బంగ్లాదేశ్లో విషాదం చోటు చేసుకుంది.ఆ దేశ మాజీ మంత్రి, హిందూనేత రమేశ్ చంద్రసేన్ ఈ రోజు ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీలో ఆయన కీలక నేతగా ఉన్నారు.
అసలే హిందువులపై దాడులతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో బంగ్లాదేశ్లో మరో వివాదం చోటు చేసుకుంది. ఆవామీ లీగ్ నేతలను విచారించే క్రమంలో నిన్న రమేశ్ చంద్ర సేన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే దింజాపూర్ మెడికల్ కాలేజ్కు తీసుకెళ్లగా కొద్దిసేపటికే ఆయన మృతిచెందినట్లు ఆసుప్రతి వర్గాలు ప్రకటించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే రమేశ్ చంద్రసేన్ని కస్టడీలో మాజీ మంత్రితో ప్రవర్తించే విధంగా చూసుకోలేదని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. వయస్సు రీత్యా (85) అనారోగ్య సమస్యలు ఉండగా వాటికి ఏటువంటి ప్రత్యేక చికిత్స అందించలేదని తెలిపాయి. బంగ్లాదేశ్ సామాజిక మాధ్యమాలలో రమేశ్ చంద్రసేన్ది కచ్చితంగా కస్టోడియల్ డెత్ అని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఐదుగురు అవామీ లీడర్లు కస్టడీడెత్ లో మరణించినట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
అయితే షేక్ హాసీనాపై వ్యతిరేకతతో ఆ దేశంలో ఉన్న అవామీ నేతలపై యూనస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. 2024 నుంచి ఇప్పటి వరకూ వందల మంది అవాలీ లీగ్ నేతల్ని చంపినట్లు తెలిపారు.
1940లో జన్మించిన రమేశ్ చంద్రసేన్ 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009 నుంచి 2014వరకూ మంత్రిగా పనిచేశారు. ప్రజలలో ఆయనకు మంచి పేరుంది. నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపినట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి.


