మీడియా మాజీ అధిపతికి హాంకాంగ్ కోర్టు శిక్ష
ప్రభుత్వ వ్యతిరేక కుట్రలకు లాయ్ని సూత్రధారిగా పేర్కొన్న జడ్జీలు
హాంకాంగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల, హాంకాంగ్ మీడియా మాజీ అధిపతి జిమ్మీ లాయ్(78)కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దేశ భద్రతకు ప్రమాదం కలిగించేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారని, విద్రోహ వార్తా కథనాలను ప్రచురించారని బ్రిటిష్ పౌరుడు కూడా అయిన లాయ్పై అభియోగాలున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక కుట్రలన్నిటికీ జిమ్మీ లాయ్ని ముఖ్య సూత్రధారిగా తీర్పు సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. లాయ్ వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, కఠినమైన ఏకాంత కారాగారవాసం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, జరిమానా తగ్గించామన్నారు. అక్రమాలకు సంబంధించిన వేర్వేరు కేసుల్లో ఆయన ఐదేళ్ల 9 నెలలపాటు శిక్ష అనుభవించాల్సి ఉన్నందున ఇది పూర్తయ్యాకే తాజాగా విధించిన జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
హాంకాంగ్లో అసమ్మతిని అణచివేసేందుకు చైనా ప్రభుత్వం తీసుకు వచి్చన కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద విధించిన మొట్టమొదటి దీర్ఘకాలం శిక్ష ఇదే కావడం గమనార్హం. లాయ్తోపాటు ఆయన స్థాపించిన యాపిల్ డైలీ వార్తాపత్రికలోని ఆరుగురు ఉద్యోగులు, ఇద్దరు ఉద్యమకారులకు కూడా పదేళ్లు, ఆరేళ్లు, మూడు నెలల జైలు శిక్షలు విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
వీరిలో ఎక్కువ మంది నేరం అంగీకరించడంతోపాటు ప్రభుత్వం పక్షానికి మారడంతో శిక్షల తీవ్రత తగ్గింది. కాగా, సోమవారం కోర్టుకు వచ్చే సమయంలో అక్కడున్న మద్దతుదారుల వైపు చేతులు ఊపుతూ నవ్వుతూ కనిపించిన లాయ్...తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం సీరియస్గా ఉన్నారు. తీర్పు విన్న తర్వాత పబ్లిక్ గ్యాలరీలో ఉన్న కొందరు రోదించారు. ఈ తీర్పుపై అప్పీల్కు వెళతారా అని ప్రశ్నించగా జిమ్మీ లాయర్ ‘నో కామెంట్’అంటూ బదులిచ్చారు.
కాగా, తన తండ్రి జైలులోనే అమరుడవుతారని లాయ్ కుమార్తె గద్గద స్వరంతో అన్నారు. ‘మా గుండె బద్దలైంది’అని ఆయన కుమారుడు సెబాస్టియన్ అన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం 2019లో హాంకాంగ్లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. ఆ సమయంలో చైనా ప్రభుత్వం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింది 2020లో హాంకాంగ్ అధికారులు లాయ్తోపాటు కొన్ని నెలల వ్యవధిలోనే యాపిల్ డైలీ సీనియర్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేశారు. దీంతో, 2021లో ఆ పత్రిక మూతబడింది.


