International News
-
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా దళాలు జరిపిన తాజా దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దక్షిణ నగరం జపోరిజ్జియాలో శనివారం ఒక నివాస గృహంపై డ్రోన్ దాడి జరగగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది గాయపడ్డారు.సమీపంలోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు డోనెత్స్క్ మరియు దక్షిణ ఖెర్సన్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఫ్లోరిడాలో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్పై విస్తృత దాడులు జరపడం ఇదే మొదటిసారి. కాగా, పశ్చియాసియాలో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు పలకగా.. రష్యా ఇరాన్ పక్షాన ఉంది. 2022లో మొదలై నేటికీ కొనసాగుతుంది..!రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం 2022లో మొదలై, నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ అనూహ్య ప్రతిఘటనతో ఇటీవలికాలంలో రష్యా దాడులను కాస్త తగ్గించింది. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో రష్యా ఈ యుద్దాన్ని మొదలుపెట్టింది. -
ఒమన్లో పెను విషాదం
ఒమన్లో పెను విషాదం చోటు చేసుకుంది. రుస్తాక్ విలాయత్లోని అల్-హైమాలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పాడుబడిన ఓ మట్టి భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చిన్నారులు భవనంలో ఆడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.ఒమన్లో గతంలో కూడా పాడుబడిన భవనాలు, గోడలు కూలి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్క ఒమన్ ఇరాన్ మిస్సైల్ దాడులతో సతమతమవుతుంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిరోజు ఒమన్పై దాడులు చేస్తుంది. ఒమన్తో నేరుగా ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న కారణంగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్,అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
పండుగ రోజు పెను విషాదం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి
ఈద్ అల్-ఫితర్ రోజు సూడాన్లోని ఓ ఆసుపత్రిపై (ఈస్ట్ దార్ఫూర్లోని ఎడ్ దాయిన్) సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు (ముగ్గురు గర్భిణులు), 44 మంది పురుషులు ఉన్నారు.ఈ దాడిలో ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం పూర్తిగా నేలమట్టమైంది. అత్యవసర చికిత్స భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రసూతి ఆపరేషన్ థియేటర్ పైకప్పు ధ్వంసం కాగా.. ఆసుపత్రి తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. దాడి తర్వాత ఆసుపత్రి మూసివేయడటంతో లక్షలాది మంది అత్యవసర వైద్య సేవలకు దూరమయ్యారు. ఇటీవలికాలంలో ఎడ్ దాయిన్ ఆసుపత్రిపై జరిగిన మూడో వైమానిక దాడి ఇది.కాగా, సూడాన్లో 2023 నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధం 2026 నాటికి మరింత తీవ్రమైంది. సూడాన్ సైన్యం (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పెద్ద మానవ సంక్షోభాల్లో ఒకటిగా మారింది. -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులు గంటకు 100 మైళ్ల వేగంతో వీచాయి. ఈ వరదలను గడిచిన 20 ఏళ్లలో అత్యంత భారీ వరదలుగా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విమానాశ్రయాలు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోనాలో అనే తక్కువ ఒత్తిడి వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ వరదలు సంభవించాయని గుర్తించారు. ఇది హవాయి దీవులపై తేమతో నిండిన గాలులను లాగి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను తెచ్చింది. హోనలూలు అత్యవసర నిర్వహణ విభాగం మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. మావి, మోలోకై, బిగ్ ఐలాండ్లకు కూడా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. రహదారులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిదని అంచనా. 2023లో లహైనా అగ్నిప్రమాదాల తర్వాత, ఇప్పుడు వరదలతో హవాయి మరోసారి ప్రకృతి విపత్తు భారాన్ని మోస్తోంది. -
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్పై దాడికి ప్రతీకారంగా డిమోనా నగరంపై వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఈ నగరంపై ఇరాన్ 24 గంటల్లో ఐదు సార్లు దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 39 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. వరుస దాడులతో డిమోనా నగరం ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డిమోనా నగరం ఇజ్రాయెల్కు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అయినా ఇరాన్ ఈ ప్రాంతంపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. డిమోనాకు ఇజ్రాయెల్ అణు సౌకర్యం ఉన్న ప్రదేశంగా గుర్తింపు ఉంది. దీంతో అమెరికా సైతం ఈ దాడుల తర్వాత హడలెత్తిపోతుంది.కొద్ది గంటల ముందే ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియాను టార్గెట్ చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను రీచ్ కావడంతో శత్రువులు బెంబేలెత్తిపోతున్నారు. -
మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి
భారతీయ మూలాలున్న ఓ కౌంటీ జడ్జి అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ ప్రచార నిధులను వ్యక్తిగత ఖర్చులకు వాడినట్లు జ్యూరీ నిర్ధారించింది. దీంతో ఆయనపై మూడో స్థాయి ఫెలనీ కేసు నమోదైంది. టెక్సాస్ చట్టం ప్రకారం ఈ నేరానికి రెండు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్జ్ తన ప్రచార ఖాతా నుండి 46,000 డాలర్లకు పైగా మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి గృహ సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. ఆయన తరఫు న్యాయవాదులు ఈ మొత్తాన్ని ప్రచారానికి ఇచ్చిన వ్యక్తిగత రుణాల రీయింబర్స్మెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, జ్యూరీ గంటల తరబడి జరిపిన విచారణ అనంతరం ఆయనను దోషిగా తేల్చింది. శిక్షను జూన్ 16న ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు జార్జ్ను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అమెరికా చట్టాల పరంగా, జార్జ్ దోషిగా తేలిన వెంటనే పదవి నుంచి తొలగింపుకు అర్హుడు. అయితే అధికారికంగా శిక్ష విధించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. -
యుద్దంలోకి మరో దేశం.. అమెరికాకు మద్దతుగా..!
హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసేందుకు యూకే ప్రభుత్వం అమెరికాకు అనుమతిచ్చింది. ఇరాన్పై దాడులకు తమ సైనిక స్థావరాలను వినియోగించుకోవచ్చని యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటన విడుదల చేశారు.ఇరాన్పై యుద్దంలో యూకే మద్దతు తెలిపినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. యూకే తమ సాయాన్ని ప్రకటించడంతో ఆలస్యం చేసిందని పెదవి విరిచారు. తమకు మిత్ర రాజ్యమైన యూకే ఈ ప్రకటనను చాలా ముందే చేసుండాల్సిందని అన్నారు.యూకే అమెరికాకు మద్దతివ్వడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా స్పందించారు. అమెరికాకు మద్దతిచ్చి స్టార్మర్ బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని అన్నారు. బ్రిటిష్ ప్రజల్లోని చాలా మంది, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనాలని కోరుకోవడం లేదని తెలిపారు. అమెరికా ఎంతమంది మద్దతు కూడగట్టుకున్నా, ఇరాన్ తన స్వీయరక్షణ హక్కును వినియోగిస్తుందని స్పష్టం చేశారు.యూకే తాజా నిర్ణయంతో ఇరాన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ కూడా అమెరికాకు మద్దతు తెలిపింది. శత్రువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇరాన్ ఇంకెనాళ్లు యుద్దం కొనసాగించగలదో చూడాలి. -
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి. ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్-పాక్ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్-పాక్ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. -
హ్యాపినెస్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారత్ ఎక్కడ..?ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్ 118 స్థానంలో ఉండింది.చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్, మాలావీ, జింబాబ్వే, బోట్స్వానా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్బీయింగ్పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు. -
అంత్యక్రియల్లో డ్రోన్ దాడి.. 17 మంది మృతి
సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం పొరుగు దేశమైన చాద్లోకి వ్యాపించింది. మార్చి 19న జరిగిన ఘటనలో సూడాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ చాద్లోని టైన్ పట్టణంలో 17 మంది ప్రాణాలను బలిగొంది. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇంటి వద్ద అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో రెండు పేలుళ్లు సంభవించాయి. వాటి ధాటికి అంత్యక్రియలకు హాజరైన పలువురితో పాటు సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు కూడా బలయ్యారు.చాద్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. సూడాన్పై త్వరలోనే ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమత్ ఇడ్రిస్ డెబీ, రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించి, సూడాన్ దాడులకు తక్షణమే బదులివ్వాలని సైన్యాన్ని ఆదేశించారు. అవసరమైతే వారి భూభాగంలోనూ ఆపరేషన్లు చేపట్టాలని అన్నారు.మరోవైపు సూడాన్ పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ దాడి సూడాన్ సైన్యం పనేనని వారు ఆరోపించారు. కాగా, సూడాన్లో సైన్యం మరియు RSF మధ్య యుద్ధం 2023 ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1.2 కోట్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిలో దాదాపు 10 లక్షల మంది చాద్లోకి శరణార్థులుగా చేరారు. చాద్.. సూడాన్కు సరిహద్దు దేశం. -
దుబాయ్లో ఈద్ వేడుకలు.. కార్మికులకు కార్లు, బంగారు కడ్డీలు
దుబాయ్లోని కార్మికులకు ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ (రంజాన్) వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ఆధ్వర్యంలో మార్చి 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ‘ఈద్ అల్ ఫితర్… లెట్స్ సెలబ్రేట్ టుగెదర్’ అనే థీమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమం కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ వేడుకల్లో పాల్గొనే వారికి కార్లు, బంగారు బార్లు, విమాన టికెట్లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించబడుతోంది. మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రకు కృతజ్ఞతగా, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్మికులు విస్తృతంగా పాల్గొనేలా ‘బ్లూ కనెక్ట్’ అనే ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వేడుకలు ప్రసారం చేయబడతాయి. ఇందులో వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్, పోటీలు వంటి విభిన్న వినోదాత్మక కంటెంట్ అందుబాటులో ఉంటుంది. GDRFA దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ మాట్లాడుతూ.. ఈ వేడుకల ద్వారా కార్మికుల కృషిని గౌరవించడం, వారి దైనందిన సహకారాన్ని గుర్తించడం మా లక్ష్యం. ఈద్ ఆనందాన్ని వారితో పంచుకోవడం ద్వారా దుబాయ్ స్థిరమైన అభివృద్ధి ప్రయాణంలో వారి పాత్రను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. -
ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరు.. జపాన్ ప్రధాని
పశ్చిమాసియాలో యుద్దం పతాకస్థాయికి చేరిన వేల జపాన్ ప్రధాన మంత్రి సనాఏ తకాఇచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరని ఆకాశానికెత్తారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచం తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో శాంతి సాధనకు అవసరమైన ధైర్యం, దృఢ సంకల్పం ట్రంప్ వద్ద మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం తరఫున ఈ సందేశాన్ని ట్రంప్కు అందిస్తున్నట్లు తెలిపారు.ఇదే సందర్భంగా తకాఇచి ఇరాన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత విషయంలో ఇరాన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా జపాన్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. జపాన్, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ప్రధాన మిత్రదేశంగా ఉంది. పెరుగుతున్న చైనా ప్రభావం, ఉత్తర కొరియా అణు పరీక్షలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాల నడుమ రెండు దేశాలు మరింత దగ్గరగా పనిచేయాల్సిన అవసరాన్ని పెంచుతున్నాయి. తకాఇచి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై విస్తృత చర్చకు దారితీశాయి. ప్రపంచ శాంతి సాధనలో ట్రంప్ను ఏకైక నాయకుడిగా అభివర్ణించడం అమెరికా వ్యతిరేకులకు మింగుడుపడటం లేదు. ఈ వ్యాఖ్యలు ఇతర ప్రపంచ నాయకుల పాత్రను తగ్గించి చూపుతున్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి. జపాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. రెండు దేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం ప్రపంచ శాంతి సాధనలో కీలకమని అన్నారు. జపాన్ ఎల్లప్పుడూ అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని పేర్కొన్నారు. మేము కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు. -
ఉత్తర కొరియా ఎన్నికల్లో 'కిమ్' ప్రభంజనం.. అన్ని సీట్లలో గెలుపు
మార్చి 15న జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో కింగ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో, పోటీ చేసిన 687 స్థానాల్లోనూ గెలిచి, తిరుగులేని విజయం సాధించింది. కిమ్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం 0.07 శాతం ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశమైంది. గెలుపొందిన సభ్యుల్లో 70 శాతం కొత్త వారు కావడం మరో విశేషం. వీరిలో కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్ కూడా ఉన్నారు. కిమ్కు అత్యంత సన్నిహితుడు జో యోంగ్-వోన్కు కీలక పార్లమెంటరీ పదవికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత కిమ్ దక్షిణ కొరియాతో సంబంధాలను శత్రుత్వంగా నిర్వచించేలా రాజ్యాంగ సవరణ చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్షం లేకపోవడానికి కారణం- ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కిమ్ కనుసన్నల్లోనే నడుస్తుంది.- ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉంటాడు. పోటీ చేసేందుకు అభ్యర్ది కూడా ఉండడు. - ఓటర్లు అభ్యర్థిని తిరస్కరించే అవకాశం ఉన్నా, బహిరంగ ఓటింగ్ విధానం కావడంతో వ్యతిరేక ఓటు వేయడం ప్రమాదకరంగా ఉంటుంది. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు కిమ్ నియంతృత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటాయి. ఇక్కడ చీమ చిట్టుక్కుమన్నా, కిమ్కు తెలిసే జరగాలి. వ్యవస్థలన్నీ కిమ్ చేతుల్లోనే ఉంటాయి. పౌరులు తినే తిండి దగ్గరి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కిమ్ నియంత్రణలోనే ఉంటాయి. పౌర హక్కులు అనేవి ఉత్తర కొరియాకు వర్తించవు. అంతలా కిమ్ నియంతృత్వం కొనసాగుతుంది. -
వెనిజులా అధ్యక్షురాలి సంచలన నిర్ణయం
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా పని చేసిన జనరల్ వ్లాదిమిర్ పడ్రినోను పదవి నుంచి తప్పించింది. అతడి స్థానంలో జనరల్ గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ను నియమించింది.2014 నుంచి రక్షణ మంత్రిగా ఉన్న పడ్రినో మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితుడు. ఈ మార్పు వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. మాజీ అధ్యక్షుడు మదురో ముద్రను క్రమంగా తొలగించే ప్రయత్నంగా భావించబడుతోంది. రోడ్రిగెస్ ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న సంకేతంగా పరిగణించబడుతోంది.పడ్రినోపై అవినీతి ఆరోపణలతో పాటు, నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయినా రోడ్రిగెస్ పడ్రినోను దేశానికి విశ్వాసపాత్రుడైన సైనికుడిగా అభివర్ణిస్తూ, త్వరలో కొత్త బాధ్యతలు అప్పగిస్తామని తెలపడం కొసమెరుపు. కొత్త రక్షణ మంత్రి గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ విషయానికొస్తే.. ఇతను గతంలో వెనిజులా ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ఇటీవల అతను ప్రభుత్వ చమురు సంస్థ PDVSAలో కీలక పాత్ర పోషించారు. ఇతనిపై కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి 3న అమెరికా సైనిక దాడి చేసి మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ను చెరలోకి తీసుకుంది. ఆతర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగెస్ను నియమించింది. తదనంతరం మదురో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఒక్కొరిగా రాజీనామాలు చేశారు. రోడ్రిగెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వందలాది రాజకీయ ఖైదీలను విడుదల చేసి, సాధారణ అమ్నెస్టీ చట్టాన్ని ఆమోదించింది.ట్రంప్ ఒత్తిడిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులా చమురు మరియు గనుల రంగాన్ని విదేశీ పెట్టుబడులకు తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా ఇప్పటికే వెనిజులా చమురు విక్రయాలపై నియంత్రణ సాధించిందని ట్రంప్ ప్రకటించారు. కారాకాస్లోని అమెరికా రాయబార కార్యాలయం ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇటీవలే మళ్లీ ప్రారంభమైంది. -
ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం పెరిగి 108.66 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) 2.5 శాతం పెరిగి 98.65 డాలర్లకు చేరింది. బ్రెంట్–WTI మధ్య ధర తేడా 2019 తర్వాత ఇదే అత్యధికం. కాగా, బుషెహర్ ప్రావిన్స్ తీరంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ఫీల్డ్ "సౌత్ పార్స్" సదుపాయాలు దాడికి గురయ్యాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని ఆయిల్–గ్యాస్ సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది.హెచ్చరించిన విధంగానే ఇరాన్ ఖతార్లోని రాస్ లాఫాన్ గ్యాస్ ఫెసిలిటీపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు, సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. రోజుకు 7–10 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి తగ్గినట్లు అంచనా. ఇది ప్రపంచ డిమాండ్లో 7–10 శాతం తగ్గుదల. చమురు–గ్యాస్ ధరలు ఎక్కువ కాలం ఇలాగే పెరుగుతూ పోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికాఅమెరికా ప్రభుత్వం ఇంధన సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు జోన్స్ యాక్ట్ నిబంధనలను 60 రోజుల పాటు సడలించింది. అలాగే, వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ PDVSAతో కొన్ని లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. -
త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు: ఖమేనీ
తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్స్టర్ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్య నౌకాయానంపై ఇద్దరు నాయకులు చర్చించారు.మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న ప్రకారం.. నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడాను. అతనికి ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించాం. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నావిగేషన్ అవసరమని మేము అంగీకరించాము. యూఏఈపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తాము.కాగా, ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి. మార్చి 2న కూడా మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడి దాడులను ఖండించారు. మోదీ ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-సబాహ్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా మాట్లాడారు. -
నీలం రంగులోకి మారిపోయిన మనిషి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..!
లండన్: ఇటీవల యూకేలోని డెర్బిషైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్ విషయం బయటపడింది.అసలేం జరిగిందంటే..?42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే బర్టన్-ఆన్-ట్రెంట్లోని క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు.అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ సంఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు.విషయం తెలిసి నవ్వుకున్నారు..!ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా పక్కున నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆతర్వాత నవ్వించిన ఈ ఘటన సోషల్మీడియాలో వైరలైంది. -
అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు
ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని అజ్మాన్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు, ప్రైవేటు ఉద్యోగులకు మూడు రోజుల సెలవుగా పేర్కొంది. మానవ వనరుల విభాగం ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 22 (ఆదివారం) వరకు కొనసాగుతాయి. వారికి అధికారిక పనులు మార్చి 23 (సోమవారం) తిరిగి ప్రారంభమవుతాయి. ప్రైవేటు ఉద్యోగుల విషయానికొస్తే.. వీరికి సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 21 (శనివారం) వరకు ఉంటాయి. వీరు మార్చి 22 (ఆదివారం) తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే యూఏఈ ఫెడరల్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది.సాధారణంగా ఈద్ ఉల్ ఫితర్ ఖచ్చితమైన తేదీ చంద్ర దర్శనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ చంద్ర దర్శనాన్ని గుర్తించడానికి యూఏఈ చంద్ర దర్శన కమిటీ మార్చి 18న (29వ రోజు) సమావేశం కానుంది. చంద్రుడు కనిపిస్తే, ఈద్ మార్చి 19న (గురువారం) ప్రారంభమవుతుంది. లేకపోతే, మార్చి 20న (శుక్రవారం) జరుపుకుంటారు. -
యూఏఈపై ఇరాన్ మరోసారి దాడి
యూఏఈపై ఇరాన్ మరోసారి (మార్చి 17) దాడికి దిగింది. 10 బాలిస్టిక్ మిసైళ్లు, 45 డ్రోన్లతో అటాక్ చేసింది. అయితే ఈ దాడిని యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దేశ సార్వభౌమత్వం మరియు భద్రతకు ముప్పు కలిగించే ఈ తరహా దాడులను సైన్యం అత్యంత అప్రమత్తతతో ఎదుర్కొంటున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి తమ రక్షణ వ్యవస్థలు 314 బాలిస్టిక్ మిసైళ్లు, 15 క్రూయిజ్ మిసైళ్లు, 1672 డ్రోన్లు నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గర్వంగా పేర్కొంది. కాగా, ఇప్పటివరకు జరిగిన రక్షణ చర్యలలో యూఏఈ ఇద్దరు అధికారుల ప్రాణాలు కోల్పోయింది. అదనంగా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాలస్తీనా దేశాలకు చెందిన ఆరుగురు సాధారణ పౌరులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు. అపశృతిఇరాన్ జరిపిన మిసైల్, డ్రోన్ దాడిని తిప్పికొడుతుండగా అబుదాబిలోని బనియాస్ నివాస ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ధ్వంసం చేస్తుండగా శకలాలు కిందపడి, ఓ పాకిస్తానీ జాతీయుడు మృతి చెందినట్లు యూఏఈ వర్గాలు తెలిపాయి. ఘర్షణనలు ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నమోదైన ఎనిమిదవ మరణం ఇది. -
పశ్చిమాసియాలో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
-
టెల్ అవీవ్ భవనాలపై ఇరాన్ భీకర దాడులు
-
ట్రంప్ మార్క్ పాలిటిక్స్ .. ఉండే అమెరికా భద్రతలో DHS కీలకం
-
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి 100 గంటలు పూర్తి వీడియో రిలీజ్ చేసిన అమెరికా
-
మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు
-
ఇరాన్ తో యుద్ధం.. బెడిసికొట్టిన అమెరికా ప్లాన్ పెంటగాన్ సంచలన రిపోర్ట్
-
డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ.. వైట్హౌస్ క్లారిటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఉన్న ఎర్రటి మచ్చ కనిపించడంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్కు ఏమైనా జరిగిందా అని.. ఆయన ఆరోగ్యంపై యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు వైట్ హౌస్ వైద్యుడు వివరించాడు.ఇది సాధారణ చర్మ వ్యాధి చికిత్స వల్లే ఏర్పడిందని అని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పష్టం చేశాడు. అందువల్లే ఎర్రటిమచ్చ ఏర్పడిందని తెలిపాడు. ఈ మచ్చ తీవ్రమైన అనారోగ్యం వల్ల వచ్చింది కాదని.. సాధారణ చర్మ చికిత్స క్రీమ్ను ఉపయోగించడం వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని వెల్లడించారు. కాగా.. సోమవారం మెడల్ ఆఫ్ ఆనర్ వేడుక సందర్భంగా ట్రంప్ చొక్కా కాలర్ పైన ఉన్న ఎర్రటి మచ్చ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బార్బరా బెల్లా క్లారిటీ ఇచ్చారు.గతేడాది ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ బార్బరా బెల్లా పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం సాధారణంగా ఉందని .. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైట్ హౌస్ పేర్కొంది. -
అమెరికా అప్రమత్తం.. పశ్చిమాసియాకు మరిన్ని దళాలు..!
పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా మరింత అప్రమత్తమైంది. ఇరాన్ పెద్దఎత్తున దాడులకు దిగడంతో అమెరికా సైతం సైనిక మోహరింపును మరింత పెంచింది. ఈ అత్యవసర చర్య మిత్రదేశాల భద్రత కోసమేనని తెలిపింది. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలు మరియు యుద్ధనౌకలు ఇప్పటికే మోహరించినప్పటికీ.. కొత్త సైనిక బలగాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.ఇరాన్తో పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగడంతో యూఎస్ రక్షణ శాఖ పెద్ద సంఖ్యలో మరిన్ని దళాలను మోహరించాలని ఆదేశించింది. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతం అంతటా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ ఎదురుదాడితో అప్రమత్తమైన అమెరికా సైనిక స్థావరాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసింది. మరోవైపు ప్రస్తుత జరుగుతోన్న యుద్ధంతో ప్రపంచ మార్కెట్లు, చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నా.. రెండు వైపులా ఎవరు కూడా తగ్గకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్- అమెరికా చర్చలు జరిగే పరిస్థతులు ఏ మూలానా కనిపించడం లేదు. -
ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటాం : జీసీసీ
ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ స్పందించింది. ఈ దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. అబుదాబి, రస్ ఆల్ ఖైమాలపై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అబుదాబిలో గిడ్డంగులు దెబ్బతిన్నాయి. ఇరాన్ దాడి తర్వాత జెబెల్ అ లీ ఓడరేవు నుండి పొగలు ఎగసిపడుతున్నాయి.కాగా.. అబుదాబి, రస్ అల్ ఖైమాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో యుఎఇ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. నిన్న మధ్యాహ్నం ముసాఫా పారిశ్రామిక ప్రాంతంపై ఈ దాడి జరిగింది. ముసాఫా, ఐసిఎడిలోని గిడ్డంగులను క్షిపణి శిథిలాలు తాకాయి. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు. సాయంత్రం జరిగిన దాడిలో ఓ క్షిపణి యూఎస్ సైనిక స్థావరంలోని నిల్వ కేంద్రం దగ్గర పడింది. ఆ సమయంలో భారీ పేలుడు జరిగింది.నిన్న రస్ అల్ ఖైమాలో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. వెంటనే అగ్నిమాపక దళం అదుపులోకి తీసుకొచ్చింది. చమురు, ఇంధన వనరులపై దాడి చేసిన ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ ప్రకటించింది. అయితే అబుదాబి, రస్ అల్ ఖైమాను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను యూఏఈ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. కొన్ని గిడ్డంగులు శిథిలాల నుండి నష్టపోయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
పశ్చిమాసియాలో యుద్ధం.. హైపర్సోనిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగిస్తుందా?
అమెరికా-ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇరాన్పై దాడులు ముమ్మరం చేశాయి. అయితే తాజాగా అమెరికా, ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన ఫతా-2 హైపర్సోనిక్ క్షిపణిని మోహరించింది. ఫతా-2 క్షిపణిని మోహరించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. ఫతా బాలిస్టిక్ క్షిపణి అప్గ్రేడ్ వెర్షన్ అని ఫతా-2 క్షిపణిగా తెలుస్తోంది. ఈ క్షిపణిని ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ఇంకా ధృవీకరించకపోయినా.. దేశ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్య ఈ ఫతా-2 వంటి క్షిపణులను ఉపయోగించి ఉండవచ్చని ఓ మ్యాగజైన్ కథనం ప్రచురించింది.ఫతా-2 హైపర్సోనిక్ క్షిపణి ప్రభావం..ఈ హైపర్సోనిక్ క్షిపణి ఫతా-2ను నవంబర్ 2023లో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రవేశపెట్టింది. ఇది సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణి రీఎంట్రీ వాహనానికి బదులుగా.. హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాన్ని ఉపయోగించేందుకు రూపొందించారు. ఇది ఊహించని దిశల నుండి లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడనుందని సమాచారం.ఈ ఫతా-2 క్షిపణి 1,400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. మాక్ 15 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని తెలిపారు. ఈ హైపర్సోనిక్ క్షిపణి శక్తివంతమైన 200 కిలోగ్రాముల వార్హెడ్ను మోయగలదని వెల్లడించారు.కాగా.. టెహ్రాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. యుఎఇ, బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులు స్థావరాలు, నౌకాదళ ప్రధాన కార్యాలయాలు సహా అమెరికా రాయబార కార్యాలయాలు, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడుల చేస్తోంది. దీనివల్ల గల్ఫ్ వైమానిక రక్షణ వ్యవస్థలకు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ దాడులతో ప్రభావిత ప్రాంతాలలో ప్రాణనష్ట, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. -
ఎకానమీకి క్రూడ్ షాక్.. చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం
-
జోర్దాన్ అధినేతకు ప్రధాని మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా
ఇరాన్- అమెరికా యుద్ధం వేళ ప్రధాని మోదీ భారతీయుల క్షేమంపై ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల సెక్యూరిటీపై జోర్డాన్ అధినేతతో చర్చించారు. ఆయనకు ఫోన్ చేసిన ప్రధాని.. ఆ దేశంలోని భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జోర్డాన్లో పరిస్థితులు తమను ఆందోళనకు గురిచేశాయని ప్రధాని మోదీ అన్నారు. శాంతి, భద్రతకు తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.కాగా.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్ దాడులు జరుగుతున్నాయి. అరబ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే మన భారత ప్రధాని మోదీ అన్ని దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై చర్చిస్తున్నారు. -
ఇరాన్పై మరిన్ని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ మాతో చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము చేసిన దాడుల్లో ఇప్పటికే సైనిక ఉన్నతాధికారులు పెద్దసంఖ్యలో మరణించారని తెలిపారు. ఇరాన్పై ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుందని అన్నారు. తాము ఇంకా దాడులు ఉధృతం చేయలేదని అన్నారు. త్వరలోనే దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించారు.ఇరాన్ ప్రతిసారి అబద్ధాలు చెబుతోందని ట్రంప్ అన్నారు. ఈ యుద్ధం మరో 4 నుంచి ఐదు వారాల పాటు కొనసాగుతందని స్పష్టం చేశారు. ఇరాన్ను మా బలగాలు తరిమికొట్టాయని తెలిపారు. ఇరాన్కు చెందిన 10 వార్షిప్లను అమెరికా ధ్వంసం చేసిందని వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ట్రంప్ అన్నారు. ఇవాళ రాత్రంతా ఇరాన్పై దాడులు జరుపుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
8 యుద్దాలు ఆపేసా.. ఇది నా ట్రాక్ రికార్డ్
-
Trump: ఏలియన్స్ ఫైల్స్ సీక్రెట్ బయట పెడతా
-
వాడు పెద్ద సైకో..నన్ను వాడుకున్నాడు.. ఎప్ స్టీన్ బాధితురాలు రీనా వీడియో
-
అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందాలు
-
అత్తాకోడళ్ల ఫైట్ కిమ్ కుటుంబంలో విభేదాలు
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం! గ్రామ్ కోట్లలో
ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అయితే ప్రపంచంలో బంగారం కంటే కొన్ని లక్షల రెట్లు ఖరీదైన లోహం ఒకటి ఉందని మీకు తెలుసా? ఒకే ఒక్క గ్రాముతో వందల కిలోల బంగారం కొనొచ్చు అంటే నమ్మగలరా? బంగారం కంటే లక్షల రెట్లు ఖరీదైన ఒక లోహం ఈ ప్రపంచంలో ఉంది. దాని పేరు కాలిఫోర్నియం. దీని ధర వింటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక గ్రాము కాలిఫోర్నియం ధర సుమారు 27 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.239 కోట్లు. అంటే ఒక్క గ్రాము కొనాలంటే దాదాపు 200 కిలోల బంగారం విలువ అనమాట.కాలిఫోర్నియం భూమిలో సహజంగా దొరికే లోహం కాదు. ఇది పూర్తిగా ప్రయోగశాలలో సృష్టించిన సింథటిక్ మూలకం. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ శాస్త్రవేత్తలు దీన్ని తొలిసారి తయారు చేశారు. అందుకే ఆ రాష్ట్రం పేరుతో దీనికి కాలిఫోర్నియం అనే పేరు పెట్టారు. దీనిని తయారు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అణు రియాక్టర్లలో ఇతర మూలకాలను దీర్ఘకాలం న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు, కొన్ని ప్రత్యేక ల్యాబ్లు మాత్రమే దీనిని తయారు చేయగలవు. పైగా ఇది అత్యంత శక్తివంతమైన రేడియోధార్మిక మూలకం కావడంతో దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం కూడా చాలా ఖరీదైన, ప్రమాదకరమైన ప్రక్రియ.ఇంత ఖరీదైన మూలకం అయినప్పటికీ దీన్ని ఆభరణాల కోసం ఉపయోగించరు. కానీ దీని ప్రయోజనాలు మాత్రం అసాధారణం. కాలిఫోర్నియం-252ను క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ కోసం ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఇతర చికిత్సలు పనిచేయని సందర్భాల్లో ఇది కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అణు పరిశ్రమలో రియాక్టర్లను ప్రారంభించడానికి ఇది స్టార్టర్గా పనిచేస్తుంది. అంతరిక్ష పరిశోధనలో పరికరాల పరీక్షల్లో దీని ఉపయోగం ఉంది. అలాగే గనుల్లో బంగారం, వెండి నిల్వలను గుర్తించడంలో, చమురు బావుల అన్వేషణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.అంటే కాలిఫోర్నియం కేవలం ఖరీదైన లోహం మాత్రమే కాదు.. అణుశక్తి, వైద్యం, అంతరిక్ష రంగాల్లో చాలా సైలెంట్గా విప్లవం సృష్టిస్తున్న శాస్త్రీయ అద్భుతం. బంగారం విలువైనదే కానీ విజ్ఞానానికి విలువ కట్టలేమని ఇది మరోసారి నిరూపిస్తుంది. -
బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో రూ. కోటి
బంగారం ఖరీదైనదే కానీ ఈ చెట్టు మాత్రం బంగారాన్ని మించిపోయింది. కిలోకు కోటి రూపాయలు పలికే ఒకే ఒక్క మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? అది అగర్వుడ్. ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి చెట్టులా ఇది ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసనలేని తెల్ల కలపతో ఉంటాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదా చెట్టు గాయపడినప్పుడు, అది తనను తాను రక్షించుకోవడానికి ముదురు, జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంలో సువాసనగల నల్ల అగర్వుడ్గా మారుతుంది.అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్ని ఉత్పత్తి చేయవు. సహజంగా కేవలం 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు.. 10 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. ఈ అరుదైన, సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన రకాన్ని 'క్యారా' అంటారు. దీని ధర గ్రాముకు రూ.8.5 లక్షల వరకు చేరుతుంది. షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒక్క చిన్న ముక్కే కోట్ల విలువ కలిగి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే..అగర్వుడ్ని ప్రపంచంలో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్, పారిస్ లాంటి నగరాల్లో లగ్జరీ సెంట్స్ కోసం దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతత ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి తదితర సమస్యలకు దీనిని ఉపయోగిస్తారు.భారతదేశంలోని అస్సాం రాష్ట్రం మంచి అగర్వుడ్కి ప్రసిద్ధి. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అక్విలేరియా చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే అగర్వుడ్ అమ్మకంపై కఠిన నియమాలు పెట్టారు. లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని అమ్మగలరు. ఇప్పుడు సహజ అగర్వుడ్ చాలా ఖరీదైన, విలాసవంతమైన వస్తువుగా మారింది. బంగారం నేలలో దొరుకుతుంది. కానీ అగర్వుడ్ తయారవ్వడానికి ప్రకృతి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది. -
2026లో కుండపోత.. 40 రోజులుగా ఆ దేశంలో వర్షాలే
ఒక్క రోజు వర్షం కురిస్తేనే ఎక్కడైనా సరే జనజీవనం స్తంభించిపోతుంది. అలాంటిది యూకేలో ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి వర్షాలు ఆగడం లేదు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 40 రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్, తూర్పు స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కార్న్వాల్లో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదవగా.. దేశవ్యాప్తంగా 26 వాతావరణ కేంద్రాలు ఈ వర్షాలతో సరికొత్త రికార్డులు సృష్టించాయి.ఇక ఫిబ్రవరి 8వ తేదీ నాటికి యూకేలో సగటు వర్షపాతం 37 శాతంగా నమోదైంది. ఇంగ్లాండ్లో ఇది 59 శాతం, దక్షిణ ఇంగ్లాండ్లో అయితే ఏకంగా 72 శాతానికి చేరింది. అబెర్డీన్లో ఫిబ్రవరి సగటు 180 శాతం దాటేయడం ఆందోళన కలిగిస్తోంది.వర్షాలు ఎప్పుడు తగ్గొచ్చు?వాతావరణ శాఖ డిప్యూటీ చీఫ్ స్టీవెన్ కీట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ వారం చివరలో స్థిరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ మధ్య అట్లాంటిక్ నుంచి వచ్చే బలమైన గాలులు.. యూకేలోకి ప్రవేశించొచ్చు. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కీట్స్ హెచ్చరించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి తొలివారాల్లో కాస్త ఎండ కనిపించినా.. మళ్లీ భారీ వర్షాల ముప్పు ఉండొచ్చని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. -
అద్దాల ట్రైన్లో అరోరా మ్యూజిక్.. చూస్తే మైమరచిపోవాల్సిందే
బస్సులోనో, ట్రైన్లోనో వెళ్తున్నప్పుడు.. 'నాకు విండో సీటే కావాలి' అని పిల్లలు మారాం చేయడం చూస్తుంటాం. బయట కనిపించే ప్రకృతి అందాల కోసం ఆ ఆత్రుత. అయితే ట్రైన్లో కూర్చున్న వారందరికీ విండో సీటే అయితే? బయటి ప్రపంచం మొత్తం అద్దాల్లా మన ముందుంటే? ఎలా ఉంటుంది. ఈ కలను నిజం చేసింది నార్వే.నార్వే ప్రభుత్వం ప్రపంచంలోనే ప్రత్యేకమైన పానొరమిక్ నైట్ ట్రైన్ని ప్రారంభించింది. ఈ ట్రైన్ పేరు 'మిడ్నైట్ అరోరా రూట్'. ప్రత్యేకంగా నార్తర్న్ లైట్స్ని చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం దీన్ని రూపొందించారు. సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు నార్వే ఆర్కిటిక్ ప్రాంతంలో ఆకాశమంతా రంగుల కాంతులు మెరుస్తుంటాయి. వాటినే నార్తర్న్ లైట్స్ అంటారు. ప్రత్యేకంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ఇవి చూడటానికి మంచి టైమ్. ఈ సమయంలో రాత్రులు ఎక్కువగా ఉంటాయి. ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ట్రోమ్సో నగరానికి వేలాది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసేందుకే వస్తుంటారు.ఈ ట్రైన్ భోగీలు పూర్తిగా గాజుతో తయారు చేశారు. గాజు గోడలు, గాజు పైకప్పు అంటే ట్రైన్ లోపల కూర్చున్నా 360 డిగ్రీల కోణంలో బయట ప్రకృతి అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకాశం అంతా విరిసే అరోరా రంగులు, మెరిసే నక్షత్రాలు, మంచుతో కప్పుకున్న పర్వతాలు, జలపాతాలు అన్నీ ఒకే ఫ్రేమ్లో!ఆర్కిటిక్ ప్రాంతం అంటే గడ్డ కట్టే చలి. కానీ ట్రైన్లో ప్రయాణికుల కోసం హీటెడ్ సీట్లు, వెచ్చని బ్లాంకెట్లు ఏర్పాటు చేశారు. బయట మంచు లోపల వెచ్చదనం.. అదే ఈ ప్రయాణం ప్రత్యేకత. ఇంకో ఆసక్తికర విషయం ఏవటంటే ఈ ట్రైన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్తో నడుస్తుంది. అంటే ప్రకృతి మధ్య ప్రయాణం. ప్రకృతిని కాపాడే శక్తితో! నార్వే మాత్రమే కాదు స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా ప్రాంతాల్లో కూడా అరోరా కనిపిస్తుంది. కానీ ఇలా అద్దాల ట్రైన్లో ప్రయాణిస్తూ చూడటం మాత్రం అరుదైన అనుభూతి. -
పాటలు పాడే రోడ్డు.. కారు నడిపితే రోడ్డుపై నుంచి మ్యూజిక్
రోడ్డు అంటే మనకు గుర్తొచ్చేది ట్రాఫిక్, హారన్లు, స్పీడ్ బ్రేకర్లు. కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల రహదారులే సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. వీటినే 'మ్యూజికల్ రోడ్స్' అంటారు. ప్రత్యేకంగా రూపొందించిన రంబుల్ స్ట్రిప్స్.. అంటే రోడ్డుపై పొడవైన కమ్మీలు లేదా గీతలు.. కారు వాటిపై నుంచి దూసుకెళ్తే వైబ్రేషన్ ద్వారా సంగీతాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ సృజనాత్మక ఆలోచనతో అదే స్ట్రిప్స్ను ప్రత్యేక దూరం, పొడవుతో అమర్చితే, కారు వెళ్లే వేగాన్ని బట్టి అవే ఒక మెలోడియస్ ట్యూన్గా మారిపోతాయి.ఇలా పాడే రహదారుల్లో అమెరికా ముందుంది. కాలిఫోర్నియాలోని లాంకాస్టర్ నగరంలో 'సివిక్ మ్యూజికల్ రోడ్' పేరుతో ఒక ప్రత్యేక రహదారి ఉంది. హైవే 14 సమీపంలోని అవెన్యూ జీలో, 30వ , 40వ వీధుల మధ్య ఉన్న పావు మైలు పొడవైన ఈ సెక్షన్పై గంటకు 50 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే ప్రసిద్ధమైన 'విలియం టెల్ ఓవర్చర్' స్వరాలు వినిపిస్తాయి. రోడ్డుపై కారు వెళుతుంది కానీ వినిపించేది ఆర్కెస్ట్రా మ్యూజిక్!అసలు ఈ ప్రాజెక్ట్ 2008లో మొదట అవెన్యూ జీలో, నివాస ప్రాంతాలకు దూరంగా తిరిగి నిర్మించారు. హోండా సివిక్ బ్రాండ్ స్పాన్సర్ చేయడంతో దీనికి 'సివిక్ మ్యూజికల్ రోడ్' అనే పేరు వచ్చింది. స్వరంలో చిన్నచిన్న విరామాలు ఉన్నా ఆ అనుభూతి మాత్రం మరిచిపోలేనిది. ఇలా రోడ్డు నుంచి పాట వినేందుకు చాలా మంది డ్రైవర్లు ఒక్కసారే కాదు మళ్లీ మళ్లీ అదే రోడ్డుపై డ్రైవ్ చేస్తారు!ఇదే తరహాలో న్యూ మెక్సికోలో కూడా మరో మ్యూజికల్ రోడ్ ఉంది. చారిత్రాత్మక యూఎస్ రూట్ 66 సమీపంలోని టిజెరాస్ పట్టణం వద్ద, ఎన్ఎమ్ 333 రహదారిపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ భాగంలో గంటకు 45 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే 'అమెరికా ది బ్యూటిఫుల్' స్వరాలు వినిపిస్తాయి. ఆ మెలోడి అంత స్పష్టంగా, అంత ప్రేరణాత్మకంగా ఉంటుంది కాబట్టి ప్రయాణం ఒక సంగీత యాత్రగా మారిపోతుంది.ఇలాంటి సంగీత రహదారులు జపాన్, దక్షిణ కొరియా, డెన్మార్క్, హంగేరీ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. కొన్ని జాతీయ గీతాలు ప్లే చేస్తాయి. కొన్ని క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తాయి. నిజానికి వీటిని డ్రైవింగ్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు, డ్రైవర్లకు ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చడం వీటి లక్ష్యం. ఒక చిన్న ఇంజినీరింగ్ ఐడియా.. ఒక సాధారణ రోడ్డును మ్యూజిక్ స్టేజ్గా మార్చింది. ఇకపై రోడ్డుపై డ్రైవ్ చేస్తూ బోర్ కొట్టేస్తే ఎక్కడో ఒకచోట రహదారే మీ కోసం పాట పాడుతుందేమో! -
కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉగ్రవాది
బ్రిటన్లోని బర్మింగ్హామ్లో రాబోయే మే నెలలో నగర కౌన్సిలర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఓ ఉగ్రవాది పోటీ చేస్తుండటం షాకింగ్గా అనిపిస్తోంది. 1999లో యెమెన్లోని బ్రిటీష్ కాన్సులేట్, ఓ మసీదు, స్విస్ హోటల్పై బాంబు దాడులు జరగ్గా.. వీటిలో భాగమైన షాహిద్ భట్ దోషిగా తేలాడు. ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు కారణంగా జైలుశిక్ష అనుభవించాడు.ఉగ్రవాది అబూ హమ్జాకు గతంలో అనుచరుడిగా ఉన్న భట్.. అప్పట్లోనే అఫ్ధానిస్తాన్, బోస్నియా, తర్వాత యెమెన్కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను షాహిద్ ఖండించాడు. బర్మింగ్హామ్ కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనని తాను సమర్థించుకున్నాడు.యెమెన్ కోర్టులో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా నాకు శిక్ష విధించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో నాకే ఓటేయాలని ఎవరినీ బలవంతం చేయను. నచ్చకపోతే నాకు ఓటు వేయొద్దు అని షాహిద్ భట్ క్లారిటీ ఇచ్చాడు. షాహిద్ భట్.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. దీనికి అఖ్మద్ యాకుబ్, షకీల్ అఫ్జర్ నాయకత్వం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజా, పాలస్తీనా అంశాలపై లేబర్ పార్టీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఓటర్లపై ఈ కూటమి ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుని ఈ స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీయగలదని అంచనా వేస్తున్నారు.బ్రిటన్ చట్టాల ప్రకారం, విదేశాల్లో లేదా దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో శిక్ష అనుభవించినవారికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఈ నిబంధనలు భట్కు అనుకూలంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లేబర్ ఎంపీ జెస్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. ఉగ్రవాద దోషిగా తేలిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా పోటీపడటం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. -
వింటర్ ఒలింపిక్స్ వేళ ఇటలీలో భారీ విషాదం
ఇటలీ వేదికగా ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అయితే ఈ క్రీడలు ప్రారంభ సమయంలోనే భారీ విషాదం చోటుచేసుకుంది. గతవారం ఈ ప్రమాదం జరగ్గా.. ఇప్పుడిది వెలుగులోకి వచ్చింది. బ్యాక్ కంట్రీ స్కీయర్స్, హైకర్స్, పర్వతారోహకులు దాదాపు 13 మంది మృతి చెందారు. వీరిలో 10 మంది అవలాంచి కారణంగానే మరణించారు. ఇవి ఒలింపిక్స్ జరుగుతున్న చోటుకి చాలా దూరంలోనే సంభవించాయి.ఇటలీ పర్వత రక్షణ బృందం చెప్పిన దాని ప్రకారం.. ఈ మధ్య తుపానుల కారణంగా కొత్త మంచు పొరలు ఏర్పడటం, బలహీనమైన లోపలి పొరల్లో మంచు కదలడం వల్ల అల్ఫైన్ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా సరిహద్దు ప్రాంతాలని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే పర్యాటకులు, స్కీయర్స్, పర్వతారోహకులు అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరించారు.గతవారం చోటుచేసుకున్న మరణాలు.. లోంబార్డీ, ట్రెంటినో, సౌత్ టైరోల్, మార్మొలాడా గ్లేసియర్, మాంటే గ్రప్పా, అపెన్నైన్స్, వాలే డోస్టా ప్రాంతాల్లో జరిగాయాని చెప్పిన అధికారులు.. ఒలింపిక్ జరుగుతున్న స్థలాలు భద్రంగా ఉన్నాయని, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. అవలాంచి హెచ్చరికలని గమనిస్తూ, పరిస్థితి చక్కబడే వరకు పర్వతారోహకులు.. ప్రయాణాలకు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. -
స్కూల్స్లో ఇకపై జంక్ ఫుడ్ నిషేధం
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా యూఏఈ విద్యామంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది. స్కూల్ క్యాంటీన్లలో జంక్ ఫుడ్, డ్రింక్స్ అమ్మడంపై నిషేధం విధించింది. ఈ జాబితాలో సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కృత్రిమ జ్యూసులు, చాక్లెట్, కేక్, డోనట్, స్వీట్ బిస్కెట్లు,చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, సాసేజులు, బర్గర్స్ ఉన్నాయి. అలర్జీ సమస్యల కారణంగా వేరుశనగ, కాజూనట్స్ని కూడా నిషేధించారు. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ మెండుగా ఉండే ఇంట్లో తయారు చేసిన ఆహారం పిల్లలకు ఇవ్వమని ప్రభుత్వం సూచించింది.అలానే పిల్లల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై కూడా కఠిన నియమాలు అమలు చేశారు. తొలిసారి పాఠశాలకు ఎవరైనా ఫోన్ తీసుకునివస్తే నెల రోజులపాటు దాన్ని తిరిగి ఇవ్వరు. మళ్లీ మళ్లీ ఇలానే చేస్తే.. విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు ఆ ఫోన్ తిరిగి ఇవ్వడం కుదరదని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. ఈ నియమాలు అమలు చేయడంలో భాగంగా అధికారులు.. విద్యార్థుల బ్యాగ్స్ తనిఖీ చేయొచ్చు. అయితే తనిఖీలు చేసినప్పుడు పిల్లల బ్యాగ్లో మొబైల్ దొరికితే.. వెంటనే తల్లిదండ్రులు సంతకంతో రికార్డ్ చేయాలి.ఐప్యాడ్ లేదా ట్యాబ్ అనేవి చదువుకోసం మాత్రమే. టీచర్స్ అనుమతితోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. విరామం లేదా క్లాస్ తర్వాత వీటిని ఉపయోగించడం.. నిబంధనలకు విరుద్ధం. ఈ చర్యలన్నీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. -
నోబెల్ విజేతకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదికి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. తాజా తీర్పు ప్రకారం ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. దేశం విడిచి వెళ్లకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే ఈ తీర్పు వచ్చింది. ఇది వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ మేరకు నర్గెస్ న్యాయవాది మోస్తఫా నీలీ పలు వివరాలు వెల్లడించారు.నర్గెస్ లాయర్ చెప్పిన ప్రకారం.. ఈమెపై ప్రభుత్వం రెండు ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం, సమావేశాలు నిర్వహించారనే ఆరోపణపై ఆరేళ్లు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు. మొత్తంగా ఏడున్నరేళ్లు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం నర్గెస్ మొహమ్మది చాన్నాళ్లుగా పోరాడుతున్నారు. ఈ విషయమై ఇదివరకే పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. శిక్ష కూడా అనుభవించారు. కొరడా దెబ్బలు సైతం ఓర్చుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా నర్గెస్ చేస్తున్న పోరాటానికి గుర్తింపుగానే 2023లో ఈమెని నోబెల్ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే నోబెల్కు ఎంపికవడం విశేషం.హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు.. నర్గెస్ మొహమ్మదిని తక్షణమే విడుదల చేయాలని, ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా మానవ హక్కుల్ని గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. -
అంటార్కిటికా కంటే చల్లగా అమెరికా?
న్యూయార్క్ నగరంలో చంపేస్తోంది. ఈ వీకెండ్ అనగా ఆదివారం తీవ్రమైన చలి నమోదైంది. 3 డిగ్రీల ఫారెన్హీట్కి తగ్గిపోయాయి. బలమైన చలిగాలుల వల్ల ఈ చలి.. -14 డిగ్రీలలా అనిపిస్తోంది. ఈశాన్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చలిగాలి.. -40 డిగ్రీలు అనిపించేంతలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల కారణంగా న్యూయార్క్, ఫిలడెల్ఫియా లాంటి పెద్ద నగరాల్లో కలిపి 4.3 కోట్లమందికి పైగా ప్రజలకు.. తీవ్ర చలి హెచ్చరికలు జారీ చేశారు.కెనడా వైపు నుంచి వచ్చిన ఆర్కిటిక్ గాలులే ఈ తీవ్రమైన చలికి కారణమని వాతావరణ నిపుణులు అన్నారు. గత 10-20 ఏళ్లలో లేనటువంటి చలి ఇది అని చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అంటార్కిటికాలోని మెక్మర్డో స్టేషన్లో.. న్యూయార్క్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది.ఈ చలి కారణంగా న్యూయార్క్ సిటీలో ఈ ఏడాది ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో కనీసం 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో 13 మంది హైపోథర్మియా(చలి) వల్లే చనిపోయారట.The beautiful lake in #NYC’s Central Park looks very frozen and frosty today. #NewYork #NewYorkCity pic.twitter.com/JMsKEVdkTo— Inga Sarda-Sorensen (@isardasorensen) February 8, 2026Alerta de frío extremo en la Ciudad de Nueva York EEUU 🇺🇸 Y los vientos no trataron muy bien a los turistas.#newyorkcity Vía @ImMeme0 pic.twitter.com/luofBYaBBm— Geól. Sergio Almazán (@chematierra) February 8, 2026 -
పాకిస్తాన్కు అమెరికా బిగ్ షాక్ POK భారత్లో అంతర్భాగమే..
-
Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!
-
అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూఎస్ఏలోని మిసిసిప్పిలోని ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురి మృత్యువాత పడ్డారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ఒక చోట కాకుండా వేరు వేరు చోట్ల కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అమెరికా వార్తా సంస్థలు డబ్యూటీవీఏ, ఎన్బీసీ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #BreakingNews: Indiscriminate shooting in the US once again: 6 people, including a child, killed in Mississippi; suspect arrested.#USAShooting #Mississippi #GunViolence #MassShooting pic.twitter.com/0BxUhFqICn— UPDATE ADDA (@UpdateAdda24x7) January 11, 2026 కాగా, ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్రంగా పెరిగాయి. 2026 ప్రారంభం నుంచే మిసిసిప్పి, టెక్సాస్, డల్లాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి, పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.జనవరి 1, 2026 మిసిసిప్పి నైట్క్లబ్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు.జనవరి 1, 2026 – డల్లాస్, టెక్సాస్ల్లో జరిగిన మరో కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు.జనవరి 1, 2026 – హ్యూస్టన్, టెక్సాస్ల్లో కొత్త సంవత్సరం మొదటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం అమెరికాలో గన్ వైలెన్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. దాంతో అమెరికాలో గన్ నియంత్రణపై చట్టసభల్లో మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. 2025లో అమెరికాలో హత్యలు, పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు కొంత తగ్గినా, గన్ వైలెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2026 మొదటి 10 రోజుల్లోనే 4 ప్రధాన కాల్పుల ఘటనలు నమోదు కావడం గమనార్హం. -
ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.!
ఐదు దశాబ్దాల క్రితం గల్ఫ్లోని ఎడారిలో జీవితాన్ని ప్రారంభించిన మలయాళీ ముహమ్మద్ కుంజి (77). మత్స్యకారులైన పొన్నిచి ముసాన్, ఒలకోన్ సారా దంపతుల కుమారుడైన కుంజి 21 సంవత్సరాల వయసులో దుబాయ్కు ఓడ ఎక్కాడు. అతని తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో అతని కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోయేవాడు. మడాయిలోని ముత్తోంలోని కొవ్వప్పురానికి చెందిన పొన్నిచి ముసాన్ ఇక జీవించడానికి అతనికి వేరే మార్గం లేకపోవడంతో.. ఐదవ తరగతిలో చదువు మానేసి బీడీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు.కానీ అతని సోదరుడు ముస్తఫా మాత్రం మొదట దుబాయ్కి వెళ్ళాడు. ముస్తఫా అక్కడ టీ దుకాణం నడుపుతున్నాడు. తన సోదరులను దుబాయ్కు తీసుకువస్తేనే కుటుంబంలో పేదరికం తొలగిపోతుందని తెలిసుకున్న ముస్తఫా.. వీసా వచ్చాక ముహమ్మద్ కుంజిని అక్కడికి రమ్మని కోరాడు. అలా మహమ్మద్ కుంజి మార్చి 3, 1967న దుబాయ్లో అడుగుపెట్టాడు.అలా మహమ్మద్ కుంజిని దుబాయ్ తీసుకువచ్చాడు ముస్తఫా. అక్కడికి వెళ్లిన కుంజి టీ, స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వ్యాపారం.. రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగేది. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను దాచుకునేవాడు. ఇంట్లో ఆకలితో అలమటిస్తున్న నా తండ్రి, తల్లి, తోబుట్టువుల కోసం పంపేవాడు. అప్పట్లో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ దుబాయ్కు వచ్చిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు, బలూచిస్తానీలే ఎక్కువ. కుంజి దుబాయ్లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాజు.అప్పట్లో దుబాయ్ కరెన్సీ దిర్హామ్కి మన డబ్బుల్లో 2 రూపాయలు. ఆ తర్వాత 1976లో అబుదాబి పోలీస్ ఉద్యోగం వచ్చింది. పోలీస్ శాఖలో వంటవాడిగా కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో కుంజి జీతం 900 దిర్హామ్లు. అలా జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. పనిలో భాగంగా ఒక చిన్న ప్రమాదం జరగడంతో నా ఉద్యోగాన్ని కోల్పోయి టీ అమ్మడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది కష్టమైన పని. ఆ తర్వాత 1987లో అబుదాబి సైన్యంలో ఉద్యోగం. అక్కడ కూడా నా ఉద్యోగం వంట. జీతం 1800 దిర్హామ్లు. అప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బు పంపగలిగానని కుంజి వెల్లడించారు. నేను మొదట మా ఊరికి వచ్చినప్పుడు, నేను కోటీశ్వరుడిననని నా కుటుంబం, స్థానికులు చాలా ఆశలు పెట్టుకునేవారని తెలిపారు.నేను అబుదాబి సైన్యంలో చేరిన తర్వాత వివాహం చేసుకున్నానని తెలిపారు. నేను అప్పట్లో గల్ఫ్ గురించి చెబితే ప్రజలు నన్ను నమ్మలేదు. అప్పట్లో అరబ్బులకు కూడా చిన్న ఇళ్లే ఉండేవి. మేమందరం చిన్న గుడిసెలలో నివసించామని.. స్నానం చేయడానికి గాడిదలపై టిన్ డబ్బాల్లో తెచ్చిన నీటికి డబ్బు చెల్లించాల్సి వచ్చేదన్నారు. కేవలం ప్రతి నాలుగైదు రోజులకు నీరు వస్తుందన్నారు. కుటుంబ ఉత్తరం కోసం వేచి ఉన్న సమయం చాలా బాధాకరంగా ఉండేదని అన్నారు.నేను రాడో వాచ్ను 1987లో కొన్నాను. లడఖ్లో ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి జీతంతో కొన్నానని తెలిపారు. ఈ వాచ్ ధర 2025 దిర్హామ్లని వెల్లడించారు. ఈ గడియారం నా గల్ఫ్ జీవితాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి నుండి, నా కుటుంబం. ఈ గడియారం నాతోనే ఉన్నాయని తెలిపారు. ఒకరోజు నేను ఒక గడియార దుకాణానికి వెళ్లి రాడో వాచ్ ధర ఎంత అడిగా.. అర మిలియన్ రూపాయలు అన్నారు. కానీ నాకు, దాని విలువ కంటే జ్ఞాపకాలే చాలా రెట్లు ఎక్కువ అనిపించిందన్నారు.నా వయస్సు 60 సంవత్సరాల వరకు అబుదాబిలో పనిచేశానని.. తరువాత నా ప్రవాసాన్ని ముగించానని కుంజి వెల్లడించారు. నా కుమార్తెలు ఆయేషా, అమీనా వివాహం చేసుకున్నారు. మనదేశానికి తిరిగి వచ్చి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే దుకాణాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు, గల్ఫ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. అప్పుడు ఈ గడియారాన్ని ఎల్లప్పుడూ చూస్తానని పేర్కొన్నారు. -
బైక్ ప్రమాదాల్లో 9 మందికి గాయాలు.. ఎక్కడంటే?
ఎడారి ఇసుక దీవుల్లో బైక్ రైడింగ్ చేయడమంటే అందరికీ సరదానే. కానీ అదే సరదా ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల అబుదాబి ఎడారి ఇసుక దిబ్బలలో బైక్ నడుపుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 9 మంది గాయపడ్డారు. గత గురువారం ఒక్కరోజే ఏడు వేర్వేరు ప్రమాదాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న వ్యక్తులు గాయపడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మితిమీరిన వేగం, భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవించాయని పోలీసులు నిర్ధారించారు.ఎడారిలో బైక్ రైడింగ్కు వెళ్లే పిల్లలతో తల్లిదండ్రులు తప్పనిసరిగా వెళ్లాలని పోలీసు అధికారులు ఆదేశించారు. జనావాసాలు లేని ఇసుక ప్రాంతాలలో పిల్లలు నిర్లక్ష్యంగా బైక్లు నడపకుండా నిరోధించడానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమన్నారు. హెల్మెట్ లేకపోవడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరించారు.ఎడారిలో రహదారి నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రదర్ మహమూద్ యూసఫ్ అల్ బలూషి అన్నారు. బైక్ రైడర్లు హెల్మెట్, తగిన భద్రతా దుస్తులను ధరించాలని కోరారు. బయలుదేరే ముందు బైక్ టైర్లు, లైట్లు పని చేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స వస్తు సామగ్రి,అనుమతి కలిగిన భద్రతా పరికరాలను తీసుకెళ్లడం చాలా అవసరమని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో వేగాన్ని తగ్గించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ సూచించిన లేన్లలో మాత్రమే ప్రయాణించాలని వాహనదారులకు గుర్తు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి పోలీసులు అంతర్గత రోడ్లు, హైవేలపై నిఘాను కఠినతరం చేశామని హెచ్చరించారు. -
ఇరాన్లో ఉద్రిక్తతలు.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్కు విజ్ఞప్తి
ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలలో మరణాల సంఖ్య 62కి పెరిగింది.ఈ నేపథ్యంలోనే ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రంప్కు రెజా పహ్లవి విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో నిరసనలు చెలరేగుతున్న ఇరాన్ దివంగత రాజు బహిష్కృత కుమారుడు రెజా పహ్లవి కోరడం హాట్ టాపిక్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్టర్ అమెరికా ప్రెసిడెంట్.. దయచేసి ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కోరాడు.మరోవైపు నిరసనకారులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ హెచ్చరించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలాంహోస్సేన్ మొహ్సేని-ఎజెయ్ శిక్షను అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన నిరసనకారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్, విదేశీ దేశాలతో కమ్యూనికేషన్ను నిషేధించింది.నిరసనల మధ్య ఖమేనీ ప్రసంగంటెహ్రాన్లో అశాంతి మధ్య.. సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా సమస్యలపై దృష్టి పెట్టాలని ట్రంప్కు సూచించారు. నిరసనకారులు మరొక దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖమేనీ అన్నారు. దేశం విదేశీ కిరాయి సైనికులను సహించదని ఖమేనీ స్పష్టంగా పేర్కొన్నారు. నిరసనలపై ఇరాన్ రాష్ట్ర టీవీ ఒక నివేదికలో ఇజ్రాయెల్ మరియు అమెరికన్ "ఉగ్రవాద ఏజెంట్లు" హింసను ప్రేరేపించారని నిందించిన తర్వాత సుప్రీం లీడర్ ప్రకటన వచ్చింది.Mr. President, this is an urgent and immediate call for your attention, support, and action. Last night you saw the millions of brave Iranians in the streets facing down live bullets. Today, they are facing not just bullets but a total communications blackout. No Internet. No…— Reza Pahlavi (@PahlaviReza) January 9, 2026 -
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
అగ్రరాజ్యానికి వార్నింగ్.. ఆ రూల్ ప్రకారమే దాడి చేస్తాం..!
అగ్రరాజ్యం అమెరికాను డైన్మార్క్ హెచ్చరించింది. గ్రీన్ల్యాండ్ను ఆక్రమించినట్లయితే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతుందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది.నాటో భూభాగమైన గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ప్రారంభించడంతోనే డెన్మార్క్ ఈ ప్రకటన చేసింది. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పరిశీలిస్తున్న ఎంపికల్లో సైనిక శక్తి ఒకటిగా పేర్కొంది. కాగా.. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భంధించాక పలు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు జాతీయ భద్రతా ప్రాధాన్యత. ఆర్కిటిక్ ప్రాంతంలో మన ప్రత్యర్థులను అరికట్టడానికి అవసరమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి సరైన ఎంపికలను పరిశీలిస్తున్నాం. యుఎస్ మిలిటరీని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఒక ఎంపిక." అని అన్నారు.వచ్చే వారం డెన్మార్క్, గ్రీన్ల్యాండ్ అధికారులతో సమావేశం కావాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ సైనిక బలప్రయోగం కాకుండా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇంతలోనే అమెరికా అధికారులతో సమావేశాన్ని డెన్మార్క్ స్వాగతించింది. దీనిని ఒక ముఖ్యమైన చర్చగా పేర్కొంది. -
చైనా కంపెనీకి జాక్పాట్.. దుబాయ్లో అనుమతులు..!
చైనీస్ టెక్ కంపెనీ అయిన అపోలో గో అరుదైన ఘనత సాధించింది. దుబాయ్లో డ్రైవర్లెస్ కార్ల పరీక్షకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా నిలిచింది. దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) పూర్తి డ్రైవర్లెస్ పరీక్ష అనుమతిని మంజూరు చేసింది. దీంతో డ్రైవర్ సీటులో వ్యక్తి లేకుండా వేగంగా వెళ్లే కార్లు దుబాయ్ రోడ్లపై కనిపించనున్నాయి.కాగా.. 2026 మొదటి అర్ధభాగం నాటికి వాణిజ్య ప్రాతిపదికన పూర్తిగా డ్రైవర్లెస్ టాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దుబాయ్ రోడ్లపై వెయ్యికి పైగా వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ వినూత్న సాంకేతికత సజావుగా సాగేందుకు వీలుగా దుబాయ్లోని మిడిల్ ఈస్ట్లో మొట్టమొదటి 'ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్'ను కూడా కంపెనీ ప్రారంభించింది. వాహన నిర్వహణ, భద్రతా తనిఖీలు, నిపుణుల శిక్షణ అన్నీ ఈ హబ్లో నిర్వహిస్తారు.2030 నాటికి దుబాయ్ మొత్తం ట్రాఫిక్లో 25 శాతం డ్రైవర్లెస్ వాహనాలుగా మార్చాలనే పాలకుల నిర్ణయానికి ఈ చర్య ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థలను వేగంగా అవలంబిస్తున్న దుబాయ్ పరిస్థితి వారి సాంకేతికతకు ఉత్తమంగా సరిపోతుందని చైనాకు చెందిన బైడు ఉపాధ్యక్షుడు వాంగ్ యున్పెంగ్ అన్నారు.కాగా.. గత మార్చిలో ఆర్టీఏతో కుదుర్చుకున్న ఒప్పందం తర్వాత కంపెనీకి జూలైలో టెస్ట్ లైసెన్స్ మంజూరు చేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ప్రపంచ మోడల్గా మారాలని దుబాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నెలల్లో దుబాయ్లో రద్దీగా ఉండే వీధుల్లో డ్రైవర్లెస్ కార్లు పరీక్షించనున్నారు. -
నెస్లే ఉత్పత్తులపై గల్ఫ్లో హై అలెర్ట్
చిన్నపిల్లల ఫుడ్ బ్రాండ్ అయిన నెస్లేపై గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. మార్కెట్లో ఉన్న నెస్లే బేబీ ఫుడ్ ఉత్పత్తులలో కొన్నింటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉందన్న ఆరోపణలతో వాటిని రీకాల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెస్లే ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నారు. యూరప్ ప్రారంభమై ఆఫ్రికా, ఆసియా, అమెరికాలకు వ్యాపించిన ఈ సంక్షోభంలో యుఎఇతో సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ చర్యలకు కారణం ముడి పదార్థాలలో ఒకదానిలో ‘బాసిల్లస్ సిరస్’ అనే బ్యాక్టీరియా ఉండటమేనని తెలుస్తోంది. గల్ఫ్ దేశాల హెచ్చరిక..యూఏఈతో పాటు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాలు కూడా ఈ ఉత్పత్తులపై ప్రజలను హెచ్చరించాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నెస్లే బేబీ ఫుడ్ ప్యాకెట్లను ఉపయోగించవద్దని సూచించాయి. కువైట్లో రేషన్ కార్డుల ద్వారా అందింంచే వాటిలో ఈ ఉత్పత్తులు చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.అసలు బాసిల్లస్ సెరియస్ అంటే ఏమిటి?ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే 'సిరిలైడ్' అనే విషం పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన వాంతులు, విరేచనాలు, అధిక అలసట, కడుపు నొప్పికి కారణమవుతుంది. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యాలు రానప్పటికీ.. కంపెనీ, ప్రభుత్వాలు ముందుజాగ్రత్తగా ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నాయి.నెస్లే వివరణ..ఒక ప్రధాన సరఫరాదారు నుంచి అందుకున్న ముడి పదార్థాలలో (అరాకిడోనిక్ యాసిడ్ ఆయిల్) సమస్య కనుగొన్నట్లు నెస్లే తెలిపింది. ఉత్పత్తులను తిరిగి ఇచ్చి డబ్బు వాపసు పొందే సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పించింది. అనుమానం ఉన్నవారు కంపెనీ హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చు. ఆ ఉత్పత్తులను దుకాణాలు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల నుండి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇంట్లో ఈ ఉత్పత్తులు ఉన్నవారు వెంటనే వాటిని నాశనం చేయాలని.. లేదంటే పిల్లలకు ఇవ్వకుండా దుకాణాలకు తిరిగి ఇవ్వాలని స్థానిక ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. -
ఒమన్లో కార్మికుల జీతాల పెంపు..!?
అరబ్ దేశమైన ఒమన్ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేతన విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్లు కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ జాయెద్ అల్ బైవిన్ తెలిపారు. త్వరలోనే కార్మికులకు వేతనాలు పెంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కార్మిక మార్కెట్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వాటాదారులతో సంప్రదించి మంత్రిత్వ శాఖ సిఫార్సులను రూపొందించిందని... మెరుగైన జీవన ప్రమాణాలు సాధించే విధంగా కనీస వేతనాన్ని పెంచే విషయంపై మంత్రిత్వ శాఖ పరిశీలించిందని తెలిపారు.కనీస వేతన పెంపు విధానంపై మంత్రిత్వ శాఖ అధ్యయనం పూర్తయిందని.. సిఫార్సులను సంబంధిత అధికారులకు సమర్పించినట్లు అల్ బైవిన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియకు ఆమోదం లభించనుందని పేర్కొన్నారు. షురా కౌన్సిల్ ఐదు ప్రధాన రంగాలపై దృష్టి సారించి చర్చలు జరిపిందని వెల్లడించారు. కార్మిక మార్కెట్ను అభివృద్ధి చేయడానికి.. ఉద్యోగాలను సృష్టించడానికి, డిమాండ్కు అనుగుణంగా కార్మికులను అందించడానికి రూపొందించిన కార్యక్రమాలను కౌన్సిల్ సమావేశంలో మంత్రి మహద్ అల్ బైవిన్ ప్రదర్శించారు.విదేశీయులను నియమించడం లాంటి విస్తృతమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాలు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, బహుళ రంగాలలో జాతీయ శ్రామిక శక్తిని స్థిరీకరించడంలో సహాయపడ్డాయని అన్నారు. ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తుందని అన్నారు. ఈ రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో కలిసి జాతీయ కార్మిక డేటాబేస్ను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. ప్రైవేట్ రంగ ఉద్యోగ నియామక కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని 50 మిలియన్ రియాల్స్ నుంచి 100 మిలియన్ రియాల్స్కు పెంచిందని తెలిపారు.సబ్సిడీ రెండేళ్లపాటు నెలకు 200 రియాల్స్తో ప్రారంభమవుతుందని.. మిగిలిన వేతనాలను యజమానులు భరిస్తారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మద్దతు లభించేంత వరకు ఉద్యోగ ఒప్పందం ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. 2021 నుంచి గత సంవత్సరం అక్టోబర్ వరకు 200,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయని మంత్రి వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ రంగంలో 68,033 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 81,114 ఉద్యోగాలు, రెండు రంగాలలో 50,925 శిక్షణ సంబంధిత ఉద్యోగాలు ఉన్నాయన్నారు. -
హజ్ యాత్రకు ఈ 6 వర్గాలకు నో ఛాన్స్: సౌదీ సర్కారు
హజ్ యాత్రకు అనుమతులపై సౌదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు కేటగిరీలకు చెందిన వారిని హజ్ మంత్రిత్వ శాఖ అనర్హులుగా ప్రకటించింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంట్రీ నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారకి హజ్ యాత్రకు అనుమతి లేదని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వైకల్యంతో బాధపడుతున్నవారు, అంటు వ్యాధులు, తీవ్రమైన క్యాన్సర్తో సహా 6 కేటగిరీల వారిని అనర్హులుగా ప్రకటించింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇప్పటికే ఆంక్షలు ఉన్నప్పటికీ.. స్పష్టమైన సూచనలు జారీ చేయడం ఇదే మొదటిసారి.తాజా నిబంధనల ప్రకారం డయాలసిస్ రోగులు, తీవ్రమైన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన కాలేయ వ్యాధి, వైకల్యంతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న రోగులు హజ్ యాత్రకు వెళ్లేందుకు అనుమతించేది లేదని సౌదీ ప్రభుత్వం తెలిపింది. అలాగే 28 వారాలు నిండిన గర్భిణీ స్త్రీలు కూడా అనర్హులేనని ప్రకటించింది.15 లోపు బుకింగ్లు..ప్రైవేట్ గ్రూపుల ద్వారా హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ నెల 15 లోపు తమ బుకింగ్లను పూర్తి చేయాలని ఇండియన్ హజ్, ఉమ్రా గ్రూప్ అసోసియేషన్ తెలిపింది. హజ్ తీర్థయాత్రకు ఎంపికైన ప్రైవేట్ గ్రూపులు కేంద్ర ప్రభుత్వం నుంచి హజ్ లైసెన్స్ కలిగి ఉన్నాయో లేదో దరఖాస్తుదారులు నిర్ధారించుకోవాలని సూచించింది. -
ఉస్మాన్ హాదీ హత్యకు అదే కారణం.. ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు.!
బంగ్లాదేశ్ ప్రస్తుతం హింస కొనసాగుతూనే ఉంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్గా దాడులు చేస్తున్నాయి. ఇటీవలే కొందరు దుండగులు హిందువులపై దాడి చేసి హతమార్చారు. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లోని హిందువులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యపై బంగ్లాదేశ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ హత్యను రాజకీయ ప్రతీకార చర్యగా బంగ్లాదేశ్ పోలీసులు అభివర్ణించారు. అవామీ లీగ్, ఛత్రా లీగ్తో సంబంధం ఉన్న దాదాపు 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా.. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.హాది బహిరంగ వ్యాఖ్యలు అవామీ లీగ్, ఛత్రా లీగ్ దాని అనుబంధ సమూహాల నాయకులు, కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేశాయని ఢాకా అదనపు పోలీస్ కమిషనర్ మొహమ్మద్ షఫీకుల్ ఇస్లాం అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఫైసల్ కరీం మసూద్కు ఛత్రా లీగ్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు తైజుల్ ఇస్లాం చౌదరి బప్పీ పల్లబి థానా ఛత్రా లీగ్ అధ్యక్షుడు, అవామీ లీగ్ నామినేట్ చేసిన వార్డు కౌన్సిలర్ అని వెల్లడించారు. హత్య తర్వాత మసూద్,మరో కీలక నిందితుడు అలంగీర్ షేక్ పారిపోవడానికి అతను సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజకీయ ప్రతీకారం కారణంగానే హాది హత్యకు గురయ్యాడని దర్యాప్తులో తేలిందని ఏసీపీ ఇస్లాం అన్నారు.కాగా.. ఛత్రా లీగ్ అనేది బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం. తాజాగా ఈ విభాగానికి చెందిన 17 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు హాదీ హత్య తర్వాత న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాది పార్టీ, ఇంక్విలాబ్ మంచా ఢాకాలో ర్యాలీ నిర్వహించింది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులందరికీ పని కల్పించడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.మరోవైపు హాదీ హత్య నిందితులు భారతదేశంలో ఆశ్రయం పొందారని ఆరోపిస్తున్నారు. వారిని అప్పగించడానికి నిరాకరిస్తే ఢాకా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఇంక్విలాబ్ మంచా హెచ్చరించింది. అయితే హాది హంతకులు భారతదేశంలోకి ప్రవేశించారనే వాదనలను భారత అధికారులు తోసిపుచ్చారు. వారు తమ సరిహద్దు దాటినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. -
అమెరికాలో సంక్షోభం.. రద్దు దిశగా పబ్లిక్ మీడియా..!
అమెరికాలో ప్రభుత్వ మద్దతుతో నడిచే మీడియా రంగం కుదేలైంది. ప్రజా నిధులు, ప్రభుత్వ మద్దతుతో పనిచేసే స్వతంత్ర వార్తా సంస్థలన్నీ యునైటెడ్ స్టేట్స్లో మూత పడుతున్నాయి. ప్రజలకు కచ్చితమైన వాస్తవాలను అందించే న్యూస్ ఏజెన్సీల శకం ఇక ముగియనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో యూఎస్ పబ్లిక్ రేడియో, టెలివిజన్ స్టేషన్లకు భారీగా నిధుల కోత పెట్టడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి.దాదాపు 60 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ (CPB) సంస్థను రద్దు చేయడానికి ఓటు వేసినట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ (CPB) డైరెక్టర్ల బోర్డు సంస్థను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, సీఈవో ప్యాట్రిసియా హారిసన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వీయ విధ్వంసంలోకి నెట్టకుండా సంస్థను రద్దు చేయడం ద్వారా పబ్లిక్ మీడియా వ్యవస్థ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే మనం చేయగల ఏకైక మార్గమని అన్నారు. పబ్లిక్ మీడియాను లక్ష్యంగా చేసుకుని వైట్ హౌస్ కాంగ్రెస్ ఫెడరల్ నిధులను నిలిపివేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ప్రకటనతో గణనీయమైన ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల కోత, సవాళ్లు ఎదురు కానున్నాయి. అయితే కొన్ని జాతీయ నెట్వర్క్లు అత్యవసర నిధులపై పనిచేస్తూనే ఉన్నాయి. కానీ తీవ్రమైన బడ్జెట్ కోత కారణంగా అవి పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది.మరోవైపు పబ్లిక్ మీడియా మనుగడ సాగిస్తుందని.. కొత్త కాంగ్రెస్ మన దేశంలో పబ్లిక్ మీడియా సమస్యను పరిష్కరిస్తుందని తాను నమ్ముతున్నానని సీపీబీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్వుమెన్ రూబీ కాల్వర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకంటే ఇది మన పిల్లల విద్య, చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొంది.కాగా.. ఈ కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సంస్థను 1967లో స్థాపించారు. ఇందులో దాదాపు 1,500 పబ్లిక్ మీడియా స్టేషన్లు, దాని ప్రసార కేంద్రాల నెట్వర్క్కు వార్షిక నిధుల రూపంలో 500 డాలర్ల మిలియన్లను పంపిణీ చేసే బాధ్యత ఈ సంస్థపై ఉంది. కానీ ట్రంప్, అతని మిత్రులు చాలా కాలంగా వీటిని విస్మరించారు. ట్రంప్ పరిపాలనలో పబ్లిక్ బ్రాడ్కాస్టర్లకు నిధులను తగ్గించే ప్రణాళికలను వివరించింది. గత సంవత్సరం మే నాటికి నిధులను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఒక మెమో పంపారు.ఇటీవలి దశాబ్ద కాలంలో సాంప్రదాయ మీడియా, ముఖ్యంగా వార్తాపత్రికలు మూసివేయబడిన దేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్లు అవసరం. సీపీబీ నిధులు పొందిన 544 పబ్లిక్ రేడియో, టీవీ స్టేషన్లలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. వీటి ద్వారా 99 శాతం అమెరికన్లకు ప్రజా సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రజలకు అవసరమైన విద్యా, స్థానికంగా కంటెంట్ను అందించే చిన్న, గ్రామీణ స్టేషన్లు ఎక్కువగా మూసివేతలకు గురి కానున్నాయి. -
ఒమన్ పౌరసత్వం దరఖాస్తులు.. నిబంధనల్లో భారీ మార్పులు..!
అరబ్ దేశమైన ఒమన్ తమ దేశ పౌరసత్వ చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒమన్ పౌరసత్వంతో సహా జాతీయత చట్టంపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యనిర్వాహక నిబంధనలను ప్రకటించింది. అక్కడి స్థానిక మంత్రివర్గ నిర్ణయించాక అధికారిక గెజిట్ విడుదల చేసింది. ప్రవాస కుటుంబాలకు పౌరసత్వం నిబంధనల్లో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. కాగా.. అరబ్ దేశాల్లో కఠిన నిబంధనలు ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.పౌరసత్వం దరఖాస్తు నిబంధనలు..జాతీయతకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత వ్యక్తి లేదా వారి సంరక్షకుడు మంత్రిత్వ శాఖ తయారుచేసిన ఫారమ్లను అంతర్గత వ్యవహారాల శాఖకు సమర్పించాలి. దరఖాస్తుదారు విదేశాలలో నివసిస్తుంటే ఒమన్ జాతీయతను గుర్తింపు కోసం దరఖాస్తులను ఒమన్ రాయబార కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తుదారులు నోటిఫికేషన్ తేదీ నుంచి 90 రోజుల్లోపు అవసరమైన విధానాలను పూర్తి చేయాలి. అయితే, మంత్రిత్వ శాఖ వ్రాతపూర్వక అభ్యర్థనపై దీనిని పొడిగించవచ్చు. ఇది పాటించడంలో విఫలమైతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఒమన్లో చట్టపరమైన నివాసం, పాస్పోర్ట్ డేటా, మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఏదైనా ఇతర మార్గాల ద్వారా నిరూపించాలి.అంతేకాకుండా దరఖాస్తుదారులు నేర చరిత్ర లేని ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అరబిక్ భాషలో ప్రావీణ్యం, అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్వహించే వ్రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో ఒకసారి విఫలమైతే..మళ్లీ ఆరు నెలల తర్వాత పరీక్షను తిరిగి రాయవచ్చు.. కానీ నాలుగు సార్లకు మించి రాయడానికి వీల్లేదు. ఒమన్ పౌరసత్వం పొందిన ప్రతి వ్యక్తి తాను సుల్తానేట్ పట్ల విధేయుడిగా ఉంటానని..దాని ప్రాథమిక చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తానని, మంచి పౌరుడిగా ఉంటానని ప్రాథమిక కోర్టులో ప్రమాణం చేయాలి. ఒమన్ పౌరసత్వం పొందిన ప్రతి వ్యక్తి వారి మైనర్ పిల్లలకు ఒమన్ పాస్పోర్ట్లు పొందడం కోసం ఆరు నెలల్లోపు మంత్రిత్వ శాఖను సందర్శించాలి.ఒమన్కు తిరిగి రావాల్సిందే..ఒమన్ పౌరసత్వం పొందిన వ్యక్తి వరుసగా 24 నెలలకు పైగా ఒమన్ వెలుపల నివసించకూడదు. ఎక్కువ కాలం ఉండాలనుకునే వారు కాల వ్యవధి ముగియడానికి మూడు నెలల ముందే విదేశాల్లో ఉండడానికి గల కారణాలు, వివరాలతో సహా దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తులను సమర్పించిన 60 రోజులలోపు మంత్రిత్వ శాఖ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ వ్యవధిలోపు ఎటువంటి ప్రతిస్పందన రాకపోతే.. మీ అభ్యర్థన తిరస్కరించినట్లే. దరఖాస్తుదారు అనుమతించిన వ్యవధి ముగిసేలోపు ఒమన్కు తిరిగి రావాలి. పౌరసత్వం కోల్పోయిన వారు ఎవరైనా తమ పాస్పోర్ట్, ఐడీ కార్డు విదేశాలలో ఉన్న రాయబార కార్యాలయాలకు 90 రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి. లేకుంటే, సంబంధిత అధికారులు, మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. పౌరసత్వం కోల్పోవడం, రద్దు చేయడం, ఉపసంహరణ కేసులను పరిశీలించడానికి మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో చర్యలు చేపడుతుంది.పౌరసత్వ దరఖాస్తు రుసుములు..ఒమానీ పౌరసత్వం కోసం దరఖాస్తు: 600 రియాల్స్ఒమానీ మహిళ, విదేశీ భార్య, వితంతువు, విడాకులు తీసుకున్న వ్యక్తి లేదా బిడ్డ కోసం దరఖాస్తు: 300 రియాల్స్పౌరసత్వం పునరుద్ధరణ లేదా వదులుకోవడం కోసం దరఖాస్తు: 200 రియాల్స్సాధారణ షరతులు..సమర్పించిన అన్ని పత్రాలు అరబిక్లో ఉండాలి.ఒమానీ పౌరసత్వం లేదా పునరుద్ధరణ కోసం దరఖాస్తుదారులు అవసరమైన పరీక్షల కోసం (అరబిక్ లేదా ఇతర భాషలు) సంబంధిత విభాగం ముందు హాజరు కావాలి.ఒమానీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి మరో దేశ పౌరసత్వం మంజూరు అయినట్లు నిర్ధారించే పత్రాలతో పాటు శాఖకు సమర్పించి నిర్దేశించిన రుసుము చెల్లించాలి.పౌరసత్వాన్ని వదులుకున్నా, రద్దయినా వారు ఎవరైనా తమ పౌరసత్వాన్ని పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సుల్తానేట్లో కనీసం రెండు సంవత్సరాల శాశ్వత నివాసం, ఇతర దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు రుజువులు సమర్పించాలి.ఒమానీ వ్యక్తిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వం..ఒమానీ వ్యక్తి భార్య అయిన విదేశీ మహిళ ఈ క్రింది షరతుల కింద ఒమానీ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు1. వివాహం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతితో జరిగి ఉండాలి (చట్టం ప్రకారం అవసరమైతే).2. ఆమె వివాహం చేసుకుని తన భర్తతో సుల్తానేట్లో కనీసం 10 సంవత్సరాలు ఉండాలి.3. ఆమెకు ఒమానీ భర్త ద్వారా సంతానం కలిగి ఉండాలి.4. ఆమె ఎలాంటి అనైతిక నేరాలకు పాల్పడి ఉండకూడదు.5. ఒమానీ మహిళను వివాహం చేసుకున్న విదేశీయుడు పౌరసత్వం పొందాలంటే, వివాహాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించాలి. -
ఇండోనేషియాలో వరద భీభత్సం.. 16 మంది మృతి..!
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే దాదాపు 16 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు వేలాదిమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇండోనేషియాలో తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున నదుల్లో జలపాతం అకస్మాత్తుగా పెరిగింది. ఈ బలమైన నది ప్రవాహాలకు సియావు టాగులాండాంగ్ బియారో జిల్లాలోని గ్రామాల కొట్టుకుపోయాయి. ఈ వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి.సులవేసి ద్వీపం నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియావు ద్వీపంలోని నాలుగు ప్రభావిత గ్రామాలకు పోలీసులు, సైన్యం మద్దతుతో రెస్క్యూ బృందాలను మోహరించారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, కమ్యూనికేషన్ అంతరాయం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 140 కి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ప్రజలను చర్చిలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించారు. -
బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ జర్నలిస్ట్ హత్య..!
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బంగ్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఓ బంగ్లా డైలీకి తాత్కాలిక ఎడిటర్గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ బైరాగి (38) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక ఏఎస్పీ అబుల్ బసర్ వెల్లడించారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఘటన బంగ్లాదేశ్లోని జెస్సోర్ జిల్లాలోని మోనిరాంపూర్ ఉపజిల్లాలో జరిగింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. కాగా.. ప్రతాప్పై పలు పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని.. అతడు నరైల్ జిల్లా నుంచి వెలువడే ఓ దిన పత్రికకు తాత్కాలిక సంపాదకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సదరు పత్రిక న్యూస్ ఎడిటర్ అబుల్ మాట్లాడారు. రాణా ప్రతాప్ తమ పత్రిక సంపాదకుడని తెలిపారు. ఒకప్పుడు అతడిపై పలు కేసులు ఉన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డారని వెల్లడించారు. అయితే ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏమిటనేది మాత్రం తనకు తెలియదని అన్నారు. #BreakingNews: Another Hindu youth killed in Bangladesh!A Hindu youth named Rana Pratap Bairagi was shot dead by miscreants in Monirampur upazila under Jessore district in Bangladesh. The incident took place today at noon today. pic.twitter.com/MlewUvcz0i— Salah Uddin Shoaib Choudhury (@salah_shoaib) January 5, 2026 -
భారత్ కు బలూచ్ లేఖ.. పెళ్ళికి ముందు ఆ పని చేస్తే జైలుకే
-
బోండీ బీచ్ ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులకు గాయాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడి కాలేదు. కాగా, డిసెంబర్ 14న (ఆదివారం) సిడ్నీలోని బోండీ బీచ్కు సమీపంలో గల ఓ చిన్న పార్కులో యూదులు "హనుక్కా బైదసీ" అనే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సాయుధులు వేడుకల్లో మునిగిపోయిన యూదులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు సహా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని నవీద్ అక్రమ్గా గుర్తించగా.. మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు పాకిస్తాన్ జాతీయులు. నవీద్కు ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
15000 అడుగుల ఎత్తులో మృత్యువుతో పోరాటం..
-
Mexico: దేశ అధ్యక్షురాలిని నడిరోడ్డు మీద లైంగికంగా..
-
టాంజానియా అల్లర్లు.. 700 మందికిపైగా మృతి
-
ట్రంప్ పై దాడికి మరో కుట్ర.. ?
-
USA: H1B ఫీ హైక్ ..
-
బిగ్ డీల్..! భారత్ అమెరికా వాణిజ్య చర్చలు..
-
అమెరికా డొల్లతనాన్ని బయటపెట్టిన భారత్
-
Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్న ట్రంప్
-
అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసు
-
భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్
-
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ను అంతమొందించేందుకు ప్రయత్నం
-
లండన్లో కూలిన విమానం
-
Visa Crisis: విద్యార్థులకు చుక్కలు అమెరికా వద్దు బాబోయ్
-
అమెరికా మునిగిపోనుందా?
-
మస్క్కు ట్రంప్ వార్నింగ్ ..!
-
అమెరికాను కుదిపేస్తున్న ట్రంప్ తెచ్చిన One Big Beautiful Bill
-
ట్రంప్ పై మరోసారి మండిపడ్డ ఎలన్ మస్క్
-
నాడు సద్దాం నేడు ఖమేనీ అమెరికా పాన్ అదేనా?
-
ఇండియా బయటపెట్టిన సంచలన నిజం
-
Israel Iran War: యుద్ధం ముగిసింది
-
భారత విమాన సర్వీసులపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్
-
Iran-Israel: ట్రంప్ కీలక ప్రకటన
-
ఇరాన్పై ఇజ్రాయిల్ భీకర యుద్ధం
-
'The Battle Begins' అంటూ ఖమేనీ కౌంటర్
-
తక్షణమే టెహ్రాన్ నగరం విడిచి వెళ్లాలని భారతీయులకు ఎంబసీ ఆదేశాలు
-
నెక్ట్స్ టార్గెట్ పాకిస్థాన్ ?
-
Magazine Story: భీకర యుద్ధం.. భయానకం
-
Los Angeles Protests: లాస్ ఏంజిల్స్లో చల్లారని ఆందోళనలు
-
న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
-
12 దేశాల పౌరులపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్
-
అమెరికా అధ్యక్షుడిపై ఈలాన్ మస్క్ మండిపాటు
-
Viral Video: ఫ్రాన్స్ అధ్యక్షుడికి చెంపదెబ్బ
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు
-
భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం
-
మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గేర్ హార్డ్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్
-
భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైన దుష్ట కూటమి
-
పాకిస్తాన్ వైమానిక శక్తి...మూడోవంతు ఊడ్చుకుపోయింది!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్ తదితర క్షిపణులు పాక్లోని 11 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడడం తెలిసిందే. వాటి ధాటికి అవి కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలతో పాటు రక్షణ నిపుణులు తేల్చారు. ‘‘పాక్ వైమానిక స్థావరాల్లోని కీలక వ్యవస్థలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాక్ ఎంతోకాలంగా మిడిసిపడుతున్న ఎఫ్ 16, జేఎఫ్ 17 వంటి అత్యాధునిక అమెరికా, చైనా తయారీ యుద్ధ విమానాల్లో చాలావరకు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి’’ అని వెల్లడించారు. సైనిక ఆపరేషన్లలో స్వావలంబన ప్రస్థానంలో ఆపరేషన్ సిందూర్ను మైలురాయిగా రక్షణ శాఖ అభివర్ణించింది. భారత రక్షణ పాటవానికి, ఆ రంగంలో సాధించిన స్వావలంబనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. ‘‘సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలతో పాటు ఆ దేశ నలుమూలల్లోని కీలక సైనిక, వైమానిక వ్యవస్థలను కూడా తుత్తునియలు చేసి చూపించాం. పాక్ మాత్రం సైనికపరంగా కేవలం విదేశీ సాయాన్నే నమ్ముకుంది. మనపై దాడులకు చైనా తయారీ పీఎల్–15, తుర్కియేకు చెందిన ‘యిహా’ డ్రోన్లు, యూఏవీలను వాడింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ద్వారా తిరుగులేని రుజువులను ప్రపంచానికి చూపించాం’’ అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఐఏఎఫ్ చీఫ్దే కీలకపాత్ర పాక్ వైమానిక స్థావరాలపై మన దాడుల్లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్సింగ్దే కీలక పాత్ర. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దాడులు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యంగా అతి కీలకమైన రావల్పిండిలోని చక్లాలా (నూర్ ఖాన్) ఎయిర్బేస్పై దాడి ప్లానింగ్ పూర్తిగా ఆయనదే. ఆ దాడిలో పాల్గొన్న పైలట్ల ఎంపిక తదితరాలను కూడా సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. శనివారం తెల్లవారుజామున చక్లాలాలో మూడు ప్రాంతాలపై మన క్షిపణులు విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించాయి. వాటి దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడు గంటలు బంకర్లో తలదాచుకోవడమే గాక తన నివాసాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చేశారట!నేవీ త్రిముఖ వ్యూహం పాక్పై మన దాడుల సందర్భంగా నేవీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్ను అష్టదిగ్బంధం చేసేసింది. అందులో భాగంగా పాక్కు జీవనాడి వంటి కరాచీ ఓడరేవుపై మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పూర్తిస్థాయిలో గురిపెట్టింది. ఏకంగా 36 నావికా దళాలను మోహరించింది. ఏడు డి్రస్టాయర్లు, ఐఎన్ఎస్ తుషిన్ వంటి యుద్ధనౌకలు వాటిలో ఉన్నాయి. అవన్నీ బ్రహ్మోస్, ఎంఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులను ఎక్కుపెట్టి ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాయి. అంతేగాక వరుణాస్త్ర వంటి అత్యాధునిక టార్పెడోలతో జలాంతర్గాములను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా సన్నద్ధం చేసింది. దాంతో మరో దారిలేక పాక్ నేవీ కేవలం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది.నవాజ్ కనుసన్నల్లోనే...! భారత్పై పాక్ సైనిక చర్యలను పూర్తిగా ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మనపై దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు సమాచారం. నవాజ్ మూడుసార్లు పాక్ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) సారథి. 1999లో ఆయన ప్రధానిగా ఉండగానే కార్గిల్ యుద్ధం జరిగింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం తెలిసిందే. ఆ మర్నాడు షహబాజ్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో ప్రభుత్వపరంగా ఏ హోదా లేని నవాజ్ కూడా పాల్గొన్నారు.మా మద్దతు పాక్కే: తుర్కియే అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురవుతున్నా తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. అన్నివేళలా పాక్కే మద్దతుగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం కుండబద్దలు కొట్టారు. ‘‘పాక్ మా నిజమైన మిత్రదేశం. మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్–తుర్కియే దోస్తీ జిందాబాద్!’’ అని చెప్పుకొచ్చారు. -
కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...
-
యుద్ధంలో పిట్టల్లా రాలిపోతున్న రష్యా దళాలు
-
H1B వీసా దరఖాస్తుదారులకు కొత్త నిబంధనలు పెట్టిన అమెరికా
-
డెల్టా విమానం ఇంజిన్ లో ఎగసిపడిన మంటలు
-
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
అమెరికా ఇరాన్ మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
-
అమెరికా చైనా మధ్య మరింత ముదిరిన టారిఫ్ వార్
-
ప్రపంచం నెత్తిన ట్రంప్ బాంబు ఇక కోలుకోలేమా..!
-
ఎన్ఆన్ఐలకు చెందిన స్థలాలపై కబ్జారాయుళ్ల దృష్టి
-
భారతీయ విద్యార్థులకు ట్రంప్ డెడ్ లైన్!
-
బ్యాంకాక్ లో భారీ భూకంపం
-
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
-
US Visa: ఇండియన్స్ కు భారీ షాక్
-
ఇండియన్స్కు ట్రంప్ వార్నింగ్!
-
ఫ్రాన్స్ లో గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
-
భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసా జారీలో 38 శాతం తగ్గుదల
-
భారతీయ విద్యార్ధిని రంజనీ వీసా రద్దు కారణం ఇదే..!
-
రష్యా దాడులకు ఉక్రెయిన్ ప్రతీకారం
-
ట్రంప్ తో ఖనిజాల డీల్ కు సిద్ధమే: జెలెన్స్కీ
-
అమెరికా టూర్లో మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్
-
అమెరికాలో అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
-
మోదీ ఫ్రాన్స్ టూర్: PM Modi
-
ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు
-
గ్రీన్ కార్డ్ కి సిటిజెన్ షిప్ కి తేడా ఏంటి..?
-
ట్రంప్ అనుకున్నది ఏది జరగదు..
-
వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
-
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ వేటు.. ఆర్డర్ జారీ
-
రెండోసారి అధ్యక్షడుగా ట్రంప్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
-
47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్
-
డొనాల్డ్ ట్రంప్ దూకుడు..తొలి రోజే సంచలన..!
-
భారతీయులను తొక్కేస్తే ట్రంప్ కొంప కొల్లేరే..!
-
సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్
-
అమెరికా కార్చిచ్చు పెద్ద కుట్ర..?
-
Sankranti 2025 : జపాన్లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
-
హాలీవుడ్ హిల్స్ పైనా వేగంగా వ్యాపించిన అగ్ని కీలలు
-
లాస్ ఏంజిల్స్ ను చుట్టుముట్టిన భయంకర కార్చిచ్చు
-
California: కూలిన విమానం
-
చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు
-
చిన్నారులను కూడా వదలని కర్కశత్వం
-
భారతీయుల ఆశలపై ట్రంప్ పిడుగు
-
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
-
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
ట్రంప్కు బేడీలు
-
బైడెన్ గుడ్ న్యూస్.. ట్రంప్ బ్యాడ్ న్యూస్
-
ట్రంప్నకు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బ


