహీం (71) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లలో మహ్మదుల్ హసన్ జాయ్ 8, షద్మాన్ ఇస్లాం 13, లిటన్ దాస్ 33, మెహిద్ హసన్ మిరాజ్ 10, తైజుల్ ఇస్లాం 17, ఎబాదత్ హొసేన్ డకౌట్, తస్కిన్ అహ్మద్ 28, నహిద్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. 34 పరుగుల ఆధిక్యంలో..!27 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 34కు చేరింది. ఓపెనర్లు మహ్మదుల్ జాయ్ 2చ, షద్మాన్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. -
పాక్ జట్టులో రోహిత్, గిల్..!
పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ ఆటగాళ్ల గణాంకాలు చూపాల్సిన సమయంలో, స్క్రీన్పై భారత క్రికెటర్ల పేర్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.పాక్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ మే 8న షేర్-ఏ బంగ్లా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట సందర్భంగా బ్రాడ్కాస్టర్ పాక్ జట్టు టెస్ట్ గణాంకాలను ప్రదర్శించే గ్రాఫిక్ను చూపించింది. అయితే అందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అర్షదీప్ సింగ్ తదితర భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి.ఈ తప్పిదం వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మీమ్స్, సరదా కామెంట్లతో బ్రాడ్కాస్టర్ను ట్రోల్ చేశారు. కొందరు ఐపీఎల్ మోడ్లోనే గ్రాఫిక్స్ తయారు చేశారా..? అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు పాక్ అభిమానులు మాత్రం ఇది సాధారణ తప్పిదం కాదని, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో అద్భుత సెంచరీతో జట్టును నిలబెట్టాడు. మొమినుల్ హక్ 91, ముష్ఫికర్ రహీం 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో మెరవగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు పాక్ స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు. -
బెంగాల్లో ముస్లింలు, మతువాలపై వేధింపులు
ఢాకా: పశ్చిమ బెంగాల్లో ముస్లింలు, మతువాలు వేధింపులకు గురవుతున్నారని, వారి ఓటు హక్కును కోల్పోయారని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ, ప్రతిపక్ష చీఫ్ విప్ నహీద్ ఇస్లాం వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, అక్కడి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముస్లింలు, దళితులు, మతువాలతో సహా అన్ని మైనారిటీ వర్గాలకు సమాన రక్షణ కల్పించి దక్షిణాసియాకు బంగ్లాదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. చిట్టగాంగ్లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల బెంగాల్లో ఎన్నికలు జరిగా యి. ఎన్నికలు వారి అంతర్గత విషయం. దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే, ఎన్నికలకు ముందే లక్షలాది మంది ఓటర్లు తమ హక్కులను కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు, మతువా వర్గానికి చెందినవారున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఈ ముస్లింలకు పౌరసత్వం నిరాకరిస్తున్నారని, వారిపై హింస పెరిగిందని ఆరోపణలొస్తున్నాయి’అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని మత సమూహాల శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించాల్సిన బాధ్యతను బంగ్లాదేశ్పై ఉందన్నారు. బంగ్లాదేశ్ వ్యతిరేక కథనాల పట్ల, మత విద్వేష ప్రచారం, రెచ్చగొట్టే చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలో మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. పారీ్టలో అంతర్గత విభేదాలను నివారించాలని, యోగ్యత, సామూహిక క్రమశిక్షణ ఆధారంగా సంస్థాగత బలాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఉద్యమాల్లో పాల్గొన్న వారి హక్కులను పరిరక్షించడం, భవిష్యత్ రాజకీయ ప్రక్రియలలో వారిని భాగస్వాములను చేయడం పార్టీ భవిష్యత్కు అత్యవసమని ఆయన పేర్కొన్నారు. -
భారత్కు బిగ్ షాకిచ్చిన బంగ్లాదేశ్
బీజింగ్: తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రెహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టు(టీఆర్సీఎంఆర్పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కలీలుర్ రహ్మన్ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా.. భారత, బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.చైనా బిగ్ ప్లాన్?మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.భారత్ భద్రతకు ముప్పు.. ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
బెంగాల్లో బీజేపీ.. బంగ్లాదేశ్కు భారీ గుడ్న్యూస్!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ అధికారాన్ని కైవసం చేసుకోవాలనే కమల దళం కల ఎట్టకేలకు నిజమైంది. రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్కు కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో, బంగ్లాదేశ్కు నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇంతకీ తీస్తా నీటి విషయంలో కేంద్రం, మమత బెనర్జీ.. బంగ్లాదేశ్ వాదనలు ఎలా ఉన్నాయంటే..ఇరు దేశాల మధ్య తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నందుకు మమతా బెనర్జీపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విమర్శలు గుప్పించింది. అదే సమయంలో బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ ఫలితంగా రాష్ట్రానికి, బంగ్లాదేశ్కు మధ్య సంబంధాలను కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అభివర్ణించింది. ఈ సందర్భంగా బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బరీ హెలాల్ మాట్లాడుతూ.. సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ అద్భుత పనితీరును కనబరిచే అవకాశముందని ప్రశంసించారు. అలాగే, రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యపై పురోగతి ఆశలకు కూడా ఈ ఫలితాన్ని హెలాల్ ముడిపెట్టారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి అడ్డుగా నిలిచిందన్నారు.ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్ చాలాకాలంగా కోరుకుంటున్న తీస్తా ఒప్పందంపై కేంద్రంతో కలిసి పనిచేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మార్పిడి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. తీస్తా సమస్యపై హెలాల్ స్పందిస్తూ..‘గత ప్రభుత్వమే అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉంది. తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండూ గట్టిగా మద్దతు తెలిపాయి. అలాగే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినందున, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.భారత్, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపిణీలో పరిష్కారం కాని సమస్యలలో తీస్తా వివాదం ఒకటిగా మిగిలిపోయింది. 1996 గంగా జల ఒప్పందం, ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. అయితే, నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ పేర్కొంది. వాతావరణ మార్పులపై ఆందోళనలు కూడా తగ్గుతున్న నీటి లభ్యతపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.ఇప్పుడు, 1996 ఒప్పందం ఈ సంవత్సరం చివరలో ముగియనున్న నేపథ్యంలో, తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల కారణంగా దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం పెండింగ్లోనే ఉంది. 2011లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, తీస్తా జలాల్లో బంగ్లాదేశ్కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేయబడింది. అయితే, ఇది రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తీస్తా జలాలపై అంతకుముందు 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా లభించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన, న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది.తీస్తా ఒప్పందం ఇలా..2011లో డ్రాఫ్ట్ ఒప్పందంభారత్కి 42.5% నీరు.బంగ్లాదేశ్కి 37.5% నీరు.20% పర్యావరణ అవసరాలకు ఉపయోగం.అడ్డంకి: గత సీఎం మమతా బెనర్జీ, ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు.సవాళ్లు..భారత్లో: ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత.బంగ్లాదేశ్లో: రెండు కోట్ల మంది ప్రజలు తీస్తా నీటిపై ఆధారపడుతున్నారు.జియోపాలిటిక్స్: చైనా భాగస్వామ్యం వల్ల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం.చైనా మద్దతు: నీటి కేటాయింపులపై ఆలస్యం జరిగితే, చైనా మద్దతుతో Teesta River Comprehensive Management and Restoration Projectను ముందుకు తీసుకెళ్తామని బంగ్లా హెచ్చరికలు. -
బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం
కోల్కతా: మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం.. ఇలాంటి పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇస్తూ, బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలు కాదు.. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం! షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.షేక్ హసీనా పతనం తర్వాత..డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి నిరసనగా కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు, సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులపై మమతా బెనర్జీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీదీ ప్రభుత్వం కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మాత్రమే కొమ్ముకాస్తోందని, బెంగాల్ హిందువుల పక్షాన నిలబడలేదనే వాదనను ఆ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.అక్రమ చొరబాటుదారులపై బీజేపీ అస్త్రంబంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్, ఈసారి ఆ ప్రభావానికి లోనైంది.గేమ్ ఛేంజర్గా ‘మతువా’ ఓటుబ్యాంక్ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది ‘మతువా’ సామాజిక వర్గం. 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆవిర్భవించిన ఈ వర్గానికి బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో బలమైన పట్టుంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు స్థానికులను బీజేపీ వైపు నిలబడేలా చేశాయి. తాము మతపరమైన వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో, బీజేపీ మాత్రమే తమకు పౌరసత్వం కల్పిస్తుందన్న ఆశతో వారు బీజేపీ పక్షాన నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాతి స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. మూడు మ్యాచ్లో టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బెవన్ జాకబ్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. -
టీ20 సిరీస్ కూడా లంకదే..!
మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు, తొలుత వన్డే సిరీస్ను 2-1 తేడాతో.. తాజాగా టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిల్హెట్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్, రితూ మోనీ తలో వికెట్ తీశారు.అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్ అక్తెర్ (44 నాటౌట్) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ నిగార్ సల్తానా 7, షోర్నా అక్తెర్ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా.. మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న ఇదే సిల్హెట్ వేదికగా జరుగనుంది. -
రెండో టీ20 వర్షార్పణం
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఈ సిరీస్లో బంగ్లాదేశ్ ఆధిక్యం 1-0తో కొనసాగుతోంది. ఏప్రిల్ 27న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో టీ20 ఢాకా వేదికగా మే 2న జరుగనుంది.కాగా, 3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్కు ఊహించని షాకిచ్చింది. ఆ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ న్యూజిలాండ్ను 182 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కేటీన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్ క్లార్క్సన్ (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకీబ్, మెహిది హసన్ తలో వికెట్ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తౌహద్ హృదోయ్ (51 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్కు పర్వేజ్ హొసేన్ (28), షమీమ్ హొసేన్ (31 నాటౌట్) సహకరించారు. మిగతా ఆటగాళ్లలో సైఫ్ హసన్ 17, తంజిద్ హసన్ 20, కెప్టెన్ లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఐష్ సోధి 2, జోష్ క్లార్క్సన్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు. -
టీ20 సిరీస్లోనూ బోణీ కొట్టిన శ్రీలంక
మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ తొలుత జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాల్టి నుంచి (ఏప్రిల్ 28) నుంచి ప్రారంభమైన టీ20 సిరీస్లోనూ బోణీ కొట్టింది. సిల్హెట్ వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో శ్రీలంక ప్లేయర్లు ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన లంకేయులు, ఆతర్వాత బౌలింగ్లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్ను 136 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.లంక బ్యాటర్లలో ఇమేషా దులని (55), హర్షిత సమరవిక్రమ (61) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ చమారీ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగతా ప్లేయర్లలో హాసిని పెరీరా 7, హన్సిమ కరుణరత్నే 2 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సల్తానా ఖాతూన్ 2, మరుఫా అక్తెర్, నహిద అక్తెర్ తలో వికెట్ తీశారు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో షోర్నా అక్తెర్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. ఆమెకు మరో ఎండ్ నుండి ఎవరి సహకారం లభించలేదు. దిల్హర అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 16, షిర్మన్ అక్తెర్ 1, కెప్టెన్ నిగార్ సుల్తానా డకౌట్, శోభన మోస్తరి 16, రబేయా ఖాన్ 6, సుల్తానా ఖాతూన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో మల్కి మదారా, మిథాలీ అయోధ్య, చమారీ తలో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను కట్టడి చేశారు. సుగంధిక, కవిష వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 30న జరుగనుంది. -
న్యూజిలాండ్కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఇవాళ (ఏప్రిల్ 27) ప్రారంభమైన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఘనంగా బోణీ కొట్టింది. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్రత్యర్దిని 182 పరుగులకు (6 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కేటీన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్ క్లార్క్సన్ (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకీబ్, మెహిది హసన్ తలో వికెట్ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తౌహద్ హృదోయ్ (51 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్కు పర్వేజ్ హొసేన్ (28), షమీమ్ హొసేన్ (31 నాటౌట్) సహకరించారు. మిగతా ఆటగాళ్లలో సైఫ్ హసన్ 17, తంజిద్ హసన్ 20, కెప్టెన్ లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఐష్ సోధి 2, జోష్ క్లార్క్సన్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 29న జరుగనుంది. -
అమెరికాలో పీహెచ్డీ విద్యార్థుల దారుణ హత్య!
అమెరికాలో గత వారం అదృశ్యమైన బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు పీహెచ్ విద్యార్థుల కేసు విషాదంగా మారింది. ఈ ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా ఈ ఇద్దరిని హత్య చేసిన వ్యక్తి వారి రూమ్మేట్ కావడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే.. బంగ్లాదేశ్కు చెందిన జమీల్ లిమోన్, నహీదా బ్రిస్టీలు అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పీహెచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి కనిపించకుండా పోయారు. అంతకుముందు రోజు వీరిద్దరూ యూనివర్సిటీ క్యాంపస్లో చివరిసారిగా కనిపించారు. తాజాగా టంపా బే వంతెనపై యువకుడి మృతదేహం గుర్తించగా, బ్రిస్టీ ఆచూకీ లభ్యం కాలేదు.అయితే, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఆమె కూడా మరణించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్లోని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
బ్యాటింగ్లో నజ్ముల్... బౌలింగ్లో ముస్తఫిజుర్
చట్టోగ్రామ్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన బంగ్లాదేశ్ జట్టు... న్యూజిలాండ్పై 2–1తో వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. గురువారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 55 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఇటీవల వెస్టిండీస్, పాకిస్తాన్పై వన్డే సిరీస్లు నెగ్గిన బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ హుసేన్ షాంటో (119 బంతుల్లో 105; 9 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో విజృంభించగా... వికెట్ కీపర్ లిటన్ దాస్ (91 బంతుల్లో 76; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకదశలో 32/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడీ ఆదుకుంది. షాంటో, లిటన్ నాలుగో వికెట్కు 160 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ కోలుకుంది. కివీస్ బౌలర్లలో విలియమ్ రూర్కె 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 44.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఫోక్స్క్రాఫ్ట్ (72 బంతుల్లో 75; 7 సిక్స్లు), నిక్ కెల్లీ (80 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. ముస్తఫిజుర్ రహమాన్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. నహీద్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. -
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్దే తొలి వన్డే
బంగ్లాదేశ్ టూర్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (68) టాప్ స్కోరర్గా నిలవగా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థసెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్, షోరిపుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థసెంచరీలు సాధించారు. లిటన్ దాస్ (46) పర్వాలేదనిపించాడు. అయితే వీరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో అర్థసెంచరీ, బౌలింగ్లో ఒక వికెట్ తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనరబరిచిన డియాన్ ఫాక్స్క్రాఫ్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హెస్సేన్ ఏప్రిల్ 15, 2026న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. 36 ఏళ్ల రూబెల్ తన 15 ఏళ్ల కెరీర్లో 159 మ్యాచ్లు ఆడి 193 వికెట్లు తీశాడు. 27 టెస్ట్ల్లో 36 వికెట్లు, 104 వన్డేల్లో 129 వికెట్లు, 28 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున 2021 ఏప్రిల్లో తన చివరి మ్యాచ్ (టీ20) ఆడిన రూబెల్.. ఐదేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసి చివరికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై దేశీయ క్రికెట్లో కొనసాగుతూ, యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా ఉంటానని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ సందేశంలో అభిమానులు, కుటుంబం, మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు.పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా పేరు గడించిన రూబెల్ రివర్స్ స్వింగింగ్ యార్కర్లు వేయడంలో దిట్ట. 2015 వన్డే వరల్డ్కప్లో పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించడంలో రూబెల్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో అతను వేసిన 4-53 స్పెల్ బంగ్లాదేశ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. -
ఏడేళ్ల తర్వాత దిగ్గజ ప్లేయర్కు పిలుపు
తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొదటి సంతకమే ఆటగాళ్ల జీతాల పెంపు ఫైల్పై చేసిన అతను.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. షర్మిన్ సుల్తానా అనే ప్లేయర్ను ఏడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చేలా చేశాడు. షర్మిన్ చివరిగా 2019లో బంగ్లాదేశ్కు ప్రాతినిథ్యం వహించింది. ఆమె ఇటీవల ఎమర్జింగ్ ఏసియా కప్లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించింది. షర్మిన్ గతంలో బంగ్లాదేశ్ తరఫున 13 వన్డేలు ఆడి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం షర్మిన్ బంగ్లా జట్టుకు ఎంపికైంది.తమీమ్ అథ్వర్యంలోని బంగ్లా సెలెక్టర్లు శ్రీలంకతో వన్డే సిరీస్కు ఇవాళ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో షర్మిన్తో పాటు మరిన్ని ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వికెట్కీపర్ బ్యాటర్ జువైరియా ఫిర్దౌస్ జట్టులో చోటు దక్కించుకుంది. అయితే కెప్టెన్ నిగార్ సుల్తానా వికెట్కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఫిర్దౌస్ కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగనుంది.శ్రీలంకతో వన్డే సిరీస్ ఏప్రిల్ 20 నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్లు 20, 22, 25 తేదీల్లో రాజ్షాహీ మైదానం వేదికగా జరుగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 28, 30, మే 2 తేదీల్లో సిల్హెట్ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్కు బంగ్లా జట్టును ప్రకటించాల్సి ఉంది.శ్రీలంక సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే జట్టు..నిగర్ సుల్తానా జోటీ (సి), నహిదా అక్టర్ (విసి), ఫర్జానా హక్, శోభనా మోస్తరీ, ఫాహిమా ఖాతున్, షర్మిన్ అక్తర్ సుప్తా, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, షర్మిన్ సుల్తానా, మరుఫా అక్టర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, సుల్తానా ఖాతున్, శంజిదా అక్తేర్ మగ్లా, జువైరియా ఫిర్దౌస్ -
ఐపీఎల్ నిరాకరణ తర్వాత పీఎస్ఎల్లో చరిత్ర
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ IPL 2026లో చోటు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. దాయాది లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్కు ఆడుతున్న ముస్తాఫిజుర్.. నిన్న (ఏప్రిల్ 9) ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో 2 డాట్ బాల్స్ వేయడంతో పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన 3000 డాట్ బాల్స్ మైలురాయిని అధిగమించాడు. తద్వారా పొట్టి క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా చరిత్రకెక్కాడు. ముస్తాఫిజుర్కు ముందు డ్వేన్ బ్రావో (3681), మొహమ్మద్ ఆమిర్ (3348), ఆండ్రీ రస్సెల్ (3213), సోహైల్ తన్వీర్ (3046) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముస్తాఫిజుర్ 3000 డాట్ బాల్స్ మైలురాయిని తాకిన మ్యాచ్లో అతని జట్టు లాహోర్ ఖలందర్స్ ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఖలందర్స్ను కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను ఇస్లామాబాద్ 10.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతుపాడుతూ ఛేదించింది. డెవాన్ కాన్వే (59) అజేయ అర్ద సెంచరీతో ఇస్లామాబాద్ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే, ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి అత్యంత సున్నితమైన పరిణామాల మధ్య తొలగించారు. 2026 సీజన్ కోసం జరిగిన వేలంలో అతన్ని కేకేఆర్ రూ. 9.2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోగా.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జియో పొలిటిలక్ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అతని ఐపీఎల్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. దీంతో ముస్తాఫిజుర్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ ఖలందర్స్తో ఒప్పందం చేసుకున్నాడు. -
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ తన మొదటి నిర్ణయంతోనే సంచలనం సృష్టించాడు. తమీమ్ తన తొలి సంతకాన్ని క్రికెటర్ల జీతాల పెంపు ఫైల్పై చేసి, వారి జీవితాల్లో ఆనందాలు నింపాడు. గతంలో ఏ అధ్యక్షుడు క్రికెటర్ల జీతాల గురించి పట్టించుకోలేదన్న వాదన ఉంది. తమీమ్ అధ్యక్షుడు కాగానే జీతాలు పెరగడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాస్ అంటే ఇలా ఉండాలంటూ పలువురు క్రికెటర్లు సోషల్మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఏప్రిల్ 7న బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్వ బోర్డును రద్దు చేసి, తమీమ్ను 11 మంది సభ్యులతో కూడిన అడ్–హాక్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. 37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు. తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరన్న విషయం తెలిసిందే.మహిళా క్రికెటర్లకు భారీ ఊరట తమీమ్ మొదటి నిర్ణయం బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లకు భారీ ఊరట కలిగించింది. గతంలో కొందరు స్థానిక క్రికెటర్లు కేవలం 1000 టాకాలు (రూ. 749.69) మాత్రమే జీతంగా పొందేవారు. తమీమ్ తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి జీతాలు టీ20 మ్యాచ్కు 10000 టాకాలు, 50 ఓవర్ల మ్యాచ్కు 15000 టాకాలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు 20000 టాకాలుగా మారాయి. టాప్ 36 మహిళా క్రికెటర్ల జీతాలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో 30000 టాకాలుగా ఉండిన వారి నెల జీతం ఇప్పుడు 40000 టాకాలకు పెరిగింది. ఈ పెంపు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కలిగించడంతో పాటు ప్రోత్సాహం కూడా అందించింది. పురుష క్రికెటర్లకు జాక్పాట్తమీమ్ నిర్ణయంతో బంగ్లాదేశ్ పురుషు క్రికెటర్లకు జాక్పాట్ తగిలనట్లైంది. గతంలో గ్రేడ్ ఏ, బీ, సీ కేటగిరిల్లో ఉండే ఆటగాళ్లకు కేవలం 35000 టాకాలు జీతంగా అందేది. ఇప్పుడు గ్రేడ్ల వారీగా విభజన జరిగి, గ్రేడ్ సి ఆటగాళ్లకు 40000 టాకాలు, గ్రేడ్ బి ఆటగాళ్లకు 50000 టాకాలు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు 65000 టాకాలు జీతంగా నిర్ణయించబడింది. అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజు 75000 టాకాల నుంచి 100000 టాకాలకు పెరిగింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తమీమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా జీతాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కష్టపడి ఆడే ఆటగాళ్లకు న్యాయమైన వేతనం ఇవ్వడం మా లక్ష్యమని అన్నారు. -
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
బెంగాల్ దీదీకి ‘సరిహద్దు’ సెగ
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తి రేపే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అ్రస్తాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్కు బంగ్లాదేశ్తో 2,216 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది. చొరబాట్లు కేంద్రం వైఫల్యమే.. సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయతి్నస్తోంది. మరోవైపు, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే ‘తీస్తా నదీ జలాల పంపిణీ’వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ‘మతువా’ల చుట్టూ రాజకీయ చదరంగం బెంగాల్లో దాదాపు 17 శాతం ఉన్న దళిత (నామశూద్ర) ‘మతువా’సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచి్చన హామీ వారిని ఆకర్షిస్తోంది. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మతువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో పెరిగిన ముస్లిం జనాభా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5 వేల చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నోరెట్లు ఉంటాయి. సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతానికిపైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో 40 శాతం వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. పెండింగ్లో 40 లక్షల ఎస్ఐఆర్ కేసులు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉన్నారు.సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి ఇలా.. → జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షీదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటలు. కానీ, ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి యతి్నస్తున్నాయి. → రాజ్బన్షీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కారి్మకులు ఉన్న ఉత్తర బెంగాల్ (కూచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్) భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయువుపట్టుగా మారింది. → సుందర్బన్స్ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనారీ్టలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తోంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. -సోమన్నగారి రాజశేఖర్రెడ్డి -
బంగ్లాదేశ్లో నదిలో పడిన బస్సు.. 24 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఫెర్రీ ఎక్కే ప్రయత్నంలో ఓ బస్సు పద్మా నదిలో పడిపోయింది. దీంతో 24 మంది మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ప్రమాదం బుధవారం రాజ్బారి జిల్లాలోని దౌలత్డియా వద్ద జరిగింది. ఇది ఢాకా నుంచి సుమారు 100 కిలోమీటర్లు (62 మైళ్లు) దూరంలో ఉంది. ఫెర్రీ వద్దకు చేరుకునే సమయంలో బస్సు నియంత్రణ కోల్పోయి ఓ వైపునకు ఒరిగి, సుమారు 30 అడుగులు (9 మీటర్లు) లోతులో నదిలో మునిగిపోయిందని పోలీసులు, ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ (అగ్నిమాపక, అత్యవసర రక్షణ విభాగం) తెలిపారు.నదిలో మునిగిన బస్సు నుంచి సిబ్బంది 22 మృతదేహాలను వెలికితీశారు, అందులో ఆరుగురు పురుషులు, 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని ఫైర్ సర్వీస్ అధికారి తల్హా బిన్ జాసిమ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 4 ఫైర్ సర్వీస్ యూనిట్లు, 10 మంది డైవర్లు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. సైన్యం, పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇంకా కొంత మంది ప్రయాణికులు అదృశ్యమై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం రోడ్డు, ఫెర్రీ ప్రమాదాల్లో వందల మంది మరణిస్తున్నారు. -
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. పద్మానదిలోకి దూసుకెళ్లిన బస్సు..
-
Bangladesh : నదిలో పడిన బస్సు 23 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్బారి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ వద్ద 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దురదృష్టవశాత్తు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఇటీవల ఈద్ సెలవులు ముగించుకొని ఢాకాకు తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల 14 మృతదేహాలు లభించాయి. ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ప్రయాణికుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. -
మోదీయే అతిపెద్ద చొరబాటుదారు
కోల్కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాదిమంది చొరబాటు దారులు పశ్చిమబెంగాల్లో తిష్టవేశారంటూ విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. శనివారం కోల్కతాలోని రెడ్రోడ్లో జరిగిన రంజాన్ వేడుకల్లో మమత పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, బహుళ సామాజిక వైవిధ్యం పరిరక్షణకు జరుగుతున్న పోరాటమే ఈ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును మోదీ జీ, బీజేపీ లాక్కునేందుకు చేసే యత్నాలను అడ్డుకుంటా. చివరిదాకా పోరాడతా. కోల్కతా నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా ప్రతిచోట కేంద్రం అసంబద్ధ నిర్ణయాలను సవాల్చేస్తా. మీరు(మోదీ) ముస్లిం దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పాలకులతో కరచాలనం చేస్తారు. స్నేహబంధంపై ప్రసంగాలిస్తారు. తీరా భారత్కు వచ్చాక హిందూ–ముస్లిం అంటూ విడగొడతారు. ఓటర్ల పేర్లను ‘సర్’ జాబితా నుంచి అన్యాయంగా తొలగించారు. పైగా వాళ్లపై చొరబాటుదారులు అనే ముద్రవేస్తున్నారు. ఓట్ల జాబితాలోకి చొరబడిన మీరే అసలైన చొరబాటుదారులు’’ అంటూ మోదీ, బీజేపీ ప్రభుత్వాలపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బెంగాల్లో అప్రకటిత రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. మా నుంచి పాలనాధికారం లాగేసుకోవాలని చూస్తున్నారు. అయినాసరే మేం భయపడబోం’ అని మమత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముస్లింలనుద్దేశించి మమత మాట్లాడారు. ‘‘మీకు తోడుగా ఎవరు నిలబడకపోయినాసరే మీకు అండగా నేనుంటా. బెంగాల్లో మతాలు, కులాలు, వర్గాల తేడా లేకుండా అందర్నీ కుటుంబసభ్యుల్లా చూసుకుంటా. ఎవరైనా రాజకీయంగా రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోను. ప్రజలను మతాల మాటున విడదీయాలనుకునే వాళ్లకు ఇక్కడ స్థానం లేదు. నేరుగా నరకానికి పొండి. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఇక్కడ అంతా కలిసిమెలసి ఉంటారు. ఈ ఐకమత్యాన్ని చెడగొట్టేవాళ్లను మనం రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వొద్దు’’ అని బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మమత ప్రసంగంపై బీజేపీ మండిపడింది. ‘‘ దేశ ప్రధానిని చొరబాటుదారుడు అంటూ సంబోధించే వాళ్లకు సీఎం కుర్చీ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చునే హక్కు లేదు. ఆమెకు మతిపోయిందేమో. వెంటనే రాంచీకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిది’’ అని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేంధు అధికారి వ్యాఖ్యానించారు. -
బంగ్లాదేశ్దే వన్డే సిరీస్
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు 2–1తో పాకిస్తాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా... రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో నెగ్గింది. నిర్ణయాత్మక పోరులో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ చేజిక్కించుకుంది. కీలక మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జిద్ హసన్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కగా... తౌహిద్ హృదయ్ (48 నాటౌట్; 4 ఫోర్లు), లిటన్ దాస్ (41; 1 ఫోర్, 1 సిక్స్), సైఫ్ హసన్ (36; 3 ఫోర్లు) అతడికి సహకరించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సల్మాన్ ఆగా (98 బంతుల్లో 106; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో పోరాడగా... అబ్దుల్ సమద్ (34; 5 ఫోర్లు), సాద్ మసూద్ (38; 5 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాహిబ్జాదా ఫర్హాన్ (6), మాజ్ (6), రిజ్వాన్ (4) విఫలమయ్యారు. పాకిస్తాన్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరమైన దశలో రెండు సిక్స్లు కొట్టిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది (38 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లు ఘాజి ఘోరి, సాద్ మసూద్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు. -
తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు!
పాకిస్థాన్తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది. ఢాకా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమిమ్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో తౌహిద్ హృదోయ్ (44 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు),లిటన్ దాస్ (51 బంతుల్లో 41) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 3 వికెట్లతో రాణించాడు. టాస్ గెలిచి బౌలింగ్కు మొగ్గు చూపిన పాకిస్థాన్ బంగ్లాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. బౌలింగ్తో బంగ్లాను కట్టడి చేయాలని భావించిన పాకిస్థాన్కు ఆది నుంచే హంసపాదు ఎదురయ్యింది. ఓపెనర్లు తంజిద్, సైఫ్ హసన్లు తొలి వికెట్కు 108 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్కు గట్టి పునాది పడింది. 36 పరుగులు చేసిన సైఫ్ హసన్ షాహిన్ అఫ్రిది బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత నజ్ముల్ హసన్ (27)తో కలిసి తంజిద్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ దశలో 107 బంతుల్లో తంజిద్ తన వన్డే కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆఖర్లో లిటన్ దాస్, తౌహిద్ హృదోయ్ ధాటిగా ఆడడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే చెరో వన్డే మ్యాచ్ గెలవడంతో మూడో వన్డే సిరీస్ విజేత ఎవరో తేల్చనుంది.Moment to remember! ✨🏏 Tanzid Hasan Tamim celebrates his first ODI hundred with signature flair. 🔥🐯#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/0mkKFILekx— Bangladesh Cricket (@BCBtigers) March 15, 2026చదవండి: 12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్ -
ప్రారంభానికి ముందే వాయిదా పడిన క్రికెట్ లీగ్
మహిళల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (WBPL) ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఈ లీగ్ ఏప్రిల్ 3 నుంచి 15 తేదీల మధ్యలో జరగాల్సి ఉండింది. అయితే స్పాన్సర్లు దొరక్క జులై నెలకు పోస్ట్పోన్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వాస్తవానికి ఈ లీగ్ టీ20 ప్రపంచకప్కు ముందు తమ ప్లేయర్లకు ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. అయితే వాయిదా పడటంతో ప్రపంచకప్ వరకు బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఎలాంటి అధికారిక మ్యాచ్లు ఉండవు. బంగ్లా ప్లేయర్లు నేరుగా జూన్ 14న నెదర్లాండ్స్తో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బంగ్లాదేశ్ క్రికెట్కు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ దేశ పురుషుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026 నుంచి వైదొలిగి, చాలా పెద్ద సాహసం చేసింది. ఈ పరిణామం తర్వాత ఆ దేశంలో క్రికెట్కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ ప్రభావం పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే పురుషుల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్పై కూడా పడనుంది. ఇప్పటికే ఆ లీగ్లోని పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ ఎగ్గొట్టాయనే టాక్ ఉంది. పురుషుల బీపీఎల్కు కూడా స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ లీగ్ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది. -
పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగే విషయంలో తమకు అండగా ఉండినట్లు నటించి, చివరికి హ్యాండిచ్చిన పాకిస్తాన్కు బంగ్లాదేశ్ జట్టు తగిన బుద్ది చెప్పింది. ప్రపంచకప్ తర్వాత జరిగిన తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి, 'మిత్రధర్మాన్ని' నిలబెట్టుకుంది. ఫ్రెండ్, ఫ్రెండ్ అంటూ.. బంగ్లాదేశ్ పాక్ను ఇంటికి పిలిచి మరీ దెబ్బకొట్టింది.పాకిస్తాన్ క్రికెట్ జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పాక్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. నహిద్ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్ రహ్మాన్ (4.4-0-18-1), తస్కిన్ అహ్మద్ (7-029-1), మెహిది హసన్ మిరాజ్ (10-0-29-3) ధాటికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.పాకిస్తాన్కు బంగ్లాదేశ్పై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్. 22 ఏళ్ల పేసర్ నహిద్ రాణా నిప్పులు చెరిగే బంతులతో పాక్ను దారుణంగా దెబ్బకొట్టాడు. స్వదేశంలో వన్డేల్లో పాకిస్తాన్పై ఓ బంగ్లాదేశ్ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు (5-24) ఇవే.పాక్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు ఫహీమ్ అష్రాఫ్ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు.ఫహీమ్, ఫర్హాన్ కాక మాజ్ సదాకత్ (18), మొహమ్మద్ రిజ్వాన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్ ప్లేయర్లలో హమిల్ హుసేన్ 4, సల్మాన్ అఘా 5, హుసేన్ తలాత్ 4, షాహీన్ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్ డకౌటయ్యారు.అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (42 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశాడు. మరో ఓపెనర్ సైఫ్ హసన్ 4 పరుగులకే ఔటైనా.. నజ్ముల్ హసన్ షాంటోతో (27) కలిసి బంగ్లాను గెలుపు తీరాలకు చేర్చాడు. అనంతరం లిటన్ దాస్ (3 నాటౌట్) సహకారంతో మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లోని రెండో వన్డే ఇదే వేదికగా మార్చి 13న జరుగనుంది. -
తీరు మార్చుకోని పాకిస్తాన్.. పసికూన చేతిలో..!
టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్లో పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. పసికూన బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచ్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న పాక్.. ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్ 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.పేసర్లు నహిద్ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్ రహ్మాన్ (4.4-0-18-1), తస్కిన్ అహ్మద్ (7-029-1), స్పిన్నర్ మెహిది హసన్ మిరాజ్ (10-0-29-3) ధాటికి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ విలవిలలాడిపోయింది. పాక్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు ఫహీమ్ అష్రాఫ్ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాక్ ఇన్నింగ్స్లో ఫహీమ్, ఫర్హాన్ కాక మాజ్ సదాకత్ (18), మొహమ్మద్ రిజ్వాన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్ ప్లేయర్లలో హమిల్ హుసేన్ 4, సల్మాన్ అఘా 5, హుసేన్ తలాత్ 4, షాహీన్ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్ డకౌటయ్యారు.బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రపంచకప్ నుంచి వైదొలిగే విషయంలో బంగ్లాదేశ్కు అండగా ఉండినట్లు నటించి, చివరి నిమిషంలో హ్యాండిచ్చిన పాక్కు కూడా ప్రపంచకప్ తర్వాత ఇదే తొలి మ్యాచ్. పాక్ ప్రపంచకప్లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఈ సిరీస్కు పాక్ సీనియర్ ఆటగాడు బాబర్ ఆజమ్ లేకుండా బరిలోకి దిగింది. పాక్ జట్టుకు షాహీన్ అఫ్రిది నాయకత్వం వహిస్తున్నాడు. జట్టు మారినా, ప్లేస్ మారినా పాక్ ఆటతీరులో మాత్రం ఏ మార్పు లేదు. ప్రపంచకప్తో పోలిస్తే ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కితే అద్భుతమే. -
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్ను పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.మూతపడుతున్న యూనివర్సిటీలుబంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) కొనుగోలు చేస్తోంది.భారత్ పాత్ర కీలకంఅంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
బంగ్లాదేశ్లో అలా.. నేపాల్లో ఇలా
కాఠ్మాండు: బంగ్లాదేశ్, నేపాల్లో జెన్ జీ ఉద్యమాల వల్ల అప్పట్లో ఆ రెండు దేశాల ప్రభుత్వాలు కుప్పకూలాయి. అయితే, ఆ ఉద్యమాల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో మాత్రం ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. అంటే నేపాల్లో జెన్ జీ ఉద్యమం ద్వారా పేరు తెచ్చుకున్న బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. బంగ్లాదేశ్లో మాత్రం 1978లో స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విజయం సాధించి, విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీ ఓడిపోయింది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జరిగిన నిరసనల లక్ష్యం ఒక్కటే.. అదే ప్రస్తుత వ్యవస్థను మార్చడం. ఇప్పుడు నేపాల్లో జెన్ జీల అభిమాన నేత బాలేంద్ర షా విజయం సాధిస్తే, బంగ్లాదేశ్లో జెన్ జీల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పార్టీ వైఫల్యం చెందింది. బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలోనే విప్లవం వచ్చింది. ఆ జెన్ జీ ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చినా, విద్యార్థుల నేతృత్వంలోని ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.బంగ్లాదేశ్లో నిరసనలు ఛత్ర శిబిర్ వంటి శక్తుల ద్వారా ప్రారంభమయ్యాయి. అది బంగ్లాదేశ్లోని ఒక ప్రధాన ఇస్లామిక్ విద్యార్థి సంఘం పేరు. దీని పూర్తి పేరు బంగ్లాదేశ్ ఇస్లామీ విద్యార్థి శిబిర్. దీన్ని 1977లో స్థాపించారు. బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమానికి హసీనా ప్రభుత్వాన్ని తొలగించడం అనే స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది.నేపాల్లో నిరసనలు సహజంగా ఉద్భవించాయి. ప్రధాన దృష్టి మొత్తం పాత వ్యవస్థను కూల్చడం. దీంతో 35 ఏళ్ల బాలేంద్ర షా వంటి నాయకులు పాత రాజకీయ పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయాలుగా ఎదగగలిగారు.బంగ్లాదేశ్ విద్యార్థుల ఉద్యమం దేశ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని సృష్టించలేకపోయింది. ఆ ఉద్యమం ప్రధానంగా అప్పటి ప్రధానమంత్రి హసీనాను తొలగించడం మీదే కేంద్రీకృతమైంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపలేకపోయింది. మరోవైపు, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు హసీనా ప్రభుత్వం కూలిన తరువాత త్వరగా వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు తాత్కాలిక ప్రభుత్వంలో పదవులు కూడా స్వీకరించారు. దీంతో వారు మార్పును కాకుండా అధికారాన్ని కోరుకుంటున్నారని అనేక మంది భావించారు. ఈ విధంగా బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు తమ ప్రతిష్ఠను దెబ్బతీసుకున్నారు. జమాత్ పార్టీతో చేతులు కలపడం వల్ల వారు ఇతర రాజకీయ శక్తితో కలిసినట్టు కనిపించింది. బంగ్లాలో తారిక్ రహ్మాన్ ప్రభావం ఇలా..హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిక్ రహ్మాన్ నమ్మకమైన నేతగా ఎదిగారు. అప్పటికే బంగ్లాలో ఉన్న రాజకీయ వ్యవస్థ నుంచే వచ్చిన నాయకుడు అయినా, 17 సంవత్సరాలు వేరే దేశంలో నివసించారు. తారిక్ రహ్మాన్ కొత్త ఆలోచనలు, కొత్త విధానం, ముఖ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి స్పష్టమైన విజన్ను చూపించారు. ఆయన “ఐ హావ్ ఏ ప్లాన్” ప్రసంగం ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుందో చెప్పింది. ఈ విధానం ఫలించింది. నేపాల్లో బాలేంద్ర షా ఇలా..గత సంవత్సరం సెప్టెంబరులో నేపాల్లో జెన్ జీ నిరసనలు చెలరేగాయి. కారణం సామాజిక మాధ్యమాల నిషేధం. తర్వాత ప్రభుత్వం ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ అవినీతిపై జెన్ జీ పోరాడింది.బాలేంద్ర షా మొదట “బలెన్” అనే పేరుతో రాపర్గా ప్రసిద్ధి చెందారు. ఆయన పాటలు సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతిని విమర్శించేలా ఉండేవి. యువతను ఆకర్షించాయి. తర్వాత ఆయన కాఠ్మాండు మేయర్గా ఎన్నికయ్యారు. నిరసనల సమయంలో ప్రధానమంత్రి పదవిని చేపడతారా అని అడిగినప్పుడు ఆయన తిరస్కరించారు.కాఠ్మాండు మేయర్గా బలెన్ షా పనిచేసిన అనుభవం ఆయనకు సాయపడింది. ముఖ్యంగా సాధారణ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడం, ప్రజా భూములపై ఆక్రమణలు తొలగించడం, దీర్ఘకాల చెత్త నిర్వహణ సమస్య పరిష్కారం వంటి అంశాలపై పని చేశారు.ప్రచార సమయంలో ఆయన సభలకు భారీ జనసందోహం వచ్చేది. ఆయన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా సాయపడ్డారు. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. -
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ డార్విన్ వేదికగా ఆగస్ట్ 13-17 మధ్య తేదీల్లో జరుగుతుంది. రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22-26 మధ్య జరుగనుంది. బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య ఇది నాలుగో టెస్ట్ సిరీస్ ఆవుతుంది. ఇందులో ఆరు మ్యాచ్లు జరగ్గా ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. 2017లో మీర్పూర్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆసీస్పై సంచలన విజయం సాధించింది.కాగా, బంగ్లాతో హోం సిరీస్తోనే 2026-27 సీజన్ ఆసీస్ టెస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సిరీస్ తర్వాత ఆసీస్ మూడు టెస్ట్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆతర్వాత నవంబర్ నుంచి 2027 జనవరి మధ్యలో న్యూజిలాండ్ జట్టు నాలుగు టెస్ట్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో భారత్లో 5 మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనుంది. అనంతరం మార్చిలో ఇంగ్లండ్తో ఎంసీజీలో 150వ వార్షికోత్సవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్వెబెర్హాఅక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్టౌన్ఈ పర్యటనలో ఆసీస్ మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ మ్యాచ్లు సెప్టెంబర్ 24 (డర్బన్), 27 (జోహనెస్బర్గ్), 30 (పోచెఫ్స్ట్రూమ్) తేదీల్లో జరుగుతాయి.ఇంగ్లండ్తో 150వ వార్షికోత్సవ టెస్ట్ 2027, మార్చి 11-15: ఏకైక టెస్ట్, ఎంసీజీఆసీస్లో న్యూజిలాండ్ పర్యటన.. భారత్లో ఆసీస్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలోనే వైదొలిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ జట్టు పునఃదర్శనం స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్తోనే ఉంటుంది. ఈ మధ్యలో ఆ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్, పాకిస్తాన్ లీగ్ తదితర ప్రైవేట్ లీగ్లతో పాటు దేశవాలీ టోర్నీల్లో ఆడతారు. -
బంగ్లాలో సంక్షోభానికి కారణం అతనే? ఆ దేశాధ్యక్షుడి ఆరోపణలు
ఢాకా: బంగ్లాదేశ్లో ఇటీవలే నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్గా వ్యవహారించిన మహ్మద్ యూనస్ ఆ బాధ్యతలనుంచి వైదొలిగారు. అయితే యూనస్పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో అస్థిరత నెలకొనడానికి యూనస్ ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాకుండా అధ్యక్షుడిగా ఉన్న తనను అనధికారికంగా తొలిగించే కుట్రపన్నారని పేర్కొన్నారు.బంగ్లాదేశ్లో ఇంతకాలం పాటు రాజకీయ అస్థిరత నెలకొంది. షేక్ హసీనా దేశాన్ని వదలిన మెుదలు ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితులపై ఆ దేశ అధ్యక్షుడు షహాబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్గా వ్యవహరించిన మహ్మద్ యూనస్ ఈ పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. ఆయన కాలంలో దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించి రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తేవడానికి యత్నించారన్నారు.బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ మాట్లాడుతూ " ఆయన పదవిలో ఉన్నంత కాలం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎటువంటి చర్చల్లో పాల్గొనలేదు. నన్ను పదవిలోంచి తొలగించే కుట్రలు జరిగాయి. అదేవిధంగా చాలాసార్లు దేశంలో అస్థిరత, అశాంతి సృష్టించి రాజ్యాంగ సంక్షోభం సృష్టించే యత్నాలు జరిగాయి. అని ఆదేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.అదేవిధంగా మహ్మద్ యూనస్ తన పదవి కాలంలో ఎటువంటి రాజ్యాంగంగా నిర్వహించాల్సిన తుంగలో తొక్కారని తన విదేశీ పర్యటనల సమయంలో దేశ అధ్యక్షునికి తెలపాల్సిన కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. విదేశీ పర్యటనల వివరాలు అధ్యక్షునితో పంచుకోవాల్సి ఉండగా దానిని సైతం పాటించలేదని తెలిపారు. అంతే కాకుండా తన పదవికాలంలో ఒక్కసారి కూడా తనను కలవడానికి అధ్యక్షుని నివాసానికి రాలేదని షహబుద్దీన్ తెలిపారు.ఏడాదిన్నర కాలం పాటు యూనస్ ప్రభుత్వం తనను ప్యాలెస్ ఖైదీగా బంధించిందని కోస్వో, ఖతార్ దేశ పర్యటనలను చేయాల్సి ఉండగా తనకు అనుమతులివ్వలేదని తెలిపారు. అయితే ఒకానోక సమయంలో తన స్థానంలో మాజీ న్యాయమూర్తిని అధ్యక్షున్ని చేద్దామని భావించగా రాజ్యాంగ నియమాలు సహకరించవని ఆ న్యాయమూర్తి చెప్పడంతో వారు వెనక్కి తగ్గారని తెలిపారు.2024 అక్టోబర్ 22న జరిగిన సంఘటన తానిప్పటికి మరిచిపోనని ఆ సమయంలో అల్లరిమూక అధ్యక్ష భవనంపై దాడికి యత్నించిందని అయితే మిలిటరీ తక్షణమే స్పందించి వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం బీఎన్పీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని నమ్మకముందని షహబుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆసియా కప్ ఫైనల్.. స్వల్ప స్కోర్కే పరిమితమైన టీమిండియా
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్కు మాత్రమే పరిమితమైంది. బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.భారత్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్లో భారత్ శ్రీలంకపై, బంగ్లాదేవ్ పాకిస్తాన్పై విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం: ఎనిమిది మంది అరెస్ట్
న్యూఢిల్లీ: భారత గడ్డపై మరోసారి నెత్తురు పారించాలని చూసిన అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా కుట్రను ఢిల్లీ పోలీసులు తిప్పికొట్టారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద సంస్థల అండదండలతో భారత్లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించిన ఎనిమిది మంది ముష్కరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఆరుగురిని తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో, మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులకు పట్టుబడిన వారిలో కొందరు బంగ్లాదేశీయులు ఉన్నారని, వీరంతా నకిలీ ఆధార్ కార్డులతో తమ స్వస్థలాలను దాచిపెట్టి, దేశంలో చొరబడినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా తమిళనాడులోని గార్మెంట్ తయారీ యూనిట్లలో కార్మికులుగా చలామణి అవుతూ, వీరు రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ప్రత్యేక విభాగం అధికారులు గుర్తించారు. ఈ భారీ కుట్ర వెనుక విదేశాల్లో తలదాచుకున్న హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.కశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంటూ ఈ ఎనిమిది మందిని భారత్లో ఆపరేట్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు నిర్ధారించాయి. నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, పదహారు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిలోని డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, చారిత్రక కట్టడాలే లక్ష్యంగా లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఐఈడీ దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ముఖ్యంగా పాత ఢిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలోని ఓ దేవాలయంతో పాటు ఎర్రకోట పరిసరాల్లో మారణహోమం సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఢిల్లీ మెట్రో సహా సుమారు పదికి పైగా ప్రాంతాల్లో ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలతో కూడిన రెచ్చగొట్టే పోస్టర్లను ఈ ముఠా అంటించింది. ఈ పోస్టర్ల మూలాలపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులకు తమిళనాడు కేంద్రంగా సాగుతున్న ఈ నెట్వర్క్ చిరునామా చిక్కింది. గతంలో జమ్ముకశ్మీర్ నుంచి ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీ వరకు విస్తరించిన డాక్టర్ల ఉగ్ర మాడ్యూల్ తరహాలోనే, ఈ ముఠా కూడా అత్యంత రహస్యంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీ డిక్లరేషన్: బయటపడిన పాక్ కుళ్లు.. తైవాన్ భయం? -
మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన
ఢాకా: బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా గడవక ముందే భారత్- బంగ్లా సంబంధాల్లో కీలక పురోగతి ఏర్పడింది. ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు గత రెండేళ్లుగా తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిన నాటి నుంచి బంగ్లాదేశ్ భారత్ పై తీవ్ర అక్కసు వెల్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతేకాకుంగా ఆ దేశంలోనే మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. దీంతో గతేడాది డిసెంబర్ లో భారత్ అదే విధంగా బంగ్లా పరస్పరం వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపట్టడం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిఖ్ రెహ్మాన్ అభినందనలు చెప్పి భారత్ రావాల్సిందిగా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారినట్లయింది.అయితే బంగ్లాదేశ్ సైతం భారత్ తో స్నేహం హస్తం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయులకు నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్న శుక్రవారం ఆ దేశ హైమిషనరేట్ కార్యాలయం భారత్ కు వీసాల నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక, మెడికల్, బిజినెస్, వర్క్ లతో పాటు ఇతరాత్ర వీసాలకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పడానికి తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది.అయితే ఇదివరకే ఈ అంశంలో భారత్ సానుకూలంగా స్పందించింది. సిల్హెట్లోని భారత సీనియర్ కాన్సులెట్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని అన్నారు. దీనిపై బంగ్లాదేశ్ సైతం పాజిటివ్ గా స్పందించడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పాక్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఫైనల్లో భారత్తో అమీతుమీ
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్-ఏ జట్టు ఫైనల్కు చేరింది. పాకిస్తాన్-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్ ఫహీమా ఖాతూన్ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ హఫ్సా ఖలీద్ 2, వహీదా అక్తర్, మొమినా రియాసత్, అనోషా నాసిర్, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీశారు.అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్ పతనాన్ని శాశించారు. పాక్ ఇన్నింగ్స్లో షావాల్ జుల్ఫికర్ (14), యుస్రా ఆమిర్ (11), హఫ్సా ఖలీద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లా-పాక్ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఆరు గజాల అద్భుతం జిగ్ జిగ్ జమ్దాని
దక్షిణ భారతదేశంలో కంచిపట్టు ఒక సాంస్కృతిక సంప్రదాయం. కంచిపట్టును ఇష్టపడే ప్రతివారూ జమ్దానీని ఇష్టపడతారు. జమ్దానీ అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రాచీన నేత పద్ధతి. బంగ్లాదేశ్ భౌగోళిక గుర్తింపు ఉన్న జమ్దానీ చీర మన దేశంలోనే విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ డిజైన్ల ప్రత్యేకతతోనే శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది జమ్దానీ చీర. పదివేల రూపాయల నుంచి 4–5 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల జమ్దానీ నేత చీర గురించి...సన్నని దారాలను గట్టి దారానికి జోడించి క్లిష్టమైన జమ్దానీ డిజైన్స్ను సృష్టిస్తారు. వీటిని నేరుగా మగ్గంపై నేస్తారు. మొదట్లో మస్లిన్ క్లాత్ మీద నేసేవారు. ప్రతి చీరకు ఇద్దరు నేత కార్మికులు చేస్తారు. ప్రకృతి నుండి ప్రేరణ పొందిన డిజైన్లు, రేఖాగణిత ఆకారాలు వీటిలో ఉంటాయి. ఇటీవల ఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం అండ్ హస్తకళా అకాడమీలో జరిగిన ప్రదర్శనలో జమ్దానీ నేత చీర సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ప్రదర్శన ప్రారంభోత్సవంలో దర్శకుడు ముజఫర్ అలా మాట్లాడుతూ ‘ఉమ్రావ్ జాన్’ సినిమాలో రేఖ కోసం జమ్దానీని ఎందుకు ఎంచుకున్నాడో తెలియజేశాడు. 60ల కాలంలో వచ్చిన సినిమాలలోనూ హీరోయిన్ల క్లాసిక్ లుక్ కోసం జమ్దానీ చీరలను ఎంచుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.జమ్దానీ అనేది రెండు పర్షియన్ పదాల కలయిక. ‘జామ్’ అంటే పువ్వు, ‘దాని’ అంటే వేజ్ అని అర్ధం. చీరపైన ఫ్లవర్వేజ్ డిజైన్లు ఉంటాయి. బంగ్లాదేశ్లోని నారాయణగంజ్ జిల్లాలో గల శీతలాక్షయ నది ఒడ్డున యునెస్కో గుర్తింపు పొందిన జమ్దానీ పరిశ్రమ ఉంది. దాదాపు 2,500 కుటుంబాలు జమ్దానీని సృష్టించడంలో నిమగ్నమై ఉన్నాయి. దీనిని బట్టి జమ్దానీది వేల ఏళ్ల క్రితం నాటిదిగా చెప్పవచ్చు. ఒకప్పుడు జమ్దానీలను హిందూ నేతకారులైన బసక్ అనే గ్రూప్వాళ్లు నేసేవారు. వారు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లినప్పుడు స్థానిక మత్స్యకారులకు, ముస్లిమ్ నేత కార్మికులకు జమ్దానీ నేతలో శిక్షణ ఇచ్చినట్టుగా చెబుతారు. జమ్దానీ డిజైన్స్ కాటన్, హాఫ్ సిల్క్, మస్లిన్ క్లాత్పై వచ్చేలా నేస్తారు. నేత పనిలో ఉపయోగించే దారాల సంఖ్యను బట్టి ఆ చీర మృదువుగా ఉంటుందని చెబుతారు. పవర్లూమ్లోనూ ఈ తరహా చీరల తయారీ రావడంతో అన్ని వర్గాల వారికీ జమ్దానీ అందుబాటులోకి వచ్చింది. అయితే, నాణ్యత నేత చీర ద్వారానే తెలుస్తుంది.నటి, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ బంగ్లాదేశ్ సందర్శించినప్పుడు ఆమె దేశంలోని ప్రముఖ జమ్దానీ చీర నేతకారులైన సోదరులు సాజిబ్, నషిదుల్ రసల్ లను కలిసింది. వారి దగ్గర నాలుగు అందమైన జమ్దానీ నేత చీరలను ఎంచుకుందని వారు చెబుతుంటారు. -
బంగ్లాలో యూనస్ ఔట్.. భారత్ కీలక నిర్ణయం!
ఢాకా: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసా సేవలు త్వరలోనే పునరుద్దరించే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం.భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు గత రెండేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 జూలై–ఆగస్టు ఉద్యమాల తర్వాత షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవడం, ఆమె భారత్కు వెళ్లిపోవడం, ఆ తర్వాత మధ్యంతర ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక శక్తులు బలపడటం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 2024 బంగ్లాదేశ్లో అశాంతి కారణంగా భారత్ తొలిసారి అన్ని వీసా సేవలను నిలిపివేసింది. అలాగే, డిసెంబర్ 2025లో ఉస్మాన్ హాది మరణం తర్వాత జరిగిన భారత్ వ్యతిరేక నిరసనల కారణంగా ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, రాజ్షాహి వీసా కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ కూడా తన కాన్సులేట్లలో వీసా సేవలను నిలిపివేసింది.అయితే, ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం దిగిపోవడం.. తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరడంతో వీసాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సిల్హెట్లోని భారత సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ స్పందిస్తూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని పేర్కొన్నారు.కాగా, ఈ పరిణామం వీసా విధానాలకే పరిమితం కాదు. ఇది రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం. సాధారణ ప్రజలకు వైద్య, వ్యాపార, సాంస్కృతిక ప్రయాణాలు సులభం అవుతాయి. ఇదిలా ఉండగా.. షేక్ హసీనా (2009–2024) కాలంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. -
T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2028 టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేరుగా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించినట్లు తెలిపింది.అదే విధంగా.. బంగ్లాదేశ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటుందని ఐసీసీ పరోక్షంగా స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్కప్ 2026 ఎడిషన్ మొదలైన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇరవై జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో నాలుగు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే... గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8లో అడుగుపెట్టాయి. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే అనూహ్య రీతిలో అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం టీ20 ప్రపంచకప్-2026 ఎడిషన్లో సూపర్-8 చేరిన జట్లన్నీ ఆటోమేటిక్గా 2028 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఈసారి విఫలమైనా.. 2028 టోర్నీకి ఆతిథ్య దేశంగా ఉన్నందున ఆ జట్టు కూడా క్వాలిఫై అయింది.బంగ్లాదేశ్, అఫ్గన్, ఐర్లాండ్ కూడా నేరుగాతద్వారా మొత్తంగా ఇప్పటికే తొమ్మిది జట్లు 2028 టోర్నీకి అర్హత సాధించగా.. ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన జట్లను చేర్చే క్రమంలో టాప్-12లో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ కూడా తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి. తదుపరి పెద్దగా టీ20 సిరీస్లు లేనందున ఈ ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పు ఉండదు కాబట్టి.. ఈ మూడు జట్లు అర్హత సాధించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇక ఈ పన్నెండు పోను మిగిలిన ఎనిమిది బెర్తులను రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, యూఎస్ఏ, యూఏఈ, నేపాల్, కెనడా, ఒమన్ టాప్-20లో కొనసాగుతున్నాయి.ఈసారి వేటు పడిందిలా!టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ పోటీపడాల్సింది. అయితే, టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్లో తమకు భద్రత లేదని.. తమకు కూడా పాక్ మాదిరి శ్రీలంకనే తటస్థ వేదికగా ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసింది. టోర్నీలో కొనసాగాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం భారత్లో ఆడాలని సూచించింది.అయితే, తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా సిద్ధమే కానీ.. భారత్లో ఆడమని బంగ్లా బోర్డు ఐసీసీకి తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలవగా.. బంగ్లాదేశ్పై ఎటువంటి కఠిన చర్యలు చేపట్టమని ఐసీసీ హామీ ఇచ్చింది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను తప్పించగా.. బంగ్లా వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు భారత్ రాకూడదని నిర్ణయించుకుంది.చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు -
వంగ దేశం హసించునా?
బంగ్లాదేశ్ రాజకీయాలు సుస్థిరంగా, ప్రజాస్వామికంగా మారి, ఆ దేశం అభివృద్ధి మార్గంలో ప్రయాణించే పరిస్థితులు ఏర్పడితే, అది బంగ్లాదేశ్ ప్రజలకే గాక దక్షిణాసియా అంతటికీ సంతోషించదగ్గ విషయమవుతుంది. అక్కడ రెండేళ్ల కిందటి జెన్–జీ ఉద్యమంతో ఆరంభించి, గత వారం వెలువడిన ఎన్నికల ఫలితాల వరకు గల పరిణామాలన్నింటిని సమీక్షించినప్పుడు, ఆ వర్ధమాన దేశం ఒక కొత్త మలుపు తీసుకోగల అవకాశాలైతే స్థూలమైన దృష్టికి కనిపిస్తున్నాయి. ‘దిగంబర’ ఉద్యమం55 ఏళ్ల చరిత్ర గల బంగ్లాదేశ్లో ఒక సరికొత్త స్థితి రెండేళ్ల నాటి జెన్–జీ ఉద్యమంతో మొదలైంది. అంతకుముందు అంతా కుట్రలు, సైనిక నియంతృత్వాలు, అప్రజాస్వామికతలే. ప్రజలు మాత్రం వెనుకబాటుతనంలో, అవినీతి, అణచివేతలో మగ్గిపోతూ వచ్చారు. భౌగోళిక రాజకీయ వ్యూహాలలో ఒక కీలక స్థానంలో ఉన్న ఆ ప్రాంతం పెద్దవారి క్రీడలకు రంగస్థలమైంది. ఇదంతా ఇపుడు రాత్రికి రాత్రి మారిపోయి నవోదయమవుతుందని కాదు. కానీ, జెన్–జీ ఉద్యమ పరిణామాలు బంగ్లాదేశ్ సమాజానికీ, రాజకీయాలకూ ఒక గట్టి కుదుపును ఇచ్చాయన్నది గుర్తించాలి. ఆ ఉద్యమం స్వయంగా ఒక ప్రత్యామ్నాయ వేదికను సృష్టించకపోవచ్చు, కకా వికలమై మరెవరితోనో కలిసి కేవలం ఆరు సీట్లే గెలిచి ఉండవచ్చు. కానీ చరిత్ర పరిణామాలను సవ్యంగా అర్థం చేసుకునేందుకు గీటు రాళ్లు అవి కావు. ఒక పోలిక చెప్పాలంటే – బంగ్లాదేశ్ జెన్–జీ ఉద్యమ ప్రభావం రాజకీయాలలో, సమాజంలో ‘దిగంబర కవిత్వం’ కవిత్వం వంటిది. కుళ్లిన గతంపై తిరుగుబాటు చేసి కుదిపి వేసి, సరి కొత్త పరిణామాలకు దారులు తెరవటం వంటిది. ఆ చారిత్రక పాత్రను నిర్వర్తించిన వెనుక దిగంబర కవిత మిగలలేదు. ఇపుడు జెన్–జీ మిగలలేదు.ఆరు రంగాల్లో సంస్కరణలుకానీ, 55 సంవత్సరాల బంగ్లాదేశ్లో ఒక పరిస్థితి ఏర్పడినట్ల యితే కనిపిస్తున్నది. క్రమంగా ఏదైనా జరగవచ్చు గాక! ప్రస్తుతాని కైతే ఒక ఆశాభావం ఏర్పడుతున్నది. అందుకు నిర్దిష్టమైన కార ణాలూ ఉన్నాయి. ఉద్యమం దరిమిలా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవటం గాక, ఉద్యమకారుల అభీష్టం మేరకు ఒక తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. భవిష్యత్తులో ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా అనుసరించటం కోసం 6 రంగాలలో సంస్క రణల కోసం కమిషన్లు ఏర్పడ్డాయి. అవి ఎన్నికల సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, అవినీతి నిరోధక సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు. వీటిపై సిఫారసులన్నింటినీ ‘జాతీయ ఏకీభావ కమిషన్’ పరిధిలోకి తెచ్చి దేశంలోని మొత్తం 33 చిన్నా పెద్దా పార్టీలు, కూటములతో చర్చించి 84 సిఫారసులతో సుదీర్ఘమైన నివేదికను ప్రకటించారు. ఏ సిఫారసును ఎవరు ఆమోదించారు, ఎవరు కాదన్నారు అనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. అంతిమంగా ఆమోదం పొందినందున వాటన్నింటినీ రాజ్యాంగ సవరణ ఆ మేరకు జరిగిన వెనుక కొత్త ప్రభుత్వం అమలుపరచవలసి ఉంటుందన్నారు. ‘జూలై ఛార్టర్’ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆరు విధాలైన సంస్కరణలపై చర్చల క్రమంలో ప్రధాన పార్టీలైన బంగ్లా దేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామీ కూడా పాల్గొని అన్నింటినీ ఆమోదించటం గమనించదగ్గది. గత వారం పార్లమెంటుకు జరిగిన ఎన్నికలతో పాటు ఈ ‘ఛార్టర్’పై కూడా జరిగిన రెఫరెండంలో 60 శాతానికి పైగా అనుకూలత లభించింది.అందుకు కట్టుబడి ఉన్నట్లు కొత్త ప్రధాని తారిఖ్ రహమాన్తో పాటు, జమాత్ నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు షఫీఖుర్ రహమాన్ పునరుద్ఘాటించటం గమనించదగ్గది. మునుముందు ఆచరణ ఎట్లుండగలదన్నది వేచి చూడవలసిన విషయమే అయినా, అసలు ఒక ఉద్యమాన్ని పురస్కరించుకుని ఇన్ని విధాలైన సంస్కరణ కమి షన్లు, వాటిపై అన్ని పార్టీలతో చర్చల ద్వారా ఎన్నికలకు ముందే ఏకీభావ సాధన అన్నదే దానికదిగా ఒక అద్భుతమైన విషయం. దీనంతటికీ తగినట్లు, బంగ్లాదేశ్లో ఎన్నికలు 17 సంవత్సరాల తర్వాత పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగినట్లు అక్కడి యువత, ప్రజలతో పాటు అంతర్జాతీయ పరిశీలకులంతా ప్రకటించటం విశేషం. తాము గెలిచినా, ఓడినా ఫలితాలను అంగీకరించగలమని బీఎన్పీ, జమాతే పార్టీలు రెండూ ఎన్నికలకు ముందే ప్రకటించాయి. విజయోత్సవాలు వద్దని బీఎన్పీ నాయకత్వం, ఓటమిపై నిరసన ప్రదర్శనలు వద్దని జమాతే నాయకత్వం నిర్ణయించటం వంటివి మనం ఇటీవలి సంవత్సరాలలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ దేశాలలో ఎక్కడా చూడనిది.సమాన సత్సంబంధాలుకొత్త నాయకత్వం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 14వ తేదీ నాటి మొదటి మీడియా సమావేశంలో అంతర్గత విధానాల గురించి, విదేశాలతో సంబంధాల విషయమై కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. అంతర్గతంగా ఆర్థికాభివృద్ధి, మెరుగైన పాలన, ఉద్యోగ కల్పన, అవినీతి నియంత్రణ, ప్రజాస్వామిక విధానాలు, అన్ని మతాల పట్ల సమాన దృష్టితో సహా జూలై ఛార్టర్లోని అంశాలకు కట్టుబడి ఉండటం తమ ప్రాధాన్యాలని ప్రకటించింది. అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరిగితే మతతత్త్వ ధోరణులు అవే బలహీన పడ తాయని పరోక్షంగా జమాతేను ఉద్దేశించి ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. పై స్థాయిలో అవినీతిని అరికడితే కింది వరకు ఆ సూచనలు పోగలవన్నది మరొక ముఖ్యమైన సూచన. ఇండియా, చైనా, పాకిస్తాన్, అమెరికా సహా అన్ని దేశాలతో సమానమైన సత్సంబంధాలు తమ విధానమని తారిఖ్ రహమాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ కొత్తమలుపు తిరిగేందుకు తప్పనిసరి అయిన, సరైన విధానం అదే కూడా! ఈ అవసరాన్ని ఇతరులు కూడా గుర్తెరిగి సహకరిస్తే బంగ్లాదేశ్తో పాటు మొత్తం దక్షిణాసియాకు మేలు కలుగుతుంది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
"కోటికి పైగా ప్రజలకు ఒకే ఒక్కడు"
నిన్న (మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ ప్రధానమంత్రి ప్రమాణస్వీకారం ఢాకాలో జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. పలువురు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే భారత్ చూపు మాత్రం నితై రాయి చౌదరిపైనే ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక హిందువు చౌదరినే. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ పై ఓ లుక్ వేద్దాం పదండి.బంగ్లాదేశ్ లో గత రెండేళ్లుగా చెలరేగిన రాజకీయ అస్థిరత, హింసకు తెరపడింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇంతకాలం అక్కడ చెలరేగిన హింసలో మైనార్టీలే తీవ్రంగా నష్టపోయారు. అక్కడి మత ఛాందస వాదులు చెలరేగి అక్కడి హిందువులపై దాడులు చేసి చంపడంతో పాటు వారి ఆస్తులను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన BNP ప్రభుత్వం ఇప్పుడు హిందువుల సంరక్షణకు ఏ చర్యలు తీసుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం తన మంత్రివర్గంలో హిందూ నేత నితై రాయి చౌదరికి చోటు కల్పించింది.వ్యక్తిగత జీవితంనితైరాయి చౌదరి 1949 జనవరి 7న జన్మించారు. తన వివాహం జూమా అనే మహిళతో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. నితై రాయి వృత్తి రీత్యా న్యాయవాది. వారి కుమారుడు దేబాసిష్ రాయ్ చౌదరి ప్రస్తుతం బంగ్లాదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నిపున్ రాయ్ చౌదరి రాజకీయ నాయకురాలు బీఎన్ పీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఆమె భర్తసైతం ప్రస్తుతం బీఎన్ పీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరో కుమారుడు మిథున్.పొలిటికల్ కెరీర్ నితై రాయి రాజకీయ జీవితం క్షేత్రస్థాయి నుంచే మెుదలైంది. అక్కడి నుంచే ఆయన జాతీయ నాయకునిగా ఎదిగారు. 1988లో తొలిసారిగా మాగురా-2 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం 1990 లలో మూడు నెలల పాటు యువజన, క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ పాలన అనంతరం BNPలో చేరారు. అక్కడి నుండి అంచెలంచలుగా ఎదుగుతూ ఆ పార్టీ ఉపాధ్యాక్షుని స్థాయి వరకూ ఎదిగారు.BNPలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాల రూపకల్పణలో తన సలహాను అందిస్తారు. అయితే గతంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాని బహిరంగంగా విమర్శించేవారు. ఆమెది ఫాసిస్ట్ పాలనని నియంతృత విధానాలని విమర్శించేవారు. 2001లో బీఎన్పీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు హిందువులపై దాడి చేయించిందని ఆరోపించారు.భారత్ సంబంధాలుఅయితే భారత్ - బంగ్లా సంబంధాలపై నితైరాయి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారత్ కు వ్యూహాత్మక పరంగా బంగ్లాదేశ్ ఎంతో ప్రముఖమైన స్థానంలో ఉందన్నారు. అందుకే భారత్ బంగ్లాతో మెత్రి కోరుకుంటుందని తెలిపారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఆ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోందని తెలిపారు. అయితే ఇంతకాలం అక్కడ మైనార్టీలపై దాడులు జరిగిన నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన రెహ్మాన్ ప్రభుత్వం వాటిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. అయితే మంత్రి పదవి చేపట్టిన నితైరాయి చౌదరికి సైతం ఆ దేశంలోని హిందువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది.భారత్- బంగ్లా సంబంధాలుబంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ను భారత ప్రధాని మోదీ ఆయనను భారత్కు ఆహ్వానించారు. నిన్న మంగళవారం ఢాకాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ మైత్రిని కోరుకుంటుందని ప్రధాని మోదీ చాటిచెప్పారు. అయితే ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ సర్కార్ ఇండియాపై ఏ వైఖరి అవలంభిస్తోందో వేచి చూడాలి. -
‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్కు రండి’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఆయనను భారత్కు ఆహ్వానించారు. మంగళవారం ఢాకాలో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఓం బిర్లా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేశారు.పొరుగు దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన లేఖ ద్వారా తారిఖ్ రెహ్మాన్ భారతదేశ పర్యటనకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఓం బిర్లా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంటూ ‘ప్రధాని మోదీ పంపిన లేఖను రెహ్మాన్కు అందజేశాను. బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించాను’ అని తెలిపారు. కాగా ఫిబ్రవరి 13నే మోదీ ఫోన్ ద్వారా రెహ్మాన్ను అభినందించారు. తాజా లేఖలో బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. Just concluded a constructive meeting with Prime Minister of Bangladesh @trahmanbnpI handed over a personal letter from Prime Minister @narendramodi conveying his wishes to PM Rahman and inviting him to visit India at the earliest convenience.I extended warm congratulations… pic.twitter.com/gFNqLmnxsT— Om Birla (@ombirlakota) February 17, 2026ఫిబ్రవరి 12న జరిగిన సాధారణ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) మూడింట రెండొంతుల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. సుమారు 17 ఏళ్ల పాటు లండన్లో ప్రవాస జీవితం గడిపిన రెహమాన్, ఎన్నికలకు ముందు స్వదేశానికి తిరిగి వచ్చి తన పార్టీని విజయపథంలో నడిపారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈ ఎన్నికల విజయం కీలకంగా నిలిచింది. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.భారత్తో సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ స్పందించారు. తమ విదేశాంగ విధానం పూర్తిగా ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ ఎజెండాపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యున్నతమని, దాని ప్రకారమే పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా చారిత్రక, సాంస్కృతిక బంధాలు కలిగిన రెండు దేశాలు కలిసి పనిచేస్తే, ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని భారత్ ఆశిస్తోంది.ఇది కూడా చదవండి: కమల్ హాసన్కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు -
బంగ్లాదేశ్లో మంత్రిగా హిందూ నేత.. ఎవరీ నితాయ్ రాయ్ చౌదరి?
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్తో పాటు మంత్రులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.అయితే కొత్త ప్రభుత్వ కేబినెట్లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితాయ్ రాయ్ చౌదరికి చోటు దక్కడం విశేషం. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నియమించిన 25 మంది క్యాబినెట్ మంత్రులలో నితాయ్ రాయ్ చౌదరి ఒకరు. ఆయనకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.నితాయ్ రాయ్ ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారుఎవరీ నితాయ్ రాయ్ చౌదరి?77 ఏళ్ల నితాయ్ రాయ్ చౌదరి 1949లో బంగ్లాదేశ్లోని మగురా జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తన ప్రాథమిక విద్యను మగురా గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఢాకా విశ్వవిద్యాలయం నుండి లా (న్యాయశాస్త్రం) పట్టా పొందారు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.అక్కడే ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. 1988లో మగురా-2 నియోజకవర్గం నుండి తొలిసారిగా జాతీయ పార్లమెంట్కు నితాయ్ రాయ్ ఎన్నికయ్యార. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన విద్య, యువజన, క్రీడల శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. నితాయ్ రాయ్ కుమార్తె నిపుణ్ రాయ్ చౌదరి కూడా బీఎన్పీలో అత్యంత క్రియాశీలక నాయకురాలగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. -
‘7 సిస్టర్స్’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ పదవి నుండి తప్పుకుంటున్న తరుణంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్లతో కలిపి ప్రస్తావించడం గమనార్హం. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో యూనస్ వ్యాఖ్యలు మరింత విదాస్పదంగా మారాయి.భారత అంతర్భాగమైన ఈ రాష్ట్రాలను సార్వభౌమాధికారం గల దేశాలతో పోలుస్తూ, సరిహద్దుల రేఖలను చెరిపివేసే ప్రయత్నం చేశారని విశ్లేషకులు యూనస్పై మండిపడుతున్నారు. తన 18 నెలల పాలనా కాలంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఏ దేశానికీ లొంగి ఉండలేదన్నారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగిందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సముద్ర తీరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానానికి ఒక బహిరంగ ద్వారమని యూనస్ అభివర్ణించారు.నేపాల్, భూటాన్, భారత ఈశాన్య రాష్ట్రాలతో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని యూనస్ పేర్కొన్నారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కేవలం ‘సెవెన్ సిస్టర్స్’ అని సంబోధించడం ద్వారా భారత్ పట్ల తనకున్న వ్యూహాత్మక వైఖరిని ఆయన ప్రదర్శించారు. ఇది నూతన ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల పునరుద్ధరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024లో బాధ్యతలు చేపట్టిన యూనస్ యంత్రాంగం ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి అధికారాన్ని అప్పగిస్తోంది. ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో 297 సీట్లకు గాను 209 స్థానాలను గెలుచుకున్న బీఎన్పీ నేడు (మంగళవారం)ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.తన హయాంలో చైనా, జపాన్, అమెరికా, ఐరోపా దేశాలతో సంబంధాలను బలోపేతం చేశామని యూనస్ తెలిపారు. ముఖ్యంగా చైనా సహాయంతో తీస్తా నది ప్రాజెక్టు, నీల్ఫామరి ఆస్పత్రి ప్రాజెక్టులలో పురోగతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సుమారు 130 కొత్త చట్టాలను రూపొందించామని, సైనిక ఆధునీకరణ ద్వారా ఏ రకమైన దురాక్రమణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని ఆయన వివరించారు.మరోవైపు యూనస్ పాలనలో భారత్తో సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. బంగ్లాదేశ్లో హిందువులతో సహా మైనారిటీలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి. దేశీయంగా కూడా మైనారిటీల రక్షణ, ప్రజాస్వామ్య పరివర్తన విషయంలో యూనస్ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ -
నేడే బంగ్లా ప్రధాని ప్రమాణస్వీకారం.. ప్రముఖుల హాజరు
బంగ్లాదేశ్ ప్రధానిగా నేడు తారిఖ్ రహ్మన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ఆదేశంలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆయన ప్రధాన మంత్రిగా నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. తారిఖ్ రహ్మన్ ప్రమాణస్వీకార వేడుకకు భారత్తో సహా దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.గత రెండేళ్లుగా బంగ్లాదేశ్ అశాంతితో రగిలిపోయింది. అక్కడి ప్రభుత్వాలకు నిరసనగా అక్కడి ప్రజలు పెద్దఎత్తున ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉద్యమాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ఆ దేశాన్ని వీడి భారత్లో తలదాచుకున్నారు. అనంతరం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్గా మహ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో ఆదేశంలో మరోసారి నిరనలు పెల్లుబెక్కాయి. మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంత అస్థితరతల మధ్య ఎన్నికలు జరుగగా ఎన్నికలలో ఎట్టకేలకు బీఎన్పీ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టబోతుంది.బంగ్లాదేశ్ ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రహ్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ప్రమాణస్వీకార వేడుకకు అక్కడి పార్లమెంటు భవన్లోని సౌత్ ప్లాజా వేదిక కానుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ వేడుకకు భారత్తో సహా 13దేశాలను ఆహ్వానం పంపగా ఇండియా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఈ వేడుకకు హాజరుకానున్నారు.వారితో పాటు విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన దాదాపు 1200 మందికి బంగ్లాదేశ్ ఆహ్వానం పంపింది.ఇటీవల 297 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీఎన్పీ 209 స్థానాల్లో గెలుపొందింది. కాగా ఇంతకాలం 17 ఏళ్లుగా లండన్లో ఉన్న ఆయన ఇటీవల బంగ్లాదేశ్కు తిరిగి వచ్చారు. బీఎన్పీ పార్టీ దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత అధికారం చేపట్టబోతుంది. -
రాజీనామా చేసిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలు కానుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. 2024లో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు పాలన చేపట్టింది. అయితే కొత్త సర్కార్ కొలువు దీరనుండడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకొన్నారు. సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించిన యూనస్.. తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. "ఈ రోజుతో తాత్కాలిక ప్రభుత్వం పాలన ముగిసింది. దేశంలో కొత్తగా మొదలైన వాక్ స్వాతంత్ర్యం, ప్రాథమిక హక్కుల సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు" అని ఆయన పేర్కొన్నారు. -
తారిఖ్ రెహ్మాన్.. ఈ సవాళ్లకు జవాబేది?
సుదీర్ఘ ప్రవాసం, అలుపెరగని పోరాటం, చివరకు ప్రజాక్షేత్రంలో తిరుగులేని విజయం.. బంగ్లాదేశ్ నూతన సారథిగా తారిఖ్ రెహ్మాన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే రెహ్మాన్కు ఈ విజయం పూలబాట కాదు. ఒకవైపు ఏళ్ల నాటి పాత గాయాలు, మరోవైపు రాజకీయ శత్రువుల అణచివేత.. వీటన్నింటి మధ్య తారిఖ్ ఇచ్చే ‘చట్టబద్ధ పాలన’ హామీ దేశాన్ని ఏ దిశగా నడిపించబోతోంది? ఆయన అడుగులు ప్రతీకారం వైపా లేక పరివర్తన వైపా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.ప్రతీకారేచ్ఛను పక్కన పెడతారా?జియావుర్ రెహ్మాన్ వారసుడిగా, ఖలీదా జియా తనయుడిగా తారిఖ్ రెహ్మాన్కు అధికారం కొత్త కాకపోవచ్చు, కానీ ఈసారి బాధ్యత అత్యంత భారంగా మారింది. అవామీ లీగ్ పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఆయన ముందున్న మొదటి సవాల్. గత ప్రభుత్వ హయాంలో అతనిపై మోపిన అక్రమ కేసులు, జైలు శిక్షలు, ప్రవాస జీవితం ఆయన మనసులో ప్రతీకారేచ్ఛను రగిలిస్తాయా? లేక ఒక పరిణతి చెందిన నాయకుడిగా మారుస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.‘చట్టబద్ధ పాలన’ అతి పెద్ద పరీక్షతాజాగా విలేకరుల సమావేశంలో తారిఖ్ చెప్పిన చట్టబద్ధ పాలన అనే మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవామీ లీగ్ మద్దతుదారులు ప్రాణభయంతో తలదాచుకుంటున్న వేళ, ఆయన ఇచ్చిన ఈ భరోసా ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందన్నది సందేహమే. కిందిస్థాయి కార్యకర్తల్లో ఉన్న ఆగ్రహాన్ని అదుపు చేస్తూ, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా యంత్రాంగాన్ని నడిపించడం అనేది ఆయన ముందున్న పెద్ద పరీక్ష.అందరి ఆమోదం సాధ్యమేనా?షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత అనాథలుగా మారిన అవామీ లీగ్ ఓటర్లు ఈ ఎన్నికల్లో మౌనంగా బీఎన్పీకి జై కొట్టారు. ఇది బీఎన్పీపై ఉన్న ప్రేమ కంటే, జమాత్ ఈ ఇస్లామీ లాంటి శక్తులు అధికారంలోకి రాకూడదనే భయం వల్ల జరిగిన మార్పు. ఈ విధంగా వచ్చిన ఓటు బ్యాంకును శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే తారిఖ్ రెహ్మాన్ తన పాలనలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.మతవాదం వెర్సస్ జాతీయవాదం?బంగ్లాదేశ్ అంటేనే లౌకికవాదం- ఇస్లామిక్ విలువల కలయిక. జమాత్ ఈ ఇస్లామీ ప్రభావం పెరగకుండా చూస్తూనే, మెజారిటీ ముస్లిం ఓటర్లను సంతృప్తి పరచడం తారిఖ్ ముందున్న కత్తిమీద సాము లాంటి వ్యవహారం. గతంలో పాకిస్తాన్ అనుకూల ముద్ర ఉన్న శక్తులతో దూరం పాటిస్తూ, బంగ్లాదేశ్ జాతీయ అస్తిత్వాన్ని కాపాడతామని ఆయన చేసిన వాగ్దానం మైనారిటీలలో ముఖ్యంగా హిందువులలో కొత్త ఆశలు రేకెత్తించింది.మహిళా ఓటర్ల మద్దతు కొనసాగేనా?షరియా చట్టం, మహిళల విషయంలో కఠిన నిబంధనలు విధిస్తామన్న జమాత్ వ్యాఖ్యలు మహిళా ఓటర్లను బీఎన్పీ వైపు మళ్లించాయి. షేక్ హసీనా హయాంలో మహిళా సాధికారత కొంతవరకు మెరుగ్గా ఉండేది. ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ ఆ పురోగతిని కొనసాగిస్తారా? లేక సంప్రదాయవాదుల ఒత్తిడికి తలొగ్గుతారా? అన్నది వేచి చూడాలి. మహిళల భద్రత, ఉద్యోగ అవకాశాల విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలే ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.అంతర్జాతీయ సవాళ్లుబంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్, చైనా, అమెరికా వంటి దేశాల ప్రమేయం ఎప్పుడూ ఉంటుంది. అవామీ లీగ్ నిషేధం వెనుక విదేశీ హస్తం ఉందన్న ప్రచారం మధ్య, తారిఖ్ తన విదేశాంగ విధానాన్ని ఎలా మలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం అనేది ఆయన పరిపాలనా దక్షతకు గీటురాయి కానుంది.ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కిస్తారా?రాజకీయ సవాళ్లు ఒకెత్తయితే, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మరో ఎత్తు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశ యువత రగిలిపోతోంది. 2024, జూలై నాటి నిరసనలకు కారణమైన సమస్యలను పరిష్కరించకపోతే, ప్రజా ఆగ్రహం తనపైకి మళ్లడానికి ఎంతో సమయం పట్టదని తారిఖ్కు తెలుసు. అందుకే, ఆయన తక్షణ ప్రాధాన్యత ఆర్థిక సంస్కరణలవైపు ఉండాలి.దేశాన్ని సుస్థిరత వైపు నడిపిస్తారా ? తారిఖ్ రెహమాన్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి గతంలోని తప్పులను పునరావృతం చేస్తూ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం, రెండు.. అందరినీ కలుపుకుపోయే ప్రజాస్వామ్యవాదిగా చరిత్రలో నిలిచిపోవడం. ఆయన ఎంచుకునే ‘చట్టబద్ధ పాలన’ అనే మార్గం బంగ్లాదేశ్ను సుస్థిరత వైపు నడిపిస్తుందా లేక మరో రాజకీయ అనిశ్చితికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో తారిఖ్ ప్రభుత్వం.. పాక్లో ఏం జరగనుంది? -
బంగ్లాదేశ్కు లోక్సభ స్పీకర్.. రీజన్ అదే..!
బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకార వేడుకకు భారత్ హాజరుకానుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇండియా తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు విదేశాంగశాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు.ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎన్పీ చీఫ్ తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళవారం అక్కడి పార్లమెంటులోని సౌత్ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మన దేశంలో సహా 13 దేశాలకు ఆహ్వానం పంపింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు భారత్ ప్రకటించింది.ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో "బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ హాజరుకావడం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది." అని తెలిపింది. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ దేశంలో రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి అధికారం సాధించింది. 297 స్థానాల్లో జరిగిన ఎన్నికలు జరుగగా 209 సీట్లు సాధించింది.అయితే బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల బీఎన్పీ నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు సైతం భారత్ సంఘీభావం ప్రకటించింది. ఆమె అంతిమ యాత్రకు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అయితే బీఎన్పీ విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని మోదీ బీఎన్పీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. అందుకు ఆ పార్టీ సైతం ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు చేసి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్తో సత్సంబంధాల దిశగా ప్రయత్నిస్తుంది. -
Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ నెల 17వ తేదీన ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ఈ వేడుకను అంతర్జాతీయ వేదికగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ సహా మొత్తం 13 దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక దౌత్య సంబంధాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫిబ్రవరి 17న ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బంగ్లాదేశ్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.బంగ్లాదేశ్లో బీఎన్పీ పార్టీ అధికారికంగా మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్లోని సదరన్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అదే రోజు ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్.. తారిఖ్ రెహమాన్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.దక్షిణాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర పొరుగు దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కాగా బంగ్లాదేశ్లో బీఎన్పీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, భారత్తో ఆ దేశ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్పీ హయాంలో భారత్తో సంబంధాలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వంపై సానుకూల ప్రకటనలు చేసింది. -
బంగ్లాకు కాబోయే ప్రధాని: ప్రజలకు ఇచ్చిన తొలి పిలుపు ఇదే..!
ఢాకా: గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో అరాచకమే చూస్తూ వస్తున్నాం. బంగ్లా అంతటా విధ్వంస చాయలే కనిపించాయి. షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా వైదొలిగిన క్రమం నుంచి మహ్మద్ యూనస్ తాత్కాలిక బాధ్యతల్లో ప్రభుత్వం నడిచిన తీరును గమనిస్తే ఆ దేశంలో ఐక్యతా చాయలు సన్నగిల్లడమే కనబడింది. మన రెండు రోజుల్లో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్.. పార్టీ అతిపెద్ద విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలకు ఐక్యతా పిలుపే ఆయన తొలి పిలుపు అయ్యింది.బంగ్లాదేశ్లోని పరిస్థితులను గత కొంతకాలం నుంచి నిశితంగా గమినిస్తున్న తారిఖ్ రెహ్మాన్.. ఐక్యతకు పిలుపునిచ్చారు. దేశంలొ ప్రజాస్వామ్యం నెలకొనడానికి త్యాగం చేసిన వారికి ఈ విజయం అంకితం ఇస్తున్నట్లు రెహ్మాన్ ప్రకటించారు. “మీ స్వచ్ఛంద భాగస్వామ్యంతో, దాదాపు పదిన్నర సంవత్సరాల తర్వాత, ప్రజలకు నేరుగా ఓటు ద్వారా బాధ్యత వహించే పార్లమెంట్, ప్రభుత్వం దేశంలో తిరిగి స్థాపించబడుతున్నాయి,” అని రహ్మాన్ అన్నారు. ఆయన ప్రజలను ఐక్యంగా నిలబడమని కోరుతూ, ఏ దుష్ట శక్తి దేశంలో మళ్లీ నియంతృత్వాన్ని స్థాపించకుండా, దేశం బానిస రాష్ట్రంగా మారకుండా చూసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి:తారిఖ్ రహ్మాన్ రాక..భారత్కు బంగ్లాకు టెన్షన్! -
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్కు బంగ్లా టెన్షన్!
తారిఖ్ రహ్మాన్.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ ప్రస్థానం బంగ్లాదేశ్ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించింది. బెయిల్పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్కు లాభమేనా? రహ్మాన్ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో రహ్మాన్ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిహద్దు భద్రత.. అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.తీస్తా నది జలాల సమస్య.. తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.ఒప్పందం ఇలా.. 2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్ టెక్నికల్ టీమ్ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్పై రెహ్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.భారత్ ముందున్న సవాళ్లు.. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడం భారత్కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్ కూడా భారత్కు ఉన్నట్టు సమాచారం. -
ఛాందసవాదులకు చావుదెబ్బ
తరాలు మారినంత మాత్రాన గాయాలు తొలగిపోవు. నెత్తుటి చరిత్రను అంత సులభంగా చెరిపేయడం సాధ్యపడదు. బంగ్లాదేశ్ తాజా ఎన్నికల ఫలితాలు దీన్నే బలంగా చాటుతున్నాయి. బంగ్లాదేశ్లో అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ, అణచివేతకూ వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్–జీ తరాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని ఛాందసవాదం ఊబిలోకి నెట్టాలని, యాభై అయిదేళ్ల క్రితం బంగ్లా ప్రజానీకాన్ని ఊచకోత కోసిన పాక్తో అంట కాగాలని తహతహలాడిన మతతత్వ శక్తులు గురువారం నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి. ఫలితాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సే ఉన్నా 300 స్థానా లున్న పార్లమెంటులో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఆధ్వర్యంలోని కూటమి 216 స్థానాలు గెల్చుకుందని వార్తలు వస్తున్నాయి. జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమికి 76 స్థానాలు లభించాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న చాలా స్థానాల్లో బీఎన్పీ కూటమి ఆధిక్యతలో ఉన్నదని సమాచారం. పెద్ద మనిషిలా కనబడే ఆర్థిక నిపుణుడు మహ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వా నికి ప్రధాన సలహాదారుగా నియమిస్తే, ఆయన కాస్తా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయమన్నట్టు ప్రవర్తించారు. మైనారిటీ హిందూ పౌరులపైనా, అవామీ లీగ్ నేతల పైనా, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలపైనా ఉన్మాద గుంపులు దాడులు చేస్తుంటే, హతమారుస్తుంటే పట్టనట్టు ప్రవర్తించారు. మతాచారాలు పాటించటం లేదంటూ నడి రోడ్లపై మహిళలను హింసిస్తుంటే కళ్లు మూసుకున్నారు. వాటిని అతిగా చిత్రిస్తున్నారని మీడియాపై విరుచుకుపడ్డారు. హసీనా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని చేరదీసి, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటు చేయించిందీ, జమాతేతో సర్దుబాటు చేయించిందీ ఆయనే. దేశంలో కొత్త పొద్దు పొడవబోతోందని గురువారం నాటి యూనస్ హుషారు మాటల అర్థం వేరు. జమాతే, ఎన్సీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తాయని ఆయన విశ్వసించారు. అవామీ లీగ్పై ఎటూ నిషేధం ఉంది. బీఎన్పీ గత చరిత్ర సైతం అవినీతిమయమే. కనుక రెండు పార్టీల కథ ముగిసినట్టేనని అంచనా కొచ్చారు. కానీ బంగ్లా ప్రజలు వివేకవంతమైన తీర్పునిచ్చి ఆయనకూ, ఆ బాపతు శక్తు లకూ చెంప ఛెళ్లుమనిపించారు. దేశంలో సుస్థిరమైన, స్వతంత్రమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలని జనం కోరుకుంటున్నట్టు రాజకీయ నిపుణులు ముందే చెప్పారు. అయితే ఎన్నికలతోపాటు రాజ్యాంగ సంస్కరణలపై నిర్వహించిన రిఫరెండమ్ విషయంలో ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తంగా ఉండకతప్పదు. వాటిల్లో అవాంఛనీయమైన అంశాలు చొరబడే ప్రమాదం లేకపోలేదు. చూడటానికి వాటి సారాంశం మెరుగ్గానే ఉంది. ప్రధాని పదవికి రెండు దఫాల పరిమితి, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మహిళలకూ, యువతకూ పటిష్టమైన ప్రాధాన్యత, పార్లమెంటుకు రెండు సభల ఏర్పాటు అందులో ఉన్నాయి. ఈ సంస్కరణల అమలు బాధ్యత జనం బీఎన్పీకి కట్టబెట్టారు. భావోద్వేగాలతో ముడిపడే ఎన్నికలతో, ఎంతో ఆలోచించి ఓటేయాల్సిన రిఫరెండమ్ను జత చేయటం సరికాదు. పైగా బీఎన్పీ గత చరిత్ర ఘనమైనదేమీ కాదు. కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తల్లి ఖలీదా జియా రెండు దఫాల ఏలుబడిలో మతతత్వ, భారత వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహాన్నందించారు. ఇప్పటికైతే రెహ్మాన్ ఆలోచనా ధోరణి భిన్నంగా ఉన్నట్టు ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి. బంగ్లా విముక్తి యుద్ధానికి కొత్త భాష్యాలు చెప్పినవారికీ, పాక్ పాలకులను నెత్తి నెక్కించుకున్నవారికీ ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. నిషేధంలోవున్న అవామీలీగ్ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పోటీచేయలేదన్న మాటేగానీ, ఆనాటి పాక్ దుష్కృత్యాలను ప్రజానీకానికి గుర్తుచేయటంలో విజయం సాధించారు. హసీనా అవినీతి పాలన పుణ్యమా అని జెన్–జీ తరానికి దేశ చరిత్ర గురించి తెలియకుండా పోయింది.భారత్ అనుకూలతకు దూరంగా ఉండాలని, హసీనాను వెనక్కి రప్పించే యత్నం చేయాలని, నీటి వాటాలపై రాజీ పడొద్దని రెహ్మాన్పై జమాతే పార్టీ ఒత్తిళ్లు తెస్తుంది. వ్యర్థ వివాదా లతో కాలక్షేపం చేయకుండా, నిజాయితీగా పాలిస్తే రెహ్మాన్ రాజకీయంగా నిలదొక్కుకుంటారు. లేనట్టయితే ఇప్పుడు ఓటమిపాలైన శక్తులు మున్ముందు బలపడే ప్రమాదంఉంటుంది. -
మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికారంలోకి రానుండటంతో, భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. 2024 జూలై నాటి విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపినందుకు.. 2025 నవంబర్లో బంగ్లాదేశ్లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా.. బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలను ఒక ప్రహసనంగా అభివర్ణించారు. జనవరి 2026లో ఆమె ఢిల్లీ నుండి చేసిన ఒక ఒక ప్రసంగంలో.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడినట్లు రుజువైనందున, ఆమెను ‘భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం’ కింద తిరిగి తమ దేశానికి పంపాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఇప్పటికే భారత్ను కోరింది.మరణశిక్ష పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని బంగ్లాదేశ్ నేతలు అంటున్నారు. ఈ సున్నిత అంశంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 2025లో ఆయన మాట్లాడుతూ, హసీనా ‘కొన్ని విలక్షణమైన పరిస్థితులలో’ భారత్కు వచ్చారని, ఆమె భవిష్యత్తు గురించి తుది నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ తీర్పును భారత్ గమనించిందని చెబుతూనే, హసీనా అప్పగింత విషయంలో భారత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం -
‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హిందువులకు సంతోషాన్ని పంచే పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి చెందిన హిందూ అభ్యర్థి గయేష్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, జమాతే ఇస్లామీ నేత మహమ్మద్ షాహినూర్ ఇస్లాంను ఓడించారు. గయేష్వర్ చంద్ర రాయ్కు మొత్తం 98,785 ఓట్లు రాగా, జమాత్ అభ్యర్థికి 82,232 ఓట్లు మాత్రమే లభించాయి. రాయ్ సాధించిన ఈ విజయం బంగ్లాదేశ్ పార్లమెంటులో హిందువుల గళాన్ని వినిపిండానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.గయేష్వర్ చంద్ర రాయ్ 1951, నవంబర్ ఒకటిన ఢాకాలోని కెరానిగంజ్లో జ్ఞానేంద్ర చంద్ర రాయ్, సుమతి రాయ్ దంపతులకు జన్మించారు. 1990వ దశకంలో బీఎన్పీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా, మత్స్య , పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. రాజకీయాలతో పాటు ఆయన కుటుంబానికి బీఎన్పీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాయ్ కుమారుడు అమితాబ్ రాయ్, బీఎన్పీ నేత నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపున్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు.ఈ ఎన్నికల ఫలితాలలో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 200 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న బీఎన్పీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఫలితాలతో జమాతే ఇస్లామీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో గత 18 నెలలుగా కొనసాగుతున్న ముహమ్మద్ యూనస్ తాత్కాలిక పాలనకు ముగింపు పలికేలా ఈ ఎన్నికల తీర్పు వెలువడింది.బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, బీఎన్పీ విజయం దాదాపు ఖాయమైంది. ఆగస్టు 2024లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ పోలింగ్ జరిగింది. మొత్తం 12.7 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, అందులో సగం మంది 18-37 ఏళ్ల మధ్య వయస్సు గల యువతే కావడం గమనార్హం. 299 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 59 పార్టీల నుంచి 1,700 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, బీఎన్పీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. -
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
ఢాకా: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఉద్యమం(2024) మధ్య బంగ్లాదేశ్ శాంతి స్థాపన కోసం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచిన తర్వాత, దేశ వ్యవస్థను చక్కదిద్దడంలో యూనస్ కీలక పాత్ర పోషించారు. అయితే తన పాత్ర కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని యూనస్ గతంలోనే స్పష్టం చేశారు.ముహమ్మద్ యూనస్ 2006లో గ్రామీణ బ్యాంక్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1983లో ఆయన స్థాపించిన ఈ బ్యాంక్, పేదలకు అతి తక్కువ వడ్డీకే మైక్రో క్రెడిట్ రుణాలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1974లో బంగ్లాదేశ్లో సంభవించిన కరువు సమయంలో ఆయన పేదల కోసం దీర్ఘకాలిక రుణాలను ప్రవేశపెట్టి వారి సాధికారతకు కృషి చేశారు. పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే యూనస్, ఇప్పుడు అదే చిత్తశుద్ధితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే బాధ్యతను నెరవేర్చారు.ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో కీలకమైనవిగా నిలిచాయి. ఒకప్పుడు దేశ రాజకీయాలను నడిపిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, అల్లర్ల సమయంలో జరిగిన హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో పోటీకి దూరమైంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాకు మరణశిక్ష విధించగా, ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) జమాత్-ఏ-ఇస్లామీ ప్రధాన పార్టీలుగా అవతరించాయి. మైనారిటీలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంలో పట్టుదలతో వ్యవహరించింది. తాజాగా యూనస్ తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగబోననని మరోమారు స్పష్టం చేసినట్లు సమాచారం.ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం 300 స్థానాలకు గాను బీఎన్పీ ఇప్పటికే 150 మార్కును దాటి మెజారిటీని దక్కించుకుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తిరిగి వచ్చిన తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ రెహ్మాన్కు అభినందనలు తెలిపారు.ఇది కూడా చదవండి: షట్డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్కు ‘ఏఐ’ హెచ్చరిక! -
తారిఖ్ రెహ్మాన్కు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత రెహ్మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ.. ఈ విజయం తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తన పోస్ట్లో స్పష్టం చేశారు. ‘ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక మార్పు నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బంగ్లాదేశ్లోని మొత్తం 299 నియోజకవర్గాలకు గాను, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు 177 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాయి. మొత్తం 237 స్థానాల లెక్కింపు పూర్తి కాగా, మిగిలిన 62 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ తిరిగి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. బీఎన్పీకి ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు కేవలం 53 స్థానాలకే పరిమితమయ్యాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో, ప్రధాన పోరు బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. అయితే, బంగ్లాదేశ్ ఓటర్లు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీకే పట్టం కట్టారు. I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh. This victory shows the trust of the people of Bangladesh in your leadership.India will continue to stand in support of a democratic,…— Narendra Modi (@narendramodi) February 13, 2026 -
Bangladesh: బీఎన్పీ క్లీన్ స్వీప్
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్పీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున వెలువడిన అనధికారిక గణాంకాల ప్రకారం 300 స్థానాలున్న పార్లమెంటులో మేజిక్ ఫిగర్ అయిన 150 మార్కును బీఎన్పీ సునాయాసంగా దాటేసింది. దాదాపు 200 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అలాగే తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని కూడా స్పష్టం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా భావించిన జమాత్-ఇ-ఇస్లామీ కేవలం 63 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్ ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి తన సత్తా చాటారు. సుదీర్ఘ కాలం పాటు ప్రవాసంలో ఉన్న ఆయన, ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చి, పార్టీని విజయపథంలో నడిపించారు. బీఎన్పీ కూటమి అధికారంలోకి వస్తే తారిఖ్ రెహ్మానే తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం నుండి ఉద్భవించిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది.జమాత్ కూటమితో కలిసి బరిలోకి దిగిన ఎన్సీపీ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు ఆ పార్టీ ఎన్నికల కమిటీ ప్రతినిధి ఆసిఫ్ మహమూద్ సోషల్ మీడియాకు తెలిపారు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్లోని మూడు స్థానాలను కూడా బీఎన్పీ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. గత 18 నెలలుగా అధికారంలో ఉన్న మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలతో ముగియనుంది. కాగా ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఎన్.ఎం. నాసిర్ ఉద్దీన్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో దాచడానికి ఏమీ లేదని, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు తమ పార్టీకి లభించిన భారీ ప్రజాదరణ నేపధ్యంలో బీఎన్పీ నేత రుహుల్ కబీర్ రిజ్వీ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు విజయ సంబరాలు చేసుకుంటూ రోడ్ల మీదకు రాకుండా, శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం మసీదుల్లో ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు. -
Bangladesh: మరో హిందూ యువకుని దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం రతన్ శుభోకర్ మృతదేహం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి నుండి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తమకు తెలియవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, నిందితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత జనవరి నెలలోనే జైలు కస్టడీలో దాదాపు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. మరణించిన వారిలో అవామీ లీగ్ సీనేయర్ నేత రమేష్ చంద్ర సేన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి తదితరులు ఉన్నారు. డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన అశాంతిలో పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతల గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరుగుతుండటంపై మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
Bangladesh: ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడం, విపక్ష నేత ఖలీదా జియా మృతి తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. నోబెల్ విజేత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల కోసం వివిధ ప్రాంతాల్లో మోహరించారు.ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)తరఫున ప్రధాని రేసులో ముందున్న తారిఖ్ రెహమాన్ ఢాకాలోని గుల్షన్ మోడల్ స్కూల్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత గత ఏడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే తమ లక్ష్యమని అన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో, బీఎన్పీకి భారీ విజయావకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇస్లామిక్ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవుతోంది.ఈ ఎన్నికలను ప్రపంచంలోనే మొట్టమొదటి ‘జెన్-జీ’ ప్రేరిత ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. 2024లో షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థి నాయకులు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఓటర్లలో నాలుగో వంతు మంది యువత ఉండటం విశేషం. ముఖ్యంగా ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరుతో విద్యార్థి నాయకులు జమాతే ఇస్లామీతో చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. దేశంలో అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం యువత పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఉత్నాహం చూపిస్తున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. తన పార్టీని అనుమతించకుండా జరుగుతున్న ఈ ఎన్నికలు దేశంలో అస్థిరతకు దారితీస్తాయని ఆమె అన్నారు. హసీనాకు కంచుకోటగా భావించే గోపాల్గంజ్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల రాక చాలా తక్కువగా కనిపిస్తోంది. VIDEO | Bangladesh Elections 2026: A woman voter is overwhelmed after casting her vote at a polling booth in Dhaka. The Election Commission has made elaborate security arrangements, deploying nearly 1 million security personnel -- the largest-ever in the country's electoral… pic.twitter.com/rWii0EGv6x— Press Trust of India (@PTI_News) February 12, 2026 -
నేడే బంగ్లాదేశ్ ఎన్నికలు
ఢాకా: కల్లోల బంగ్లాదేశ్లో అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు పది లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో హిందువులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. పలువురు హత్యకు గురయ్యారు. అందుకే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత 18 నెలలుగా మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొనసాగుతోంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలని బంగ్లాదేశ్ ప్రజలతోపాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. గురువారం 13వ పార్లమెంటరీ ఎన్నికలతోపాటు 84 సూత్రాల సంస్కరణ ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం) కూడా జరుగబోతోంది. విదేశీ పరిశీలకులు, మీడియా ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ప్రధానంగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ), ఒకప్పటి దాని మిత్రపక్షం జమాత్–ఇ–ఇస్లామీ మధ్య పోటీ నెలకొంది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మొహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించింది. దాంతో ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీలో లేకుండాపోయింది. మొత్తం 300 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 299 నియోజకవర్గాల్లో ఉదయం 7.30 గంటలకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4.30 గంటల దాకా కొనసాగుతుంది. ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మృతిచెందడంలో అక్కడ ఎన్నికలు రద్దుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 రాజకీయ పారీ్టల నుంచి 1,755 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే 273 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ 291 మందిని బరిలోకి దించింది. వీరిలో 83 మంది మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 42,659 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 12.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3.58 శాతం మంది తొలిసారి ఓటర్లుగా నమోదైనవారే కావడం విశేషం. విదేశాల్లో ఉన్న 8 లక్షల మంది ప్రవాస బంగ్లాదేశీయులు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతోన్నారు. వారికోసం ఐటీ ఆధారిత పోస్టల్ బ్యాలెట్ విధానం తీసుకొచ్చారు. బీఎన్పీకి విజయావకాశాలు! బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం 350 స్థానాలున్నాయి. ఇందులో 300 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 50 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. పార్లమెంట్ పదవీ కాలం ఐదేళ్లు. ఈ ఎన్నికలను రాజకీయ సంస్కరణలకు రిఫరెండంగా భావిస్తున్నారు. అవామీ లీగ్ పోటీలో లేకపోవడం బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టకి అనుకూలంగా మారింది. పోటీలో ఉన్న అతిపెద్ద పార్టీ అదొక్కటే కావడం గమనార్హం. దివంగత ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహా్మన్ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. బీఎన్పీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
బంగ్లాదేశ్ కెప్టెన్కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్రౌండర్ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది. -
Bangladesh: హిందూ వ్యాపారి దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మొయ్మన్సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ (62) అనే బియ్యం వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. దుండగులు సర్కార్ను పదునైన ఆయుధంతో నరికి చంపి, మృతదేహాన్ని షాపులోనే వదిలేసి, నగదు తీసుకుని, షట్టర్లు వేసి పరారయ్యారు. బాధితుడు దక్షిణ్కాండ గ్రామానికి చెందినవాడని, స్థానిక బోగర్ బజార్ జంక్షన్లో ‘భాయ్ భాయ్ ఎంటర్ప్రైజ్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.తండ్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుమారుడు సుజన్ సర్కార్ షాపు వద్దకు వెళ్లి చూడగా, సుషేన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆయనను మొయ్మన్సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హత్య అనంతరం దుండగులు షాపులో ఉన్న లక్షలాది రూపాయలను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, కేవలం దోపిడీ కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని వారు అంటున్నారు.బంగ్లాదేశ్లో గతంలో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా కొట్టి, నిప్పంటించి చంపిన ఉదంతం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మైనారిటీలపై దాడులు గణనీయంగా పెరిగాయి. ఆలయాల ధ్వంసం, ఆస్తుల కబ్జా లాంటి 2,900 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, అల్పసంఖ్యాక వర్గాలకు తగిన రక్షణ కల్పించాలని ఢాకా ప్రభుత్వాన్ని భారత్ కోరింది. -
మూలాన్ని గుర్తించని జెన్–జీ ఉద్యమాలు?
బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో జెన్–జీ ఉద్యమాలు జరిగి, అక్కడి ప్రభు త్వాలు కూలిపోవడం తెలిసినదే. ఈ ఆందోళనలకు ప్రేరణ ఆ యా సమాజా లలో పెరిగిపోతోన్న నిరుద్యోగం, ధరలు, అవినీతి వంటి అంశాలే. ఈ రెండు దేశాలు త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతు న్నాయి. సరికొత్త రాజకీయ ‘అవతారం’ ఎత్తిన పాత రాజకీయ పక్షాలు కానీ... ప్రస్తుతం రాజకీయ రూపం సంతరించుకున్న జెన్–జీ ఉద్యమ కారులు కానీ సమస్యల పరిష్కారం కోసం ముందుకు తెస్తోన్న క్రొంగొత్త, సృజనాత్మక అజెండా మాత్రం ఏమీ లేదు! ఈ పోరాటాల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ఇవి ఆవేశకావేశాల ప్రాతిపదికన సాగాయే తప్ప, స్పష్టమైన కార్యాచరణతో జరిగినవి కావు. నేపాల్, బంగ్లాదేశ్లలోనే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నిరు ద్యోగ సంక్షోభానికి జవాబు వెతకడం కష్టంగా మారుతోంది.ప్రస్తుత నిరుద్యోగ విలయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది– 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడి ఉపాధి కల్పన కుంటుపడింది. రెండోది– దశాబ్దాలుగా సాగుతున్న సాంకేతిక పురోగతి నేడు పరాకాష్టకు చేరింది. మానవ శారీరక శ్రమను రోబోలు ఆక్రమిస్తుంటే, మేధా శ్రమ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కైవసం చేసు కుంటోంది. ఫలితంగా బ్లూ కాలర్, వైట్ కాలర్ రంగాల్లో మనిషికి స్థానం లేకుండా పోతోంది. ఉదాహరణకు, అమెజాన్ సంస్థలో 30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించనున్నారు. దీనికి కారణం ఆ కంపెనీ ఒక ఉద్యోగస్థుడికి సాలీనా సగటున 36 వేల డాలర్ల వేతనం చెల్లించవలసి ఉంటే... అదే స్థానంలో మర మనిషిని (రోబో) పెట్టుకుంటే అయ్యే ఖర్చు 3,600 డాలర్లు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తన సంస్థకు సంబంధించిన కొత్త కోడ్ను గూగుల్ 2025 నాటికి 30% మేరకు రాయగలుగు తోంది. అంటే, ఆ మేరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోతలు అనివార్యమన్నమాట. వ్యవస్థ ఇక కొత్త ఉద్యోగాలను ఇవ్వలేదని గ్రహించిన బిల్గేట్స్ వంటి వారు ‘సార్వజనీన కనీస ఆదాయం’ (యూబీఐ) వంటి ప్రతిపాదనలు తెస్తున్నారు. అంటే, పెరిగిపోతున్న నిరుద్యోగుల తిరుగుబాట్లను అడ్డుకోవడానికి ప్రజల ఖాతాల్లో కొంత నిరుద్యోగ భృతి జమ చేసి వ్యవస్థను కాపాడుకోవాలనేది వారి ఎత్తుగడ. ఈ స్థితిని 180 ఏళ్ల క్రితమే కారల్ మార్క్స్ తన ‘కమ్యూనిస్ట్ ప్రణా ళిక’లో అంచనా వేశారు. ‘...ఒక వర్గాన్ని పీడించాలంటే ఆ పీడిత వర్గం తన బానిస బతుకును కొనసాగించడానికైనా హామీ ఇవ్వాలి... కానీ, ఈనాటి బూర్జువా వర్గ ఆధిపత్యం కింద, ఈనాటి పారిశ్రామిక క్రమంలో ఆధునిక శ్రామికుడు ఎదగడం మాట అటుంచి, నానాటికీ అడుగుకి పోతున్నాడు... కార్మికుడు బుక్కాపకీరుగా మారుతున్నాడు. తన బానిసకు బానిస బతుకునైనా నమ్మకంగా చూపించగల సత్తా దానికి (వ్యవస్థకు) లేదు. తన బానిస శ్రమ మీద బతకాల్సిన వర్గం అది. కానీ, ఆ పరిస్థితి మారి ఆ బానిసే దాని బిచ్చం (పైన పేర్కొన్న సార్వజనీన కనీస ఆదాయం) మీద ఆధారపడాల్సి వస్తే అటువంట ప్పుడు బూర్జువా వర్గం కింద సమాజం ఇక ఎంతమాత్రమూ బతక లేదు. కాబట్టి (ఆ) వర్గ పతనం తప్పదు. కార్మిక వర్గ విజయమూ తప్పదు.’ అదీ విషయం. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ దాని పరిణామక్రమంలో మార్క్స్ చెప్పిన పై దశను చేరుకుంది. ప్రస్తుత వ్యవస్థలో నిర్జీవమైన పెట్టుబడి (డబ్బు), సజీవమైన మనుషులపై పెత్తనం చేస్తోంది. నిన్నటి ఉత్పత్తి సాధనాలే నేడు విధ్వంసక శక్తులుగా మారుతున్నాయి. ఈ వ్యవస్థాగత లోపాలను గుర్తించకుండా చేసే ఏ ఉద్యమమైనా నిష్ప్రయోజనమే! కమ్యూనిజా నికి కాలం చెల్లిందన్న ప్రచారపు బూజును తలల నుంచి దులుపుకొని ఆ సిద్ధాంతపు వెలుగులో సమకాలీన సమస్యలను చూడగలిగితేనే మరో ప్రపంచానికీ, మానవాళి మహోదయానికీ దారులను అన్వేషించగలం.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు -
బంగ్లాకు పరీక్షా సమయం
ఏణ్ణర్థంక్రితం విద్యార్థి ఉద్యమం ధాటికి మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టిన నాటినుంచీ రాజకీయ, సామాజిక అస్థిరతలో కూరుకుపోయిన బంగ్లాదేశ్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు అయిన మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఉన్న వైషమ్యాలను మరింత పెంచి పోషించింది. జవాబుదారీతనం లేని అధికారంతో ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిళ్లు పెరగటంతో ఇవి తప్పనిసరి అయ్యాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) గెలుపుగుర్రంగా కనబడటమే గత ఎన్నికలకూ, ప్రస్తుత ఎన్నికలకూ కొట్టొచ్చి నట్టు కనబడుతున్న తేడా. పదిహేనేళ్లపాటు దేశాన్నేలిన షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్పై నిషేధం విధించటంతో ఆ పార్టీ జాడలేదు. పాకిస్తాన్ నుంచి విడివడి 1971లో స్వతంత్ర ప్రయాణం ప్రారంభించిననాటి నుంచీ బంగ్లాదేశ్కు ఆటుపోట్లు తప్పడం లేదు. సైనిక కుట్రలు, మత ఛాందసవాదం షరా మామూలైన పాకిస్తాన్ చీడ దానికి కూడా అంటి, ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. 17 కోట్ల 30 లక్షల జనాభాతో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న బంగ్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ప్రశంసిస్తూ ఉండేవి. అదే జరిగుంటే హసీనా పదవికి ముప్పు వచ్చి ఉండేది కాదు. కానీ ఆర్థిక అసమానతలకు తోడు పేదరికం, అవినీతి, కక్షసాధింపు ఆమెను దెబ్బతీశాయి. 2022 నుంచి బంగ్లా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ల నుంచి వందలకోట్ల డాలర్ల రుణాలు తీసు కొస్తున్నా మారిందేమీ లేదు. ఆ డబ్బంతా పాలకపార్టీని ఆశ్రయించుకున్నవారి జేబుల్లోకి పోయింది. అధిక ధరలు, ఉపాధిలేమి సగటు మధ్యతరగతి, దిగువతరగతి కుటుంబా లను తీవ్రంగా దెబ్బతీశాయి. బీఎన్పీయే విజేతగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నా ఆ పార్టీకి అంత మంచి పేరేమీ లేదు. తూర్పు పాకిస్తాన్గా ఉన్నకాలంలో అప్పటి పాక్ పాలకులు తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడినా, అనంతరకాలంలో అధికారంలోకొచ్చిన బీఎన్పీ ఆ దేశంతో అంట కాగిందనీ, అవినీతిలో కూరుకుపోయిందనీ జనం గుర్తు చేసుకుంటున్నారు. అందుకే రెహ్మాన్ కొత్త బాణీ అందుకుని అన్ని సభల్లోనూ గత తప్పులకు క్షమాపణ కోరుతున్నారు. 1971 విముక్తి పోరాటంలోనూ, 2024 ప్రజాస్వామ్య ఉద్యమంలోనూ మరణించిన వారికి నివాళులర్పిస్తున్నారు. బీఎన్పీ మాదిరే పాకిస్తాన్ అనుకూల పార్టీగా పేరున్న జమాతే ఇస్లామీ(జేఈఐ)కు ఉన్న అనుకూలాంశమల్లా ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలో లేకపోవ టమే! మహిళల హక్కుల విషయంలో ఆ పార్టీది ఛాందసవాద ధోరణి. దీన్ని బీఎన్పీ తనకు అనుకూలంగా మలుచుకుని, తమ పాలనలో లింగవివక్ష ఉండబోదంటోంది. అయితే యూనస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందువులపై పెరిగిన దాడుల్ని తామే దృఢంగా ఎదిరించి, రక్షణగా నిలిచామని జేఈఐ చెప్పుకుంటోంది. కానీ ఆ దాడులు ఆగింది లేదు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక అవి మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ను ఆయన దుకాణంలోనే దుండగులు కాల్చిచంపారు. బంగ్లాలో ఎవరు పాలకులైనా చైనా, పాకిస్తాన్ల ప్రభావం దండిగానే ఉంటుంది. బీఎన్పీ ఈ విషయంలో బహిరంగంగా ఏమీ చెప్పకపోయినా, జేఈఐ తన పాక్ అనుకూలతను చాటుకోవటంతో పాటు ఇటీవల చైనా దౌత్యవేత్తలతో భేటీ అయింది. విషాదమేమంటే, హసీనాను పదవీచ్యుతురాలిని చేయటంలో కీలకపాత్ర పోషించిన జెన్ జీ తరానికి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం లేదు. విద్యార్థుల నాయకత్వంలోని నేషనల్ సిటిజెన్ పార్టీకి ఆశించినంత మద్దతు లభిస్తున్న దాఖలా లేదు. నిరుడు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో పాటు 30 రాజకీయ పార్టీలు పాల్గొన సదస్సు ఆమోదించిన ‘జూలై ఛార్టర్’పై కూడా గురువారం రిఫరెండమ్ జరగబోతోంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చేందుకే, చరిత్ర వక్రీకరించేందుకే దీన్ని తీసుకొచ్చారని వామపక్షాల విమర్శ. మొత్తానికి బంగ్లాదేశ్ భవితవ్యం ఎలా ఉండబోతున్నదో ఈ ఎన్నికలూ, రిఫరెండమ్ తేల్చబోతున్నాయి. -
దాడులు కొనసాగితే హిందువులకు ప్రమాదమే?
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్కా ప్రణాళిక ప్రకారమే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాయి.ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో ఆ దేశంలో మైనార్టీలపై ప్రత్యేకించి హిందువులపై పెద్దఎత్తున దాడులు చేసి చంపారు. దీనిపై భారత్ సైతం ఎన్ని సార్లు స్పందించిన పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి."హిందూ అడ్వాన్సింగ్ ఉమన్ రైట్స్" అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడులకు నిరసనగా మద్దతు కూడగట్టింది. దాదాపు 15 దేశాలకు చెందిన 125 సంస్థల సహకారంతో ఐక్యరాజ్య సమితికి లేఖ రాసింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పక్కా ప్రణాళిక ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని తక్షణమే వాటిని నివారించాల్సిన అవసరం ఉందని కోరింది. ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ తో పాటు భారత్ ఇతర దేశాలు, సంస్థలు జోక్యం చేసుకోవాలని తెలిపింది.ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఆ దేశంలోని మైనార్టీలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2024లో షేక్ హాసీనా బంగ్లాదేశ్ను వదిలిన నాటి నుంచి ఆ దేశంలో మైనార్టీలపై విపరీతంగా దాడులు తీవ్రంగా జరుగుతన్నాయి. హత్యలు, ఆలయాలపై దాడి, ఆస్తుల ఆక్రమణ ఇలా ఎన్నో అఘాయిత్యాలతో ఆ దేశంలోని హిందువులు భయభ్రాంతులకు గురువుతున్నారు. అయితే బంగ్లాదేశ్లో రేపు ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
‘బంగ్లా’పై ట్రంప్ కరుణ.. కీలక రంగానికి సుంకాల ఎత్తివేత!
ఢాకా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్పై అపార కరుణ చూపించారు. ఈ ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను 19 శాతానికి తగ్గించారు. గత ఏడాది ఏప్రిల్లో అమెరికా తొలుత 37 శాతం సుంకాన్ని ప్రతిపాదించగా, సుదీర్ఘ చర్చల దరిమిలా గత ఆగస్టులో దానిని 20 శాతానికి తగ్గించారు. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఇది మరింత తగ్గి 19 శాతానికి చేరుకుంది.ముఖ్యంగా అమెరికా ముడి పదార్థాలను (కాటన్, కృత్రిమ నూలు) ఉపయోగించి, బంగ్లాదేశ్లో తయారు చేసే దుస్తులకు సుంకాల నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కూడా అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్లో ప్రాధాన్యత కల్పించేందుకు అంగీకరించింది. రసాయనాలు, వైద్య పరికరాలు, యంత్రాలు, మోటార్ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు సోయా, డెయిరీ, బీఫ్, పౌల్ట్రీ వంటి అమెరికా ఆహార ఉత్పత్తులకు బంగ్లాదేశ్లో మార్కెట్ ఏర్పడనున్నది. అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) ధృవీకరణలను ఇకపై బంగ్లాదేశ్ గుర్తించనుంది.రాబోయే 15 ఏళ్లలో అమెరికా నుండి సుమారు 15 బిలియన్ డాలర్ల(రూ.1,36,063 కోట్లు) విలువైన ఇంధన ఉత్పత్తులను, 3.5 బిలియన్ డాలర్ల(రూ.31,748 కోట్లు) వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. విమానయాన రంగంలో ‘బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్’ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుండి 14 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వీటితో పాటు అదనపు ఆర్డర్లకు కూడా అవకాశం ఉంది. రక్షణ రంగంలో సైతం బంగ్లాదేశ్ అమెరికా నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేయనుంది. అంతర్జాతీయ కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.సుదీర్ఘ చర్చల దరిమిలా కుదిరిన ఈ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వాగతించారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ మాట్లాడుతూ, అమెరికా ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించడంలో , వాణిజ్య అడ్డంకులను తొలగించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం వాటా కలిగిన వస్త్ర రంగం ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుంది. అమెరికా ముడిపదార్థాలు వినియోగించి తయారు చేసే వస్త్రాలకు సుంకం ఎత్తివేయడం బంగ్లాదేశ్కు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇది కూడా చదవండి: మమతతో కట్.. లెఫ్ట్తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్! -
Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం
ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే.. -
ఈసారి మంత్రి వంతు!
ఢాకా: పదవీచ్యుత షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక బంగ్లాదేశ్లో హిందువులపై మూకదాడులు సర్వసాధారణమైపోగా ఇప్పుడా బాధితుల జాబితాలో ఏకంగా కేంద్ర మాజీ మంత్రి చేరిపోయారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. అవామీ లీగ్ నేత, సీనియర్ హిందూ నాయకుడు రమేశ్ చంద్రసేన్ శనివారం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. విద్యార్థి సంఘాలు, అతివాద కూటముల సారథ్యంలో మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో కొలువుతీరిన తాత్కాలిక ప్రభుత్వం ఇన్నాళ్లూ అధికార పార్టీగా కొనసాగిన అవామీ లీగ్ నేతలనూ లక్ష్యంగా చేసుకుందన్న వాదనలకు తాజాగా చంద్రసేన్ మరణం మరింత బలం చేకూర్చింది. హత్య, ఇతర ఆరోపణలపై జల వనరుల శాఖ మాజీ కేంద్ర మంత్రి రమేశ్ను అరెస్ట్చేసి దినాజ్పూర్ జిల్లా జైలుకు తరలించిన యూనుస్ ప్రభుత్వం ఆయనకు ఉద్దేశపూర్వకంగా జైలుగదిలో కనీస సౌకర్యాలు కల్పించలేదని గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. వైద్య వసతులు లేకపోవడంతో 85 ఏళ్ల రమేశ్ తీవ్ర అనారోగ్యంపాలయ్యారని, చివరకు శనివారం ఉదయం ప్రాణాపాయ స్థితిలో దినాజ్పూర్ వైద్యబోధనాస్పత్రికి తరలించినా కేవలం పావుగంటకే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సాధారణ హిందువులపై బెదిరింపులు, చోరీల వంటి తప్పుడు ఆరోపణలతో చితకబాది, నిప్పంటించి అల్లరిమూకలు చంపేస్తుంటే యూనుస్ సర్కార్ ఇలా హిందూ నేతలను కస్టడీలో ప్రాణాలు తీస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రమేశ్ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఐదుసార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. రమేశ్తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు అవామీ లీగ్ నేతలను కస్టడీలోనే చంపేశారని బంగ్లాదేశీయులు త సామాజిక మాధ్యమాల్లో వార్తలను షేర్చేస్తున్నారు. ‘‘ రమేశ్ అజాత శత్రువు. ఎంతో మందికి సాయపడ్డారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ముఖ్యనేత మిర్జా ఫక్రూల్ ఇస్లాం ఆలాంగిర్ను ఎదిరించి రమేశ్ పెద్ద నేతగా ఎదిగారు. అది వాళ్లకు నచ్చలేదు. ఇలాంటి నేతనూ అతివాద తాత్కాలిక సర్కార్ పొట్టనపెట్టుకుంది. నేతలనే కాదు సాధారణ అవామీలీగ్ కార్యకర్తలు వేలాదిగా ఇటీవల బలయ్యారు. 2024 ఆగస్ట్లో హసీనా ప్రభుత్వం గద్దెదిగాక ఈ హత్యల పరంపర మొదలైంది’’ అని బంగ్లాదేశ్లో కంటెంట్ క్రియేటర్ ప్రదీప్ చౌదరి తన ‘ఫేస్బుక్’ ఖాతాలో రాసుకొచ్చారు. -
బంగ్లాదేశ్ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో హిందువుల దాడులు..?
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షేక్ హాసీనా భారత్లో తలదాచుకున్న మెుదలు అక్కడి మతఛాందస వాదులు హిందువులపై ఊచకోత జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ దేశంలో దాదాపు ఎనిమిది శాతం ఉన్న హిందువులకు అక్కడి పార్టీలు ఏ రకమైనా హామీలిచ్చాయి. దాడులపై ఎలా స్పందించాయి. అనే విషయం తెలుసుకోవాలి ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.ప్రస్తుతం బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు ఎంతమాత్రం ఆశించిన విధంగా లేవు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్గా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్తో డిస్టెన్స్ పెంచారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్, బంగ్లా సంబంధాలు క్షీణించాయి. అంతే కాకుండా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ భారత్తో ఎలా వ్యవహరించనున్నదనే అంశం ఆసక్తిగా మారింది.బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీరెహమాన్ నేతృత్వంలోని BNP శుక్రవారం తన మ్యానిఫెస్టోని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదమే తమ ఎజెండా అని ఆ పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఏ దేశానికి ప్రతినిధిగా ఉండదని సమానత్వం, ఆత్మగౌరవం ఆధారంగా మాత్రమే ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంటుందని పేర్కొన్నారు. అదే విధంగా బంగ్లాదేశ్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. అదే విధంగా తమ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే సహించదు అన్నారు. తమదేశం అటు పాకిస్థాన్తో గానీ ఇటు ఇండియాతో గానీ పొత్తు పెట్టుకోదని తెలిపారు. " అటు ఢిల్లీ కాదు ఇటు పిండి కాదు బంగ్లా అన్నింటికంటే ముందుంటుంది" అని తెలిపారు.జమాత్- ఇ- ఇస్లామీ అయితే అదే దశలో మరో పార్టీ జమాత్- ఇ- ఇస్లామీ పార్టీసైతం తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దానిలో చుట్టుపక్కల దేశాలతో స్నేహా పూర్వక వాతావరణం పెంపొందిస్తామని పేర్కొంది. ప్రత్యేక్షంగా పాకిస్థాన్ పేరు తీయకపోయినా ముస్లిం మెజారిటీ దేశాలకే అనుకూలంగా ఉండనున్నట్లు ప్రకటించింది.హిందువుల దాడులపైబీఎన్పీ: హిందువులతో పాటు ఇతర మైనార్టీల ఆస్తుల, దేవాలయాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంది. అదే విధంగా వారి మనోభావాలను గౌరవిస్తామని తెలిపింది. అన్ని మతాలకు చెందిన నాయకులకు ప్రత్యేక స్టై ఫండ్ ఇస్తామని ప్రకటించింది. మతపరమైన పండుగలను ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుకునేలా రక్షణ కల్పిస్తామని తెలిపింది.జమాత్-ఇ-ఇస్లామీ: సాధారణంగా ఈ పార్టీకి చెందిన నాయకులే హిందువులపై అధికంగా దాడులు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హిందువుల రక్షణపై ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పెద్దగా స్పందించలేదు. మతపరమైన మరియు జాతి మైనారిటీలకు ప్రాతినిథ్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. -
అమెరికా, బంగ్లా మధ్య సీక్రెట్ డీల్.. భారత్ కారణమా?
భారత్ పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడుల కారణంగా భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు.. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. యూనస్ ప్రభుత్వాన్ని టెన్షన్కు గురిచేస్తోంది. ఈ డీల్తో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై ఈ ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో యూనస్ సర్కార్.. అమెరికాతో చేసుకున్న సీక్రెట్ డీల్ ఇప్పుడు బంగ్లాలో హాట్ టాపిక్గా మారింది.అయితే, ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ సర్కార్ ట్రంప్తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ ప్రకారం.. బంగ్లా, అమెరికా మధ్య ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.కాగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? అనే ప్రశ్న ఎదురైంది. కాగా, 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్పై 37 శాతం సుంకాలు విధించారు. అనంతరం, జూన్లో నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది.ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం సీక్రెట్ ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరోవైపు.. సీక్రెట్ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. అయితే, ఈ డీల్పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.వివాదాస్పద అంశాలు..పారదర్శకత లోపం: ఒప్పందం వివరాలు ప్రజలకు, పార్లమెంట్కు తెలియజేయలేదు.అనుమానాలు : ఎన్నికల ముందు తాత్కాలిక ప్రభుత్వం దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆర్థిక ప్రభావం: ఎగుమతిదారులు, ఆర్థిక నిపుణులు దీని వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య విధానాలకు బంధించబడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వస్త్ర పరిశ్రమపై ప్రభావం..అమెరికా మార్కెట్ ఆధారపడటం: బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 90% వస్త్రాలు, అందులో ఎక్కువ భాగం అమెరికాకు వెళ్తుంది. కొత్త ఒప్పందం వల్ల 20% టారిఫ్ స్థిరపడింది. ఇది భారతదేశం (25%), వియత్నాం (21%), పాకిస్తాన్ (19%)తో పోలిస్తే పోటీ స్థాయిలో ఉంది.పోటీ సామర్థ్యం: టారిఫ్ తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్ వస్త్రాలు మరింత పోటీగా నిలుస్తాయి.ఉద్యోగ భద్రత: అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు.వేతన ఒత్తిడి: తక్కువ ధరల పోటీ కొనసాగించడానికి తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు కొనసాగవచ్చు.సామాజిక ప్రభావం: కార్మికుల హక్కులు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ ఒత్తిడితో మెరుగుపడే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తి ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అమెరికా మార్కెట్లో దీర్ఘకాలికంగా స్థిరపడే అవకాశం ఉంది. -
దారీ తెన్నూ లేని జెన్–జీ తుపాను
బంగ్లాదేశ్లో ఈ నెల 12న, నేపాల్లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.స్పష్టత లేని బంగ్లా యువతబంగ్లాదేశ్ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. నమ్మకం కోల్పోయిన తిరుగుబాటుతిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.చీలిన నేపాల్ గ్రూపులునేపాల్ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్ బాలేన్ షా, జాతీయ విద్యుత్ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పాక్కు బలూచ్ సవాలు!
బలూచిస్తాన్ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 84 మంది పాక్ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్ను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షిన్జియాంగ్ నుంచి గ్వాదర్ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్ మెటల్స్తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్ఏ ఆరోపణ. పాకిస్తాన్ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్ గౌస్ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్తో నేషనల్ అవామీ పార్టీ (ఎన్ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్ మిలిటెంట్ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్ఖాన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయటం మొదలుకొని పాక్ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. -
మయన్మార్లో భూకంపం
మంగళవారం మయన్మార్లోని పలు ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు తెలుస్తుంది.రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత నమోదైంది. భూకంపం తీవ్రతతతో మయన్మార్లోని పలు ప్రాంతాలలో భూమి కంపించడంతో ఆందోళన చెందిన ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు. అయితే దీనివల్ల జరిగిన నష్టం వివరాలను అక్కడి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఈ భూకంప ప్రభావం తూర్పు, ఈశాన్య ప్రాంతాలపై పడినట్లు తెలుస్తోంది. కోల్కతా పరిసర ప్రాంతాలలో భూమికొద్దిగా కదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది చోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం అందుతుంది. -
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో పొరుగు దేశం బంగ్లాదేశ్కు ఇచ్చే అభివృద్ధి సహాయాన్ని భారత్ భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్లో బంగ్లాదేశ్కు రూ. 120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని సగానికి అంటే రూ. 60 కోట్లకు కుదించింది. దీని వెనుకగల కారణం ఏమిటి? మిగిలిన పొరుగు దేశాల విషయంలో ఉదారత చూపిన భారత్ ‘బంగ్లా’ విషయంలో ఎందుకిలా చేసింది?భూటాన్కు అత్యధిక సాయంగత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య సఖ్యత కొరవడింది. ఢాకాలో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్ఢెట్ కేటాయింపుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పొరుగు దేశాలైన భూటాన్.. భారత్ నుంచి రూ.2,288 కోట్లతో అత్యధికంగా లబ్ధి పొందుతుండగా, నేపాల్కు రూ. 800 కోట్లు, మాల్దీవులు, మారిషస్లకు చెరో రూ. 550 కోట్లు కేటాయించారు.క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్తో సన్నిహితంగా ఉండటం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలను పరిమితం చేయడమే కాకుండా, ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయి, ఆ దేశంతో సంబంధాలను బలపరుచుకోవడం భారత్కు తీవ్ర అసంతృప్తి కలిగించింది.క్రీడారంగానికీ పాకిన వైరంఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా క్రీడారంగానికి కూడా పాకాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించడంతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో తమ గ్రూప్ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఆతిథ్య దేశమైన భారత్తో తలపడకూడదని ఆంక్షలు విధించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ డైలమాలో పడింది.తాలిబాన్ ప్రభుత్వానికి సహకారం పెంపుఒకవైపు బంగ్లాదేశ్కు నిధులు తగ్గించినా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపిన భారత్, ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని రూ. 150 కోట్లకు పెంచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్లో మొత్తం రూ. 22,118 కోట్లు కేటాయించారు. మైనారిటీల రక్షణ విషయంలో బంగ్లాదేశ్ను నిలదీస్తూనే, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా తన ‘నైబర్హుడ్ ఫస్ట్’ విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు రూ. 400 కోట్లు, మయన్మార్కు రూ. 300 కోట్లు కేటాయించి , ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది.ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు -
హసీనాకు పదేళ్ల జైలు
ఢాకా: పదవీచ్యుత బంగ్లాదేశ్ మహిళా ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఢాకా కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ప్రభుత్వ గృహాల ప్రాజెక్టులో భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన రెండు కేసుల్లో హసీనాతోపాటు ఆమె బంధువులను ఢాకా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దోషిగా తేల్చారు. లబి్ధదారులకు బదులుగా హసీనా తన బంధువు, బ్రిటన్ లేబర్ పార్టీ మహిళా ఎంపీ, మాజీ బ్రిటన్ మంత్రి తులిప్ సిద్ధిఖ్సహా పలువురికి రెసిడెన్షియల్ ప్లాట్లను కేటాయించారన్న వాదనలతో న్యాయమూర్తి రూబియుల్ ఆలమ్ ఏకీభవించారు. ఢాకా శివారులోని పూర్బకోల్లోని రజూక్ న్యూ టౌన్ ప్రాజెక్టులో ఈ అక్రమాలు వెలుగుచూశాయని గతంలో కేసు నమోదైంది. శిక్ష పడిన హసీనా ఇద్దరు మేనకోడళ్లు, మేనల్లుడిని పోలీసులు వెంటనే వేర్వేరు కారాగారాలకు తరలించారు. సిద్ధిఖ్ చిన్న సోదరి ఆలజమాన్ సిద్ధిఖ్, సోదరుడు రద్వాన్ ముజీబ్ సిద్ధిఖ్ బాబీలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష వేస్తూ సోమవారం మధ్యాహ్నం 12. 30 గంటలకు జడ్జి తీర్పు వెలువర్చారు. 16 మంది నిందితులకు గాను ప్లాట్లు కేటాయించిన రజూక్ ప్రాజెక్టు సీనియర్ అధికారి ఖుర్షీద్ ఆలమ్ మాత్రమే కోర్టు హాలులో హాజరయ్యారు. గృహశాఖ సహాయ మాజీ మంత్రి ,అదే శాఖలో మాజీ కార్యదర్శి, రజూక్ ప్రాజెక్ట్ చైర్మన్, ఇతర అధికారులకు ఐదేళ్ల కారాగార శిక్ష పడింది. తన శిక్షపడడంపై హసీనా స్పందించారు. ‘‘ఇలాంటి తీర్పును ముందే ఊహించాం. ఈ కేసులన్నీ మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కక్షసాధింపుతో వేసిన తప్పుడు కేసులు. ఇవన్నీ కుట్రపూరితంగా తప్పుడు సాక్ష్యాలతో అల్లిన కేసులు’’అని హసీనా వ్యాఖ్యానించారు. నాటి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో నాకెలాంటి సంబంధం లేదు. అయినాసరే నాపై ఏడాదిన్నరగా తప్పుడు ఆరోపణలు ప్రచారంచేస్తున్నారు’’అని తులిప్ సిద్ధిఖ్ అన్నారు. 2024 ఆగస్ట్ ఐదున బంగ్లాదేశ్ విద్యార్థులు, యువత సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ‘జూలై ఉద్యమం’ధాటికి షేక్ హసీనా సారథ్యంలోని అవామీలీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం విదితమే. ఆ తర్వాత హసీనాపై కేసుల పరంపర మొదలైంది. -
బంగ్లా దాడులు.. USAలో నిరసనలు
బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు నిరసనగా యుఎస్లో భారీఎత్తున ఆందోళనలు చేపట్టారు. అమెరికాలోని ప్రధాన నగరాలలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందువులపై హింస ఆపాలని ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీలు నిర్వహించారు.బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అక్కడి మతఛాందస వాదులు రెచ్చిపోయి అక్కడి మైనార్టీలపై ప్రధానంగా హిందువులపై దాడులు చేసి చంపుతున్నారు. అయితే ఈ దాడులు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లాండ్ పార్లమెంటులో సైతం హిందువులపై దాడులని తీవ్రంగా ఖండించారు. తాజాగా అమెరికాలో బంగ్లాదేశ్లో మైనారీటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.బంగ్లాలో హిందువులపై జరుగుతున్న హింసను తెలియజేయడానికి ఈ ప్రదర్శన జరుపుతున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. యుఎస్ఏ వ్యాప్తంగా దాదాపు 22 నగరాల్లో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇతర దేశాలలో మైనార్టీ వర్గాల మతస్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో ఇటీవల తరచుగా మతహింస జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఎవరికి ఏటువంచి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టామని అన్ని సమాజాలను తగిన విధంగా గౌరవించాలని అందరికి తగిన ప్రాధాన్యాత ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. -
బంగ్లాకు షాకిచ్చిన భారత్.. భారీగా నిధుల కోత
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి కేటాయించే నిధులను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుంగా మాల్దీవులు, మయన్మార్లకు భారత్ అందించే సహాయంలో భారీగా కోతలు విధించింది.ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగాయి. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు హెచ్చరించినా దాడులు ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత్ ఆ దేశం పై ఆర్థిక కోత విధించింది. ప్రస్తుత బడ్జెట్లో రూ. 60 కోట్లు బంగ్లాకు కేటాయించింది. అదే గతేడాది ఈ ఇధి రూ.120 కోట్లుగా ఉంది. అదే విధంగా మాల్దీవులకు దాదాపు 8 శాతం సహాయం తగ్గించి రూ. 550 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా ఇరాన్లోని చాబహార్ పోర్టుకు ఈ ఏడాది ఎటువంటి నిధులు కేటాయించలేదు.అయితే భూటాన్కు అందిస్తున్న సహాయాన్ని భారత్ ఈ సారి మరికొంతగా పెంచింది. దాదాపు ఆరు శాతం నిధులు పెంచి మెుత్తం రూ. 2,289 కోట్లకు పెంచింది. నేపాల్కు ఎనిమిది శాతం పెరిగి రూ. 800 కోట్లు చేసింది. శ్రీలంకకు సహాయం ఒక వంతు పెరిగి రూ. 400 కోట్లకు చేరుకుంది. మెుత్తంగా ఇతర దేశాలకు భారత్ చేసే ఆర్థిక సహాయం 4 శాతం పెరిగి రూ. 5,686 కోట్లకు చేరింది. . అదే గ తేడాది ఈ మెుత్తం రూ.5,483 కోట్లుగా ఉంది. 2026-27 సంవత్సరానికి భారత విదేశాంగ శాఖ బడ్జెట్ రూ.22,119 కోట్లుగా అంచనా వేయబడింది. -
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్ కీలక అడుగు
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్ క్రికెట్ బోర్డు కీలక అడుగు వేసింది. ప్రపంచకప్ గ్యాప్ను కవర్ చేసుకునేందుకు స్వదేశంలో కొత్త టీ20 టోర్నీని ప్రకటించింది. ఈ టోర్నీకి ఓడొమ్మో (ODOMMO) బంగ్లాదేశ్ టీ20 కప్గా నామకరణం చేసింది. మూడు జట్లు (ధూమకేతు XI, దుర్బార్ XI, దురొంటో XI) పోటీ పడే ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ లాంచ్ విషయాన్ని ఆ దేశ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహ్బూబ్–ఉల్–ఆలమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్ ఆడకపోయినా, ఆటగాళ్లకు పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.కాగా, భారత్లో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్కు వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు వరల్డ్కప్ బెర్త్ దక్కింది.ODOMMO టోర్నీ వివరాలు - జట్లు: ధూమకేతు XI, దుర్బార్ XI, దురొంటో XI - కెప్టెన్లు: లిటన్ దాస్ (ధూమకేతు), నజ్ముల్ హొసైన్ షాంటో (దుర్బార్), అక్బర్ అలీ (దురొంటో) - మ్యాచ్లు: గ్రూప్ స్టేజ్ ఫిబ్రవరి 5, 6, 7; ఫైనల్ ఫిబ్రవరి 9 - ప్రారంభం: ప్రతి మ్యాచ్ రోజు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, 6 గంటలకు మ్యాచ్ - ప్రైజ్ మనీ: మొత్తం 2.5 కోట్లు టాకా, ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వబడతాయి -
అదానీతో పవర్ పంచాయితీ.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుధరలతో పాటు విద్యుత్ ధరలకు సంబంధించి.. అదానీపవర్ లిమిటెడ్తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించడానికి బ్రిటిష్కు సంబంధించిన ఒక న్యాయ సంస్థను నియమించినట్లు పేర్కొంది. ఈ విషయాలను ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.విద్యుత్ ధరల విషయంలో అదానీ కంపెనీతో కలిగిన విభేదాలను పరిష్కరించడానికి లండన్కు చెందిన 3వీపీ అనే న్యాయసంస్థను నియమించినట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలఫ్ మెంట్ బోర్టు అధికారులు తెలిపారు. ఈ సంస్థ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ సెంటర్లో బంగ్లాదేశ్ తరపున వాదనలు వినిపిస్తుందని తెలిపారు. గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ వివాదాస్పద బొగ్గు సుంకాలకు సంబంధించి ఈ సంస్థ కొద్దినెలలుగా న్యాయ సహాకారం అందిస్తుంది.బంగ్లాదేశ్ నుంచి భారత్ నుంచి బంగ్లాదేశ్ మెుత్తం అవసరాల్లో భారత్ నుంచే దాదాపు 17శాతం వరకూ విద్యుత్ సరఫరా అవుతుంది. అందులో అధికశాతం జార్కండ్ లోని అదానీ పవర్ గొడ్డా కంపెనీ నుంచే అధికంగా వెళుతుంది. అయితే విద్యుత్, బొగ్గు ధరలకు సంబంధించి ఇరుపక్షాల మధ్య వివాదం ఏర్పడింది. విద్యుత్ సంస్థ దాదాపు $485 మిలియన్ల బకాయిలు ఉన్నట్లు అదానీ సంస్థ క్లెయిమ్ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయసలహా కోసం బంగ్లాదేశ్ న్యాయ నిపుణుల కమిటీని నియమించుకుంది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ 1991లో స్థాపించబడింది. ఇది ఒక ప్రధాన, స్వతంత్ర లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఆసియాలో వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి అత్యంత విశ్వసనీయమైన వేదికగా గుర్తింపు పొందింది.ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఆదేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. -
భారత్లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత కూడా బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. అయితే మీరనుకున్నట్లు ఇది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కాదు. షూటింగ్ జట్టు. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ కోసం బంగ్లా టీమ్ భారత పర్యటనకు రానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరగనుంది. క్రికెట్ మ్యాచ్లు భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్.. షూటింగ్ పోటీల్లో ఎలా పాల్గొనబోతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ మ్యాచ్లకు లభించని భద్రత షూటింగ్కు లభిస్తుందా అని భారత క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు.కాగా, భారత్లో జరగాల్సిన తమ టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లను భద్రతా కారణాలు సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదం మొదలైంది. ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భారత్పై ప్రతీకార చర్యగా స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసింది. ఇంతటితో ఆగకుండా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, భారత్లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఐసీసీ ససేమిరా అనడంతో చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. ఇప్పుడేమో తమ దేశ షూటింగ్ జట్టును భారత్కు పంపుతూ కొత్త చర్చకు తెరలేపింది. ఈ విషయంలో భారత షూటింగ్ సమాఖ్య ఎలా స్పందిచబోతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. -
ప్రపంచకప్కు బంగ్లాదేశ్.. మరో జట్టుగా..!
జూన్ 12 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. నేపాల్లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో (ప్రపంచకప్ క్వాలిఫయర్) థాయ్లాండ్పై 39 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది.మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, థాయ్లాండ్, నేపాల్, జింబాబ్వేపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్లోకి ప్రవేశించిన నెదర్లాండ్స్.. టాప్-4లో (సూపర్ సిక్స్లో) బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.ప్రపంచకప్ క్వాలిఫయర్లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. సూపర్-6 దశలో టాప్-4లో నిలిచే జట్లు ప్రపంచకప్ బెర్త్లను దక్కించుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వరల్డ్కప్ టికెట్ను కన్ఫర్మ్ చేసుకోగా.. మిగతా రెండు బెర్త్ల కోసం పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి.కాగా, జూన్ 12న బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది. -
బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారుల విడుదల
మహారాణిపేట: బంగ్లాదేశ్ చెరలో ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు మంగళవారం విడుదలయ్యారు. అక్టోబర్ 13న బయలు దేరిన మత్స్యకారులు 14న అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్గార్డ్ పరిధిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ దేశ్ చెరలో ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వం చర్చలు జరపడంతో మత్స్యకారుల విడుదలకు బంగ్లా దేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం బాగాహట్ జైలు నుంచి మత్స్యకారులను విడుదల చేశారు. భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ చంద్ర జీత్ దగ్గర ఉండి మత్స్యకారుల విడుదలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ను ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్తో కలిసి పూర్తి చేశారు. సమావేశం అనంతరం భారతీయ మత్స్యకారులను బాగాహట్ జైల్ నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. మోంగ్లా పోర్టుకు చేరుకున్న తర్వాత మోంగ్లా పోలీసుల కస్టడీలో ఉన్న బోట్ల వద్దకు మత్స్యకారులను తీసుకొని వచ్చి ఇండియాకు పంపడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన బోట్లను మరమ్మతులు చేస్తున్నారు. బుధవారం నాటికి బోట్ల రిపేర్లు పూర్తి చేసి మత్స్యకారులను వారి సొంత ప్రాంతాలకు పంపించనున్నారు.కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులుమత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నం చేసిన భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మత్స్యకారుల తరఫున వైఎస్సార్సీపీ నేత వాసుపల్లి జానకీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. మోంగ్లా పోర్టుకు చేరుకున్న తర్వాత 9 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాలుగు, ఐదు రోజుల్లో విశాఖపట్నం చేరుకుంటారని అంతవరకు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని జానకీరామ్ తెలియజేశారు.


