ఢాకా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్పై అపార కరుణ చూపించారు. ఈ ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను 19 శాతానికి తగ్గించారు. గత ఏడాది ఏప్రిల్లో అమెరికా తొలుత 37 శాతం సుంకాన్ని ప్రతిపాదించగా, సుదీర్ఘ చర్చల దరిమిలా గత ఆగస్టులో దానిని 20 శాతానికి తగ్గించారు. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఇది మరింత తగ్గి 19 శాతానికి చేరుకుంది.
ముఖ్యంగా అమెరికా ముడి పదార్థాలను (కాటన్, కృత్రిమ నూలు) ఉపయోగించి, బంగ్లాదేశ్లో తయారు చేసే దుస్తులకు సుంకాల నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కూడా అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్లో ప్రాధాన్యత కల్పించేందుకు అంగీకరించింది. రసాయనాలు, వైద్య పరికరాలు, యంత్రాలు, మోటార్ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు సోయా, డెయిరీ, బీఫ్, పౌల్ట్రీ వంటి అమెరికా ఆహార ఉత్పత్తులకు బంగ్లాదేశ్లో మార్కెట్ ఏర్పడనున్నది. అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) ధృవీకరణలను ఇకపై బంగ్లాదేశ్ గుర్తించనుంది.
రాబోయే 15 ఏళ్లలో అమెరికా నుండి సుమారు 15 బిలియన్ డాలర్ల(రూ.1,36,063 కోట్లు) విలువైన ఇంధన ఉత్పత్తులను, 3.5 బిలియన్ డాలర్ల(రూ.31,748 కోట్లు) వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. విమానయాన రంగంలో ‘బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్’ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుండి 14 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వీటితో పాటు అదనపు ఆర్డర్లకు కూడా అవకాశం ఉంది. రక్షణ రంగంలో సైతం బంగ్లాదేశ్ అమెరికా నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేయనుంది. అంతర్జాతీయ కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
సుదీర్ఘ చర్చల దరిమిలా కుదిరిన ఈ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వాగతించారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ మాట్లాడుతూ, అమెరికా ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించడంలో , వాణిజ్య అడ్డంకులను తొలగించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం వాటా కలిగిన వస్త్ర రంగం ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుంది. అమెరికా ముడిపదార్థాలు వినియోగించి తయారు చేసే వస్త్రాలకు సుంకం ఎత్తివేయడం బంగ్లాదేశ్కు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఇది కూడా చదవండి: మమతతో కట్.. లెఫ్ట్తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్!


