ఇటలీ వేదికగా ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అయితే ఈ క్రీడలు ప్రారంభ సమయంలోనే భారీ విషాదం చోటుచేసుకుంది. గతవారం ఈ ప్రమాదం జరగ్గా.. ఇప్పుడిది వెలుగులోకి వచ్చింది. బ్యాక్ కంట్రీ స్కీయర్స్, హైకర్స్, పర్వతారోహకులు దాదాపు 13 మంది మృతి చెందారు. వీరిలో 10 మంది అవలాంచి కారణంగానే మరణించారు. ఇవి ఒలింపిక్స్ జరుగుతున్న చోటుకి చాలా దూరంలోనే సంభవించాయి.
ఇటలీ పర్వత రక్షణ బృందం చెప్పిన దాని ప్రకారం.. ఈ మధ్య తుపానుల కారణంగా కొత్త మంచు పొరలు ఏర్పడటం, బలహీనమైన లోపలి పొరల్లో మంచు కదలడం వల్ల అల్ఫైన్ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా సరిహద్దు ప్రాంతాలని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే పర్యాటకులు, స్కీయర్స్, పర్వతారోహకులు అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరించారు.
గతవారం చోటుచేసుకున్న మరణాలు.. లోంబార్డీ, ట్రెంటినో, సౌత్ టైరోల్, మార్మొలాడా గ్లేసియర్, మాంటే గ్రప్పా, అపెన్నైన్స్, వాలే డోస్టా ప్రాంతాల్లో జరిగాయాని చెప్పిన అధికారులు.. ఒలింపిక్ జరుగుతున్న స్థలాలు భద్రంగా ఉన్నాయని, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. అవలాంచి హెచ్చరికలని గమనిస్తూ, పరిస్థితి చక్కబడే వరకు పర్వతారోహకులు.. ప్రయాణాలకు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.


