బంగ్లా డార్క్‌ ప్రిన్స్‌... పునరాగమనం  | Bangladesh Unrest: Tarique Rahman Welcomed By Massive People | Sakshi
Sakshi News home page

బంగ్లా డార్క్‌ ప్రిన్స్‌... పునరాగమనం 

Dec 25 2025 10:10 AM | Updated on Dec 26 2025 5:33 AM

Bangladesh Unrest: Tarique Rahman Welcomed By Massive People

17 ఏళ్లకు తిరిగొచ్చిన ఖలీదా కుమారుడు తారిఖ్‌ 

రాజకీయాల్లో ఇక కీలక పాత్ర 

బీఎన్పీ పగ్గాలు ఆయన చేతికే  

ఫిబ్రవరి సాధారణ ఎన్నికల్లో బరిలోకి 

భారత వ్యతిరేకిగా పేరు

నానాటికీ పతనావస్థకు చేరుతున్న కల్లో ల బంగ్లాదేశ్‌ లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యరి్థగా అంతా భావిస్తున్న బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎనీ్ప) తాత్కాలిక చైర్మన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్‌ రెహ్మాన్‌ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణకు ముగింపు పలికారు. లండన్‌ నుంచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు.

 ఈ సందర్భంగా ఆయనకు బీఎన్పీ శ్రేణులు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికాయి. విమానాశ్రయానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా పోటెత్తారు. తారిఖ్, తారిఖ్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తల్లి హయాంలో రాజ్యాంగేతర శక్తిగా అపరిమిత అధికారాలు చెలాయించిన తారిఖ్‌ డార్క్‌ ప్రిన్స్‌ గా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. తల్లి మాది రిగానే ఆయనకు కూడా భారత వ్యతిరేకిగా పేరుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాలో చోటుచేసుకున్న ఈ కీలక రాజకీయ పరి ణామాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది.  
 

కాబోయే ప్రధాని! 
తారిఖ్‌ రెహా్మన్‌ (60). బంగ్లా అంతటా గత 17 ఏళ్లుగా ఆయన ఫోటోలు, పోస్టర్లు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి. బీఎన్పీ ర్యాలీల్లో ఆయన వీడియో సందేశాలే మాట్లాడుతూ వచ్చాయి. అవినీతి కేసులు తదితర కారణాలతో 2008 నుంచీ భార్య జుబైదా, కూతురు జైమాతో పాటు తారిఖ్‌ లండన్‌ లో తలదాచుకోవడమే ఇందుకు కారణం. గురువారం భార్య, కూతురితో కలిసి ఢాకా చేరుకున్నాక, ‘6,314 సుదీర్ఘ రోజుల అనంతరం సొంత గడ్డపై అడుగుపెట్టా. నా బంగ్లా వాసులారా! ఇకనుంచీ మీ అందరితో నేరుగానే మాట్లాడతా‘ అంటూ సోషల్‌ మీడియాలో తారిఖ్‌ పెట్టిన పోస్టు దేశమంతటా వైరల్‌ అయింది. 

ఆయన తల్లి 80 ఏళ్ల ఖలీదా సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో ఉండటంతో బీఎన్పీ పగ్గాలను తారిఖ్‌ పూర్తిస్థాయిలో చేపట్టడం లాంఛనమే కానుంది. బంగ్లాలో శక్తిమంతమైన నేతగా వెలుగొందిన షేక్‌ హసీనా గతేడాది చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ప్రధాని పదవితో పాటు దేశాన్ని కూడా వీడి భారత్‌ లో తలదాచుకుంటున్నారు. ఆమె అవామీ లీగ్‌ పార్టీపైనా ఇప్పటికే అనర్హత వేటు పడింది. ప్రభుత్వ తాత్కాలిక సారథి, నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ కు కూడా మంచినోరే ఉన్నా ఏడాదికి పైగా అసమర్థ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. దాంతో ప్రకటించిన మేరకే వచ్చే ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగితే తారిఖ్‌ ప్రధాని పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమేనంటున్నారు. 

జమాతేకు ముకుతాడు! 
భారత వ్యతిరేకే అయినా, తారిఖ్‌ రాక మనకు ఊరటనిచ్చే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాలో ప్రస్తుతం.నెలకొని ఉన్న తీవ్ర రాజకీయ అస్థిరతే ఇందుకు కారణం. ఏ పార్టీలోనూ పెద్దగా జనాదరణ ఉన్న నాయకుడు లేకపోవడంతో ప్రజల్లోని ఆగ్రహావేశాలను మతోన్మాద శక్తులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ జేబు సంస్థ అయిన జమాతే ఇస్లామీ నానాటికీ కోరలు చాస్తోంది. హసీనా హయాంలో పడ్డ నిషేధాన్ని వదిలించుకుని యువత, ముఖ్యంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. రాజకీయ శక్తిగా బలపడుతోంది. ఇటీవలి ఢాకా వర్సిటీ ఎన్నికల్లో జమాతే విద్యార్థి విభాగమే ఘనవిజయం సాధించింది.

 ఇతర చోటామోటా పక్షాలతో కలిసి ఏకంగా అధికార పీఠంపైనే జమాతే ఇప్పుడు కన్నేసింది. ఈ పరిస్థితుల్లో దానితో పోలిస్తే ఉదారవాది అయిన తారిఖ్‌ రాక భారత్‌ కు ఊరటనిచ్చే పరిణామమే. పైగా భారత్‌ తో సత్సంబంధాలు కోరు కుంటున్నామన్న బీఎన్పీ ప్రకటనను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జమాతే వంటి మతోన్మాద శక్తికి ముకుతాడు పడటం మన జాతీయ ప్రయోజనాల రీత్యా చాలా ముఖ్యమని చెబు తున్నారు. తారిఖ్‌ పై ఉన్న అవినీతి, హసీనా హత్యాయత్నం తదితర కేసులన్నింటినీ కోర్టులు ఇటీవలే కొట్టేశాయి. దాంతో ఆయన ఎన్నికల పోటీకి మార్గం సుగమమైంది. 
        
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement